వేట | Intense police manhunt for ellangaud | Sakshi
Sakshi News home page

వేట

Published Sun, Aug 3 2014 1:51 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

వేట - Sakshi

వేట

  •      ఎల్లంగౌడ్ కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు
  •      రంగంలోకి ప్రత్యేక బృందాలు
  • సాక్షి, సిటీ బ్యూరో:  నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు, మెదక్ జిల్లాకు చెందిన ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్  పోలీసులతో పాటు మరో రెండు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు. కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు మృతికి  కారకులైన ముఠాను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఈ ముఠాలోని సభ్యులు రఘు, నరేష్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్, రంగారె డ్డి, మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగలోకి దింపారు.
     
    పారిపోతూ చిక్కిన శ్రీకాంత్...
     
    ఘటనా స్థలంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి జరిపిన కాల్పుల్లో తన అనుచరుడు ముస్తఫా అక్కడికక్కడే మృతి చెందడంతో, షిఫ్టు కారును అక్కడే వదిలిన శ్రీకాంత్ మజీద్‌పురాకుపరుగుతీశాడు. అతన్ని అనుమానించిన గ్రామస్తులు పట్టుకున్నారు. తాను కారు డ్రైవర్‌నని.. రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్ జరిగిందని.. అందరూ కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చానని గ్రామస్తులను నమ్మించాడు. తిరిగి రాజీవ్ రహదారికి ఎలా చేరుకోవాలో చెప్పాలని వారినే కోరాడు. గ్రామస్తుడి నుంచి రూ.10 తీసుకుని, లారీ కోసం రహదారిపై వేచి చూస్తుండగా, శామీర్‌పేట ఠాణా పెట్రోలింగ్ సిబ్బంది హైజలీ, హెచ్.కె.రవిలు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని అధికారులకు అప్పగించారు.
     
    అలా కలిశారు...
     
    ముస్తఫా (22) మెదక్ జిల్లా సిద్దిపేట వాసి. ఎల్లంగౌడ్ సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామవాసి. సిద్దిపేట సమీపంలోని కాళ్లకుంట కాలనీలో రాజు అలియాస్ చిన్నా అనే యువకుడు సుమారు మూడు నెలల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  చిన్నా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు ముస్తఫా, ఎల్లంగౌడ్‌లు వచ్చారు. అక్కడే వారిద్దరికి పరిచయం ఏర్పడింది.    పంచాయతీలు, సెటిల్‌మెంట్లు, దాడులు, చోరీలు, దోపిడీలు, అరాచకాలలో ఆరితేరిన ఎల్లంగౌడ్‌కు ముస్తఫా ఆయుధమయ్యాడు.
     
    నేరాలకు మారుపేరు ఎల్లంగౌడ్
     
    దాదాపు ఎనిమిదేళ్లుగా సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, జహీరాబాద్, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతాల్లో ఎల్లంగౌడ్‌పై 12 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ తన అరాచకాలను కొనసాగించాడు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఎల్లంగౌడ్ తండ్రి అంజాగౌడ్, తల్లి లచ్చవ్వ, భార్య భాగ్యలు స్వగ్రామం ఇమాంబాద్‌లో హోటల్, కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నారు.
     
    కాసులు ఇస్తే దాడులకు సై...
     
    సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్‌లోని పేద కుటుంబంలో జన్మించిన ముస్తఫా విద్యార్థి దశలోనే విలాసాలకు అలవాటు పడ్డాడు. సుమారు మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ముస్తఫా డబ్బు ఇస్తే ఎంతటి నేరమైనా చేసేవాడు. ఎల్లంగౌడ్‌తో పరిచయం ముస్తఫాను పెద్ద నేరస్తుడిగా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. అతడి తండ్రి జహంగీర్  హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా, తల్లి సలీమ బీడీ కార్మికురాలిగా, సోదరుడు గౌస్ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడని, ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తే... ‘అడగవద్ద’ని ఎదురు సమాధానం చెప్పేవాడని సమాచారం.
     
    ఆ ఎస్‌ఐ సనత్‌నగర్‌లో పని చేశారు..
     
    సంజీవరెడ్డినగర్: దుండగులను పట్టుకునే ప్రయత్నంలో కత్తిపోట్లకు గురైన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి గతంలో సనత్‌నగర్‌పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. ఆరు నెలలుగా బాలానగర్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వద్ద అటాచ్‌గా పని చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఎస్‌ఐ ప్రస్తుతం బోరబండ గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన నివాసానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement