కృష్ణా పైప్లైన్కు భారీ లీకేజి ఏర్పడిన కారణంగా ఈనెల 24న(బుధవారం)నగరంలో సగం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి ప్రకటించింది.
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా పైప్లైన్కు భారీ లీకేజి ఏర్పడిన కారణంగా ఈనెల 24న(బుధవారం)నగరంలో సగం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్-2పరిధిలోని 1600 డయా వ్యాసార్థంగల భారీ రింగ్మెయిన్-1 పైప్లైన్ కు చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ వద్ద సోమవారం భారీ లీకేజి ఏర్పడింది. మరమ్మతులు చేసేందుకు 16 గంటల సమయం పడుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. దీంతో ఈనెల 24న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాలకు సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తామంటున్నారు.
నగరంలోని సగం ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. సాహెబ్నగర్ రిజర్వాయర్ నుంచి మైలార్దేవ్ పల్లి వరకు ఉన్న ఈ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్(పీఎస్సీ)భారీ మంచినీటి పైప్లైన్కు తరచూ లీకేజీలు ఏర్పడడం, ఆయా ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. భారీ వాహనాలు పైప్లైన్ మీదుగా వెళితే చాలు పైప్లైన్కు చిల్లులు పడుతున్నాయి. పైప్లైన్ నిర్మాణం సమయంలో మైల్డ్స్టీల్తో తయారు చేసిన పైప్లైన్ వేయకపోవడం కారణంగానే ఈ పైప్లైన్కు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ పైప్లైన్ మార్చని పక్షంలో నిత్యం ఇలాంటి లీకేజీలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
నీటిసరఫరా ఉండని ప్రాంతాలు..
కిషన్భాగ్, చార్మినార్, బాలాపూర్ రిజర్వాయర్ పరిధి,గోషామహల్, జహానుమా, మైసారం, సంతోష్నగర్(పార్ట్), ప్రశాసన్నగర్ రిజర్వాయర్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎస్పీఆర్హిల్స్, ఎర్రగడ్డ, సోమాజిగూడా, ఎల్లారెడ్డిగూడా, లింగంపల్లి రిజర్వాయర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, హైదర్గూడా తదితర ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరా నిలిపివేస్తున్నామని జలమండలి అధికారులు ప్రకటించారు.