
సాక్షి, హైదరాబాద్: నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక, పూర్తిస్థాయి రద్దు కొనసాగనుంది. ఈ మేరకు నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్నుమా, జనగామ–ఫలక్నుమా (ఇది ప్యాసింజర్ ట్రైన్), నాంపల్లి–ఫలక్నుమా, లింగంపల్లి–నాంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్ రూట్లలో 19 సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను సికింద్రాబాద్–ఫలక్నుమా, నాంపల్లి–ఫలక్నుమా మధ్య రద్దు చేశారు. దీంతో ఈ రైళ్లు లింగంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయి.