![Go's that are not visible in the website - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/28/gos.jpg.webp?itok=NzjByXB2)
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో నిర్ణయాల అమలుకు ఉద్దేశించి వెలువరించే జీవోల గోప్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జీవో రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వం 2016లో వెలువరించిన జీవోల్లో 56 శాతాన్నే వెబ్సైట్లో పెడితే, 2017లో 42 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన జీవోల వివరాలను శుక్రవారం వెల్లడించింది. జీవోలన్నింటినీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ను ఇప్పటికే ప్రభుత్వం, గవర్నర్, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లింది. అయినా ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లలో మొత్తం 44,329 జీవోలకు గాను 21,869 అంతర్గత (ఇంటర్నల్) జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని సమాచారహక్కు చట్టం ద్వారా ఐటీశాఖ తేల్చిచెప్పింది.
జీవోలన్నీ పెట్టేదాకా పోరాటం
ప్రభుత్వం ఇప్పటికే అంతర్గత జీవోల పేరుతో ఏసీబీ కేసుల విత్డ్రా, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, న జరాల ప్రకటనలకు సంబంధించిన నిర్ణయాల జీ వోలను ‘ఇంటర్నల్’పేరుతో వెబ్సైట్లో ప్రజలకు అం దుబాటులో ఉంచకపోవటం సరైన నిర్ణయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. తాము ఇప్పటికే గవర్నర్ను కలిశామని, హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు.
వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్న జీవోలు అధికారుల టూర్లు, అలవెన్సులకు సంబంధించినవే ఉంటున్నాయని, దీని వల్ల ప్రజల కు ఏమీ ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల నిధులు, వారి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించకపోవటం దారుణమైన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత కోసం కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పద్మనాభరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment