
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా ఫొగట్ , మాలావత్ పూర్ణ, లైఫ్ టైం అవార్డును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అందుకున్నారు. వసుదైక కుటుంబం అనేది మన మార్గం కావాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాగృతి అంటే చైతన్యమని... ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభినందనలు తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్కు 110 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపిచంద్, మలావత్ పూర్ణ, రెజ్లర్ బబితా పోగట్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై వక్తలు చర్చించారు. రెండేళ్లకొకసారి ఇంటర్నేషన్ సమ్మిట్ ఏర్పాటు చేసి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేలా ముందడుగు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.