
'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం'
హైదరాబాద్:కృష్ణా, గోదావరి నీటిలో అధికవాటా సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ జలాలకు సంబంధించి అధిక వాటా సాధించిన అనంతరం ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. శనివారం ' సాక్షి' తో మాట్లాడిన హరీష్ రావు.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు. హైదరాబాద్లో కాకుండా ప్రాజెక్టుల వద్దే సమీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడే ఉందని హరీష్ రావు తెలిపారు.