
డ్వాక్రా మహిళలు డిష్యుం డిష్యుం
డ్వాక్రా మహిళల మధ్య చిచ్చు రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. జుట్టు జుట్టు పట్టుకుని వీరంగం సృష్టించారు. ఇదంతా ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో.. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా జరిగిన తతంగం. డ్వాక్రా సంఘాలకు చెందిన మొత్తం 1.80 లక్షల రూపాయల సొమ్మును కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయలు ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఆరోపణలు చేశారు. దీనిపై కార్యవర్గ సభ్యులకు తెలియకుండానే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతా కలిసి సమావేశం ఏర్పాటుచేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.
దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇందులో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా కొట్టుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. విపరీతంగా జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపిస్తూ కుమ్ములాడుకున్నారు. దీంతో కమిషనర్ వెంటనే లోపలకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వన్ టౌన్ పోలీసులు వచ్చి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు.