![బర్డ్ఫ్లూపై ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి](/styles/webp/s3/article_images/2017/09/3/71428612404_625x300_0.jpg.webp?itok=mB41DoaC)
బర్డ్ఫ్లూపై ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్ (మహబూబ్నగర్): బర్డ్ప్లూపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ముందస్థు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో బర్డ్ప్లూ నిర్దారణ అయ్యిందని, అందుకోసం అక్కడి వైద్య ఆరోగ్యశాఖ- పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా నివారణ చర్యలు చేపట్టాయన్నారు.
బర్డ్ప్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెట్టడం జరుగుతోందని, కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి తగిన జాగ్రత్తలు వివరించటం జరిగిందన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక బృందం క్షేత్ర స్థాయిలో పరిశీస్తుందని చెప్పారు. కోళ్లఫారాలు, చికెన్లకు దగ్గరగా ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్లు ధరిచటంతోపాటు జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైరస్ నివారణకు తగినన్ని టామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు.