
తుంగభద్రకు జలకళ
సాక్షి, బళ్లారి : తుంగభద్రమ్మ వడివడిగా కదలివస్తోంది. నై చీలిన భూమిని తన స్పర్శతో తడుపుతూ పరుగుపరుగున వచ్చేస్తోంది. నది ఎగువన ఉన్న ఆగుంబె, శృంగేరి, మోరాళు, తీర్థహళ్లి, శివమొగ్గ, భద్రావతి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు ఊపందుకోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి నీటి జలాశయమైన తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత బుధవారం మొదటిసారిగా ఒకేసారి 25 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు డ్యాంలోకి చేరింది. దీంతో మూడు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 17 టీఎంసీలు నిల్వ ఉంది. ఇదే ప్రవాహం మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డు అధికారి వెల్లడించారు.