
అక్రమ కోటీశ్వరులు
► నలుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
► భారీఎత్తున స్థిరాస్తులు, నగదు, బంగారం బట్టబయలు
► కొనసాగుతున్న సోదాలు
సాక్షి, బెంగళూరు: తమకున్న అధికారంతో ప్రజాసేవ చేయాల్సిన అధికారులు అయినకాడికి దండుకోవడంలో మునిగితేలారు. అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నలుగురు ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక దళం (యాంటీ కరప్షన్ బ్యూరో) పంజా విసిరింది. నిందితుల్లో ముగ్గురు బెంగళూరులోనివారే. వీరి వద్ద వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను గుర్తించారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే తూర్పు వలయం జాయింట్ కమిషనర్ డాక్టర్ యతీష్కుమార్, రామనగర తహశీల్దార్ ఎన్.రఘుపతి, కేపీటీసీఎల్ డైరెక్టర్ హెచ్.నాగేశ్, సాంకేతిక విద్యా డైరెక్టరేట్లో సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డిలకు చెందిన కార్యాలయాలు, ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లు తదితర చోట్ల జరిగిన సోదాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బుధవారం ఉదయం నుంచి పొద్దుపోయేంతవరకూ సోదాలు కొనసాగాయి. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సోదాల్లో బయటపడిన సొత్తు వివరాలు
ఎన్.రఘుపతి (తహశీల్దార్) – బెంగళూరులో సుమారు 2.5 కోట్ల విలువైన భవనం. 185 గ్రాముల బంగారు, 4 కిలోల వెండి, 36 లక్షల గృహోపయోగ వస్తువులు భార్య, కుమారులు, తల్లి తండ్రి పేర్ల పై ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ.2.17 కోట్ల నగదు. కారు, ద్విచక్ర వాహనాలు.
హెచ్. నగేష్ (కేపీటీసీఎల్ డైరెక్టర్ ) – 2.4 కిలోల బంగారు. 95 లోల విలువ చేసే వజ్రాభరణాలు, 17.8 కిలోల వెండి, రూ.3 లక్షల విలువ చేసే 33.28 లీటర్ల విదేశీ మద్యం, 1559 యూ.ఎస్ డాలర్లు, 15 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.20 లక్షల విలువ చేసే 60 చేతిగడియారాలు. రద్దైన రూ.1000 నోట్లు (మొత్తం విలువ రూ.45వేలు) రాష్ట్రంలో వివిధ చోట్ల దాదాపు నాలుగుకోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో 11 ఖాతాలు ఉన్నాయి.
యతీష్కుమార్ (పాలికే తూర్పు వలయం జాయింట్ కమిషనర్): రూ.1.25 కోట్ల విలువైన భవనం. 1.07 కిలోల బంగారు ఆభరణాలు, 1.6 కిలోల వెండి, రూ.4.16 లక్షల నగదు.ఇవి కాక రాష్ట్రంలో వివిధ చోట్ల తన, తన బంధువుల పేర్లతో దాదాపు రూ.3 కోట్ల విలువైన భవంతులు ఉన్నాయి.
రామకృష్ణారెడ్డి (సాంకేతిక విద్యాశాఖ): దాదాపు రూ.1.50 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, ఐదు హై ఎండెడ్ కార్లు ఉండగా ఒక కారులో రూ.20 లక్షల నగదు లభించింది.