
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఇల్లందులో 60 మెగావాట్లు, రామగుండంలో 50 మెగా వాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 10 రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, టెండర్ల నిర్వహణ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (ఇండియా) అధికారులతో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం హైదరాబాద్లో సమావేశమై చర్చించారు. ఒక్కో మెగావాట్కు 5 ఎకరాల స్థలం చొప్పున 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 1,500 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సింగరేణి యాజమాన్యం గుర్తించింది. తొలి దశ కింద 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment