mmts trains
-
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుపై ప్రయాణికుల సంఘాలు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఏ రైలు ఎపుడొస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దవుతుందో తెలియదు. నగరానికి లైఫ్లైన్గా నిలిచిన ఎంఎంటీఎస్పైన నిర్లక్ష్యమెందుకు’ అంటూ రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపైన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రయాణికుల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకల పట్ల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతే కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ లోకేష్ విష్ణోయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సికింద్రాబాద్లోని సంచాలన్భవన్, హైదరాబాద్ భవన్లలో ప్రయాణికుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్, దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సకాలంలో రైళ్లు నడపాలి.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు గతేడాది సర్వీసులను ప్రారంభించారు. కానీ ఈ రూట్లలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. పైగా ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మధ్యాహ్నం సమయంలో నడిపే రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఉండే సమయాల్లోనే రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ రూట్లో సకాలంలో రైళ్లు నడపాలని జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నూర్ కోరారు. ఉదయం 9 గంటలకు రావలసిన ట్రైన్ 11 గంటలకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది కాలనీలకు సిటీబస్సుల కంటే ఎంఎంటీఎస్ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావిస్తే ఈ రూట్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందని అమ్ముగూడ, రాఘవేంద్రనగర్ కాలనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. చదవండి: హైదరాబాద్లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు ‘హైలైట్స్’ పునరుద్ధరించాలి... ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందజేసే ‘హైలైట్స్’ మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికుల సంఘాలు కోరాయి. చిన్న చిన్న కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం పట్ల కూడా ప్రయాణికుల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా కూడా రైళ్లను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన సమస్యలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్ధనలను పరిశీలించిన అనంతరం, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని దక్షిణమధ్యరైల్వే జనరల్మేనేజర్ అరుణ్కుమార్జైన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ వచ్చేనా..
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దాదాపు ఎంపిక చేసిన అన్ని లైన్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయలేదు. కనీసం 9 రైళ్లను కొత్తగా కొనుగోలు చేస్తే తప్ప కొత్త మార్గాల్లోకి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడం సాధ్యం కాని పరిస్థితి. గతంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడడంతో ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల కొరత సవాల్గా మారింది. ఇప్పటికైనా రెండో దశకు నిధులు కేటాయిస్తే ఔటర్ చుట్టూ వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేలా ఎంఎంటీఎస్ విస్తరణకు అవకాశం ఉంటుంది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించే ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాదైనా ఆచరణలోకి వస్తే నగరవాసులకు ఎంతో ఊరట. అలాగే.. వందే మెట్రో రైళ్లు, హైస్పీడ్ రైళ్లు వంటి అధునాతన సదుపాయాల కోసం నగరం ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఔటర్ వరకు ఎంఎంటీఎస్.. మహా నగర విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ వరకు విస్తరించనున్నారు. ఈ క్రమంలో ప్రజా రవాణాను కూడా అన్ని వైపులా విస్తరించవలసిందే. మెట్రో రెండో దశ కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. కానీ దక్షిణమధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికే పూర్తయింది. మేడ్చల్, పటాన్చెరు, ఉందానగర్, చర్లపల్లి, ఘట్కేసర్ తదితర నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేసేలా రెండో దశ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం మౌలాలీ– సనత్నగర్ మధ్య కూడా పనులు తుది దశకు చేరుకున్నాయి. కానీ నగర విస్తరణకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న వాటినే వివిధ మార్గాల్లో నడుపుతున్నారు. గతంలో లింగంపల్లి– ఫలక్నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి మార్గాల్లో రోజుకు 121 సరీ్వసులు నడిచాయి. కానీ ప్రస్తుతం సరీ్వసుల సంఖ్య సగానికి తగ్గింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 9 కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొత్తగా పట్టాలెక్కలేదు. యాదాద్రికి పొడిగిస్తారా.. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం ఘట్కేసర్ వరకు చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు మరో 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈసారైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఏర్పడితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవకాశం ఉంది. ‘హైస్పీడ్’ను పట్టాలెక్కించండి.... గంటకు 220 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. సుమారు 922 కిలోమీటర్ల దూరం చేపట్టనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో.. శంషాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్.. మరో రూట్లో విశాఖ పట్టణం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్ వరకు మరో హైస్పీడ్ కారిడార్ను ఏర్పాటు చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య అత్యంత వేగంతో దూసుకెళ్లే రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 4 గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది. వందే మెట్రో కోసం సిటీ వెయిటింగ్.. వందేమెట్రో రైళ్ల కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల వరకు ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, సికింద్రాబాద్–పెద్దపల్లి, కాచిగూడ–కర్నూల్, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–రాయ్చూర్, తదితర మార్గాల్లో ఈ రైళ్లకు డిమాండ్ ఉంది. పాతబస్తీ మెట్రో సంగతేంటీ? పాతబస్తీ మెట్రో మార్గానికి నిధుల కొరత సవాల్గా మారింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం సుమారు రూ.2000 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో పాతబస్తీ మెట్రోను పట్టాలెక్కించేందుకు నిధులు విడుదల చేస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. -
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
ఎంఎంటీఎస్ కొత్త రూట్తో వారికి నిరాశే! హైటెక్ సిటీకి వెళ్లాలంటే కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులను ఎంతో ఊరించిన ఎంఎంటీఎస్ కొత్త రూట్ అరకొర కనెక్టివిటీతో ఉస్సూరుమనించే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే ఇది పరిమితం కానుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఉందానగర్–ఫలక్నుమా మధ్య కూడా రైళ్లను ప్రారంభించనున్నారు. కానీ మేడ్చల్, మల్కాజిగిరి వాసులు హైటెక్సిటీ, లింగంపల్లి వైపు వెళ్లాలంటే సికింద్రాబాద్లో మరో రైలు మారాలి. ఇది కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరో ట్రైన్ కోసం సికింద్రాబాద్లో పడిగాపులు కాయాల్సి ఉంటుంది. మేడ్చల్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం సికింద్రాబాద్ వరకే పరిమితం చేసినట్లు సమాచారం. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, నేరేడ్మెట్, సైనిక్పురి, బొల్లారం, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. వారంతా సిటీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మేడ్చల్ వాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అరకొర కనెక్టివిటీ వల్ల పాక్షిక సదుపాయంగానే మిగలనుందనే భావన కలుగుతోంది. ఉందానగర్ నుంచి ఉన్నా... ● పాలు, కూరగాయలు తదితర వస్తువులను విక్రయించే చిరువ్యాపారులు ఉందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మేడ్చల్, మల్కాజిగిరి వైపు రాకపోకలు సాగించేవారు ఉన్నారు. ఉందానగర్, ఫలక్నుమా నుంచి వచ్చేవారు. లేదా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేవారు సికింద్రాబాద్లో దిగి మరో రైలు మారాలి. దీంతో ఈ రూట్లోనూ ఇది అరకొర సదుపాయమే కానుంది. ● అలాగే ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు ఇప్పట్లో రైళ్లు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో కొత్తగా రెండు రూట్లలో ఏకంగా ప్రధాని చేతుల మీదుగా రైళ్లను ప్రారంభించనున్నప్పటికీ వందశాతం కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెల్లాపూర్ రూట్ తెల్లారినట్టే.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మధ్య కొత్తగా లైన్లను నిర్మించి రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మీదుగా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు సర్వీసులు మాత్రమే నడిపారు. దీంతో ప్రయాణికులు పెద్దగా వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ రూట్లో రైళ్లు తిరగడం లేదు. ఇలా అయితే ఎంతో మేలు.. ఉత్తరం వైపు ఉన్న మేడ్చల్ నుంచి పడమటి వైపున ఉన్న లింగంపల్లి వరకు సుమారు 50 కిలోమీటర్ల వరకు రైళ్లను నడపడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దక్షిణం వైపున ఉన్న ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లికి రైళ్లను నడిపితే ఈ రూట్లో కనెక్టివిటీ పెరుగుతుంది. నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పడమటి వైపు ఉన్నప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసినట్లవుతుంది.మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు నేరుగా రైళ్లను ఏర్పాటు చేస్తే ఉత్తర– దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
మేడ్చల్– ఉందానగర్ మార్గంలో వాహనదారులకు బ్రేక్లు.. అదొక్కటే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గం. మేడ్చల్లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్ రెండో దశలో ఈ లైన్ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్ సంస్థ అనుమతిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్ క్లియర్గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ ఉన్నా లేనట్లుగానే మారింది. అక్కరకొచ్చేది ఎలా..? ఎంఎంటీఎస్ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్నుమా– ఉందానగర్ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్లు ఉన్నాయి. కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున లెవల్ క్రాసింగ్ ఉంది. అంటే ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకోనుంది. దయానంద్నగర్, సఫిల్గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్లు ఉన్నాయి. ఈ రూట్ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్ క్రాసింగ్లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా రైల్ ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో రైల్ అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) ఒక్కటే పరిష్కారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్ క్రాసింగ్లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్నుమా ఆర్సీ పురం-ఫలక్నుమా ఫలక్నుమా-ఆర్సీ పురం ఫలక్నుమా-హైదరాబాద్ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కిన తరువాత కూడా ఏ సమయానికి గమ్యం చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు సమయపాలనలో నెంబర్ వన్గా నిలిచిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు అట్టర్ప్లాప్ అయ్యాయి. మరోవైపు సరీ్వసుల సంఖ్యను సైతం భారీగా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రైళ్ల నిర్వహణ కోసం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఈ సరీ్వసుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి సర్వీసు ఆలస్యమే... ‘రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఎంఎంటీఎస్కే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే’ లక్ష్యంతో ప్రారంభించిన ఈ లోకల్ రైళ్ల సేవలు క్రమంగా మసకబారుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో కుదేలైన ఎంఎంటీఎస్ వ్యవస్థను పునరుద్ధరించి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ రైళ్ల నిర్వహణ పట్టాలెక్కకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రతి సరీ్వసు అరగంట నుంచి గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్ను నమ్ముకొని ప్రయాణం చేశారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలకు చెందిన వేలాది మంది ఈ సరీ్వసులకు దూరమయ్యారు. కేవలం సమయపాలన లేకపోవడం వల్లనే ఎంఎంటీఎస్లో ప్రయాణించలేకపోతున్నట్లు బాలకిషన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు.‘మధ్యాహ్నం 3 గంటలకు ఒక ట్రైన్ లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు బయలుదేరితే సాయంత్రం 4.30 వరకు మరో ట్రైన్ అందుబాటులో ఉండదు. పైగా ఏ రైలు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.’ అని శేఖర్ అనే మరో ప్రయాణికుడు తెలిపారు.ఏదో ఒక విధంగా బేగంపేట్ వరకు చేరినా అక్కడి నుంచి సికింద్రాబాద్కు రావడానికే అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్కు గంటలో చేరుకోవలసి ఉండగా ఒక్కోసారి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. భారీగా ట్రిప్పుల రద్దు.. కోవిడ్కు ముందుకు ప్రతి రోజు 121 సరీ్వసులు నడిచాయి. ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–నాంపల్లి–లింగంపల్లి మధ్య ప్రతి రోజు 1.6 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం 75 నుంచి 100 సర్వీసులను పునరుద్ధరించారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఈ రైళ్లపైన ప్రయాణికులు నమ్మకం కోల్పోయారు. దీంతో రైళ్ల సంఖ్య తగ్గింది. శని, ఆదివారాల్లో గంటకు ఒక రైలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతి వారం 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య చాలా తక్కువ. సికింద్రాబాద్పై ఒత్తిడి.. మరోవైపు ఎంఎంటీఎస్కు ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్ల రాకపోకలతో ఈ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో పండుగ రద్దీ కారణంగా రెండు రోజులుగా ప్లాట్ఫామ్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంఎంటీఎస్లు నిలిపేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్
-
హైదరాబాద్: 34 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్నుమా రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి ఫలక్నుమా రూట్ 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒక్క సర్వీస్, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Secunderabad Railway Station: సాఫీగా రైలు కూత!
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్ఫామ్లపైకి అనుమతిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇబ్బందులు శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు. ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పార్శిళ్లకు నష్ట పరిహారం ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్ను బుకింగ్ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. వేగంగా మరమ్మతులు.. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. రద్దయిన, షెడ్యూల్ మారిన రైళ్లు ఇవీ.. ► భువనేశ్వర్–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్–సికింద్రాబాద్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. ► ఆదివారం సికింద్రాబాద్–షాలిమార్ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్–దానాపూ ర్, సికింద్రాబాద్–రాజ్కోట్, సికింద్రాబాద్–విశాఖపట్నం ఎక్స్ప్రెస్లను సమయా లను రీషెడ్యూల్ చేసి నడుపుతున్నారు. నేడూ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్క్లాస్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్లో సబర్బన్ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్లో ఫస్ట్ క్లాస్లో ప్రతి సింగిల్ రూట్ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లోని సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్నుమా– సికింద్రాబాద్– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్ వరకు 29 స్టేషన్ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్.. కథ మొత్తం కారు నుంచే..) 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్క్లాస్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు) -
ప్రయాణికులకు గుడ్న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు. ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్ధరాత్రి వరకూ సర్వీసులు.. కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. గతేడాది జూన్ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు. ► ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు. చార్జీలు తక్కువ... ►ప్లాట్ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్లు తదితర వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్: ఎంఎంటీస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు మరో గుడ్న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 11వ తేది నుంచి నగరంలో మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. అలాగే రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు పేర్కొంది. తాజాగా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు స్పష్టం చేసింది. The popular suburban transport services in the twin cities providing affordable and convenient travel option. 86 #MMTS services running as on 11th April, 2022 between Falaknuma - Lingampalli - Hyderabad- Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/dsVrdrGrVW — South Central Railway (@SCRailwayIndia) April 13, 2022 అయితే, గతంతో ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు రైళ్లు నడిచేవి. అలాగే, సీజనల్ టికెట్స్ను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే మళ్ళీ అందుబాటులో తీసుకువచ్చింది. #MMTS #TwinCities Secunderabad to Hyderabad; Secunderabad - Lingampalli - Secunderabad; Falaknuma to Hyderabad & Falaknuma - Ramchandrapuram - Falaknuma @drmsecunderabad @drmhyb pic.twitter.com/dgCiB1bQmQ — South Central Railway (@SCRailwayIndia) April 14, 2022 -
2018 నాటికే ప్రారంభం అన్నారు.. నాలుగేళ్లవుతున్నా ఊసే లేదు!
సాక్షి, ఘట్కేసర్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా 2వ దశలో సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదన చేశారు. 2013లో పనులు ప్రారంభించి మౌలాలి–ఘట్కేసర్ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం కేంద్రం 1/3, రాష్ట్ర ప్రభుత్వం 2/3 నిధులతో పనులు చేపట్టాలి. గతంలో ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ 2018 డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కాని మూడేళ్లయినా ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ ప్లాట్ఫాం నిరాశలో స్థానికులు.. ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం.. తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపుతారని భావించారు. ప్రజలు సికింద్రాబాద్కు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు దూరం ట్రాఫిక్ బాధను భరించలేక రైలు ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. బస్సులోనైతే గంటన్నర సమయం పడుతుండగా రైలులో కేవలం 35 నిమిషాల్లోనే సికింద్రాబాద్కు చేరుకోవచ్చు. చదవండి: కూతురి మరణం జీర్ణించుకోలేకే.. నిందితుడిని కాల్చి చంపారా? ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి.. స్థానికంగా ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, కొత్త కాలనీలు వెలుస్తున్నందున ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో యంనంపేట్, ఇస్మాయిల్ఖాన్గూడ పరిధిలో రైల్వే స్టేషన్లు ఏర్పడి రవాణ సౌకర్యం మెరుగు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకులకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటలోకి తేవాలని కోరుతున్నారు. ఎంఎంటీఎస్ బండి.. ఎంతకాలం ఆగాలండి.! మేడ్చల్రూరల్: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేపట్టింది. ఈ పనులు చేపట్టి ఏళ్లు గడిచినా మేడ్చల్ ప్రజలకు నేటికి ఎంఎంటీఎస్ కల నెరవేరలేదు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్ సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. దీంతో మేడ్చల్ వరకు ప్రత్యేక రైల్యే ట్రాక్, విద్యుత్ లైన్, నూతన ప్లాట్ఫార్మ్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రారంభం కాని రెండోదశ పనులు.. ఏళ్ల పాటు సాగిన పనులకు కరోనా అడ్డంకిగా మారింది. అదేవిధంగా అధికారుల అలసత్వం వల్ల నేటికి పనులు పూర్తి కాక మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు తొలగినా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటికి తోడు నిధుల లేమి కూడా కారణంగా మారడంతో ఎక్కడి పనులను అక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చి.. మేడ్లల్ పట్టణంలోని మేడ్చల్ – గిర్మాపూర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ – గుండ్లపోచంపల్లి రోడ్డులో రైల్వే గేట్లు ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థాని క నేతలు అండర్పాస్ల ఏర్పాటు చేయాలని ఢిల్లీకి వె ళ్లి రైల్వేశాఖ మంత్రికి పరిస్థితిని వివరించారు. ఆయన ఆదేశాలతో అండర్పాస్ల నిర్మాణం చేపట్టారు. -
హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, జీఎమ్మార్ అంగీకరిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు పరిమితమైన ఈ సర్వీసులను ఉందానగర్కు విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. రెండో దశలో ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మరో 6 కిలోమీటర్ల మార్గా న్ని కొత్తగా నిర్మించి ఎయిర్పోర్టుకు రైళ్లు నడిపేం దుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉన్నా జీఎమ్మార్ నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉందా నగర్ వరకు నడిపేందుకే అధికారులు పరిమితమ య్యారు. భవిష్యత్తులో జీఎమ్మార్ అంగీకరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులు ఎయిర్పోర్టుకు చేరుకొనేలా విస్తరిం చనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు 95 కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి కానున్నాయి. దీంతో ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ను పొడిగించేందుకు అవకాశం లభించింది. అలాగే సికింద్రాబాద్ నుంచి మహబూ బ్నగర్ వరకు ఇంటర్సిటీ సర్వీసులు నడిచే అవకా శం ఉంది. ప్రస్తుతం 8 ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పూర్తయిన దృష్ట్యా మరో రెండు సర్వీసులు కొత్తగా ప్రవేశపెట్ట నున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూర్, తిరుపతికి వెళ్లే రైళ్లు ఇకపై సికింద్రాబాద్–డోన్ మార్గంలోనూ రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా దూరంతో పాటు, కనీసం గంటకు పైగా ప్రయాణ సమయం తగ్గనుంది. -
చుక్..చుక్.. చిత్రాలెన్నో ! మారిన రైల్వేస్టేషన్ రూపు రేఖలు
సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. చిత్రం చెప్పే అర్థం.. జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. శివారులోనే అతిపెద్దది నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్గా లింగంపల్లి స్టేషన్కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది. ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే... ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది -
ఎంఎంటీఎస్ రైళ్లకు మళ్లీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లకు మరోసారి బ్రేక్ పడింది. ట్రాక్ నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా సోమవారం 36 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్నుమా– లింగంపల్లి, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. నిర్వహణపరమైన కారణాలతో రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడం, కనీస స్థాయిలో ఆదాయం లభించకపోవడం వంటి కారణాలతోనే సర్వీసులు రద్దవుతున్నాయి. గడ్డుకాలం.. తాజాగా కోవిడ్ మూడో ఉద్ధృతి మొదలైన నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ మరింత భారంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.5 కనిష్ట చార్జీల నుంచి రూ.15 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయాన్ని అందజేసే అత్యంత చౌకైన రవాణా సర్వీసులు నగరంలో ఎంఎంటీఎస్ ఒక్కటే. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా ఎంఎంటీఎస్కు గడ్డుకాలంగా మారింది. లా క్డౌన్ అనంతరం దశలవారీగా సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ పెద్దగా ఆదరణ లభించడం లేదు. (చదవండి: అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!) వారంలో రెండు మూడుసార్లు.. ► గతంలో సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్ను మా– సికింద్రాబాద్, లింగంపల్లి– ఫలక్నుమా, నాంపల్లి– లింగంపల్లి తదితర రూట్లలో ప్రతిరోజూ 121 సర్వీసులు నడిచేవి. రోజుకు 1.5 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్ వల్ల ఏడాది పాటు సర్వీసులను నిలిపివేశారు. గతేడాది మొదట్లో 25 సర్వీసులతో పునరుద్ధరణ మొదలుపెట్టి దశలవారీగా ప్రస్తుతం 79 కి పెంచారు. (చదవండి: హైదరాబాద్లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు) ► ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో వారంలో రెండు మూడు సార్లు కనీసం 20 నుంచి 25 సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రస్తుతం సగానికి సగం అంటే 36 సర్వీసులను సోమవారం ఒక్కరోజే రద్దు చేయనున్నారు. సాధారణంగా సికింద్రాబాద్– లింగంపల్లి మార్గంలో ప్రయాణికులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. కోవిడ్ మూడో ఉద్ధృతితో అనేక ప్రైవేట్ సంస్థలు, ఐటీ సంస్థలు తిరిగి వర్క్ఫ్రం హోమ్కు అవకాశం కల్పించాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. -
అయ్యో!.. ఎంఎంటీఎస్ రైలు ఎవరెక్కడం లేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ రైళ్లు వెలవెలబోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఈ రైళ్లను పునరుద్ధరించి 45 రోజులు దాటినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కనిపించడం లేదు. రోజుకు 30 వేల మంది కూడా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవడం లేదు. సాధారణ రోజుల్లో 1.6 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు మూడొంతుల మంది ఎంఎంటీఎస్కు దూరమయ్యారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులపైన పునరుద్ధరణ అనంతరం పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగం పెరగడం లేదు. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో గతేడాది నుంచి ఐటీ రంగం పునరుద్ధరణకు నోచకపోవడం వల్ల వివిధ మార్గాల్లో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నట్లు రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 16 నెలల తర్వాత పట్టాలపైకి.. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 22వ తేదీన నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో లోకల్ రైళ్లను చాలా రోజుల క్రితమే పునరుద్ధరించినప్పటికీ హైదరాబాద్లో మాత్రం ఈ ఏడాది జూన్ 22వ తేదీన పునరుద్ధరించారు. 2003లో ఈ రైళ్లను ప్రారంభించిన అనంతరం మొట్టమొదటిసారి కోవిడ్ కారణంగా స్తంభించాయి. సుమారు 16 నెలల పాటు ఎంఎంటీఎస్ సేవలు ఆగిపోవడంతో నగరవాసులు దాదాపుగా ఈ రైళ్లను మరిచారు. ఇదే సమయంలో సొంత వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఐటీ రంగం పునరుద్ధరించకపోవడం వల్ల సికింద్రాబాద్–హైటెక్సిటీ, లింగంపల్లి–హైటెక్సిటీ మార్గంలో డిమాండ్ పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వివిధ వర్గాలు ఈ ఏడాదిన్నర కా లంలో చాలా వరకు సొంత వాహనాల వైపు మ ళ్లారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఆదరణ తగ్గినట్లుగానే ఎంఎంటీఎస్ రైళ్లకు సైతం తగ్గింది. రద్దు దిశగా ఎంఎంటీఎస్ ► గతంలో రోజుకు 121 సరీ్వసులు నడిచేవి. ప్రస్తుతం 45 నుంచి 50 సరీ్వసులు మాత్రమే నడుస్తున్నాయి. ► ఈ సరీ్వసులకు సైతం ఆదరణ లేకపోవడం వల్ల సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను తగ్గించారు. ► ప్రతి ఆదివారం 10 రైళ్లను రద్దు చేస్తున్నారు. గ త మూడు వారాలుగా ఈ రద్దు కొనసాగుతోంది. కొరవడిన ప్రచారం ► దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల సదుపాయాలపైన ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టినా విస్తృతంగా ప్రచారం చేస్తారు. వివిధ రూపాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది. 16 నెలల తరువాత పునరుద్ధరించిన ఎంఎంటీఎస్పైన ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడం వల్లనే ప్రయాణికుల ఆదరణ లేదని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణీకులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సీజనల్ టిక్కెట్ల గడువును పొడిగించారు. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సరీ్వసులను బుధవారం నుంచి పాక్షికంగా నడుపనున్నారు. దీంతో గతేడాది రైళ్ల రద్దు కారణంగా చాలామంది ప్రయాణికులు తమ సీజనల్ టికెట్లను వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారు నష్టపోయిన కాలాన్ని ప్రస్తుతం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు సీజనల్ టికెట్ల గడువును పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సీజనల్ టికెట్ ప్రయాణికులు బుధవారం నుంచి ఈ పొడిగింపు సేవలను పొందవచ్చు. అంటే సీజనల్ టికెట్ మిగిలిన రోజులను ఇప్పుడు వినియోగించుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకున్నా, కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టికెట్లయినా ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ సీజనల్ టికెట్ పొడిగింపునకు ఎమ్ఎమ్టీఎస్/సబర్బన్ స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ సూచించారు. యూటీఎస్ను వినియోగించుకోండి... ► ఎంఎంటీఎస్ ప్రయాణానికి బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేయడమే కాకుండా నగదు రహితంగా టికెట్లను పొందవచ్చు. ► అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న అటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లలో స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లపైన 3 శాతం బోనస్ లభిస్తుంది. ► ఈ మేరకు తమ పాత స్మార్ట్ కార్డులను పునరుద్ధరించుకొనేందుకు ఎంఎంటీఎస్ స్టేషన్లలో సంప్రదించవచ్చు. ► అలాగే అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్) మొబైల్ యాప్ వినియోగించే వారు కూడా ఎంఎంటీఎస్ టికెట్లను పొంద వచ్చు. యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకొనేవారికి 5 శాతం బోనస్ లభిస్తుంది. ► కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు. చదవండి: ‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి -
హైదరాబాద్ లో ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణ
-
రెడ్సిగ్నల్ ఇంకెన్నాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: దశల వారీగా రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్ రైళ్లపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షన్నర మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగిస్తారు. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ ఈ సర్వీసులు అందుబాటులోకి రావపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు వంద శ్రామిక్ రైళ్ల ద్వారా 2.5 లక్షల మందిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి నుంచి మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సాధారణ రైళ్ల తరహాలోనే ఇవి సేవలందజేస్తాయి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లను నిలుపుతారు. ఈ రైళ్లలాగే నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు చార్జీలకు చెక్ పెట్టొచ్చు.. ‘సిటీ బస్సుల కంటే ఎంఎంటీఎస్ రైళ్లు సురక్షితమే కాకుండా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయవచ్చు. స్టేషన్లలో ఎంఎంటీఎస్ ఎక్కేవారు, దిగేవారిపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.’ అని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ‘లాక్డౌన్ నిబంధనలు చాలావరకు సడలించారు. ఉద్యోగ, వ్యాపారాలు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు క్యాబ్లు, ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. కానీ వాటిలో చార్జీలను రెట్టింపు చేశారు. నిలువుదోపిడీకి పాల్పడుతున్నార’ని సబర్బన్ ట్రైన్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూర్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో బ్రేక్.. నగరంలోని ఫలక్నుమా– లింగంపల్లి, నాంపల్లి– లింగంపల్లి, ఫలక్నుమా– నాంపల్లి, సికింద్రాబాద్– నాంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 121 సర్వీసులు నడుస్తాయి.1.5 లక్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటారు. ప్రత్యేకంగా లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు, లింగంపల్లి నుంచి నాంపల్లి వరకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రూట్లలోనే ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగిన ప్రయాణికులు ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ఇళ్లకు చేరుకుంటారు. లాక్డౌన్ కారణంగా సిటీ బస్సులు, మెట్రో రైళ్లలాగే సుమారు 68 రోజుల క్రితం ఈ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. కానీ ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించిన దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లను పరిమితంగా అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రూట్లలోఇలా నడపొచ్చు.. ♦ సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ఉదయం, సాయంత్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడపవచ్చు ♦ ఈ రెండు రూట్లలో హైటెక్ సిటీ వరకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువ ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్లను,రైళ్లను శానిటైజ్ చేయాలి ♦ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం పెద్దగా ఇబ్బంది ఉండబోదు ♦ భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసి సీట్ల సామర్థ్యం వరకు అనుమతించవచ్చు ♦ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడిపితే ప్రయాణికులపై కచ్చితమైన అంచనా ఉంటుంది ♦ ప్రస్తుతం సాధారణ టికెట్ల కొనుగోళ్లను నిలిపివేశారు. కానీ యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ టిక్కెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తే ప్రయాణం చేసే వారి వివరాలు కూడా నమోదవుతాయి -
ఎక్కడి రైళ్లు, బస్సులు అక్కడే
సాక్షి, హైదరాబాద్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి మోదీ పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది మధ్య బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేసింది. జనతా కర్ఫ్యూ మొదలయ్యే ముందు బయలుదేరిన రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక నగర పరిధిలో మా త్రం ప్రజల అత్యవసర ప్రయాణాల దృ ష్ట్యా 12 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం నడుపుతోంది. ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్ –ఫలక్నుమా రైలు, ఉ.6.50, 9.55, 1.00, 5.10Sకు ఫలక్ను మా–లింగంపల్లి మధ్య, 8.23, 11.30, 3.30, రాత్రి 8.45లకు లింగంపల్లి–ఫలక్నుమా, సాయంత్రం 6.50కి లింగంపల్లి–హైదరాబాద్, 7.35కి హైదరాబాద్–లింగంపల్లి, రాత్రి 10.30కి ఫలక్నుమా–సి కింద్రాబాద్ సర్వీసులు బయల్దేరతాయి. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవా రం ఉదయం 6 వరకు అన్ని బస్సులు ని లిచిపోనున్నాయి. అత్యవసరాలకు కొన్ని బస్సులు మాత్రం సిద్ధంగా ఉంటాయి. -
తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక, పూర్తిస్థాయి రద్దు కొనసాగనుంది. ఈ మేరకు నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్నుమా, జనగామ–ఫలక్నుమా (ఇది ప్యాసింజర్ ట్రైన్), నాంపల్లి–ఫలక్నుమా, లింగంపల్లి–నాంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్ రూట్లలో 19 సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను సికింద్రాబాద్–ఫలక్నుమా, నాంపల్లి–ఫలక్నుమా మధ్య రద్దు చేశారు. దీంతో ఈ రైళ్లు లింగంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. -
నిమజ్జనానికి సులువుగా వెళ్లొచ్చు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారు జామున 4 గంటల వరకు 8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. లింగంపల్లి–ఫలక్నుమా, సికింద్రాబాద్–ఫలక్నుమా, సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి. ఎంఎంటీఎస్... ‘హైలైట్స్’ యాప్ నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్’ మొబైల్ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి– లింగంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్, ఫలక్నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంఎంటీఎస్పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్’ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్ ఏ రూట్లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. (ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?.. ఇక్కడ క్లిక్ చేయండి) -
రైలొస్తోంది
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు సోమవారం నుంచి పట్టాలెక్కనుంది. ఐదేళ్లుగా ఎంఎంటీఎస్ రాక కోసం ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెల్లాపూర్, బీహెచ్ఈఎల్, రామచంద్రపురం మూడు స్టాప్లను ఏర్పాటు చేశారు. గతంలో ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లి వరకు వచ్చేది. గతంలోనే తెల్లాపూర్ మీదుగా రామచంద్రాపురం పట్టణం వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించారు. పనులు పూర్తయి సుమారు రెండేళ్లు పూర్తి అవుతున్నా రైలు రాక కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వచ్చింది. 6 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరలో ఎంఎంటీఎస్ రైలును రప్పించేందుకు కృషి చేస్తామని ఎన్నికల హామీలు సైతం ఇచ్చారు. ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సైతం సంప్రదించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుండి రామచంద్రాపురం నుంచి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి ఫలక్నుమా నుంచి ఎంఎంటీఎస్ రైలు 11 గంటల 10నిమిషాలకు రామచంద్రపురం రైల్వే స్టేషన్ చేరుకోనుంది. తిరిగి ఉదయం 5 గంటలకు రామచంద్రపురం నుంచి ఫలక్నుమా బయలు దేరి వెళ్లనుంది. ఆదివారం ఈ మార్గంలోని రైల్వే స్టేషన్లో సాంకేతిక పరమైన పనులను అధికారులు పూర్తి చేశారు. రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఆగే ఎంఎంటీఎస్ రైలును రామచంద్రాపురం రైల్వే స్టేషన్ వద్ద ఆపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్టు తెలిసింది. ఈ మార్గంలో రద్దీని బట్టి రైళ్ల సంఖ్య పేరిగే అవకాశం ఉంది. రెండు రోజులుగా రామచంద్రాపురం రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్ రైలుకు చెందిన టైం టేబుల్ వాట్సాప్లలో హల్చల్ చేస్తోంది. దీనిపై స్థానిక రైల్వే అధికారులను సంప్రదించగా ఎంఎంటీఎస్ రైలు మాత్రం రాత్రి 11 గంటల సమయంలో రామచంద్రపురం రైల్వే స్టేషన్లో ఉందని వివరించారు. ఉదయం 5 గంటల సమయంలో ఫలక్నుమా బయలుదేరి వెళుతుందని చెప్పారు. పూర్తి వివరాలు తమ పరిధిలో లేవని వివరించారు. -
ఎంఎంటీఎస్కు కొత్త సొబగులు
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ కొత్త సొబగులను అద్దుకుంది. సరికొత్త సదుపాయాలతో, మరిన్ని భద్రతా ప్రమాణాలతో ప్రయాణికుల ముందుకు రానుంది. గులాబీ, తెలుపు రంగుల్లో రూపొందించిన సరికొత్త ఎంఎంటీఎస్ రైళ్లను బుధవారం ప్రారంభించనున్నారు. మెట్రో తరహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటరైజ్డ్ కంట్రోలింగ్ వ్యవస్థ కలిగిన కొత్త మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. సమయపాలన పాటించండి.. బుధవారం నుంచి కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా రైళ్ల నిర్వహణపై మంగళవారం రైల్నిలయంలో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైళ్ల జాప్యానికి తావు ఉండరాదన్నారు. రైళ్ల నిర్వహణ, సమయపాలనపైన క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మార్గం లో అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక హంగులతో.. ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ, జీపీఎస్ ఆధారిత రూట్ మ్యాపింగ్, రైల్వేస్టేషన్ల సమాచారం, ఎల్ఈడీ డిస్ప్లే వంటి ఆధునిక హంగులతో ఈ 12 బోగీల రైళ్లు అతి తక్కువ చార్జీలతో అత్యధిక దూరం రవాణా సదుపాయాన్ని అందజేయనున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రస్తుతం 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. అందుబాటులోకి రానున్న కొత్త రైళ్ల వల్ల ప్రయాణికుల సంఖ్య 2.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. 30 శాతానికి పైగా ప్రయాణికుల భర్తీ రేషియో పెరుగుతుందన్నారు. ఆధునాతన నియంత్రణ వ్యవస్థ.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తిస్థాయి ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీసీఎంఎస్) ద్వారా నడుస్తాయి. దీనివల్ల పట్టాలపైన పరుగులు పెట్టే రైళ్ల కదలికలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న అవాంతరం ఎదురైనా అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపడుతుంది. ఆధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనివల్ల విద్యుత్ బాగా ఆదా అవుతుంది. అన్ని బోగీల్లో వీఆర్ఎల్ఏ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. దీంతో లైటింగ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా కోచ్ల లోపలి భాగాలను రూపొందించారు. భద్రత పటిష్టం.. ఫలక్నుమా, ఉప్పుగూడ, యాఖుత్పురా తదితర స్టేషన్లలో రైళ్లపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు పెద్ద సవాల్గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లకు ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. రాళ్లు విసిరినా ప్రయాణికులకు తాకకుండా జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు మహిళల బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. దీంతో మహిళల బోగీల్లోకి మగవారు ప్రవేశించడం, పోకిరీలు, ఈవ్టీజర్ల బెడద నుంచి రక్షణ లభించనుంది. ఎల్ఈడీ డిస్ప్లే.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లలో లోపల, బయట ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టేషన్ల వివరాలు ప్రదర్శితమవుతాయి. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్టేషన్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగే తరువాత రాబోయే స్టేషన్ అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది. ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు.. ప్రస్తుతం నగరంలోని ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 9 కోచ్లు ఉన్న 10 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతి రోజు 121 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. 2003లో కేవలం 6 కోచ్లతో ప్రారంభించిన రైళ్లను 2010లో 9 కోచ్లకు పెంచారు. ఇప్పుడు 12 కోచ్లతో తయారు చేసిన 4 కొత్త రైళ్లు వచ్చేశాయి. ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు ఉంటుంది. మరో 4 రైళ్లు త్వరలో నగరానికి రానున్నాయి. దీంతో 8 కొత్త రైళ్ల వల్ల ట్రిప్పుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లలో 700 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 2,000 మంది నిల్చొని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రైళ్లలో 1150 సీట్లు ఉంటాయి. మరో 4,000 మంది నిల్చొని ప్రయాణం చేయవచ్చు.. అంటే ఒక ట్రిప్పులో ప్రయాణికుల సంఖ్య 2700 నుంచి ఏకంగా 5150 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశ సికింద్రాబాద్–బోయిన్పల్లి, పటాన్చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను నడుపుతారు. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా ఇప్పుడు ఉన్న 1.5 లక్షల నుంచి 2.5 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది. రూ.10 చార్జీ.. 40 కి.మీ ప్రయాణం.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయం లభిస్తుంది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రిప్పులు కూడా బాగా పెరుగుతాయి. కేవలం రూ.10 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్లకు పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న రైళ్లు కేవలం ఎంఎంటీఎస్ రైళ్లే. – సీహెచ్ రాకేష్, సీపీఆర్వో, దక్షిణ మధ్య రైల్వే -
అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రయాణాలకు కామన్గా ఒకే మొబిలిటీ కార్డు అందించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. దీనికి అవసరమైన ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వివిధ మార్గాల ద్వారా ప్రయాణించే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొబిలిటీ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్, స్వైపిం గ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ప్రత్యేకతలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్శ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సీజీఎం కేవీ రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎంటీఎస్ రైళ్లకు కొత్త లుక్
సాక్షి, హైదరాబాద్: దశాబ్దన్నర కాలంగా నగర రవాణాలో భాగమైన ఎంఎంటీఎస్ రైలు బోగీలు కొత్త రంగులతో మెరిసిపోనున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్ల లుక్ను మార్చాలని రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా కొత్త లుక్తో కొన్ని బోగీలు రూపొందించి నగరానికి చేర్చింది. ప్రస్తుతం మౌలాలిలోని ఈఎంయూ కార్షెడ్లో ఉన్న కొత్త ఎంఎంటీఎస్ రేక్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు తెలుపు రంగుపై నీలి రంగు స్ట్రిప్తో బోగీలు నడుస్తున్నాయి. మధ్యలో మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బోగీలకు గులాబీ రంగు వేయించారు. ఇప్పుడు రైలు బోగీలకు కొత్త రంగులు రానున్నాయి. ప్రస్తుతం గులాబీ రంగు డిజైన్లతో ఉన్న బోగీలు వచ్చాయి. వాటిల్లో సీట్ల రూపాన్ని కూడా మార్చారు. సీటింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఈ కొత్త రైళ్లు త్రీ ఫేజ్ విద్యుత్తో నడుస్తాయి. వీటిల్లో కొన్ని ఆధునిక వసతులు కూడా కల్పించనున్నారు. తమిళనాడులోని పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. అధికారులు చేసే సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేసి పూర్తిస్థాయి కొత్త బోగీలను సరఫరా చేయనున్నారు. పనుల పురోగతిపై జీఎం సమీక్ష.. అల్వాల్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనుల పురోగతిపై గజానన్ మాల్యా సమీక్షించారు. మౌలాలిలోని ఎలక్ట్రిక్ కార్షెడ్లో ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) కోచ్ నిర్వహణ అవసరాలను గురించి సమగ్ర సమీక్ష జరిపారు. ఎంఎంటీఎస్ రేక్ మరమ్మతులు నిర్వహించే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్ను పరీక్షించారు. అనంతరం స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్ఎంతో చర్చించారు. -
హతవిధీ.. ఆర్టీసీ నిపుణుల కమిటీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభంతో మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న ఆర్టీసీని బాగుచేసేందుకు ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీ కూడా చేతులెత్తేసింది. ఉన్నపళంగా సంస్థ బాగు పడాలంటే ఏం చేయాలనే విషయంలో సిఫారసులు చేసేందుకు 8 నెలల కింద ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేకపోయింది. అసలు ఆ కమిటీ గురించి పట్టించుకునే వారే లేకపోవటంతో కమిటీ సభ్యులు కూడా మిన్నకుండి పోయారు. ఆర్టీసీకి ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీ, చైర్మన్ లేకపోవటం కమిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంస్థను పర్యవేక్షించేవారు లేకపోవటంతో అధికారులు కూడా కమిటీకి సహకరించటం లేదని తెలుస్తోంది. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే, రవాణా శాఖ మంత్రి ఇటీవలే బాధ్యతలు స్వీకరించటం, వెంటనే లోక్సభ ఎన్నికల్లో బిజీ కావటంతో కమిటీ సభ్యులు కలవలేకపోయారు. విచిత్రమేంటంటే.. మూడు నెలల కిందే నివేదిక సిద్ధమైనా, దాన్ని సమర్పించే ఆసక్తి కూడా సభ్యుల్లో నశించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎనిమిది మంది సభ్యులున్నారు. వారు అన్ని రకాలుగా సంస్థ పనితీరును పరిశీలించి సూచనలతో నివేదిక సిద్ధం చేశారు. కొంత సమాచారం కావాల్సి ఉండగా, ఆ వివరాలు చెప్పేందుకు అధికారు లు సహకరించట్లేదు. కమిటీలో కీలక బాధ్యత ల్లో ఉన్న ఈడీ మాత్రం నిరంతరం అందు బాటులో ఉంటున్నా.. ఓ ఉన్నతాధికారి సభ్యు లను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. పలు మార్లు సమయం కోరితే అతి కష్టమ్మీద ఒక్క సారి కలసి మొక్కుబడిగా సమావేశాన్ని ముగించారు. వారికే అంత పట్టింపు లేనప్పుడు తామెందుకు పట్టించుకోవాలన్న తీరులో సభ్యులున్నారు. నివేదికపై ఇప్పటికీ కొందరు సభ్యులు సంతకాలు కూడా చేయలేదు’అని కమిటీకి సహకరించిన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. గతంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరించిన కర్ణాటక కాంగ్రెస్ నేత నాగరాజు కూడా కమిటీ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆ నివేదికపై ఆయన సంతకం చేసేందుకు కూడా ఆసక్తి చూపట్లేదట. ఇదీ నేపథ్యం.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మూడేళ్ల కింద ఆర్టీసీ తీరును సమీక్షించారు. అప్పట్లో ఆయన ఎన్నో సూచనలు చేశారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు యథావిధిగా సంస్థను సంక్షోభంలోకి నెట్టేశారు. అప్పట్లో ఎండీగా పనిచేసిన రిటైర్డ్ అధికారి రమణారావుకు ఈడీలతో సఖ్య త లేకపోవటం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థను బాగు చేసేందుకు కొంత వరకు కృషి చేసిన నాటి చైర్మన్ సోమారపు సత్యనారాయణకు, అప్పటి ఎండీకి మధ్య పొసగలేదు. దీంతో ఎండీ నుంచి సహకారం లేక సోమారపు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఆయన కృషి వల్లే నిపుణుల కమిటీ ఏర్పడింది. ఇక మళ్లీ సమీక్షలు కూడా లేకపోవటంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. కమిటీ సిఫారసుల్లో కొన్ని.. - ఆర్టీసీ నుంచి హైదరాబాద్ సిటీని విడదీసి.. మెట్రో రైలుతో కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందులో ఎంఎంటీఎస్ రైల్ నెట్వర్క్ను కూడా కలపాలి. - రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు సరిగా కొనట్లేదు. వెంటనే 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. నిధుల సమస్య ఉంటే విడతల వారీగా కొనాలి. సంస్థలో కాలం చెల్లిన బస్సులను పక్కనపెట్టాలి. వాటివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఉన్న బస్సుల సామర్థ్యం పెరగాల్సి ఉంది. - కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే తరచూ కార్మికులతో అధికారులకు వివాదాలు తలెత్తి వాటి ప్రభావం సంస్థ పనితీరుపై పడుతోంది. - సంస్థకు నిరంతరం పూర్తిస్థాయి ఎండీ ఉండాలి. అవగాహన ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి. సంస్థపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పనితీరు బాగా దిగజారిపోతోంది. - తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పరిపాలన బోర్డు ఉండాలి. ఇది జరగాలంటే ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య పూర్తిస్థాయిలో విభజన జరగాలి. -
అరగంట ఆగాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: మీరు రోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేస్తుంటారా? అయితే మీరు నిశ్చింతగా స్టేషన్కు వెళ్లండి. నిర్ణీత సమయానికంటే అరగంట ఆలస్యంగా వెళ్తేనే ట్రైన్ వస్తుంది. అంతేకాదు.. ఒకవేళ వస్తుందో? రాదో? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన ఇలా ఉంది మరి! నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా, మరోవైపు సాంకేతిక కారణాలతో ట్రిప్పులు కూడా రద్దవుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఎంఎంటీఎస్ను నమ్ముకొని స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సకాలంలో ఆఫీస్లకు చేరుకోలేకపోతున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా ట్రిప్పులు రద్దయితే.. తర్వాత వచ్చే రైలు కోసం మరో గంట ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన మెరుగుపడిందని అధికారులు చెబుతుండగా... వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగానే ఉందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అనేకం... నగరంలో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో పట్టాలెక్కించిన ఎంఎంటీఎస్ రైళ్లకు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పట్లో రైల్వేశాఖ నిర్ణయించింది. కానీ పట్టాలపై ఎక్కడ ఏ చిన్న అవాంతరం వచ్చినా వెంటనే ఆగిపోయేది ఎంఎంటీఎస్ రైలునే. వందల కొద్దీ ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర రైల్వేస్టేషన్లలో ప్రధాన రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ప్లాట్ఫామ్లను కేటాయిస్తారు. అందుకోసం ఎంఎంటీఎస్ రైళ్లను స్టేషన్లకు దూరంగా నిలిపివేస్తారు. ప్లాట్ఫామ్లపైన ఉన్న రైళ్లు కదిలితే తప్ప ఎంఎంటీఎస్ వచ్చేందుకు అవకాశం ఉండదు. సికింద్రాబాద్ స్టేషన్లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీంతో ఫలక్నుమా–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లకు బ్రేక్ పడుతోంది. అలాగే నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా తరచూ స్తంభిస్తున్నాయి. మరోవైపు పట్టాలపై తరచూ చేపట్టే మరమ్మతులు కూడా ఎంఎంటీఎస్కు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో నెలల తరబడి ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. అరగంట వ్యవధిలో రెండు రైళ్లు రావాల్సిన మార్గంలో ఒక ట్రిప్పు రద్దు కావడంతో గంట సమయంలో కేవలం ఒక్క రైలుమాత్రమే వస్తోంది. అంటే రెండు రైళ్ల ప్రయాణికులు ఒకే దాంట్లో వెళ్లాల్సి వస్తోంది. పైగా ఆలస్యం తప్పడం లేదు. ప్రాధాన్యమేదీ? ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలో 2003లో ప్రవేశపెట్టారు. ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర మార్గాల్లో ప్రస్తుతం ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తున్నాయి. 1.6 లక్షల మందికి పైగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈ రైళ్ల ప్రాధాన్యతను గుర్తించి ఎంఎంటీఎస్ కోసం ఒక ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించారు. ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ రైళ్ల రాకపోకలతో సంబంధం లేకుండా అన్ని రూట్లలో ఒక లైన్ కేటాయించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. కానీ దశాబ్దాలు గడిచినా ఆ ప్రతిపాదన అమల్లోకి రాలేదు. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2013లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటి వరకు రెండో దశ రైళ్లు నడుస్తాయో తెలియదు. నిధుల కొరత వెంటాడుతోంది. నగర శివార్లను కలుపుతూ రెండో దశను చేపట్టారు. ఘట్కేసర్, పటాన్చెరు, ఉందానగర్, మేడ్చల్ తదితర ప్రాంతాలను ఎంఎంటీఎస్తో అనుసంధానం చేసేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. ఎంఎంటీఎస్ కంటే ఆలస్యంగా ప్రారంభించిన మెట్రో రైళ్లు దశల వారీగా పరుగులు తీస్తుండగా ఎంఎంటీఎస్ మాత్రం అక్కడే ఉంది. -
