
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్లు సోషల్ మీడియాలో మాటల యుద్దానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలని ఆకాంక్షించారు. తాజాగా ఓ ఆన్లైన్ చాట్ షోలో పాల్గొన్న యూనిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా కాలంగా వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవేళ వారి మధ్య మాటల యుద్దం శాంతించకపోతే.. ప్రపంచంలో ఏదో ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలని నేను వారికి సలహా ఇస్తున్నాను’అని తెలిపారు.
అలాగే, భారత్, పాక్ల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని యూనిస్ అన్నారు. క్రికెట్ అభిమానులు నిరాశ చెందకుండా ఉండటం కోసం పాకిస్తాన్, ఇండియాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని చెప్పారు. సమీప భవిష్యత్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అది ఎక్కడ జరుగుతుందో తెలియదన్నారు. కాగా, భారత్, పాక్ల మధ్య 2013 జనవరి తర్వాత నుంచి ద్వైపాక్షిక సీరిస్ జరగని సంగతి తెలిసిందే. ఇక, గంభీర్, ఆఫ్రిదిల మధ్య ఎప్పుడూ ఏదో అంశంపై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పీవోకేకు సంబంధించి ఆఫ్రిది చేసిన వివాదస్పద వ్యాఖ్యలను గంభీర్ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తనదైన శైలిలో వ్యంగ్యాస్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment