- మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
- వ్యాపారం కోసం వస్తూ అనంత లోకాలకు
కారటగి, న్యూస్లైన్ : వ్యాపారం కోసం బయల్దేరిన ముగ్గురు స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన బస్సు కబలించింది. కలిసిమెలిసి తిరిగిన ఆ ముగ్గురూ మృత్యువులోనూ కలిసే అనంతలోకాలకు ప్రయాణమయ్యారు. ఈ ఘటన చందనహళ్లి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముదుగల్కు చెందిన జమీర్ (21), రామయ్య (20), బీజాపూర్కు చెందిన సోహైల్ (19) మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపేవారు.
వ్యాపారాలకు కలిసి వెళ్తూ స్నేహితులుగా మారారు. వ్యాపారం నిమిత్తం ముగ్గురూ మంగళవారం సింధనూరుకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం బైక్పై కారటగికి వెళుతుండగా పట్టణ శివార్లలోని చందనహళ్లి క్రాస్ వద్ద అతి వేగంగా వచ్చిన కొప్పళ-హైదరాబాద్ బస్సును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. సీఐ ప్రభాకర్, ఎస్ఐ ఉదయ రవి, కనకగిరి ఎస్ఐ వీరణ్ణ ఘటనా స్థలానికి చే రుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు రవాణ శాఖ నుంచి పరిహారం కల్పిస్తామని రవాణ శాఖ సంచాలకులు పీఎస్.వస్త్రాద్, డిపో వ్యవస్థాపకులు కేఎల్.చంద్రశేఖర్, గంగావతి బస్టాండ్ కంట్రోలర్ శివనగౌడ హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం రూ.5 వేలు చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు సహాయ ధనం అందజేశారు. ఇదిలా ఉండగా ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.