12 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు | inter first year classes start in 12th june | Sakshi
Sakshi News home page

12 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు

Published Wed, Jun 7 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

12 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు

12 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు

ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూలు జారీ.. ఈ నెల 30 వరకు దరఖాస్తులు
ఆన్‌లైన్‌లో ప్రవేశాల్లేవు.. ఫీజుల పెంపునకు నో


సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఇంటర్‌ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు చేపట్టేందుకు షెడ్యూలు జారీచేసింది. మంగళవారం నుంచే ఈ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. కాలేజీల్లో విద్యార్థులకు దరఖాస్తు ఫారాలను అందజేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. మొదటి విడతలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారికి ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విద్యార్థులు ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వచ్చే నెలలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక రెండో విడత ప్రవేశాలుంటాయని వివరించారు. ప్రవేశాలను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం చేపట్టాలని కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (ఏ–7శాతం, బీ–10 శాతం, సీ–1 శాతం, డీ–7 శాతం, ఈ–4 శాతం), వికలాంగులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా వారికి 5 శాతం, ఎక్స్‌ సర్వీస్‌మెన్, రక్షణ శాఖ కుటుంబాల విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయించాలని సూచించారు.

 ఇందులో మొత్తం 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయించాలని పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులైనట్లు ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న మార్కుల మెమో ఆధారంగా ప్రవేశాలకు అనుమతించాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఆ తర్వాత విద్యార్థులు ఒరిజినల్‌ మెమో, పాస్‌ సర్టిఫికెట్, టీసీ అందజేశాక ప్రవేశాలను కన్ఫర్మ్‌ చేయాలని సూచించారు. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని, అలా నిర్వహించే కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జోగిని పిల్లల రికార్డుల్లో తండ్రిపేరు స్థానంలో తల్లి పేరును చేర్చి రాయాలని సూచించారు.

ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు?
ఇంటర్మీడియెట్‌లోనూ కళాశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) తరహాలోనే జూనియర్‌ కాలేజీల ఫీజులను నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాలేజీలను 3 కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఆఫ్‌లైన్‌లోనే ప్రవేశాలు..
ఈసారికి ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలను ఆఫ్‌లైన్‌లోనే చేపడుతున్నట్లు అశోక్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రవేశాలను చేపట్టేందుకు యోచించినా, తగిన ఏర్పాట్లు లేకపోవడం, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశాలపై అవగాహన లేకపోవడం వల్లే ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టట్లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌కు సంబంధించిన అంశాలపై పరిశీలన కారణంగానే ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ కొంత ఆలస్యం అయిందన్నారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ ఫీజులను పెంచాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అయితే ఆర్థికంగా రూ.270 కోట్ల వరకు భారం కానున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఫీజులు పెంచట్లేదని వివరించారు. పాత ఫీజుల ప్రకారమే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement