మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసి రైతులకు సాగు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ (జడ్చర్ల): మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసి రైతులకు సాగు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన 'సాక్షి'తో ఫోన్లో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్లు కేటాయించి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోందన్నారు.
పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తే.. జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని మల్లు రవి ఆరోపించారు.