జంట నగరాల ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రయాణికులకు తీపికబురు. మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించడానికి కామన్ మొబిలిటీ కార్డ్(సీఎంసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు బేగంపేటలోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. జంట నగరాల్లో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్బీఐ/హిటాచీ కన్సార్టియం ద్వారా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారంలో ఎస్బీఐతో చర్చలు జరిపి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. 2019 జనవరి చివరికి కనీసం 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా 2 మెట్రో స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. పురోగతిని పరిశీలించిన తర్వాత జంట నగరాల్లోని అన్ని మెట్రో స్టేషన్లకు విస్తరించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ) పురుషోత్తమ నాయక్, ఎస్బీఐ అధికారి ఓబుల్ రెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్ కన్వీనర్ ఖాన్, హెచ్ఎంఆర్ఎల్ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఈజీ జర్నీ
సాక్షి,సిటీబ్యూరో: మహానగర వాసులకు ప్రయాణ సదుపాయాలు మరింత చేరువయ్యాయి. తక్కువ సమయంలోనే ప్రజలు ప్రజా రవాణాను అందుకోగలుగుతున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, విస్తృతమవుతోన్న మెట్రో రైళ్ల సేవలతో ప్రయాణ సదుపాయాలు మెరుగుపడుతున్నట్లు ‘ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్, ఓలా థింక్ ట్యాంక్’ సంస్థల తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాబ్లు అందుబాటులోకి వచ్చాక నగరంలో ప్రయాణం కోసం ఎదురు చూసే సమయం బాగా తగ్గిపోయినట్టు ఆ సంస్థలు గుర్తించాయి. అతి తక్కువ కాలినడక దూరంలో ప్రయాణ సదుపాయాలు గల నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ అంశంలో ఢిల్లీ, ముంబై నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఓలా సంస్థ దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, తిరువనంతపురం తదితర 20 నగరాల్లో ప్రయాణ సదుపాయాలపై ఇటీవల సర్వే నిర్వహించింది. మొత్తం 43 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం వెల్లడించారు. పర్యావరణ ప్రియమైన రవాణా సదుపాయాలను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని, అతి తక్కువ సమయంలో, కాలుష్యం, వాహనాల రద్దీ లేని రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందజేయడంపై రవాణా సంస్థలు, ప్రజా రవాణా రంగంలో ఉన్న భాగస్వామ్య సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రజారవాణాయే ప్రధానం.. ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గాలు, నగరంలో అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, ప్రజల కొనుగోలుశక్తి, సంస్కృతి, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. ఓలా చేసిన సర్వే ప్రకారం హైదరాబాద్లో ప్రయాణ సదుపాయాల కల్పనలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లే ప్రధాన ప్రజారవాణా సాధనాలుగా నిలిచాయి. నగరంలో (సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారు కాకుండా) అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకుంటున్న వారిలో 64 శాతం మంది బస్సులు, రైళ్లను ఎంపిక చేసుకుంటుండగా, 33 శాతం మంది షేర్ క్యాబ్లను వినియోగిస్తున్నారు. మిగతావారు ఆటోలు వంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సుమారు 3,850 బస్సులతో నగరంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలను అందజేసే సామర్థ్యం ఉన్న ఆర్టీసీకి 87 శాతం వినియోగదారులు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. నగరంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా సరే కేవలం 15 నిమిషాల కాలినడక దూరంలో ప్రజా రవాణాను చేరుకోగలుగుతున్నట్టు సర్వేలో గుర్తించారు. పర్యావరణ సహిత వాహనాలకే జై.. మరోవైపు నగరవాసులు ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, సీఎన్జీ వంటి ఇంధనాలను వినియోగించే పర్యావరణ ప్రియమైన వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో పర్యారవణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. 2030 నాటికి నగరంలో పూర్తిగా ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి రాగలవని చాలామంది విశ్వాసం వ్యక్తం చేశారు. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల్లో పయనిస్తున్న వారిలో 50 శాతం మేర పాస్లు, స్మార్ట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఇటీవల మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్కార్డుల వినియోగం బాగా పెరిగింది. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ఉద్యోగులు, రెగ్యులర్గా రాకపోకలు సాగించేవారు నెలవారీ పాస్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ‘‘ప్రయాణ సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇది కీలకమైన మలుపు కానుంది’’ అని ఓలా సహ వ్యవస్థాపకులు, సీఈఓ భవీష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రవాణా రంగంలో అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
సామాన్యుడికి చేరువ కావాలి అదే మా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ వెల్లడించారు. సామాన్యుడికి రైల్వే సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, దక్షిణమధ్య రైల్వే పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రత, కొత్తలైన్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలివీ... సాక్షి: దక్షిణ మధ్య రైల్వే పురోగతి ఎలా ఉంది? జీఎం: బావుంది. ఆదాయ పెరుగుదలతో దక్షిణమధ్య రైల్వే ఏప్రిల్–సెప్టెంబర్లో రూ.7,017 కోట్లు ఆర్జించింది. 2016లో ఇది రూ.6,171గా ఉంది. అంటే 13.71 శాతం పెరుగుదల నమోదైంది. ఆదాయాభివృద్ధి పెరుగుదలలో దేశంలోనే మొదటిస్థానం సాధించాం. ఇక సరుకు రవాణా ఆదాయంలో దేశంలో 5వ స్థానంలో నిలిచాం. భారతీయ రైల్వే చేపట్టిన అంబ్రెల్లా ప్రాజెక్టుల గురించి వివరిస్తారా? దీని కింద ప్రతీ జోన్లో ఉన్న జీఎంకు రూ.100 కోట్ల నిధులొస్తాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్యం మేరకు స్టేషన్లలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వెచ్చించవచ్చు. ముఖ్యంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, హైలెవెల్ ప్లాట్ఫారమ్స్ ఏర్పా టు చేస్తున్నాం. రాబోయే రెండు మూడేళ్లలో జోన్ పరిధిలో ఉన్న 742 స్టేషన్లలో ఈ పనులు పూర్తవుతాయి. మాసాయిపేట దుర్ఘటన తరువాత కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగుల నిర్మూలిస్తామన్నారు కదా! ఆ పనులు పూర్తయ్యాయా? కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు అక్టోబర్ 31 గడువుగా పెట్టుకుని పూర్తిచేశాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగులు లేవు. 2018 చివరి నాటికి దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ల నిర్మూలన దిశగా భారతీయ రైల్వే కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆర్వోబీ/ఆర్యూబీల పనుల పురోగతి? గత నాలుగేళ్లలో 379 ఆర్వోబీ/ఆర్యూబీలను పూర్తి చేశాం. మిగిలిన 264 ఆర్వోబీ/ఆర్యూబీ ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనులు ఎంతవరకు వచ్చాయి? ఎంఎంటీఎస్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేక్స్(నాలుగు బోగీలు కలిగిన రైళ్లు) కొనుగోలు మాత్రమే మిగిలింది. అవి రాగానే సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2ని యాదాద్రి వరకు పొడిగిస్తారా? ఈ ప్రాజెక్టు చేపట్టడానికి మేం సుముఖమే. సర్వే కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరీంనగర్–హసన్పర్తి కొత్త లైన్ సర్వే పనులు ఎలా ఉన్నాయి? ఉత్తర తెలంగాణను ఉత్తర భారతంతో కలిపే ప్రాజెక్టు ఇది. దీని సర్వే పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి సర్వే పూర్తవుతుంది. శివారు స్టేషన్ల అభివృద్ధి, టెర్మినళ్ల నిర్మాణానికి ఏం చర్యలు తీసుకున్నారు? సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై రద్దీ పెరిగిన నేపథ్యంలో లింగంపల్లి స్టేషన్ని నాలుగో టెర్మినల్గా అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం 5 రైళ్లను అక్కడ నుంచి నడుపుతున్నాం. త్వరలోనే మరిన్ని నడుపుతాం. చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలుపెట్టాం. అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నాం. మొత్తం రూ.224 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రైల్వే పనుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొత్త రైల్వే పనుల కోసం భారతీయ రైల్వే ఎప్పుడూ ముందుంటుంది. ఇందుకోసం జాయింట్ వెంచర్ విధానంలో ముందుకెళుతున్నాం. రాష్ట్రాలు 51 శాతం, కేంద్రం 49 శాతం నిధులతో ప్రాజెక్టులు చేపడతాం. ఈ విధానాన్ని వినియోగించుకోవడంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. దీనిపై ఏపీ సంతకం చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. తెలంగాణతో ఇంకా సంప్రదింపులు నడుస్తున్నాయి. స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతీ స్టేషన్కు రూ.30 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. స్టేషన్ల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ఆయా స్టేషన్ల ముఖద్వారాల్లో స్థానిక పట్టణ విశిష్టతను తెలిపేలా చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక రూ.400 కోట్ల నిధులతో తిరుపతి స్టేషన్కు అభివృద్ధి పనులు చేపట్టాం -
పలు రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ పనుల వల్ల ఈ నెల 15, 16 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు 15వ తేదీన లింగంపల్లి –నాంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 10 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నారు. అలాగే 16వ తేదీన లింగంపల్లి– ఫలక్నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య 3 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ⇔ పూర్ణ–హైదరాబాద్ ప్యాసింజర్ 15వ తేదీన పూర్ణ నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది.తిరుగు ప్రయాణంలోనూ లింగంపల్లి నుంచే బయలుదేరుంది. ⇔ హైదరాబాద్–కొచువెలి స్పెషల్ ట్రైన్ నాంపల్లి స్టేషన్ నుంచి కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 15వ తేదీ రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. తాండూరు–హైదరాబాద్ ప్యాసింజర్ను లింగంపల్లి వరకే నడుపుతారు. హైదరాబాద్–పర్భని ప్యాసింజర్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.10 కి బయలుదేరుతుంది. హుస్సేన్సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు : నగరంలో గురువారం నుంచి గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచి ప్రారంభమవుతుంది. శనివారం నుంచి 22 వరకు హుస్సేన్సాగర్ చుట్టూ నిమజ్జనం కోలాహలం నెలకొననున్న నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు, మళ్లింపులు ఇలా... హోటల్ మారియట్ ‘టి’ జంక్షన్ వద్ద: కర్బాలామైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ను అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా మీదుగా పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్లే వాహనచోదకులు కవాడీగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్లాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్లే వాహనచోదకులు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. నెక్లెస్ రోటరీ వద్ద:ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. వీటిని నెక్లెస్ రోడ్ లేదా మింట్ కాంపౌండ్ మీదుగా పంపిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా వద్ద:ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలామైదాన్ మీదుగా వెళ్లాలి. డీబీఆర్ మిల్స్ వద్ద:గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్బండ్ మీదుగా పంపిస్తారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్–రాయగిరి (యాదాద్రి) మార్గంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా ఘట్కేసర్–రాయగిరి మార్గంలో సైతం ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద రూ.150 కోట్ల నిధులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్)కు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ కింద ఘట్కేసర్–రాయగిరి మార్గంలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.75 కోట్లు, జంట నగరాల్లో నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల కోసం మరో రూ.50 కోట్లు, ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల భవిష్యత్తు అవసరాలకు రూ.25 కోట్లను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంఎస్ఆర్టీఎస్) ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.350 కోట్లను విడుదల చేయాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కోరడంతో, ప్రస్తుతానికి రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రో అనుసంధానంపై పరిశీలన హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేసి ప్రయాణికులకు చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెట్రో రైలు స్టేషన్లను, ఎంఎంటీఎస్ స్టేషన్లు, బస్ స్టాపులతో అనుసంధానం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన నిధులను హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
లైన్లు రెడీ...రైళ్లేవీ?
ఎంఎంటీఎస్ రెండో దశను నిధుల గండం వెంటాడుతోంది. లైన్లు సిద్ధమైనప్పటికీ కొత్త రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం మార్గంలో కొద్ది రోజుల క్రితమే రైల్వే భద్రతా కమిషన్ తనిఖీలు నిర్వహించింది. రైళ్లు నడిపేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అనుమతులు కూడా ఇచ్చేసింది. కానీ కొత్త లైన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు బోగీలు మాత్రం లేవు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండాఉండిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గత బడ్జెట్లో తమ వంతు వాటాగా రూ.430 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో రెండో దశ రూట్లలో రైళ్లు పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో రైల్వే లైన్ల పనులు పూర్తయినప్పటకీ రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్నాయి. ఒక్క 12.5 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్–బొల్లారం లైన్లు మాత్రమే కాకుండా 14 కిలోమీటర్ల పొడవైన మౌలాలి–ఘట్కేసర్, మరో 10 కిలోమీటర్ల పొడవైన పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాల్లో పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రైళ్ల కొనుగోళ్లు, స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల్లో జాప్యంనెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి... నగర శివార్లను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు మొదటి నుంచి నిధులు కేటాయించడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు అందజేయకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ సంయుక్త ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన మూడు వంతుల నిధులను అందజేయాల్సి ఉంది. మరో 1/4 వంతు నిధులను రైల్వేశాఖ కేటాయిస్తుంది. సుమారు రూ.630 కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నుంచి అందాల్సి ఉండగా ఇప్పటి వరకు దశల వారీగా రూ.200 కోట్ల వరకే అందజేశారు. వీటితో పాటు, రైల్వేశాఖ నిధులతో కొన్ని లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. మిగతా పనుల్లో నిధుల కొరత తలెత్తింది. సకాలంలో ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రైల్వేకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని కలిశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు ఇవ్వాల్సిన సుమారు రూ.430 కోట్ల నిధులను అందజేయాల్సిందిగా కోరారు. అలాగే చర్లపల్లి టర్మినల్ కోసం భూమిని కేటాయించాలని, అప్రోచ్ రోడ్డు వేయించాలని కోరారు. నిధులొస్తేనే రైళ్లు.... ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్న సికింద్రాబాద్–బొల్లారం మార్గంలో ప్రతి రోజు కనీసం 20 ట్రిప్పులు నడపాలన్నా ఒక ట్రిప్పుకు 3 బోగీల చొప్పున 15 అవసరమవుతాయి. అలాగే సికింద్రాబాద్ –ఘట్కేసర్, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపాలంటే కొత్తబోగీలు అవసరమే. మొత్తంగా ఎంఎంటీఎస్ రెండో దశ మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ఇంజన్లు, బోగీల కోసం కనీసం రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు అందజేస్తే తప్ప కొత్త బోగీలు కొనే పరిస్థితి లేదని, రైల్వేశాఖ తన వంతు నిధులను ఇప్పటికే పూర్తిగా ఖర్చు చేసిందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రైల్వే ఉన్నతాధికారులు జరిపిన సంప్రదింపుల్లో ఎంఎంటీఎస్ రెండో దశతో పాటు చర్లపల్లి టర్మినల్పై చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.80 కోట్లతో చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇక్కడ భూమి కొరత ఉంది. ఈ అంశంపైన అధికారులు చర్చలు జరిపారు. మరో టర్మినల్ కోసం సర్వే... చర్లపల్లితో పాటు రెండో టర్మినల్గా గతంలో వట్టినాగులపల్లిని ప్రతిపాదించారు. కానీ నగరానికి చాలా దూరంలో ఉన్న వట్టినాగులపల్లి కంటే సమీపంలో ఉండి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఉండే మరో చోట రైల్వే టర్మినల్ కట్టించాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. నాగులపల్లి నుంచి నగరానికి రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పైగా రోడ్డు రవాణా మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రతిపాదించిన హైటెక్సిటీ వద్ద కానీ లేదా భూమి లభ్యతను బట్టి మరో చోట కానీ టర్మినల్ నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంయుక్త సర్వే చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. -
ఒకే ట్రాక్పై ఎదురెదురుగా రెండు రైళ్లు
హైదరాబాద్ : ఒకే ట్రాక్పైకి రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా అతి సమీపంలోకి రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రెండు రైళ్లు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ రెండు రైళ్లు దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందని, ప్రతి 400 మీటర్ల దూరంలో డ్రైవర్లు రైలును ఆపుకునే వీలుందని తెలిపారు. ఒకే ట్రాక్పైన ఎంఎంటీఎస్ రెండు రైళ్లు పద్ధతి ప్రకారమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని అధికారులు వివరణ ఇచ్చారు. -
యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే రైలు మార్గాన్ని పొడిగించేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంది. రాయగిరి నుంచి యాదాద్రి (4 కి.మీ.) వరకు కొత్త లైన్లను నిర్మించి, విద్యుదీకరించి, యాదాద్రిలో స్టేషన్ నిర్మిస్తారు. స్టేషన్ నిర్మాణానికి 40 నుంచి 50 ఎకరాలు కేటాయించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తలైన్లు, రైల్వేసేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైల్వేశాఖ సీరియస్గా పరిశీలిస్తుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రెండో దశను పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మార్గాన్ని రాయగిరి వరకు పరిమితం చేయకుండా యాదాద్రి వరకు విస్తరించాలని ప్రభుత్వం కోరితే మరో 3 ఏళ్లలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. లక్షలాది మందికి రైల్వే సదుపాయం ... ప్రస్తుతం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతి రోజు సుమారు 3 లక్షల మంది సందర్శిస్తుండగా, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య 5 లక్షలు దాటుతోంది. హైదరాబాద్ నుంచి వందలాది బస్సులు, వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను విస్తరించేందుకు రైల్వేశాఖ రూ.330 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో 51 శాతం నిధులను రాష్ట్రం భరిస్తే మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ భరించనున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్లో టెండర్లు ఆహ్వానించేందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పూర్తవుతుందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. యాదాద్రి వరకు రైల్వేమార్గాన్ని పొడిగిస్తే 5 ప్లాట్ఫామ్లతో ఒక టర్మినల్ను నిర్మించే యోచన చేస్తున్నారు. -
ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక రద్దు
హైదరాబాద్ : వివిధ రూట్లలో నడుస్తున్న 6 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. మే 1 నుంచి జూలై 31 వరకు ఈ పాక్షిక రద్దు కొనసాగనుంది. లింగంపల్లి-ఫలక్నుమా, సికింద్రాబాద్-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను సికింద్రాబాద్-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-సికింద్రాబాద్ మధ్య రద్దు చేస్తారు. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే సమయంలో 6 సర్వీసులను పాక్షికంగా రద్దు చేయడం వల్ల, రద్దీ అధికంగా ఉండే సమయాల్లో సర్వీసులు పెంచేందుకు ఏ మేరకు అవకాశం లభించగలదనే అంశాన్ని తెలుసుకొనేందుకు 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. -
దూరం...దూరం
ఎంఎంటీఎస్కు తగ్గుతున్న ఆదరణ ఆరు నెలల్లో 9 శాతం తగ్గిన ఆక్యుపెన్సీ రాకపోకల్లో జాప్యం, బస్లకు లింక్ లేకపోవడమే కారణం సిటీబ్యూరో: నగర ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు రానురానూ దూరమవుతున్నాయి. నగర జనాభా, విస్తరిస్తున్న కాలనీలకు అనుగుణంగా వీటి ప్రయాణికుల సంఖ్య పెరగాల్సి ఉండగా... అందుకు విరుద్ధంగా కొంతకాలంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నిత్యం లక్షా 60 వేల మంది ప్రయాణికులు ఉంటే... ఇప్పుడు ఆ సంఖ్య లక్షా 30 వేలకు తగ్గింది. ఆక్యుపెన్సీ రేషియో 9 శాతం పడిపోయినట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త ప్రకటించడం గమనార్హం. రాకపోకల్లో జాప్యంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రయాణికులు ఎంఎంటీఎస్కు దూరమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సుమారు 100 మంది ఉద్యోగులు రైళ్ల జాప్యం కారణంగా హైటెక్ సిటీకే తమ నివాసాలను మార్చుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 2003లో ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, అర నిమిషమైనా ఆలస్యానికి తావు లేకుండా నడపాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ అనతి కాలంలోనే ఆ లక్ష్యం నీరుగారింది. ఎందుకు తగ్గిపోతున్నాంటే... ఫలక్నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి ఫలక్నుమా, లింగంపల్లి నుంచి నాంపల్లి వరకు వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లకు ఒక ప్రత్యేక లైన్ లేదు. ప్రధాన రైళ్లు ప్లాట్ఫామ్ నుంచి వెళితే తప్ప ఇవి ముందుకు కదలలేవు. దీంతో నిత్యం అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఒక్క సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి మార్గంలో తప్ప మిగతా రూట్లలో ఎంఎంటీఎస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. చాలా స్టేషన్లలో ఒకేవైపు బుకింగ్ కౌంటర్లు ఉండడం వల్ల టిక్కెట్ తీసుకున్న ప్రయాణికులు ప్లాట్ఫామ్కు మరోవైపునకు సకాలంలో చేరుకోలేక రైళ్లు అందుకోలేకపోతున్నారు. బస్ కనెక్టివిటీ లేదు... నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో చాలా వాటికి సరైన బస్సు సదుపాయం లేదు. వీటిలో పయనించాలంటే కనీసం 2, 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. లేదా ఆటోల్లో వెళ్లాలి. ఎంఎంటీఎస్ చార్జీలతో పోల్చుకుంటే ఆటో చార్జీలు చాలా ఎక్కువ. దీంతో బస్సుల్లో వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. లింగంపల్లి, చందానగర్, బోరబండ, నేచర్క్యూర్ హాస్పిటల్, ఆర్ట్స్ కాలేజీ, ఉప్పుగూడ, ఫలక్నుమా, తదితర స్టేషన్లకు బస్సులు అందుబాటులో లేవు.నగరంలో 2003 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఎంటీఎస్కు, ఆర్టీసీకి మధ్య సరైన సమన్వయం లేకపోవడం గమనార్హం.ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న లకిడికాఫూల్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ వంటి కొన్ని స్టేషన్లు మినహా మూడొంతుల స్టేషన్లకు రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు మాత్రమే వెళ్తాయి. లేదంటే కాలినడకే. అడుగులు ఇలా... పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, అన్నిటికీ మించి నగరాన్ని పట్టిపీడిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ.69.50 కోట్ల వ్యయంతో 2003లో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్రస్తుతం 121 సర్వీసులకు పెరిగాయి.సగటున 1.4 లక్షల మంది ఈ రైళ్లను వినియోగించుకుంటున్నారు. హైటెక్ సిటీ నుంచి పాత నగరం వరకు సాఫ్ట్వేర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు, తదితర అన్ని వర్గాలకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉన్నాయి. తగ్గిపోతున్న ప్రయాణికుల సంఖ్య గత 7 నెలల కాలంలో సగటు ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, 2014 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన గణాంకాల ప్రకారం ఒక్క మేలో తప్ప మిగతా అన్ని నెలల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గుతూనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్లో రోజుకు 1.61 లక్షల మంది పయనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 1.47 లక్షలకు పడిపోయింది. ప్రాధాన్యం పెరగాలి : ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లకు దీటుగా ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రాధాన్యం పెంచాలి. ఎక్స్ప్రెస్ల కోసం ఎంఎంటీఎస్లను నిలిపివేయడం వల్ల బాగా ఆలస్యమవుతోంది. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. బాలకిషోర్, సాఫ్ట్వేర్ నిపుణులు నిర్వహణలో నిర్లక్ష్యం తొలగిపోవాలి : ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం తొలగిపోవాలి. ఒకప్పటి కంటే ఇప్పుడు పారదర్శత పెరి గింది. కానీ ఇంకా పెరగాలి. వేల సంఖ్యలో రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారనే స్పృహ చాలా ముఖ్యం. విజయరాఘవన్, సాఫ్ట్వేర్ నిపుణులు బుకింగ్ కౌంటర్లు పెంచాలి: నగరంలోని 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో చాలా వర కు ప్లాట్ఫామ్కు ఒకవైపే టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నా యి. రెండో వైపు లేవు. దీం తో ప్రయాణికులు సకాలంలో రైలును అందుకోలేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తోంది. సీతారామ్,హైటెక్ సిటీ -
ఇక తెలంగాణలోని రైళ్లలో ‘షీ టీమ్స్’
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, తెలంగాణ జిల్లాల పరిధిలో ప్రయాణించే రైళ్లలో మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం గవర్నమెంట్ రైల్వే (జీఆర్పీ) పోలీసులు ‘షీ’ టీములను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఐదు షీ టీమ్లను రంగంలోకి దింపినట్టు జీఆర్పీ సికింద్రాబాద్ జిల్లా ఎస్పీ ఎస్జే.జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల పరిధిలో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు నిజామాబాద్, మహబూబ్నగర్, కాజీపేట్ మార్గాల్లో నడిచే అన్ని రైళ్లలో షీ టీములు సంచరిస్తాయని చెప్పారు. ఒక్కో టీమ్లో ముగ్గురేసి మహిళా, పురుష కానిస్టేబుళ్లను మఫ్టీలో ఉంటారని తెలిపారు. బాధిత ప్రయాణికులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు తమకు అవసరమైన సహాయ సహకారాల కోసం హెల్ప్లైన్ నంబర్ 1512 లేదా రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440700040 కు కాల్ చేసి సమాచారం అందిస్తే సత్వరమే వారు ప్రయాణిస్తున్న బోగీలోకి షీ టీమ్ను పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. -
మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘రిస్తా’
మొబైల్ యాప్ను ప్రారంభించిన ద.మ. రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోన్న దక్షిణమధ్య రైల్వే.. తాజాగా మరో మొబైల్ అప్లికేషన్ ‘రిస్తా’ను ప్రారంభించింది. గురువారం లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ప్రయాణ సమయంలో అసాంఘిక శక్తులు, నేరస్తులు, ఈవ్టీజర్స్తో ఎదురయ్యే ఇబ్బందులపై ఈ యాప్ ద్వారా ఆర్పీఎఫ్కు సమాచారం అందజేయవచ్చునన్నారు. ఈ యాప్కు వచ్చే ఫిర్యాదులు, బాధితుల వివరాలు, వాట్సప్ దృశ్యాలు గోప్యంగా ఉంటాయన్నారు. రిస్తాను ప్రయోగాత్మకంగా పరిశీలించే దశలోనే రూ.9 లక్షల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడిన ఒక నిందితుడిని ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుందన్నారు. నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువు ప్రకారం రెండో దశ రైళ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. పునర్నిర్మించిన లింగంపల్లి స్టేషన్ భవనం, రూ.2 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణించిన జీఎం.. ప్రయాణికులతో ముచ్చటించారు. ఎంఎంటీఎస్ సేవలపై ఆరా తీశారు. రెళ్ల రాకపోకల్లో జాప్యానికి తావు లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు జీఎం వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ రాంచందర్రావుతో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్కుఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న దక్షిణమధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాత్సవ -
నేడు ఎంఎంటీఎస్లకు బ్రేక్
సిటీబ్యూరో: సనత్నగర్-భరత్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య మెట్రో రైలు పనుల దృష్ట్యా శనివారం ఆ మార్గంలో నడిచే 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు వీటి రాకపోకలు నిలిచిపోతాయి. లింగంపల్లి-ఫలక్నుమా, నాంపల్లి- లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. వికారాబాద్-కాచిగూడ ప్యాసింజర్, తాండూరు-నాంపల్లి ప్యాసింజర్, సికింద్రాబాద్-వికారాబాద్ రైళ్లు రద్దు కానున్నాయి. ఫలక్నుమా-నాంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. పూనే-సికింద్రాబాద్ (12025/12026) శతాబ్ది ఎక్స్ప్రెస్ లింగంపల్లి వరకు వచ్చి... తిరిగి అక్కడి నుంచే బయలుదేరుతుంది. వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.45 గంటలకు బదులు 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది. -
ఎంఎంటీఎస్ రైళ్లకు బ్రేక్
హైదరాబాద్సిటీ : సనత్నగర్-భరత్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య మెట్రో రైలు పనుల దృష్ట్యా శనివారం ఆ మార్గంలో నడిచే 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు వీటి రాకపోకలు నిలిచిపోతాయి. లింగంపల్లి-ఫలక్నుమా, నాంపల్లి-లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. వికారాబాద్-కాచిగూడ ప్యాసింజర్, తాండూరు-నాంపల్లి ప్యాసింజర్, సికింద్రాబాద్-వికారాబాద్ రైళ్లు రద్దు కానున్నాయి. ఫలక్నుమా-నాంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. పూనే-సికింద్రాబాద్ (12025/12026) శతాబ్ది ఎక్స్ప్రెస్ లింగంపల్లి వరకు వచ్చి... తిరిగి అక్కడి నుంచే బయలుదేరుతుంది. వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.45 గంటలకు బదులు 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది. -
ఎంఎంటీఎస్ రైళ్లకు అంతరాయం
నేడు, 7వ తేదీన నిలిచిపోనున్న సర్వీసులు సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని భరత్నగర్-సనత్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్లపై మెట్రో రైలు క్రాసింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 3,7 తేదీలలో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపి వేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజుల్లో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారు. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తారని వివరించారు. మొత్తం 20 ఎంఎంటీఎస్ సర్వీసులపై నిర్మాణ పనుల ప్రభావం పడనుందని సీపీఆర్వో పేర్కొన్నారు. లింగంపల్లి-ఫలక్నుమా, నాంపల్లి-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్లు నిలిచిపోనున్నాయి. ఫలక్నుమా-నాంపల్లి మధ్య నడిచే కొన్ని ఎంఎంటీఎస్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. వికారాబాద్-కాచిగూడ, తాండూరు-హైదరాబాద్, సికింద్రాబాద్-వికారాబాద్ పాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. పూనే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ పూనే నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది. లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఈ సర్వీసు నిలిచిపోతుంది. మధ్యాహ్నం 1.45 కు బయలుదేరవలసిన వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ ఈ రెండు తేదీలలో (ఫిబ్రవరి 3,7) మధ్యాహ్నం 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది. -
ఎంఎంటీఎస్ రైళ్లకు అంతరాయం
నేడు, 7వ తేదీన నిలిచిపోనున్న సర్వీసులు సిటీబ్యూరో: నగరంలోని భరత్నగర్-సనత్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్లపై మెట్రో రైలు క్రాసింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 3,7 తేదీలలో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపి వేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజుల్లో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారు. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తారని వివరించారు. మొత్తం 20 ఎంఎంటీఎస్ సర్వీసులపై నిర్మాణ పనుల ప్రభావం పడనుందని సీపీఆర్వో పేర్కొన్నారు. లింగంపల్లి-ఫలక్నుమా, నాంపల్లి-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్లు నిలిచిపోనున్నాయి. ఫలక్నుమా-నాంపల్లి మధ్య నడిచే కొన్ని ఎంఎంటీఎస్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. వికారాబాద్-కాచిగూడ, తాండూరు-హైదరాబాద్, సికింద్రాబాద్-వికారాబాద్ పాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. పూనే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ పూనే నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది. లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఈ సర్వీసు నిలిచిపోతుంది. మధ్యాహ్నం 1.45 కు బయలుదేరవలసిన వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ ఈ రెండు తేదీలలో (ఫిబ్రవరి 3,7) మధ్యాహ్నం 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది. -
విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్లు వద్దు!
* అక్కడికి 3.2 కి.మీ. ముందే ఆగిపోవాలి * ఎంఎంటీఎస్ విస్తరణలో జీఎంఆర్ మడతపేచీ * రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దక్షిణ మధ్య రైల్వే * రైలు దిగాక మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే దుస్థితి ఏంటంటూ ఆగ్రహం * అలా చేస్తే రూ.180 కోట్ల కొత్తలైన్ నిరుపయోగమేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే దక్షిణ మధ్య రైల్వే ఆలోచనకు జీఎంఆర్ బ్రేకులు వేసింది. విమానాశ్రయం వరకు రైలు రావటానికి వీళ్లేదని, అక్కడికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే స్టేషన్ నిర్మించి అక్కడి వరకే రైల్వే సేవలు పరిమితం చేయాలని మడతపేచీ పెట్టింది. ఇటీవల జీఎంఆర్-రైల్వే అధికారుల అంతర్గత భేటీలో ఈమేరకు షరతు విధించింది. సరిగ్గా ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పట్టాలెక్కేవేళ ఈ వ్యవహారం తెరపైకి రావటంతో బిత్తరపోయిన దక్షిణ మధ్య రైల్వే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారీ ఖర్చుతో ఎంఎంటీఎస్ లైనును విస్తరించి... విమానాశ్రయానికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తే అసలు ఆ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని, అక్కడ రైలు దిగే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాలంటే మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ దృష్టికి తేవ టంతో ఈ వ్యహారం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీఎంఆర్ షరతులు విధిస్తూ... ఎంఎంటీఎస్ రెండో దశ లక్ష్యాన్నే నీరుగారుస్తోందని ఆయన సీఎస్తో పేర్కొన్నారు. రైలు దిగగానే నేరుగా విమానాశ్రయంలోకి మార్గం ఉండాలని, సామగ్రి తరలించేందుకు అక్కడి నుంచే ట్రాలీల ఏర్పాటు ఉండాలని, అంతర్జాతీయంగా ఇదే పద్ధతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థ యూజవూన్యంతో మాట్లాడి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైలు వెళ్లే విధంగా చూడాలని కోరారు. ఇదీ సంగతి...: ప్రస్తుతం ఫలక్నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రాజెక్టు విస్తరణ(రెండోదశ)లో భాగంగా ఫలక్నుమా నుంచి శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభించేందుకు అంతా సిద్ధమవుతున్న వేళ జీఎంఆర్ నిబంధనతో గందరగోళం నెలకొంది. కొత్త లైను, ఎలక్ట్రిఫికేషన్ తదితరాలకు సంబంధించి కిలోమీటరుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఫలక్నుమా నుంచి ఉందానగర్ 13 కి.మీ., అక్కడి నుంచి విమానాశ్రయం దారిలో జీఎంఆర్ సూచిస్తున్న ప్రాంతం మరో 5 కి.మీ. ఉంటుంది. వెరసి 18 కి.మీ.మేర పనులు నిర్వహించేందుకు రూ.180 కోట్ల ఖర్చవుతుంది. ఇంత ఖర్చు చేసి రైలు విమానాశ్రయానికి 3.2 కి.మీ.దూరంలోనే నిలిచిపోతే ఉపయోగమేంటని రైల్వే వాదిస్తోంది. భవిష్యత్తు విస్తరణ అవసరాల దృష్ట్యా తనకు భూముల అవసరం ఉంటుందని, అం దులో రైల్వే స్టేషన్ నిర్మిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయనే కోణంలో జీఎంఆర్ వాదిస్తోంది. ఇందులో ప్రైవేటు టాక్సీ ఆపరేటర్ల ఒత్తిడి కూడా ఉండొచ్చని రైల్వే అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. ఇందులో స్పష్టత వస్తేనే పను లు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని, తాము పనులు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ గురువారం తెలిపారు. -
వరల్డ్క్లాస్..ట్రాష్!
ప్రతిపాదనగానే ‘సికింద్రాబాద్’ అభివృద్ధి రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువు రెండో దశ ఎంఎంటీఎస్ నత్తనడక రైల్వే బడ్జెట్ వైపు.. నగరజీవి చూపు సాక్షి, సిటీబ్యూరో : ఏటేటా రైల్వే బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. నగరంలో ఆగి ఆగకుండానే వెళ్తున్నాయి. ప్రతిపాదనలు పెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి. తాజాగా ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్ రానుంది. బుధవారం రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే దీనిని ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన పనులకే దిక్కు లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో నగరానికి చోటు దక్కుతుందా అనేది సందేహాస్పదంగానే ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ను ‘వరల్డ్క్లాస్’ చేయాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఎస్కలేటర్లు, లిఫ్ట్లకు మాత్రమే అది పరిమితమైంది. నాంపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ ఎండమావిగానే మారింది. ఒకప్పటి ప్రతిష్టాత్మకమైన కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. చాలావరకు ఎంఎంటీఎస్ స్టేషన్లలో కనీస సదుపాయాలు లేవు. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సైతం నేటికీ అమలుకు నోచుకో లేదు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆసుపత్రికి సూపర్స్పెషాలిటీ హోదా ఆచరణకు నోచుకోలేదు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రాయి కూడా పడలేదు. ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చిన బాల్పోర్బెట్టి, కాళింది నిర్మాణ్ వంటి సంస్థలు సైతం తాజాగా తప్పుకొని వెనుకడుగు వేశాయి. జీఎమ్మార్, టాటాపవర్ సంస్థలతో రైల్వేశాఖ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ముగిసి, పనులు ప్రారంభం కావడానికి మరో ఆర్థిక సంవత్సరం గడిచినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. నేటి బడ్జెట్లో.. నగరానికి కొత్త రైళ్లు వస్తాయా? గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? అని నగరవాసి ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఎంఎంటీఎస్ స్టేషన్లు.. కనీస సౌకర్యాలు నిల్ ఫలక్నుమా, ఉప్పుగూడ, యాకుత్పురా, డబీర్పురా రైల్వే స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు వెళుతుంటాయి. ఈ స్టేషన్ల నుంచి నగరంలోని సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, బొల్లారంతో పాటు మహబూబ్నగర్, కర్నూల్, భువనగిరి, గుల్బార్గా తదితర ప్రాంతాలకు ప్రతి రోజు వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ ప్రయాణికులు ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరంలోకి వెళ్లేందుకు బస్సులు లేవు. బస్సులు రైల్వేస్టేషన్లకు వచ్చేందుకు రోడ్లు లేవు. రాష్ట్రప్రభుత్వం, రైల్వేశాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఏళ్లుగా రైలు-బస్సు అనుసంధానం ఎండమావిగానే మిగిలింది. లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రైళ్లు ఒకేసారి స్టేషన్కు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. స్టేషన్లో నీటి కుళాయిలు ఉన్నా వాటిలో బోరు నీటినే సరఫరా చేస్తున్నారు. హఫీజ్పేట్, చందానగర్ రైల్వేస్టేషన్లలో మంచినీటి సదుపాయం లేదు. ఫ్లాట్ఫాంలపై విద్యుత్ దీపాలు వెలగడం లేదు. పార్కింగ్ షెడ్లు లేవు. పోలీస్ నిఘా లేదు. ప్రయాణికుల భధ్రత గాలిలో దీపంగా మారింది. మౌలాలీ స్టేషన్ నుంచి ప్రయాణికులు బస్సు కోసం కిలోమీటర్నర దూరం నడిచి రావాల్సిందే. రహదారి వెంట విద్యుత్ దీపాలు లేవు. మూడు ప్లాట్ఫాంలు ఉన్నప్పటికీ ఒక వైపు నుంచి మరొక వైపు ప్రయాణికులు వెళ్లడానికి ఫుట్ ఓవర్బ్రిడ్జి లేకపోవడంతో ప్రమాదకరమైనా సరే ప్రయాణికులు పట్టాలు దాటే వెళ్లవలసి వస్తోంది. స్టేషన్ లో ప్రయాణికులకు వెయిటింగ్ హాళ్లులేవు. మంచినీటి సదుపాయం లేదు. మౌలాలీ స్టేషన్ నుంచి ప్రతిరోజు వందకు పైగా ఎక్స్ప్రెస్లు రాకపోకలు సాగిస్తాయి. కానీ ఒకటి , రెండు రైళ్లు మాత్రమే ఆగుతాయి. దీంతో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు మౌలాలీ నుంచి సికింద్రాబాద్కు పరుగెత్తవలసి వస్తోంది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్కు మల్లికార్జునగర్ వైపు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు అప్రోచ్ రోడ్డు లేదు స్టేషన్లో 24 బోగీల ైరె ళ్లు ఆగే విధంగా ఫ్లాట్ ఫామ్లు లేవు. స్టేషన్ చుట్టూ ఐదు ఎకరాల రైల్వే స్థలం ఉంది. స్టేషన్ విస్తరించవచ్చు. దీనివల్ల కాచిగూడ, సికింద్రాబాద్లపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ అలాంటి చర్యలు చేపట్టడం లేదు. -
ఎంఎంటీ ఎస్ టూ లేట్...
మొత్తం రూ.800 కోట్ల ప్రాజెక్టు ఇప్పటివరకు రూ.30 కోట్లే విడుదల కొత్త లైన్ల నిర్మాణానికే రూ.380 కోట్లు సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఒక అడుగు ముందుకు... నాలుగడుగులు వెనక్కు అన్నట్టుంది దీని పరిస్థితి. రెండున్నరేళ్లలో పూర్తి చేయవలసిన ప్రాజెక్టు ఇది. ఇప్పటికే ఏడాది గడిచింది. మరో ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదు. నిర్దేశిత గడువులోగా పని పూర్తికావడం కాదు కదా. కనీసం ప్రారంభిస్తారా లేదా అనే సంశయం నెలకొంది. ఎందుకంటే రూ.800 కోట్ల భారీ అంచనాలతో సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టులో రెండొంతుల నిధులు కేటాయించవలసిన రాష్ట్రప్రభుత్వం.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.30 కోట్లే. మిగతా నిధులు కేటాయించాల్సిన రైల్వేశాఖ సైతం రూ.30 కోట్లే చెల్లించింది. రెండోదశలో లైన్లు, విద్యుదీకరణ పనులకే రూ. 380 కోట్లు వెచ్చించాల్సిన తరుణంలో నిధుల్లేక పనులు ప్రారంభం కాలేదు. గడిచిన ఏడాది పొడవునా ప్రణాళికల రూపకల్పన, మార్గాల గుర్తింపు, స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ ఖరారు వంటి పనులతోనే గడిచింది. మరో ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. అయినా పనులెప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంఎంటీఎస్ రెండో దశపై రాష్ర్టప్రభుత్వం శీతకన్ను వేసింది. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. నిర్మాణ వ్యయంలో రాష్ట్రప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున నిధులను అందజేయవలసి ఉంటుంది. అంటే రూ.800 కోట్లలో రాష్ట్రం తన వాటాగా రూ.533.33 కోట్లు, రైల్వేశాఖ రూ.266.67 కోట్లు కేటాయించాలి. కానీ ఇప్పటివరకు రెండు వైపులా అందింది రూ.60 కోట్లే. దక్షిణమధ్య రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మొత్తం 6 లైన్లలో రెండోదశకు రంగం సిద్ధం చేసింది. బ్రిటన్కు చెందిన బాల్ఫోర్బెట్టి, ఇండియాకు చెందిన కాళింది సంస్థలు సంయుక్తంగా ఈ టెండర్లను దక్కించుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే హడావిడి మొదలైంది. అనేక దశలను దాటుకొని చివరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఒక రాయి వేసి శంకుస్థాపన చేసిన దాఖలా కనబడటం లేదు. మొదటి నుంచి నిర్లక్ష్యమే... రెండోదశపై మొదటి నుంచి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోంది. ఎంఎంటీఎస్ మొదటి దశలో ఫలక్నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో రైలు మార్గాలు, రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశను మరింత విస్తరించి రెండో దశలో నగరం నలువైపులా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం 2005లోనే ప్రతిపాదించింది. అయినా అది ప్రతిపాదనలు, కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు గత ఆర్థికసంవత్సరం రైల్వే బడ్జెట్లో ఇది స్థానం సంపాదించుకుంది. ప్రణాళికలు పూర్తయ్యాయి. రైల్వే మార్గాల సర్వే, టెండర్ల కేటాయింపులు ముగిశాయి. ప్రస్తుతం పని ప్రారంభం కావలసిన దశలో.. ప్రభుత్వం అందజేయవలసిన నిధుల విషయంలో మొండి చెయ్యి చూపుతోంది. రానున్న కొత్త ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు ఫిరోజ్గూడ సుచిత్ర జంక్షన్ బీహెచ్ఈఎల్ భూదేవీనగర్ మౌలాలీహౌసింగ్బోర్డు కాలనీ రెండోదశ పనులివీ... ఎక్కడి నుంచి ఎక్కడకు కి.మీ. ఏం చేయాలి ఘట్కేసర్- మౌలాలీ 14 కొత్త లైన్లు, విద్యుదీకరణ సనత్నగర్-మౌలాలీ 23 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ బొల్లారం-మేడ్చెల్ 14 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ సికింద్రాబాద్-బొల్లారం 14 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ ఫలక్నుమా-ఉందానగర్ -- సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ సికింద్రాబాద్-బొల్లారం 14 విద్యుదీకరణ తెల్లాపూర్-రామచంద్రాపురం 10 పాత లైన్ల పునరుద్ధరణ -
ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్పీఎఫ్ తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రైళ్లలో శుక్రవారం రైల్వే రక్ష క దళాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన వివిధ విభాగాలు ఆ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతా సిబ్బందిని పెంచారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్పీఎఫ్ నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పలువురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకొని జరిమానాలు విధించారు. మొత్తం 79 మందిని విచారించి రూ.10 వేల వరకు జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు వృద్ధులు, చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.