
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. 3,4 రోజుల్లోనే డిమాండ్కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించాలన్నారు. స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించడంపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు. గత నాలుగేళ్లలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటుఇటుగా యూరియా అవసరం పడింది.
ఈసారి ఆగస్టు చివరికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడటంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. రైతుల డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయశాఖ ముందుజాగ్రత్తగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని యూరియాను వెంటనే తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.
3 వేల లారీల ద్వారా పోర్టుల్లోని యూరియా...
ఐడీఎల్, ఇఫ్కో, సీఐఎల్, క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు 1.15 లక్షల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగుళూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియాను త్వరగా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టుల్లోని యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సు రైళ్లను కేటాయించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు యూరియా నేరుగా పంపాలని కోరారు. ఇందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు.
రైల్వే స్టేషన్లకు స్టాక్ చేరుకోగానే అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని, కావాల్సిన లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు.
గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కోరారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ లారీలను సేకరించి యూరియాను తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు. పోర్టుల నుంచి నేరుగా రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చే యూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకువెళ్లకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్ధారించి నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని సీఎం ఆదేశించారు.
3–4 రోజుల్లోనే లక్ష టన్నులు అందాలి...
మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ పోర్టుల్లోని యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణాశాఖ మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, అధికారులకు నిర్దేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్రావు, పార్థసారధి, సునీల్శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోశ్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా తెప్పించేందుకు పర్యవేక్షణ...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్ నుంచి యూరియాను తెప్పించే పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో రేక్ (గూడ్సు రైలు) ద్వారా 2,600 టన్నులు యూరియా రానుంది. కేవలం రైళ్ల ద్వారానే దాదాపు 60 వేల టన్నుల యూరియా 2–3 రోజుల్లో ఆయా జిల్లాలకు చేరుకోనుంది. అదే సమయంలో దాదాపు 4 వేల లారీల ద్వారా కూడా యూరియా వివిధ మండలాలకు చేరుకోనుంది. మొత్తం యూరియా 3–4 రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు కాస్త ఓపికగా ఉండాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకొని ఎవరైనా ధరను పెంచి విక్రయించే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని చెప్పారు. రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆయా మండలాలకు చేరుకుంటుందని, 3–4 రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment