
అహ్మద్గూడలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఆఫ్రికా జర్నలిస్టుల బృందం
కీసర వికారాబాద్ : అహ్మద్గూడలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. శుక్రవారం ఆఫ్రికాకు చెందిన 30 మంది జర్నలిస్టుల బృందం నగర శివార్లో పర్యటించింది. కీసర మండలంలోని అహ్మద్గూడలో 20.73 ఎకరాలలో రూ.384 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ 4428 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 41 బ్లాకుల్లో 9 అంతస్తులలో అన్ని మౌలిక సదుపాయాలతో 4428 ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందం అభినందించింది.
అహ్మద్గూడలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, స్లమ్లెస్ సిటీగా హైదరాబాద్ను రూపొందించాలన్న ప్రణాళికలను వారు ప్రశంసించారు. గృహæనిర్మాణ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేంద్రకుమార్ అహ్మద్గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందానికి వివరించారు.
ఈతకొల్లూరు, రాంపల్లిలలో చేపడుతున్న అతిపెద్ద కాలనీల అనంతరం అహ్మద్గూడలో డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ మూడో అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. మీడియా అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓ వెంకటరమణ, సమాచార శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment