ఎవరికో పీఠం! | No clarity on the chairman seat of District Central Co-operative Bank | Sakshi
Sakshi News home page

ఎవరికో పీఠం!

May 2 2015 1:06 AM | Updated on Mar 28 2018 11:08 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పీఠం గులాబీ పార్టీకే దక్కనుందని స్పష్టత వచ్చినప్పటికీ...

- డీసీసీబీ చైర్మన్, ైవె స్ చైర్మన్ల ఎన్నిక నేడు
- గులాబీ పార్టీకే దక్కనున్నా... సారథిపైనే సందిగ్ధం
- రేసులో పెంటారెడ్డి, మాధవరెడ్డి
- వ్యూహ, ప్రతివ్యూహాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పీఠం గులాబీ పార్టీకే దక్కనుంది. వ్యూహాత్మక ఎత్తుగడ వేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లను అవిశ్వాసంతో గద్దె దింపింది. ఈ క్రమంలో కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ రెండు పీఠాల్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శనివారం ఉదయం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలకు సహకార శాఖ ఏర్పాట్లు చేసింది. గులాబీ దళానికే పీఠం దక్కనుందని స్పష్టమవుతున్నప్పటికీ.. సారథిపై మాత్రం ఆ పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉత్కంఠ రేపుతోంది.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పీఠం గులాబీ పార్టీకే దక్కనుందని స్పష్టత వచ్చినప్పటికీ.. సారథిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్న పెంటారెడ్డికే పూర్తిస్థాయి చైర్మన్‌గా పదవిని కట్టబెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం సైతం ఆయనవైపు మొగ్గు చూపుతున్నందున పార్టీ వర్గాల్లో పెంటారెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే హైదర్షాకోట్ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి సైతం చైర్మన్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య సమోధ్య తీసుకువచ్చేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు మంత్రి నివాసంలో మంతనాలు జరిపాయి. మరోవైపు పదవి కోల్పోవడంతో కొంత ఆవేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. టీఆర్‌ఎస్‌లో నెలకొన్న గందరగోళాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. గతంలో చైర్మన్ రేసులో ఉన్న పెంటారెడ్డి, మాధవరెడ్డి కాంగ్రెస్ మాజీలే. తాజా సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోల్పోయినప్పటికీ.. టీఆర్‌ఎస్ వ్యూహాన్ని తారుమారు చేసే అవకాశం లేకపోలేదు.

పెంటారెడ్డికి అధిష్టానం మద్దతు ఉండగా.. మాధవరెడ్డికి కాంగ్రెస్ డెరైక్టర్లు పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో 2/3 మెజార్టీ(13మంది డెరైక్టర్లు) మద్దతు కావాలి. ఆశావహుల మధ్య సానుకూల వాతావరణం రాకుంటే శనివారం నాటి ఎన్నికలో టీఆర్‌ఎస్ అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement