పరిహారం... పరిహాసం! | Compensation ... | Sakshi
Sakshi News home page

పరిహారం... పరిహాసం!

Published Mon, Apr 6 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

పరిహారం...  పరిహాసం!

అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు            
ఏటా తగ్గుతున్న పంట విస్తీర్ణం
ఒక్క కోలారు జిల్లాలోనే రూ.189 కోట్ల మేర పంట నష్టం
పరిహారం చెల్లింపుల్లో ఉదాసీనత    
కనీస పెట్టుబడులూ దక్కని వైనం            
పాలకుల వైఫల్యానికి పరాకాష్ట

 
 కనుచూపు మేరలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు. తాగేందుకు నీళ్లు కూడా లభ్యం కావు!  ఒకవేళ దొరికినా విషతుల్యం... ఫ్లోరైడ్ మయం. ఇక్కడ వ్యవసాయం చేయడమంటే సాహసమే. బోరుబావి ఏర్పాటు చేయాలంటే 1500 అడుగుల లోతున నీటి కోసం సోధించాల్సిందే. అదృష్టం బాగుంటే అరకొరగా నీరు లభ్యమవుతుంది. లేదంటే అన్నదాత అప్పుల పాలవ్వాల్సిందే. ఇది ప్రకృతి శాపం కాదు.. పాలకుల అసమర్థతను ఎత్తి చూపుతూ దశాబ్ధాలుగా కరువు కాటకాలతో చిక్కి శల్యమై పోతున్న కోలారు జిల్లా దుస్థితి. నీటి బొట్టు కోసం ఇక్కడ పుడమి తల్లి తహతహలాడుతోంది. నీటి పథకాల పేరుతో కాలయాపన చేయడం ప్రజాప్రతినిధులకు ప్రహసనంగా మారింది. వ్యక్తిగత పరువుకు పాకులాడుతుండడంతో పది మందికి ఉపయోగపడే నీటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. వరుస పంట నష్టాలను చవి చూస్తున్న అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టకపోవడంతో ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోలారు జిల్లాలో రైతు ఉనికికి ప్రమాదముందని      నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కోలారు:  దశాబ్దాలుగా కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న కోలారు జిల్లాలో ప్రతి ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొని వరుస పంట నష్టాలతో అన్నదాతలు చిక్కి శల్యమైపోతున్నారు. అధికారుల లెక్క ప్రకారం కోలారు జిల్లాలో 1.02 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల గత ఏడాది 79,025 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేయగలిగారు. ఇందులో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 13,160 హెక్టార్లలో వేరుశనగను విత్తారు. ఇందులో 12వేల హెకా్టార్లలో పంట నష్టం వాటిల్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. అలాగే 48,162 హెక్టార్లలో రాగి పంట సాగు చేపడితే 47,397 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. పంట పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. మొత్తానికి ఈ ఏడాది 4.97 లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో రూ. 84.75 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
 
ఎండుతున్న తోటలు

కోలారు జిల్లాలో 1,06,262 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఇందులో 53,209 హెక్టార్లలో పండ్ల  తోటలు ఉండగా 45 వేల హెక్టార్లలోని తోటలు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయాయి. దీంతో రూ. 103.48 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2014 నవంబర్ 20న ఆర్.బి.సిన్హా నేతృత్వంలోని కరువు పరిశీలన కేంద్ర ృందం కోలారు జిల్లాలో పర్యటన చేసి అధ్యయనం చేసిన సమయంలో జిల్లాలో రూ. 189 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు నివేదికను జిల్లా యంత్రాంగం అందజేసింది. మామిడి పంటలకు ప్రపంచ ప్రసిధ్ది పొందిన కోలారు జిల్లాలో నేడు నీటి కొరత వల్ల మామిడి చెట్లు ఎండుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండుతున్న మామిడి చెట్లను గుర్తించి రైతులు బాధతో వాటిని కొట్టి వేస్తున్నారు.

అరకొర సాయం

కోలారు జిల్లాలో ఇంత భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. నామమాత్రంగా పంట నష్ట పరిహారాన్ని విదిల్చి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. రూ. వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం లెక్కలు చూపిస్తున్నా కేవలం రూ. 28.74 కోట్ల మేర  పరిహారాన్ని ప్రభుత్వం అందించడం రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పంట పెట్టుబడుల కింద ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు  కనీసం వడ్డీకి కూడా పరిహారం సరిపోకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పంట సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రారని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement