ఉపాధి కల్పనకే తొలి ప్రాధాన్యం: హర్షవర్ధన్
Published Thu, Nov 14 2013 11:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యతనిస్తామని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ హామీనిచ్చారు. కృష్ణానగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న హర్షవర్ధన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నామినేషన్ సమర్పించారు. మొత్తం ప్రక్రియ 30 నిమిషాలు పట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుంభకోణాలకు, ప్రజావ్యతిరేక విధానాలకు చెక్ పెట్టాలని ఢిల్లీవాసులు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు.
మూడింట రెండు వంతుల స్పష్టమైన మెజార్టీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని సైతం బీజేపీ ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యం ఉపాధి కల్పనకు ఇస్తామని, ఢిల్లీవాసులందరికీ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు భద్రత, గౌరవం పెంచేలా ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ఈ-గవర్నెన్స్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలలోని ప్రతి పనినీ ఆర్టీఐ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. హర్షవర్ధన్ నామినేషన్ సందర్భంగా ఆయన భార్య నూతన్, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్కుమార్ మల్హోత్రాతోపాటు పెద్దసంఖ్యలో బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement