Solar power plants
-
ఒడిశాలో థర్మల్ పవర్ రాజస్తాన్లో సోలార్
సాక్షి, హైదరాబాద్: భారీ నష్టాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నా య చర్యలతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ సౌర విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాజస్తాన్లో భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పా టు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన భూకేటాయింపుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో పీక్ అవర్స్లో రాష్ట్రం నుంచి దాదాపు 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ను రాజస్తాన్కు విక్రయించే అంశంపైనా ఒప్పందం చేసుకోనుంది. మరోవైపు ఇటీవలే సింగరేణికి ఒడిశాలోని నైనిలో కేటాయించిన బొగ్గు బ్లాక్ పక్కనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్థలం కోసం చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసే పిట్హెడ్ స్టేషన్ నుంచి ‘నాల్కో’కు 1,350 మెగావాట్ల విద్యుత్ను విక్రయించేందుకు సింగరేణి సంసిద్ధత వ్యక్తం చేసింది. అందుకోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవడానికి ‘నాల్కో’ముందుకొచ్చింది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుదుత్పాదన రంగంలోకి దిగిన సింగరేణి మరిన్ని పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాజస్తాన్లో.. రాజస్తాన్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘సాక్షి’కి చెప్పారు. ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం జరుగుతోందని.. సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉదయం పూట సౌర విద్యుత్ వినియోగించుకుంటామని, పీక్ అవర్స్లో వారికి థర్మల్ విద్యుత్ అవసరం ఉన్నందున దాదాపు 1,200 మెగావాట్లు ఇవ్వడానికి కూడా తెలంగాణ జెన్కో సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు చెప్పారు. తక్కువ ధరకు బయట విద్యుత్ లభిస్తున్నప్పుడు థర్మల్ స్టేషన్లను బ్యాక్డౌన్ చేస్తున్నామని, పీక్టైమ్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తప్పనిసరి అని చెబుతున్నారు. భారీగా సౌర విద్యుత్పైనే దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ను రైతులకు, మహిళా సంఘాలకు కేటాయించి వాటి నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను పిలిచింది. ఇది కాకుండా రాష్ట్రంలో వివాదరహితంగా ఉన్న అన్ని దేవాలయ భూముల్లో సోలార్ పవర్ యూనిట్లు నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నీటిపారుదల శాఖకు సంబంధించి రిజర్వాయర్లు, కాలువల కో సం వేలాది ఎకరాలు సేకరించింది.అందులో చాలా భూములు ఉపయోగించుకుండా ఖాళీగా ఉన్నాయి. అలా ఉన్న భూములన్నింటినీ అధికారులు సర్వే చేస్తున్నారని, వాటిల్లోనూ సోలార్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. తద్వారా ఆయా భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతోపాటు ఆయా శాఖలకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. మధ్యతరహా నీటిపారుదల రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నట్టు వివరించారు. ఇప్పటికే సింగరేణి ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్తో విద్యుత్ ఉత్పాదన చేస్తోందన్నారు. సింగరేణిలోని ఓపెన్కాస్ట్ మైన్స్లో.. సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసిన తర్వాత పెద్ద గుంతలుగా ఏర్పడిన వాటిలో భారీ వర్షాల కారణంగా అవి నీటితో నిండుతున్నాయి. అక్కడ పంప్డ్స్టోరేజీ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. మరోవైపు భాగ్యనగరంలో ఫుట్పాత్లు ఆక్రమణకు గురికాకుండా వాటికి పైకప్పు రూపంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. తద్వారా వీధిదీపాలకు అవసరమయ్యే విద్యుత్ను అందించడంతోపాటు పాదచారులకు నీడ కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు మండలాల్లో పూర్తిగా సౌర విద్యుత్ ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లితోపాటు సీఎం నియోజకవర్గ(కొడంగల్) పరిధిలోని ఒక మండలం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం(మధిర)లోని బోనకల్ మండలంలో పూర్తిగా సౌరవిద్యుత్ను సరఫరా చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఈ రెండు మండలాలు పూర్తయిన తర్వాత మరిన్ని గ్రామాల్లో సౌర విద్యుత్ సరఫరా చేయడానికి సంకల్పించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఐటీ కంపెనీలు ముందుకొస్తున్న విషయం విదితమే. అయితే వీరు క్లీన్ఎనర్జీ కావాలని కోరుతున్నారని, తద్వారా వారికి కార్బన్ క్రెడిట్స్ రావడం వల్ల రాయితీలు లభిస్తాయని చెబుతున్నారు. అందుకే క్లీన్ఎనర్జీ వైపు దృష్టి సారించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రైతులకు ‘సౌర’ పంట!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల గ్రూపులు, నీటి వినియోగ సంఘాలు, డెవలపర్లు, ఎస్హెచ్జీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరింది. రైతులు, ఇతరుల ఆధ్వర్యంలో 3 వేల మెగావాట్లు.. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సొంత భూముల్లో కరెంటు ఉత్పత్తి ఎస్హెచ్జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పించారు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులు, ఎస్హెచ్జీలకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15–16 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవస్థాపకులకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఎస్హెచ్జీలకు భూములు, 90% రుణాలు.. సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఒక మెగావాట్కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుందని రెడ్కో అంచనా వేసింది. ఎస్హెచ్జీలు 10 శాతం వాటా భరిస్తే, మిగిలిన 90 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. అంటే, మెగావాట్ ప్లాంటు ఏర్పాటుకు ఎస్హెచ్జీలు రూ.29.7 లక్షలు పెట్టుబడి పెడితే, బ్యాంకులు రూ.2.61 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్హెచ్జీలకు ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములను లీజుకు ఇవ్వనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఎస్హెచ్జీలను ఎంపిక చేసి, వారితో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయిస్తారు. ఇక రైతులు 30 శాతం పెట్టుబడి పెట్టుకుంటే, మిగిలిన 70 శాతం మూలధనాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 6 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచి్చంది. రూ.2 కోట్లకు మించిన రుణానికి 9 శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఎస్బీఐ అధికారులతో బుధవారం ఇంధన శాఖ, సెర్ప్ అధికారులు జరిపిన చర్చల సందర్భంగా ఈ మేరకు నిర్ణయించారు. ఏడాదిలోగా పూర్తి చేయాలి.. రాష్ట్రంలోని ఒక్కో 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉందో డిస్కంలు ప్రకటించాయి. దీని ఆధారంగా రైతులు ప్లాంటు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెగావాట్కు రూ.5,000 దరఖాస్తు ఫీజును 18 శాతం జీఎస్టీతో కలిపి చెల్లించాలి. ప్లాంట్ కెపాసిటీ మెగావాట్కు మించితే రూ.10,000 దరఖాస్తు ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఎంపికైన వ్యవస్థాపకులు లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్ఓఏ) జారీ చేసిన 10 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీగా మెగావాట్కు రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్లాంట్ల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్లాంటు నుంచి సబ్ స్టేషన్ వరకు వ్యవస్థాపకులే ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్ వేసుకోవాలి. సబ్ స్టేషన్కు 5 కి.మీల పరిధిలోపల ప్లాంటు పెట్టుకునే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్ స్టేషన్ పరిధిలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్లాంట్లు ఏర్పాటుచేస్తే.. అందరూ కలిసి ఒకే సరఫరా లైన్ వేసుకోవచ్చు. కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్కు 40 పైసల చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్ఆర్ఈ) ప్రోత్సాహకంగా అందిస్తుంది. మెగావాట్కు మొత్తం రూ.6.6 లక్షలకు మించకుండా ఈ ప్రోత్సాహం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుదారులు పీఎం కుసుమ్ తెలంగాణ వెబ్సైట్ www.pmkusum.telangana.gov.in లో ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా సబ్స్టేషన్ పరిధిలో సామర్థ్యానికి మించి ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వస్తే రాష్ట్ర ప్రభుత్వ టెండర్ల వెబ్సైట్ https://eprocurement.telangana.gov.in ద్వారా రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఎవరు ప్లాంట్ నిర్మించి తక్కువ ధరకు విద్యుత్ విక్రయించేందుకు ముందుకు వస్తే వారినే ఎంపిక చేస్తారు. ఎస్హెచ్జీల నుంచి దరఖాస్తులను స్వీకరించడం లేదు. పనితీరు ఆధారంగా సెర్ప్ అధికారులే వారిని ఎంపిక చేస్తున్నారు. -
నారీ‘శక్తి’ వెలుగులిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు.. సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లను ఒకటి, రెండురోజుల్లోనే అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. సచివాలయంలో మంగళవారం జరిగిన పీఆర్ఆర్డీ, ఆర్థిక శాఖ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహాయించి) 64 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బ్యాంకర్లతో చర్చలు పూర్తయి, ఒప్పందాలు, రుణాలు అందించే ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఒక్కొక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.3 కోట్ల వ్యయం కానుండగా.. దీనికి సంబంధించి ఇంకా బ్యాంకర్లతో ఒప్పందాలు, విధి విధానాలు పూర్తి కావలసి ఉంది. మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుదుత్పత్తిలో ఆలస్యం లేకుండా పీఆర్ ఆర్ డీ శాఖ చర్యలు చేపడుతోంది. రుణాలు సమకూర్చనున్న ‘స్త్రీనిధి’ మొత్తంగా 64 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన రుణాలను స్త్రీనిధి సంస్థ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.192 కోట్ల పెట్టుబడి అవసరం కాగా, 10 శాతం అంటే రూ.30 కోట్లు.. విలేజ్ ఆర్గనైజేషన్లు అందించనున్నాయి.స్త్రీనిధి ద్వారా మిగిలిన రూ.162 కోట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. మార్చి 8నాటికి బ్యాంకర్లతో రుణాలిప్పించి.. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాల సమాచారం. -
అచ్యుతాపురం సెజ్లో రిలయన్స్ సోలార్ పవర్ సెల్ ప్లాంట్!
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్లో రిలయన్స్ సోలార్ పవర్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిలయన్స్ పవర్ అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో స్థలం పరిశీలించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. సెజ్లో ఏపీఐఐసీ భూములను పరిశీలించి తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు ఆయన బయలుదేరారు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకురావడంతో దానికి పోటీగా పునరుత్పాదక విద్యుత్కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసు్తన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలం పరిశీలించినట్లు తెలిసింది. అనిల్ అంబానీ పర్యటనపై అధికారికంగా ముందస్తు సమాచారం లేదని, ఆయన విశాఖ ఎయిర్పోర్టు నుంచి అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్కు వస్తున్నారని తెలిసిన వెంటనే జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఏపీఐఐసీ అధికారులు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో...అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామ సమీపంలో సుమారు 1,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనిల్ అంబానీ కూడా సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన ఎటువంటి హడావుడి లేకుండా అచ్యుతాపురం సెజ్లో స్థలం పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. -
త్వరలో ‘సౌర’ టెండర్ల ఖరారు!
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పిలిచిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకుగాను ఎస్హెచ్జీల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సహాయం కోసం ఎస్హెచ్జీలను బ్యాంకులతో సమన్వయం చేయాలని కోరారు. ఎస్హెచ్జీల ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గతేడాది సెప్టెంబర్లో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ కార్యక్రమం పురోగతిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి బుధవారం ప్రజాభవన్లో జిల్లా కలెక్టర్లతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకి 4 ఎకరాలు చొప్పున ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకుగాను దేవాదాయ, నీటిపారుదల శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూములు సేకరించాలని భట్టి ఆదేశించారు. వీటితో ఎస్హెచ్జీలు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకి 4–5 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. అటవీ భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్న గుట్టలతో పాటు నగరాల్లో భారీ భవంతులపై సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజనులకు భూమి ఎక్కువగా ఉన్నా ఆదాయం తక్కువగా ఉంటుందని, అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరీవాహకంలోని భూములపై దృష్టిపెడితే వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, లోకేశ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ కొనుగోలు పిల్పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
ఏది నిజం?: సౌర విద్యుత్ మేమే ఇస్తాం
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనేఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
2050 నాటికి 100 కోట్ల మందికి స్థిర ఆదాయం!
ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈమేరకు బాకులోని కాప్29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షెరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ తయారీకి ఐఎస్ఏ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమీకరించే ఎనర్జీ పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. దేశ స్థిరాభివృద్ధిలో సౌరశక్తి పాత్రను కేంద్రం గుర్తించిందని, అందుకు తగిన విధంగా సోలార్ ఎనర్జీ పరిధిని విస్తరించేందుకు ప్రపంచ వాటాదారులతో కలిసి పని చేస్తోందన్నారు. ఐఎస్ఏ నివేదికలో సూచించిన వినూత్న విధానాల ద్వారా మరింత మెరుగ్గా సౌరశక్తిని వినియోగించుకోవచ్చని చెప్పారు.నివేదికలోని వివరాల ప్రకారం.. సౌరశక్తితో గణనీయమైన సామాజిక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. 2050 నాటికి ప్రపంచ సౌరశక్తి సామర్థ్యం 20 రెట్లు పెరుగనుంది. స్లో ట్రాన్సిషన్, డైనమిక్ ట్రాన్సిషన్, షైన్ అనే మూడు విధానాలతో నెట్-జీరో(కార్బన్ను విడుదలను పూర్తిగా తగ్గించడం) లక్ష్యాన్ని సాధించవచ్చు.స్లో ట్రాన్సిషన్: సౌరశక్తిని పెంచడానికి అవసరమయ్యే విధానాలను నెమ్మదిగా పెంచాలి. ప్రస్తుతం పరిమిత పెట్టుబడుల వల్ల ఈ విభాగం విస్తరణ కొంత వెనకబడి ఉంది. భవిష్యత్తులో ఈ ఇది పెరగనుంది.డైనమిక్ ట్రాన్సిషన్: స్లో ట్రాన్సిషన్తో పోలిస్తే సౌరశక్తిని పెంచడానికి మరింత చురుకైన, ప్రతిష్టాత్మక విధానాన్ని ఇది సూచిస్తుంది.షైన్: షైన్ (సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్) ద్వారా సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థను సృష్టించవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) సిస్టమ్ను శక్తి నిల్వ కోసం వినియోగించుకోవచ్చు.స్థిర ఆదాయం: ప్రభుత్వాలు ప్రజలకు సౌరశక్తిపై అవగాహన కల్పిస్తే నిర్ణీత ఖర్చుతో సోలార్ ఎనర్జీను గ్రిడ్కు కనెక్ట్ చేయవచ్చు. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి స్థిర ఆదాయం ఏర్పడుతుంది.ఉపాధి: 2050 నాటికి ఈ విభాగంలో మహిళలు, యువతకు గణనీయమైన అవకాశాలు కల్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్లకు పైగా ఈ సెక్టార్లో ఉద్యోగాలను సృష్టించవచ్చు.పర్యావరణ ప్రభావం: సౌరశక్తిని పెంచడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులను తగ్గించి పారిస్ ఒప్పందం ప్రకారం 1.5°C ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వీలవుతుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 శాతం హానికర కర్బన ఉద్గారాలను కట్టడి చేయవచ్చు.తగ్గనున్న వ్యయ సామర్థ్యం: సౌరశక్తి అందించడం ప్రస్తుతం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, 2050 నాటికి వీటి ఖర్చులు 60 శాతం తగ్గుతాయని అంచనా.ఇదీ చదవండి: ‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’పునరుత్పాదక ఇంధన వనరులతో శిలాజ ఇంధనాల వాడకం తగ్గడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అన్నారు. భవిష్యత్తులో స్థిరమైన ఎనర్జీ సరఫరాకు సౌరశక్తి కీలకంగా మారనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు. -
రూఫ్టాప్ సౌరభం!
పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం! సోలార్ పవర్ ‘టాప్’లేపుతోంది! నివాసాల్లో సౌర విద్యుత్ వాడకం జోరందుకుంది. మోదీ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక ఫ్లాగ్íÙప్ పథకం పీఎం సూర్య ఘర్ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో దాదాపు 4 లక్షలకు పైగా గృహ సోలార్ కనెక్షన్లు కొత్తగా జతయ్యాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) 1.8 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా అంచనా. ఈ ఏడాది మార్చి నాటికి నివాస రూఫ్టాప్ సోలార్ సామర్థ్యం 3.2 జీడబ్ల్యూగా నమోదైంది. అంటే, దీంతో పోలిస్తే గడిచిన ఆరు నెలల కాలంలో 50 శాతం పైగా సామర్థ్యం ఎగబాకినట్లు పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇదంతా పీఎం సూర్య ఘర్ స్కీమ్ చలవేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, దేశంలో రూఫ్టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం 2024 మార్చి నాటికి 11.9 జీడబ్ల్యూగా ఉంది. ఇందులో అత్యధికంగా సుమారు 60 శాతం వాటా వాణిజ్య, పారిశ్రామిక విభాగాలదే! సబ్సిడీ పెంపు.. తక్కువ వడ్డీకే రుణం.. ఇంటి డాబాలపై సౌర విద్యుత్ సిస్టమ్ల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటి నుంచో ఉంది. ఖర్చు తడిసిమోపెడవుతుండటంతో ప్రజల నుండి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, గ్రీన్ ఎనర్జీ పాలసీపై గట్టిగా దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం గృహాల్లో సోలార్ వెలుగులు పెంచేందుకు పీఎం సూర్య ఘర్ స్కీమ్ను తీసుకొచ్చింది. ప్రధానంగా అధిక వ్యయ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ మాడ్యూల్స్పై సబ్సిడీని 40% నుంచి 60%కి పెంచింది. 7% వడ్డీకే రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. దీంతో రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గత కొన్ని నెలలుగా భారీగా పెరిగినట్లు జేఎంకే రీసెర్చ్, ఎనలిటిక్స్ తాజా నివేదికలో వెల్లడైంది. కాగా, ఈ జోరు ఇలాగే కొనసాగితే నివాస సౌర విద్యుత్ సామర్థ్య విస్తరణలో ఈ స్కీమ్ గేమ్ ఛేంజర్గా నిలుస్తుందనేది నిపుణుల మాట!ఏటా 8–10 గిగావాట్లు..దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచడంలో భాగంగా 2027 నాటికి నివాస గృహాల రూఫ్టాప్ సోలార్ స్థాపిత సామర్థ్యాన్ని 30 గిగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే ఏటా 8–10 జీబ్ల్యూ వార్షిక సామర్థ్యం గల రూఫ్టాప్ సోలార్ యూనిట్లు జతకావాల్సి ఉంటుంది. ‘మిగులు విద్యుత్ను తిరిగి విక్రయించడంతో సహా డిస్కమ్ల నుంచి అనుమతులను పొందడం విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. రుణ సదుపాయంతో పాటు ప్రజల్లో సౌర విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుపై అవగాహన పెంచేలా చర్యలు చేపడుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ వి. పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచడం, సోలార్ మాడ్యూల్స్పై వ్యయాలను తగ్గించడం, వినియోగదారుల్లో ఈ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం వంటి అంశాల నేపథ్యంలో రెసిడెన్షియల్ రూఫ్టాప్ సోలార్ మార్కెట్ వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఈ స్కీమ్ అమలుకు దన్నుగా నిలుస్తున్నాయి. గృహ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకునే కస్టమర్లకు నెట్ మీటరింగ్ను అందిస్తున్నాయి. దీనికి తోడు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వీటి ఏర్పాటుకు రుణాలిచ్చే సంస్థలు అరకొరగానే ఉండేవి. ఇప్పుడు 25కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ కంపెనీలు రుణాలిస్తున్నా యి. దీంతో నివాసపరమైన రూఫ్టాప్ సోలార్ మార్కెట్ పుంజుకుంటోంది’ అని విక్రమ్ చెప్పారు. సవాళ్లున్నాయ్...గృహాల్లో సోలార్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మోదీ సర్కారు 2027 నాటికి కోటి ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.75,021 కోట్ల మొత్తాన్ని (ప్రభుత్వ వ్యయం) కేటాయించింది కూడా. భారత్ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలన్న సంకల్పానికి సూర్య ఘర్ పథకం చేదోడుగా నిలుస్తుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు పొంచి ఉన్నాయని... ముఖ్యంగా దేశీయంగా నివాస రంగానికి దేశీయ సోలార్ మాడ్యూల్స్ లభ్యతను పెంచాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఫొటోవోల్టాయిక్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం, డిమాండ్ మధ్య భారీ అంతరం ఉందని, ఈ మేరకు ప్లాంట్ల సామర్థ్యం భారీగా పెరగాల్సి ఉందనేది వారి అభిప్రాయం. చిన్న, మధ్య తరహా గృహ విద్యుత్ వినియోగదారులు ఈ స్కీమ్ను ఉపయోగించుకునేలా మరింత ప్రోత్సహించాలని కూడా నిపుణుల సూచిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సౌర విద్యుత్ (సోలార్ పవర్ ప్లాంట్లు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందులో ఇందిరా మహిళాశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్లో ఆయన ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వైస్చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వావిలాల అనీల తదితరులతో ఈ అంశంపై సమీక్షించారు.రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి త్వరితగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల కొనుగోళ్లకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రుణాల తిరిగి చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్న విషయాన్ని అనుకూలంగా మలుచుకోవాలని డిప్యూటీ సీఎం చెప్పారు.ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆరీ్టసీకి బస్సులు సమకూర్చే మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామన్నారు. వారు కూడా విరివిగా రుణాలిచ్చి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంధనశాఖకు పీఆర్శాఖ ప్రతిపాదనలుమహిళా స్వయం సహాయక సంఘాలకు వె య్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒక్క మెగావాట్కు రూ. 3 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు భరిస్తే 90 శాతం బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వనున్నాయి. ఇంధనశాఖ దీనికి గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. -
సోలార్ పవర్ డైరెక్టుగా స్పేస్ నుంచే
కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..ఆకాశంలోనే అడ్డా వేసి..భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!1. స్పేస్లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్ను రేడియో వేవ్స్గా మార్చి భూమి మీదకు పంపుతారు.3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్ను తిరిగి విద్యుత్గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.రేడియో తరంగాల రూపంలో పంపుతూ..ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్ల్యాండ్లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది. ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.మూడు కంపెనీలు కలసి.. యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్ల్యాండ్కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్వర్క్గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు. - సాక్షి సెంట్రల్డెస్క్ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది. ⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. ⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. ⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
దేవుడి భూముల్లో ‘సౌర’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్ : దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కానుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు దశాబ్దాలుగా వృథాగా ఉంటున్నాయి. ఈ భూముల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వ్యవసాయానికి ఉపయోగపడని భూములను గుర్తించి వాటిల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా దేవాదాయ శాఖ కాకుండా.. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూములు ఇవ్వటం ద్వారా లీజు రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయం రానుండగా, సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ రూపంలో ఎస్హెచ్జీలకు రాబడి సమకూరుతుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల భూములను గుర్తించి ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో రెడ్కో, ఎస్హెచ్జీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రస్తుతానికి 250 ఎకరాల భూములను గుర్తించారు. 62 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వీలుంది. వీటి ద్వారా నిత్యం సగటున 2.48 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి ఆలనాపాలనా అంత పక్కాగా లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. వీటిల్లో విడిపించుకోదగ్గ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధిత దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు పొందే కసరత్తు దేవాదాయ శాఖ ప్రారంభించింది.ఇప్పటికే 57 శాతం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయించారు. ఇప్పటికి స్వాధీనం అయిన భూములు, కబ్జా కాకుండా ఉన్న భూములను దేవాలయాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభమైంది. అయితే వ్యవసాయ యోగ్యంగా లేని భూములపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి లేకుండా పోయింది. ఇప్పుడు వాటిల్లో సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే దీన్ని సొంతంగా నిర్వహించగలిగే స్థాయిలో దేవాదాయ శాఖ వద్ద మానవవనరులు లేవు. దీంతో ఎస్హెచ్జీలను తెరపైకి తెచ్చారు.దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాల భూములుఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రెండుదశల్లో నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో ఐదు దేవాలయాలకు చెందిన 231 ఎకరాలను గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 20 ఎకరాలు, మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి చెందిన 100 ఎకరాలు, నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ గోశాలకు చెందిన 96 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాలు, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బుజలాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి చెందిన 6 ఎకరాలను మొదటి దశ కోసం గుర్తించారు. రెండో దశలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబాబాద్లోని శ్రీ శివాలయం, హనుమకొండ రాగన్న దర్వాజా ప్రాంతంలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవాలయాలకు చెందిన 21 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు.వీటిల్లో త్వరలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్లో రెడ్ కో, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఎకరాకు రూ.15 వేల మేర లీజును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. -
గ్రామాలకు సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్టాప్లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ సోలార్ విలేజ్..గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.అంతా సోలార్మయంపైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్ను గ్రిడ్కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్ను అమరుస్తారు. బహుళ ప్రయోజనాలు..సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది. సిరిపురంలో సర్వే పూర్తిమధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగంమా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లాబిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లారుణపడి ఉంటాం..మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా -
పీవీ మాడ్యూల్స్ పరిశ్రమలు నెలకొల్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు ఫోటో వోల్టాయిక్ (పీవీ) మాడ్యూల్స్ పెద్దసంఖ్యలో కావాల్సి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూయ ల్ సెల్ టెక్నాలజీని వినియోగించబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీవీ మాడ్యూ ల్స్, ఫ్యూయల్ సెల్స్ తయారీ యూనిట్ల ఏర్పా టుకు ముందుకు రావాలని ప్రముఖ జపనీస్ కంపెనీ తోషిబాను ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన టోక్యో శివార్లలోని తోషిబా ప్రధాన కార్యాలయంలో ఫ్యూయల్ సెల్, న్యూక్లియర్ పవర్/థర్మల్ పవర్ టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. కంపెనీ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగేరిజో కవహర.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఉత్పత్తులను వివరించారు. తెలంగాణను ఎల్రక్టానిక్ హబ్గా మార్చనున్నామని, ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తామని భట్టి విక్రమార్క వారికి చెప్పారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా లిథి యం, ఇతర ఖనిజ తవ్వకాల రంగంలోకి ప్రవేశించనుందన్నారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందు కు పోవచ్చని సూచించారు. భారత్లో మూడు రాష్ట్రాల్లో తమ యూనిట్లను నెలకొల్పామని, అందులో తెలంగాణలోని యూనిట్ అత్యంత ముఖ్యమైనదని తోషిబా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వ ఉమ్మడి భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బులెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలి భట్టి విక్రమార్క బుల్లెట్ ట్రైన్లో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసాకా పట్టణాన్ని 2.2 గంటల్లో చేరుకున్నారు. ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలోనూ అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను కోరనున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి పానసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని భట్టి సందర్శించనున్నారు. పర్యటనలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రైతులు/రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకంలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇప్పటివరకు 8,112 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం అనుమతి ఇవ్వగా, అందులో అత్యధికంగా 4 వేల మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రా నికి సంబంధించినవే కావడం గమనార్హం. రైతులు వ్యక్తిగ తంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగా వాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న సోలా ర్ పవర్ ప్లాంట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. రెన్యువబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో) నిబంధనల ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏటా తప్పనిసరిగా కొంత శాతం పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్లాంట్ల ద్వా రా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను కూడా ఆర్పీఓ నిబంధనల కింద డిస్కంలు తప్పనిసరిగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లించనున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్కు 0.40 పైసలు చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరు త్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకంగా అందించనుంది.త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం..డిస్కంలు తమ 33/11 కేవీ, 66/11 కేవీ, 110/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా వాటి పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేందుకు అవకాశం ఉందో గుర్తించి తమ వెబ్సైట్లో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తైంది. త్వరలో రైతుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ డిస్కంలు ప్రకటన జారీ చేయనున్నాయి. ఆసక్తి గల రైతులు/డెవలపర్లు మెగావాట్కు రూ.,5000కి మించకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రైతులు/డెవలపర్లు కుదుర్చుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఆధారంగా రైతులు/డెవలపర్లకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. -
పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో ‘సూర్య ఘర్’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.ఇదీ చదవండి: ‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
భూ భ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడావల్ల గాలులు ఏర్పడి ఒకవైపు నుంచి మరోవైపునకు వీస్తాయి. ఈ గాలి ఎందుకు అవసరం అంటే వెంటనే ఏం చెబుతాం.. గాలి పీల్చకుండా బ్రతుకలేమని అంటాం. వాతావరణ మార్పులకు గాలి అవసరం అని చెబుతాం. అయితే ఇటీవల నెలకొంటున్న పరిస్థితుల వల్ల గాలి అవసరాలు పెరుగుతున్నాయి. గాలి నెమ్మదిగా మన వరండా నుంచి గుమ్మం ద్వారా మన టీవీలో చేరి వినోదాన్ని అందిస్తోంది. మన మొబైల్లో ప్రవేశిస్తోంది. మన మిక్సీలో పిండి రుబ్బేందుకు సహాయం చేస్తోంది. అదేంటి గాలి ఇన్ని పనులు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారా.. క్రమంగా పవన విద్యుత్కు ఆదరణ పెరుగుతోంది. ఆయా ప్రాజెక్ట్ల్లో తయారైన కరెంట్ను గ్రిడ్కు అనుసంధానం చేసి నిత్యావసరాలకు వాడుతున్నాం. ఈరోజు గ్లోబల్ విండ్ డే సందర్భంగా పవన విద్యుత్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవనశక్తిని కనుగొన్నా.. భౌగోళిక, సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం తరవాత అనేక దేశాలు పవన విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41శాతం. అందులోనూ పవన విద్యుత్తు 11శాతానికే పరిమితమైంది. సౌర విద్యుత్తు తరవాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. థర్మల్ విద్యుత్తు కంటే దీన్ని సుమారు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు.ప్రపంచవ్యాప్తంగా భారత్ పవన విద్యుత్తు తయారీలో నాలుగో స్థానం(42.87 గిగావాట్లు)లో ఉంది. మొదటి స్థానంలో చైనా 288.32 గిగావాట్లు, తరవాతి స్థానాల్లో వరుసగా అమెరికా (122.32 గిగావాట్లు), జర్మనీ (62.85 గిగావాట్లు) ఉన్నాయి. డెన్మార్క్ తన విద్యుత్తు అవసరాలన్నింటికీ పూర్తిస్థాయిలో పవనశక్తినే ఉపయోగిస్తోంది. భారతదేశానికి మూడు వైపులా సుమారు 7,600 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. నేషనల్ విండ్పవర్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం..సముద్ర తీరాల వద్ద సుమారు 300 గిగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణ ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పవనశక్తి ద్వారా 140 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయించింది. కానీ, నేటికీ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.87 గిగావాట్లకే పరిమితమైంది.రాష్ట్రాలవారీగా పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యంతమిళనాడు 9.62 గిగావాట్లుగుజరాత్ 8.58మహారాష్ట్ర 5.1కర్ణాటక 4.98రాజస్థాన్ 4.34ఆంధ్రప్రదేశ్ 4.11తెలంగాణ 0.12 గిగావాట్లపునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌరశక్తి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. పవన విద్యుత్తు, సౌరశక్తి మధ్య ప్రధాన తేడాలు గమనిస్తే..సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్తు వినియోగం మాత్రం రాత్రి వేళల్లో ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవనశక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
పైకప్పుపై ‘పవర్’..! ఫుల్..!!
ఏ ఇంటికై నా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు స్వయంగా విద్యుత్ని ఉత్పత్తి చేసుకుంటే కరెంటు బిల్లు బెడద లేకుండా హాయిగా ఉండొచ్చు. కేవలం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడమే కాదు.. మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్రం సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోంది. సోలార్ విద్యుత్ తయారీకి సబ్సిడీ, రుణ సదుపాయం కల్పించింది. ఆసక్తిదారులు ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించింది. మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల కరెంటు బిల్లు కాపీని జతపరచాలి.తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. తదుపరి ట్రాన్స్కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలో వాట్కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కల్పించనున్నారు. చివరగా ఇంటి రూఫ్పై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో ‘నెట్ మీటర్’ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తి.. వినియోగదారుడు వాడుతున్న వి ద్యుత్ని గణిస్తారు. ఈపీడీసీఎల్లోని విశాఖపట్నం సర్కిల్లో ఇప్పటి వరకు 452 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.రూ.78 వేల వరకు సబ్సిడీ..కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.30 రోజుల్లో రాయితీ..నెట్ మీటర్ అమర్చిన తరువాత వినియోగదారులు ‘పోర్టల్’లో బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చెయ్యాలి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోనే వినియోగదారుడికి చెల్లిస్తుంది. ఒక కిలో వాట్ రూఫ్ టాప్ కెపాసిటీ కోసం 3–4 ప్యానల్స్ (1 మీటరు వెడల్పు – 1.6 మీటర్ల ఎత్తు)ని అమర్చనున్నారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్ నెలకు దాదాపు 125 పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ సూర్యరశ్మిని నిలిపేసుకోవడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వినియోగదారుడు పెట్టిన పెట్టుబడి ఆరు నుంచి ఏడేళ్లలో తిరిగి పొందగలరని అధికారులు చెబుతున్నారు.సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు..– దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి.– వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.– సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి.– దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.– పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.– దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే అనర్హులు.– దరఖాస్తుదారు దగ్గర అవసరమైన సరైన పత్రాలు ఉండాలి.– దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..వినియోగదారులే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చూసే ‘సూర్యఘర్’ అద్భుతమైన పథకం. సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ, రుణ సదుపాయం కల్పిస్తోంది. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ మీటర్ విధానం ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.. అందులో ఎంత మేర వినియోగిస్తున్నాం అనే వివరాలు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. సందేహాలుంటే ట్రాన్స్కో అధికారులతో నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.దరఖాస్తు చేసేందుకు అవసరమైన పత్రాలు..– ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రం– విద్యుత్ బిల్లు బ్యాంకు పాస్ బుక్– పాస్పోర్ట్ సైజు ఫొటో రేషన్ కార్డు– మొబైల్ నంబర్ అఫిడవిట్– ఆదాయ ధ్రువీవీకరణ పత్రం – ఎల్.మహేంద్రనాథ్, ఈపీడీసీఎల్ ఎస్ఈ -
విద్యుత్ సరఫరాలో అంతరాయం.. పరిష్కారం దిశగా ప్రభుత్వం
సంప్రదాయేతర విధానాలతో కరెంటు ఉత్పత్తి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిసమయంలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్రిడ్పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం ఛార్జీల చెల్లింపులో గతంలోనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని భారీ పరిశ్రమలకు అమలు చేస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి గృహవినియోగదారులకు దీన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.భారత్లో అత్యధిక భాగం థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి కరెంట్ తయారవుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండిచడంతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దాంతో సంప్రదాయేతర విధానాల్లో కరెంట్ను తయారీని పెంచుతూ క్రమంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. కానీ అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలను భర్తీ చేసేంత కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. అందుకు తగ్గట్టు ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలాలకు అనుగుణంగా, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం నిత్యం మారుతుంటోంది. కానీ ఉత్పత్తి ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నపుడు కరెంట్ను పెద్దమొత్తంలో స్టోర్చేసే మార్గాలులేవు. దాంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో వ్యత్యాసం వచ్చినపుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్) విఫలమయ్యే ప్రమాదం ఉంది.అధిక ఖర్చులు..సంప్రదాయేతర కరెంట్ తయారీలో సౌరవిద్యుత్ ప్రధానమైంది. ఇది పగటిపూట ఎక్కువగా అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. అవి గ్రిడ్కు అనుసంధానం అయినప్పటికీ వాటిద్వారా వెంటనే విద్యుత్ తయారీ సాధ్యం అవ్వకపోవచ్చు. దాంతో కాలుష్యం ఏర్పడుతోందని తెలుస్తున్నా థర్మల్ విద్యుత్వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ విద్యుత్ తయారీ పెంచడానికి కొంత సమయం పడుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ కరెంట్ను బ్యాటరీల్లో నిల్వ ఉంచితే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొంది. ఈ క్రమంలో గ్రిడ్ వైఫల్యం చెందకుండా చూసుకోవడం సవాలుగా మారుతోంది.జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దాంతో రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్ ఎక్కువ వృథా అవుతోంది. పగటిపూట లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్లు కరెంట్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని గతంలో సవరించింది. ఇందులో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చింది. రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.ఈ సవరణల్లో భాగంగా పగలు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయనుంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్ మీటర్లను బిగించాల్సి ఉంటుంది. -
‘సెకీ’ విద్యుత్ చౌక
సాక్షి, అమరావతి: కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ, రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్ను సమకూరుస్తోంది.ఇందుకోసం ప్రైవేటు రంగం నుంచి కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదు2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం ఏడాదికి 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. సెకీ విద్యుత్ అతి తక్కువకు యూనిట్ రూ.2.49 కు వస్తోంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) యూనిట్ రూ.2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్విుషన్ చార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది.అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్కు పాతికేళ్ల పాటు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. టీడీపీ వల్లనే నష్టంచంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు అసలు పొంతనే లేదు. చంద్రబాబు హయాంలో సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44 కు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) చంద్రబాబు ఏకంగా యూనిట్కు రూ.8.90 వెచ్చించారు. పవన విద్యుత్ యూనిట్కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కుదుర్చుకున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఇదే సెకీ నుంచి యూనిట్కు రూ.4.57తో గాలివీడులో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లను కొనుగోలు చేసింది. ఇలా చంద్రబాబు హయాంలో మొత్తం దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ఐదేళ్లుగా సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ‘సెకీ’తో ఒప్పందం కారణంగా బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12 కు కొనే బదులు గ్రీన్ పవర్ను యూనిట్ రూ.2.49 కొనవచ్చు. ఫలితంగా డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. -
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో రూ.78వేలు..?
సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాని అమలుదిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది. ఈ మేరకు లబ్ధిదారులు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువరించనున్నట్లు సమాచారం. పీఎం సూర్య ఘర్ పథకాన్ని రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని గతంలోనే తెలియజేశారు. ఇదీ చదవండి: వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే.. రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హైడ్రో పవర్పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్కాస్ట్ మైన్స్లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్కాస్ట్లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
‘90 శాతం ఉచిత విద్యుత్ ఇచ్చాం’.. మంత్రి వెల్లడి
రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 2023లో ప్రభుత్వం 90 శాతం ఉచిత విద్యుత్ను అందించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటి నుంచి ప్రతినెలా గృహాల్లో సరాసరి 300 యూనిట్లకు బదులు 600 యూనిట్ల కరెంట్ అధికంగా సరఫరా అవుతుందన్నారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్పీసీఎల్) ఆధ్వర్యంలోని అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,873 కోట్లతో పంపిణీ వ్యవస్థలను పునరుద్ధరించినట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇతర సంస్థలతో పవర్పర్చేజ్ అగ్రిమెంట్లపై సంతకం చేసిందని చెప్పారు. దాంతో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పంజాబ్ 2023లో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. గరిష్ఠంగా జూన్ 23, 2023న 15,293 మెగావాట్ల విద్యుత్ అవసరమైనట్లు తెలిసింది. -
త్వరలో 1.47 లక్షల మందికి ఉపాధి.. ఎలాగంటే..?
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. పసుపురంగు పార్టీ నేతలు పనికిమాలిన, అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందని ఆ ‘ఎల్లో’ నేతలకు చెంపపెట్టులా ఉన్న ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి. అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? సెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ప్రస్తుతం సగటు ధర యూనిట్కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ప్రస్తుతం సగటు ధర యూనిట్కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
సాగుకు పగలు మాత్రమే విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని.. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటివేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటే సౌర, పవన విద్యుత్తో తీర్చవచ్చ ని వివరించింది. ఈ నెల 1న దేశంలో పగటిపూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు (ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లకు సమానం) పెరిగిపోయినా తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈ నెల 1న ఆ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని.. అందువల్ల వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగటివేళలకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఈ నెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ లేఖలోని వివరాల మేరకు.. 23 శాతం పెరిగిన డిమాండ్ దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఆ నెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్ యూ నిట్లకుపైగా విద్యుత్ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మి.యూనిట్ల కొరత ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. దక్షిణాదిలోనే కొరత అధికం దేశవ్యాప్తంగా చూస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జలవిద్యుదుత్పత్తి జరగగా.. ఈసారి 40 గిగావాట్లలోపే ఉండటం గమనార్హం. జూన్–సెపె్టంబర్ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉండగా.. 2–3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలుండగా.. గ్యాస్ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. విద్యుత్ డిమాండ్ తీర్చడానికి కేంద్రం సూచించిన చర్యలివీ.. ♦ విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలి. ♦ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలి. ♦ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టు కోవాలి. ళీ నాణ్యత లేని బొగ్గు, యాష్ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక.. 12–14 గిగావాట్ల విద్యుత్ లభ్యత లేకుండా పోయింది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలి. ♦ ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకో వాలి. ళీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్ను పవర్ ఎక్స్చేంజి ల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలి. ♦ డిమాండ్ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. ♦ నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలి. -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్తో లాభాలు... ► సౌర విద్యుత్కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోలార్ పవర్ ఉత్పత్తికి కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది. సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇవీ నిబంధనలు ♦ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ♦ ఇంటరాక్టివ్ రూఫ్టాప్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది. ♦ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి. ♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్వర్క్ నుంచి సోలార్ నెట్వర్క్ను డిస్కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి. ♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు. -
కేజీహెచ్లో సోలార్ పవర్ ప్లాంట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/గాజువాక: కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమక్షంలో కేజీహెచ్లోని సీఎస్ఆర్ బ్లాక్ రూఫ్ టాప్లో సౌర విద్యుత్ను ఇన్స్టాలేషన్ చేయడానికి ఎంవోయూ జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వైజాగ్ అసెట్కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ ద్వారా కేజీహెచ్లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ హెడ్, హెచ్ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. రూ.670 కోట్లతో 1,125 పీహెచ్సీల ఆధునికీకరణ రాష్ట్రంలోని 1,125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.670 కోట్లతో ఆధునికీకరించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన కణితి పీహెచ్సీ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను నిర్మిస్తున్నామన్నారు. 121 సీహెచ్సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం జగనన్న ప్రభుత్వం రూ.1,223 కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రూ.8,500 కోట్లను ఖర్చు చేస్తున్నారన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం రూ.3,820 కోట్లు కేటాయించామని తెలిపారు. -
బాల్కనీ ఉంటే చాలు.. సోలార్ పవర్ పొందొచ్చిలా..
సౌరవిద్యుత్తు వాడుక ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తోంది. ఇంటికి సౌరవిద్యుత్తు అమర్చుకోవాలంటే, పైకప్పులో చాలాభాగం సౌరఫలకాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారికి ఇదంతా కుదిరే పనికాదు. అందువల్ల సౌరవిద్యుత్తుపై ఆసక్తి ఉన్నా, నగరాల్లో అపార్ట్మెంట్లలో ఉండే జనాలు సౌరవిద్యుత్తు జోలికి పోవడం లేదు. ఈ సమస్యను గమనించి, జపాన్కు చెందిన ‘ఇకో ఫ్లో’ బాల్కనీలో కూడా అమర్చుకోవడానికి వీలైన కాంపాక్ట్ పోర్టబుల్ సోలార్ పవర్ జెనరేటర్ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ జెనరేటర్తో పాటు ఉండే నాలుగు సౌరఫలకాలను బాల్కనీలో ఎండ సోకే ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) దీని ద్వారా ఏడాదికి దాదాపు 1040 కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే, ఒక ఇంటి అవసరాలకు ఈ విద్యుత్తు పూర్తిగా సరిపోతుంది. దీనిని అరగంట లోపే కోరుకున్న చోట అమర్చుకోవచ్చు. ఆరుబయట పిక్నిక్లకు తీసుకువెళ్లేందుకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ధర 2,049 పౌండ్లు (రూ.2.10 లక్షలు) మాత్రమే! -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
సౌర కాంతుల సిటీ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం సౌరకాంతులు వెదజల్లుతోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ..ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, ఇళ్లపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు) ఏర్పాటవుతున్నాయి. ఇవి సొంతింటి విద్యుత్ అవసరాలను తీర్చడమే గాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. సాధారణ విద్యుత్ బిల్లుల మోత మోగుతుండడంతో ‘సిటీ’జనులు సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో దీనిపై అంతగా అవగాహన లేకున్నా.. క్రమేణా సౌర విద్యుత్పై ప్రజలకు ఆదరణ పెరుగుతోంది. ♦ నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానెల్ ఏడాదికి సగటున 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా జీహెచ్ఎంసీ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తన కరెంటు బిల్లుల వ్యయాన్ని ఏడాదికి రూ.1.50 కోట్ల మేర తగ్గించుకుంది. ♦ బండ్లగూడ నగరపాలిక పరిధి గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్లోని పది బహుళ అంతస్తుల్లో 518కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మ డి అవసరాలకు నెలకు రూ.12 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిద్వారా నెలకు 85వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా వారి నెలవారీ విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గిపోయింది. ♦ఈయన పీవీ రంగనాయకులు. కాప్రాలోని వెస్ట్రన్ బ్లీస్ విల్లాస్లో నివసిస్తున్నారు. 2022 నవంబర్లో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఇంటిపై ఐదు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున 25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో అప్పటివరకు నెలకు రూ.5,000 వచ్చే కరెంటు బిల్లు రూ.150 నుంచి రూ.200కు పడిపోయింది. పాఠశాలలకూ సోలార్ హంగులు సర్కారీ పాఠశాలలను కరెంట్ బిల్లుల భారం నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు– మన బడి’లో భాగంగా 11 జిల్లాల పరిధిలో తొలి విడతగా 1,521 ప్రభుత్వ పాఠశాలలపై రూ.32.02 కోట్లతో 3,072 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పాఠశాలల భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. మరికొన్ని ప్రాజెక్టులు ♦ శంషాబాద్ విమానాశ్రయంలో 2015లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2021 జూలైలో అదనంగా మరో ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును అమర్చారు. ప్రస్తుతం విమానాశ్రయం విద్యుత్ అవసరాలు 50% సౌరశక్తి ద్వారానే తీరుతుండటం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ సైతం సోలార్ ఎనర్జీతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి గట్టెక్కింది. ♦ రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలోవార్షిక విద్యుత్ బిల్లు రూ.కోటికి పైగా వచ్చేది. భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. ♦ శామీర్పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్నగర్లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్సాగర్ ఓనర్స్ అసోసియేషన్ పరిధిలో 710 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. విద్యుత్ బిల్లులు తగ్గిపోయాయి. నిథమ్ క్యాంపస్లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్ల ద్వారా నెలకు 2.50 లక్షల బిల్లు ఆదా చేస్తున్నారు. అదనపు విద్యుత్ డిస్కంకు.. ♦ గ్రేటర్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 220 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన మినీ సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 170 నుంచి 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వేసవిలో మరో 30% అదనంగా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. నగరంలో రోజుకు సగ టున 2,500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉండగా, ఇందులో థర్మల్, జల విద్యుత్ 2,300 మెగావాట్లు, సోలార్ ద్వారా 220 మెగావాట్ల వరకు రికార్డవుతోంది. నగరంలో సౌర విద్యుత్కు సంబంధించి మొత్తం 11,968 రూఫ్ టాప్ నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. మిద్దెలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు వీటి ద్వారా తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన విద్యుత్ను నెట్ మీటరింగ్ ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు సరఫరా చేస్తున్నారు. తద్వారా ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న విల్లా ప్రాజెక్టుల్లో అధికశాతం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. సోలార్ విద్యుత్ను అదనపు ఫెసిలిటీగా కస్టమర్లకు చూపుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ♦ మల్కాజ్గిరికి చెందిన శ్యామ్సుందర్ సింగ్ తన ఇంటిపై 6 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 30 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు పోను మిగిలిన విద్యుత్ను డిస్కంకు విక్రయిస్తున్నారు. ఒక్కసారి బిగిస్తే.. 25 ఏళ్ల పాటు ఉత్పత్తి గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లు, ఇతర రెసిడెన్షియల్ కాలనీలకు డిస్కం వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్ (హెచ్టీ) జారీ చేస్తుంది. ఆ తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని ఎవరికి వారు బిల్లులు చెల్లిస్తుంటారు. ఇందుకు ఆయా వినియోగదారుల నుంచి డిస్కం యూనిట్కు రూ.6.30 పైసల చొప్పున వసూలు చేస్తుంది. అదే వారి ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది. ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా ఉండదు. అంతేకాదు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 నుంచి 50 శాతం రాయితీ కూడా ఇస్తుంది. – బి.అశోక్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ -
సముద్రంలో ‘పవన విద్యుత్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే... సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన (విద్యుత్) ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించాల్సిన ఆవశ్యకతపై ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పటికే ఒక తీర్మానాన్ని కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తోపాటు పవన విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కొండలు, మైదాన ప్రాంతాల్లోనే పవన విద్యుత్ ప్లాంట్లు ఉండగా.. కొద్దికాలంగా సముద్రంలోనూ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2026 నాటికి దాదాపు 20 గిగావాట్లు పవన విద్యుత్ సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం... 2021లో ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ కొత్తగా 93.6 గిగావాట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకు చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను నివారించడంలో సహాయపడుతోంది. మన దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 6 %గా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 గిగావాట్ల ఆన్షోర్ విండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ, గాలి విస్తరణ వేగం మందగించడంతో ఉత్పత్తి ఆశించినంతగా ఉండటం లేదు. 2012–2016 మధ్య 13 శాతంగా ఉన్న వార్షిక పవన విద్యుత్ సగటు వృద్ధి రేటు... 2016–21 మధ్య 5 శాతానికి తగ్గింది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విశ్లేషణ ప్రకారం ఈ వృద్ధి రేటు రానున్న దశాబ్దంలో 15శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో సముద్రతీరంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. నిర్వహణకు సెన్సార్ సిస్టమ్ భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సముద్రంలో ఏర్పాటు చేసే విండ్ పవర్ టరై్బన్లను బ్లేడ్లు, ఫైబర్ గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తారు. వందల అడుగుల పొడవు, అనేక టన్నుల బరువు ఉంటాయి. బ్లేడ్ల అంచులలో పగుళ్లు, రంద్రాల వల్ల టరై్బన్ విఫలమై, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో వాటిని పర్యవేక్షించడానికి ధ్వని ఆధారిత సెన్సార్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా బ్లేడ్లో వైర్లెస్ మైక్రోఫోన్లను ఆమర్చుతారు. దీనివల్ల సమస్యను వెంటనే గుర్తించి బాగుచేసే వీలు కలుగుతుంది. అంతేకాదు ఈ టరై్బన్లు తీరానికి దూరంగా ఉంటాయి. కాబట్టి రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీని వాడతారు. ఇతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికే ప్రాచుర్యంలోకి రాగా, మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన, చవకైన సహజ వనరులను వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అందులో సముద్రతీర గాలి మన దేశ విద్యుత్ వ్యవస్థకు ప్రధానమైనదిగా మారుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్కు ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్విుషన్ సిస్టమ్ చార్జీల మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. -
ఇంటి అవసరాలకు.. ఆపై గ్రిడ్కు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల గృహాలకు సౌరవిద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్లో తమ గృహావసరాలకు పోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా వీరు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందేలా చూడొచ్చని, అలాగే, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించవచ్చని భావిస్తోంది. ఈ సౌర విద్యుత్ ఫలకలను బిగించుకునేందుకు డాబా ఇళ్లు ఉన్న ఎస్హెచ్జీ మహిళలను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోంది. ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆయా మహిళలకు స్త్రీ నిధి ద్వారా రుణాలను ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు కిలోవాట్ల యూనిట్లను మంజూరు చేయనుంది. దీనికి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి (టీఎస్రెడ్కో) నుంచి సబ్సిడీ వస్తుంది. మండలానికి 35 యూనిట్లు మొదట ఒక్కో మండలానికి 35 సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నారు. స్వయం సహాయక కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించే వారిని, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సభ్యులను వీటికి ఎంపిక చేస్తున్నారు. నెలకు 200–300 యూనిట్ల విద్యుత్ వాడుకునే వారు ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్ యూనిట్లకు నెట్ మీటర్లు బిగించి పవర్ గ్రిడ్కు అనుసంధానిస్తారు. సొంత అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్కు నిర్ణీత ధర చొప్పున గ్రిడ్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. విద్యుత్ను విక్రయించగా వచ్చే ఆదాయంతో సభ్యులు ఐదేళ్లలో రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 ఏళ్ల వరకు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయని, ఐదేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాం. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాన్ని స్త్రీనిధి ద్వారా అందించనున్నాం. సభ్యులు ఈ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అలాగే, వాడుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా నెలవారీ ఈఎంఐలు సులువుగా కట్టవచ్చు. –సీహెచ్ శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
సౌర కాంతులు: సోలార్ విద్యుత్పై పెరుగుతున్న ఆసక్తి
నెల్లూరు సిటీ: ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తున్న సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా ప్రజలు దృష్టి సారించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు, గృహ వినియోగంలో సోలార్ గ్రిడ్ సిస్టమ్పై ఆసక్తి పెరిగింది. భవిష్యత్లో తమ అవసరాలకు పోను మిగులు విద్యుత్ను విద్యుత్శాఖకు విక్రయించే అవకాశం ఉండడంతో దీనిపై దృష్టి సారిస్తున్నారు. ఇటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రాబడిని పెంచుకునేందుకు ఇదొక మార్గంగా ఉండడంతో రోజు రోజుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్స్ ఏర్పాటుకు ఆదరణ పెరుగుతోంది. గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్కు విద్యుత్ శాఖ సంపూర్తిగా సహకరిస్తోంది. సోలార్ను వినియోగించడం ద్వారా బొగ్గు వినియోగం, కాలుష్య సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో 60 కేడబ్ల్యూపీ గ్రిడ్ కనెక్ట్డ్ రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.32.50 లక్షలు ఖర్చు చేశారు. ప్రతి రోజూ 240 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ వినియోగం ఖర్చు అవుతోంది. నెలకు 7,200 కేడబ్ల్యూహెచ్ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి నెలా రూ.55,080 ప్రకారం ఏడాదికి రూ.6,60,960 ఖర్చు అవుతుంది. నెల్లూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నూనతంగా కార్పొరేషన్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ విద్యాసంస్థలు గీతాంజలి, నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయదారులు, విద్యాసంస్థలు, వ్యాపారస్తులు, ఇళ్లకు కలిపి దాదాపు 500 సోలార్ కనెక్షన్లు ఉన్నాయి. సోలార్లో రెండు రకాలు సోలార్లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ రెండు రకాలు ఉన్నాయి. వినియోగదారుడు తనకు రెండింట్లో ఏది అవసరమో దానిని వినియోగించుంటారు. రెండింటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు, పూర్తిగా రాకుండా ఉండేందుకు ఉపయోగ పడుతుంది. వినియోగదారుడు తన ఇంటికి ఎంత అవసరమో ఆ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంది. సోలార్ గ్రిడ్లు ఒక కిలోవాట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఒక కిలో వాట్కు రోజుకు 4 యూనిట్లు విద్యుత్ తయారు అవుతుంది. ß ఆన్గ్రిడ్ సిస్టమ్: ఆన్గ్రిడ్ సోలార్ ప్యానల్స్ ఏర్పా టు చేసుకోవడం ద్వారా సూర్యరస్మి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు కనెక్ట్ చేసుకోవాలి. తయారైన విద్యుత్ను గ్రిడ్ నుంచి ఉపయోగించుకోవచ్చు. కరెంట్ మీటర్కు కనెక్ట్ చేయడం ద్వారా ఎంత వరకు విద్యుత్ను వినియోగిస్తామో, అంత వరకు గ్రిడ్ ద్వారా తీసుకుని, మిగిలినది విద్యుత్ శాఖకు విక్రయించవచ్చు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్: ఇది బ్యాటరీని రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇంట్లో విద్యుత్ వినియోగ వస్తువులకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్వర్ట్లా పని చేస్తుంది. మూడేళ్ల నుంచి వినియోగిస్తున్నాను.. ప్రతి నెలా నాకు రూ.1500 నుంచి రూ.2000 విద్యుత్ బిల్లు వచ్చేది. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెల్ను పెట్టుకున్నాను. ప్రతి రోజూ 12 యూనిట్లు కరెంట్ తయారవుతుంది. నెలకు 250 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాను. మిగిలిని విద్యుత్ను విద్యుత్శాఖకు విక్రయిస్తున్నాను. మూడేళ్ల నుంచి సోలార్ను వినియోగిస్తున్నాను. – వీ సుధాకరన్, ఉస్మాన్సాహెబ్పేట రూ.6 వేల విద్యుత్ బిల్లు ఆదా నాకు దుస్తుల దుకాణం ఉంది. నేను ఇటీవల సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేసుకున్నాను. నా దుకాణానికి ప్రతి నెలా రూ.6 వేల విద్యుత్ బిల్లు వచ్చేది. వ్యాపారస్తులు సోలార్ను వినియోగించడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. – రాజీవ్, వస్త్ర వ్యాపారి, కావలి 50 కిలో వాట్స్ ఇన్స్టాలేషన్ చేశాను నేను రెండేళ్లుగా సోలార్ ఇన్స్టాలేటర్గా ఉన్నాను. ఇప్పటి వరకు 50 కిలో వాట్స్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశాను. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని సోలార్ను వినియోగించాలి. భవిష్యత్లో విద్యుత్ ధరలను తగ్గించుకునేందుకు సోలార్ సిస్టం ఉపయోగపడుతోంది. – పీ శ్రావణ్, సోలార్ ఇన్స్టాలర్ ఐదు రకాలు 1. సోలార్ వాటర్ హీటర్ 2. సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్ 3. సోలార్ ఫెన్సింగ్ ఫర్ అగ్రికల్చర్ 4. సోలార్ స్ట్రీట్ లైట్ 5. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ సోలార్ వాటర్ హీటర్: చల్లటి నీటిని వేడినీళ్లుగా మార్చే సాధనాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. 100 లీటర్ల సోలార్ వాటర్ హీటర్ నుంచి 10 వేల లీటర్లకు పైగా వేడి చేసేందుకు వీలు ఉంటుంది. సోలార్ అగ్రికల్చర్ మోటర్: విద్యుత్ శాఖ రాత్రి సమయాల్లోనే వ్యవసాయానికి విద్యుత్ను అందజేస్తున్నారు. పగలు సమయంలో ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు అధికంగా విద్యుత్ను వాడడం ద్వారా కరెంట్ సమస్య ఉంది. అయితే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్తో పగటి పూట మోటార్స్ను వినియోగించవచ్చు. సోలార్ ఫెన్సింగ్: రైతులకు తమ పొలాల్లో ఇతర జంతువులు దాడి నుంచి తప్పించుకునేందుకు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్ను వినియోగిస్తుంటారు. రైతులు పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న సమయంలో కరెంట్ లేని సమయాల్లో పొలంలోకి ఇతర జంతువులు దాడి చేసే అవకాశం ఉంది. సోలార్ను వినియోగించడం ద్వారా 24 గంటలు రక్షణ కవచంగా మారుతుంది. సోలార్ స్ట్రీట్ లైట్: ప్రభుత్వాలు ఇప్పటికే రోడ్లు డివైడర్లకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ను ఆదా చేసేందుకు కొన్ని ప్రధాన రోడ్లలో సోలార్ స్ట్రీట్ లైట్స్ను వినియోగిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సోలార్ స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం సమయాల్లో విద్యుత్ను స్టోరేజ్ చేసుకుని రాత్రి సమయాల్లో వినియోగించుకుంటుంది. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ: సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవ చ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, విద్యుత్ బిల్లులు కట్టాలనే సమస్య లేకుండా ఉండొచ్చు. -
భలే మంచి చౌక బేరము
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను సాధించడం కోసం రూఫ్టాప్ సోలార్ యోజన స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద 3 కిలోవాట్ల రూఫ్టాప్కు దాదాపు రూ.43 వేల వరకూ సబ్సిడీ అందించనుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్తో ఇంట్లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైన వాటిని నడపవచ్చు. దీని కోసం నెలనెలా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగులు విద్యుత్ను ఇంల్లో అద్దెకున్న వారికి, పొరుగింటి వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అదనపు చార్జీలతో పనిలేదు సోలార్ ప్యానెల్స్ను అమర్చడానికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించవద్దని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఏ కంపెనీకి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని గృహ విద్యుత్ వినియోగదారులకు సూచించింది. ఎవరైనా అదనపు రుసుము కోరితే ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది. సబ్సిడీ మినహాయించి చెల్లిస్తే చాలు ఒక కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఎన్ని కిలోవాట్లు పెట్టాలనుకుంటే అన్ని వందల చదరపు అడుగులు అవసరం. బెంచ్మార్క్ ధరలపై సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సీఎఫ్ఏ) 3 కిలోవాట్ల వరకూ 40 శాతం, 3 కిలోవాట్లపైన 10 కిలోవాట్ల కంటే ఎక్కవ సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలపై 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్కు అయ్యే రూ.50 వేల ఖర్చులో రూ.18,800 సబ్సిడీ వస్తుంది. అదే 10 కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.4.40 లక్షల్లో రూ.1,06,600 సబ్సిడీ లభిస్తుంది. వీటికి తోడు దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1,000, ఆ పైన రూ.5 వేల చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ మేరకు నగదును తగ్గించుకుని సంబంధిత ఏజెన్సీకి మిగతా ధర చెల్లిస్తే సరిపోతుంది. అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్లకు 20 శాతం మాత్రమే సీఎఫ్ఏ వస్తుంది. -
ఎస్జేవీఎన్ గ్రీన్కు రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్యూ కంపెనీ ఎస్జేవీఎన్ గ్రీన్ ఎనర్జీకి రుణాలందించేందుకు ఇండియన్ రెనువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా రాజస్తాన్లోని బికనీర్లో కంపెనీ ఏర్పాటు చేయనున్న 1,000 మెగవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు రూ. 4,445 కోట్ల రుణాలను సమకూర్చనుంది. ఇది ఎస్జేవీఎన్ లిమిటెడ్కు అనుబంధ సంస్థకాగా.. రుణ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఐఆర్ఈడీఏ డీజీఎం ప్రదీప్త కుమార్ రాయ్, సీఈవో ఎస్ఎల్ శర్మ పేర్కొన్నారు. ఎస్జేవీఎన్ సీఎండీ నంద్ లాల్ శర్మ, ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ సమక్షంలో సంస్థ చరిత్రలోనే గరిష్ట రుణ విడుదలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
45 రోజుల్లో రూ.1,550 కోట్లు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) షాక్ ఇచి్చంది. సౌర విద్యుత్ విక్రేత కంపెనీలకు రూ. 1,550 కోట్లకుపైగా బకాయిలను 45 రోజుల్లో చెల్లించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/టీఎస్ఎనీ్పడీసీఎల్)లను వేర్వేరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇప్పటివరకు బకాయిపడిన మొత్తం బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కంపెనీలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం ఇకపై ఎప్పటికప్పుడు వాటికి చెల్లింపులు జరపాలని ఆదేశించింది. నెలలు, ఏళ్లు గడుస్తున్నా డిస్కంలు బిల్లులు చెల్లించకపోవడంతో పలు కంపెనీలు ఈఆర్సీని ఆశ్రయించి తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలతో ఏకీభవించిన ఈఆర్సీ.. ఆయా కంపెనీలకు 45 రోజుల్లోగా మొత్తం బకాయిలను అపరాధ రుసుం (లేట్ పేమెంట్ సర్చార్జీ)తో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేవాంగరే షుగర్ కంపెనీ కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్రి్టసిటీ (ఏపీటెల్) 2009లో జారీ చేసిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకుంది. సకాలంలో బకాయిలను చెల్లించకపోవడం పీపీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలను చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా అరుదని డిస్కంల అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొండలా పెరిగిపోయిన బకాయిలు... రాష్ట్ర డిస్కంలు దాదాపుగా 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సౌర విద్యుత్ కేంద్రాల డెవలపర్లతో గత ఐదారేళ్ల కింద ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన విద్యుత్కు సంబంధించిన బిల్లులను జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలు సౌర విద్యుత్ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతున్నాయి. రెండు, మూడేళ్ల నాటి బిల్లులను సైతం కొన్ని కంపెనీలకు బకాయిపడటంతో వాటిపై అపరాద రుసుం భారీగా పెరిగిపోతోంది. అసలు బిల్లులు, అపరాద రుసుములు కలిపి మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోవడంతో డిస్కంలు సతమతమవుతున్నాయి. బకాయిల కోసం పలు సౌర విద్యుత్ కంపెనీలు కేంద్ర విద్యుత్ శాఖకు ఫిర్యాదు సైతం చేశాయి. ఈ నేపథ్యంలోనే పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రం విద్యుత్ కొనుగోళ్లు జరపకుండా కేంద్రం ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంపై నిషేధం విధించింది. తాజాగా ఈఆర్సీ సైతం 45 రోజుల్లోగా మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని ఆదేశించడం గమనార్హం. చదవండి: వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు? -
గోల్డి సోలార్ రూ.5,000 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో ఉన్న గోల్డి సోలార్ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.5,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. మాడ్యూల్స్, సెల్స్, ముడి పదార్థాల తయారీ సామర్థ్యాలతో సమీకృత కంపెనీగా మారాలని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్లో కొత్త సెల్ తయారీ కేంద్రం వచ్చే ఏడాది అందుబాటులోకి రానుందని గోల్డి సోలార్ ఎండీ ఐశ్వర్ ధోలాకియా తెలిపారు. ‘తద్వారా సెల్ ఉత్పత్తి సామర్థ్యం 5 గిగావాట్లకు చేరుకుంటుంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
జలాశయాలపై భారీగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, లోయర్ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో ఫ్లోటింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్లో సింగరేణి సంస్థలు తమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సమస్య తప్పుతుంది! భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
కడప నగరంలో సౌరకాంతులు.. రూ.113.46 కోట్లతో..
సాక్షి, కడప: జిల్లా కేంద్రమైన కడప నగరంలో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. రూ.113.46కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆ ప్లాంటు నిర్మాణానికి అవసరమయ్యే 95 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప నగరం చిన్నచౌకు గ్రామ పొలంలో 1151 నుంచి 1159 వరకూ ఉన్న సర్వేనంబర్లలో ఈ 95 ఎకరాల భూమి ఉంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పంపింగ్ ఇతర అవసరాల కోసం కడప నగరపాలక సంస్థ ప్రతినెలా సుమారు రూ.2కోట్ల మేర విద్యుత్ చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. తద్వారా ఒక ఏడాదికి రూ.24కోట్లు కరెంటు చార్జీలకే పోతోంది. కార్మికుల జీతాలు, కరెంటు చార్జీలకే సాధారణ నిధులన్నీ ఖర్చయి పోతుండటంతో నగరంలో అభివృద్ధి పనులు చేసేందు కు నిధులు మిగలడం లేదు. అధిక భారంగా మారిన కరెంటు చార్జీలను ఆదా చేసేందుకు నగర మేయర్ సురేష్బాబు, డిప్యూటీ సీఎం అంజద్బాషాల ఆధ్వ ర్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. నగరపాలక సంస్థకు ప్రతి సంవత్సరం సుమారు 3కోట్ల యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. దానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్కు చెందిన ది సిస్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారు 17 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఆరు సంవత్సరాల(72 నెలలు)పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. ఈ ఆరేళ్లలో వీధిదీపాలు, మోటార్లు, తాగునీటి సరఫరా, పంపింగ్ వంటి వాటన్నింటికీ సోలార్ పవర్నే వినియోగించనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ భూమిని కేటాయించడంతోపాటు 72 నెలలపాటు రూ.1.50కోట్ల చొ ప్పున ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతినెలా కరెంటు చార్జీల రూపేణా కార్పొరేషన్ విద్యుత్ శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆరేళ్ల తర్వాత అనగా నెలవారీ చెల్లింపులు పూర్తయిన పిమ్మట ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థ సొంతమవుతుంది. ఒకవేళ ప్రాజె క్టు నిర్వహణ, ఆపరేషన్ కా లం పెంచవలసి వస్తే అందుకు తగిన సర్వీసు చార్జీలను నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం కడప నగరపాలక సంస్థకు ప్రతినెలా వస్తున్న కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి సోలార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి భూమి కేటాయించడం శుభ పరిణామం. ప్రతినెలా కార్పొరేషన్ కరెంటు చార్జీల కింద విద్యుత్శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఆ పవర్ ప్రాజెక్టుకు చెల్లిస్తాం. ఆరేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థకు సొంతమై కరెంటు చార్జీలు మిగులుతాయి. అతి త్వరలోనే దీని పనులు ప్రారంభించి పూర్తి చేసేలా కృషి చేస్తాం. ఈ ప్రాజెక్టు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – కొత్తమద్ది సురేష్బాబు, మేయర్, కేఎంసీ -
వైర్లు లేకుండా విద్యుత్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త సాంకేతికత వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతానికి కొంచెం వింతగా అనిపించినా భవిష్యత్తులో సాధారణంగా మారే అవకాశం ఉన్న సరికొత్త పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న అలాంటి కొన్ని సరికొత్త వాస్తవాలను పరిచయంచేసే ప్రయత్నమే ఈ వారం సండే స్పెషల్. వైర్లెస్ విద్యుత్.. ప్రస్తుతం మనకు వైర్లెస్ ఇంటర్నెట్ గురించి తెలుసు. కానీ, వైర్లెస్ కరెంటు గురించి తెలీదు. త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్లెస్ కరెంట్ అందుబాటులోకి రాబోతోందని దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. 30 మీటర్ల దూరం వరకూ ఇన్ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి, 400 మిల్లీవాట్ల వైర్లెస్ విద్యుత్తో ఎల్ఈడీ లైటును వెలిగేలా చేశారు. ట్రాన్స్మీటర్, రిసీవర్ ద్వారా ఈ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్ సేఫ్ మోడ్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరగవని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు.. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్హోమ్స్ లేదా పెద్దపెద్ద షాపింగ్ మాల్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్ను అందించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇసుకతో బ్యాటరీ.. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఇసుకతో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీనిలో ఒకసారి గ్రీన్ పవర్ను స్టోర్చేస్తే నెలవరకూ నిల్వ ఉంటుంది. సౌర, పవన విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీని ఏడాది పొడవునా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ఈ తాజా బ్యాటరీ పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్ను ఉష్ణం రూపంలో 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దీనిలో నిల్వచేయొచ్చు. సోలార్, పవన విద్యుత్ను గ్రిడ్లతో అనుసంధానించవచ్చు. కానీ, రాత్రివేళ, గాలి లేనప్పుడు విద్యుదుత్పత్తి జరగదు. ఈ సమస్యను పెద్దపెద్ద బ్యాటరీలతో పరిష్కరించవచ్చు. ప్రస్తుతం చాలావరకు బ్యాటరీలను లిథియంతోనే తయారుచేస్తున్నారు. ఇది చాలా ఖరీదైన లోహం. ఫిన్లాండ్ ఇంజినీర్లు ఇసుకతో తయారుచేసిన బ్యాటరీలో తక్కువ ఖర్చుతో విద్యుత్ నిల్వచేయగలిగారు. అమెరికాలోని నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లే»ొరేటరీ కూడా ఇసుకను హరిత ఇంధనంగా భావించి పరిశోధనలు చేపట్టింది. రాత్రిపూటా సోలార్ విద్యుత్ రాత్రిపూట కూడా విద్యుత్ను ఉత్పత్తిచేసే సోలార్ ప్యానెల్ను కాలిఫోరి్నయాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. ఇప్పుడు మనం చూసే సోలార్ ప్యానెల్ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దానికి సూర్యకాంతి అవసరం. కానీ.. కొత్త ప్యానెల్స్తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాకప్ నుంచి పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. రాత్రిపూట విద్యుదుత్పత్తి కోసం ఇంజనీర్లు థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ను రూపొందించారు. ఈ జనరేటర్ సోలార్ ప్యానెల్, గాలి, ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని విద్యుత్గా మారుస్తుంది. ఎన్నెన్నో ప్రయోగాలు.. ఇక గాలిపటాలతో విద్యుత్ను పుట్టించే టెక్నాలజీని స్కాట్లాండ్కు చెందిన రాడ్ కనిపెట్టారు. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆయన ఆవిష్కరించారు. గాలి పటాలు తిరుగుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్గా మారుస్తుంది. మరోవైపు.. బ్రిటన్లోని ఒక నైట్క్లబ్ తమ క్లబ్కు వచ్చి డ్యాన్స్ చేసే కస్టమర్ల శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారుచేస్తోంది. ‘బాడీహీట్’ పేరుతో ఇలా తయారుచేసిన విద్యుత్ను నిల్వచేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా ఏర్పాటు కూడా చేసింది. పలు దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ సముద్ర అలలతో విద్యుదుత్పత్తి చేసే అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది. ఇటీవల మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను స్థాపించారు. ఇక బొగ్గు కొరత నుంచి బయటపడేందుకు బ్లూ హైడ్రోజన్ ప్రత్యామ్నాయమని జపాన్ భావిస్తోంది. అమ్మోనియానుగానీ, హైడ్రోజన్ను గానీ మండించడం ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ బ్లూ హైడ్రోజన్ విధానం. జపాన్లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్తో వాహనాలను ఆ దేశం ప్రయోగాత్మకంగా నడిపింది. -
పవర్ ఎవర్ 'గ్రీన్'
సాక్షి, అమరావతి: విద్యుత్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి స్మార్ట్గా ఆలోచించారు. సోలార్.. సో బెటర్ అని భావించారు. గ్రీన్ పవర్.. ఎవర్ గ్రీన్... అని విశ్వసించి తన ఐదు అంతస్తుల భవనం గోడలకు సౌర ఫలకాలను అమర్చారు. భవనాన్ని సోలార్ ప్యానల్ ఎలివేషన్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరూ భవనాలపై రూఫ్టాప్ సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఆయన దానికి భిన్నంగా గోడలకు నిలువుగా ప్యానల్స్ను అమర్చారు. ఫుల్ ఎకో గ్రీన్ హోటల్గా రికార్డు సృష్టించారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలోని గురుద్వార జంక్షన్ వద్ద ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో అన్నె నారాయణరావు (బాబ్జి) అనే వ్యాపారి నిర్మించిన ఈ భవనం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయంగా.. ఆదర్శవంతంగా... ఐదు అంతస్తుల భవనానికి సోలార్ ప్యానళ్లను నిలువుగా అమర్చడంతో అద్భుత డిజైన్లా కనిపిస్తుంది. ఈ భవనం ఆకర్షణీయంగా, అందరికీ ఆదర్శంగా కూడా ఉంది. భవనం ఎలివేషన్ కోసం నలుపు రంగు అద్దాలకు బదులుగా దాదాపు 200 సోలార్ ప్యానళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్స్ రోజుకు దాదాపు 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. నెట్ మీటరింగ్ ద్వారా భవనానికి అవసరమైన 40శాతం విద్యుత్ వినియోగించుకుంటారు. మిగిలిన విద్యుత్ను యూనిట్ను రూ.6 చొప్పున ఏపీఈపీడీసీఎల్ ద్వారా గ్రిడ్కు విక్రయిస్తారు. రాత్రి వేళ భవన అవసరాలకు గ్రిడ్ నుంచి కరెంటు తీసుకుంటారు. ఈ భవనానికి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ.45 లక్షలు ఖర్చయినట్లు యజమాని బాబ్జి ‘సాక్షి’కి తెలిపారు. తాము వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఎనిమిదేళ్లలో పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. భవనం పైన మరో 70 సోలార్ పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా... దేశం మొత్తం విద్యుత్ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువగా భవనాల్లోనే ఉంటుంది. ముంబైలోని ఓ డేటా సెంటర్లో దాదాపు ఒక మెగావాట్ సామర్థ్యం గల దేశంలోనే అతిపెద్ద బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ వర్టికల్ సోలార్ సిస్టంను 2019లో ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంలోనే తొలిసారిగా ఈ తరహాలో ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో ఒక హోటల్ నిర్మించారు. ఇక్కడ 15 రోజుల కిందట విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని యజమాని బాబ్జి తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు సంప్రదాయ గాజు అద్దాల స్థానంలో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు సూర్య కిరణాలను నిరోధించి థర్మల్ ఇన్సులేషన్ తరహాలో పనిచేస్తాయి. దీనివల్ల ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. గాజు వినియోగం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించవచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మాదే తొలి గ్రీన్ బిల్డింగ్ ‘పర్యావరణాన్ని కాపాడటంతోపాటు విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం కోసం ఎంతో శ్రమించి భవనం మొత్తం సోలార్ పలకలతో నిర్మించాం. భవనం రూఫ్టాప్ మీద కూడా సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలోనే మాది తొలి గ్రీన్ బిల్డింగ్ అని భావిస్తున్నాం. ఈ మేరకు సర్టిఫికెట్ పొందడం కోసం విశాఖ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేశాం.’ –బాబ్జి, భవన యజమాని, విశాఖపట్నం -
సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. 2015లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 279 మెగావాట్లు కాగా, ఇప్పుడది 4,390.48 మెగావాట్లకు చేరింది. 2020లో రాష్ట్రంలో స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 3,744 మెగా వాట్లుగా ఉంది. 2021లో దేశంలో 10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపిస్తే.. అందులో 50 శాతం ఏపీ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్టు అధ్యయనంలో వెల్లడైంది. చదవండి: బల్క్ డ్రగ్స్ పార్క్పై టీడీపీ విషం.. ఏపీకి పెట్టుబడులు అడ్డుకునేందుకు కుట్ర సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరగడంతో 2021–22 చివరి నాటికి 4,148.91 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుత 2022–23 ఆరి్థక సంవత్సరంలో ఇప్పటికే సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 241.57 మెగా వాట్లు అదనంగా పెరిగింది. ఒక్కో మెగావాట్ నుంచి ఏటా సగటున దాదాపు 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో (జనవరి–జూన్) 47.64 బిలియన్ యూనిట్ల సౌర విద్యుదుత్పత్తి జరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మొదటి త్రైమాసికం) 22.22 బిలియన్ యూనిట్లుండగా, రెండో త్రైమాసికం(ఏప్రిల్, మే, జూన్)లో 25.41 బిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. అంటే తొలి త్రైమాసికం కంటే 14 శాతం పెరుగుదల రెండో త్రైమాసికంలో వచ్చింది. అదే 2021లో ఇదే సమయానికి జరిగిన ఉత్పత్తితో పోల్చితే 40 శాతం పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2030 నాటికి థర్మల్ విద్యుత్ను 32 శాతానికి తగ్గించాలని, కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నాకు తేవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీని కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపుతోంది. 2024 నాటికి అందరూ ఏపీనే అనుసరించాలని, వ్యవసాయానికి సౌర విద్యుత్నే వాడాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజాగా సూచించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పర్యావరణ హితంగా విద్యుదుత్పత్తి సాధించగల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులను స్థాపిస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను రైతన్నకు హక్కుగా అందించాలని నిర్ణయించింది. దాని కోసం ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కోసం ఒప్పందం చేసుకుంది. – విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
దేశంలో రికార్డ్ స్థాయిలో సౌర వెలుగులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్ ఇండియా రిసర్చ్ తెలిపింది. భారత సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్–జూన్లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది. 2022 జనవరి–జూన్లో, అలాగే జూన్ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. ఏప్రిల్–జూన్లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్ 1 నుంచి సోలార్ మాడ్యూల్స్పై 40, సోలార్ సెల్స్పై 25 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. చదవండి: మా రేంజ్ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన -
ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇంటికి కరెంటు అక్కర్లేదు. అదేంటి ఇల్లన్నాక కరెంటు లేకుండా ఎలా అనుకుంటున్నారా? నిజంగానే, ఈ ఇంటికి కరెంటు అక్కర్లేదు. తనకు కావలసిన కరెంటును ఈ ఇల్లు తనంతట తానే తయారు చేసుకుంటుంది. నిజానికి కావలసినంత కాదు, అవసరానికి మించినంత కరెంటునే తయారు చేసుకుంటుంది. పైకప్పు మీద అమర్చిన సౌర ఫలకాల ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది. అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కాస్మిక్ బిల్డింగ్స్’ కస్టమర్ల అవసరాల మేరకు ఇలాంటి ‘సెల్ప్ పవర్డ్’ ఇళ్లను రూపొందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో గృహనిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ, 450 చదరపు అడుగుల కనీస విస్తీర్ణం మొదలుకొని, రకరకాల పరిమాణాల్లో పొందికైన ఇళ్లను నిర్మిస్తోంది. ఇలాంటి ఇళ్లు విరివిగా తయారయ్యేటట్లయితే, కరెంటు కొరత సమస్య ఉండనే ఉండదు. చదవండి: అక్కడ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. పిల్లల్ని తీసుకెళ్లి బయట వదిలేస్తారు! ఎందుకంటే -
అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం!
బీజింగ్: సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా తలపోస్తోంది. ఇందుకోసం అంతరిక్షంలోనే సౌర విద్యుత్కేంద్రం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది మరో ఆరేళ్లలో పూర్తవుతుందట! ఈ సోలార్ స్పేస్ స్టేషన్లో విద్యుత్, మైక్రోవేవ్లను ఉత్పత్తి చేయనున్నారు. దీనిద్వారా కృత్రిమ ఉపగ్రహాల విద్యుత్ అవసరాలను తీర్చగా మిగిలే విద్యుత్ను కాంతి పుంజం (సోలార్ బీమ్) రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తారు. భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఒడిసిపట్టి కరెంట్ రూపంలో నిక్షిప్తం చేస్తాయట. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. -
టొరెంట్ పవర్ చేతికి స్కైపవర్ సోలార్ ప్లాంటు
న్యూఢిల్లీ: స్కైపవర్ గ్రూప్నకు తెలంగాణలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంటు (ఎస్పీవీ) కొనుగోలు చేసినట్లు టొరెంట్ పవర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 416 కోట్లు. స్కైపవర్ గ్రూప్ సౌత్ఈస్ట్ ఏషియా ఐఐఐ ఇన్వెస్ట్మెంట్స్, స్కైపవర్ సౌత్ఈస్ట్ ఏషియా హోల్డింగ్స్ 2 లిమిటెడ్, సన్శక్తి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ (ఎస్పీవీ)తో ఒప్పందం ప్రకారం 50 మెగాావాట్ల సోలార్ పవర్ ప్లాంటును కొనుగోలు చేసినట్లు టోరెంట్ పవర్ వివరించింది. కిలోవాట్ అవర్కు సుమారు రూ. 5.35 రేటు చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (ఎన్పీడీసీటీఎల్)తో ఎస్పీవీకి ఒప్పందం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ టొరెంట్ పవర్ మొత్తం విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 4.1 గిగావాట్లుగా ఉంది. తాజాగా మరో సోలార్ పవర్ ప్లాంటు కొనుగోలుతో ఇది 4.7 గిగావాట్లకు చేరినట్లయ్యింది -
రాత్రిపూటా సౌర విద్యుత్!
థర్మల్ విద్యుత్తో కాలుష్యం.. జల విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉండదు.. ప్రత్యామ్నాయంగాసౌర విద్యుత్ ఉన్నా.. సోలార్ ప్యానెల్స్తో పగటి పూట మాత్రమే కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు చెక్పెట్టేలా.. పగలూరాత్రీ కూడా విద్యుత్ను ఉత్పత్తి చేశారు. రెండు సాంకేతికతలను కలిపి.. సాధారణంగా సౌర ఫలకాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్గా మార్చుతాయి. దీనిని ఫొటో వోల్టాయిక్ టెక్నాలజీ అంటారు. మరోవైపు కొన్నిరకాల పదార్థాలు తాము గ్రహించిన వేడిని తిరిగి వదిలేసే సమయంలో శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాయి. దీనిని థర్మోరేడియేటివ్ ప్రాసెస్ అంటారు. సాధారణ ఫొటో వోల్టాయిక్ పదార్థాలతో థర్మోరేడియేటివ్ మెటీరియల్ను కలిపి.. సోలార్ ప్యానెల్స్ను తయారు చేస్తే.. సూర్యరశ్మి తగ్గిన సమయంలో, రాత్రి పూట కూడా విద్యుత్ను ఉత్పత్తి చేయగలవని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫోబి పియర్స్ తెలిపారు. నైట్ విజన్ గాగుల్స్ తరహాలో.. సైన్యం, రక్షణ విభాగాల సిబ్బంది రాత్రిపూట కూడా చూడగలిగే ఇన్ఫ్రారెడ్ (పరారుణ) నైట్ విజన్ గాగుల్స్ను, ఇతర పరికరాలను వినియోగిస్తుంటారు. స్వల్పస్థాయి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కు కూడా స్పందించే ‘మెర్క్యురీ కాడ్మియం టెల్లూరైడ్ (ఎంసీటీ)’ మెటీరియల్ వాటిలో ఉంటుంది. ఏదైనా సరే.. వేడిగా ఉన్న వస్తువు, పదార్థం నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెలువ డుతూ ఉంటుంది. ఇదే తరహాలో చీకట్లో కూడా మనుషులు, జంతువులు, ఎలక్ట్రిక్, మెకానికల్ పరికరాల నుంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను నైట్ విజన్ పరికరాలతో గుర్తిస్తారు. ►తాజాగా శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్నే ఫొటో వోల్టాయిక్ సెల్స్తో అనుసంధానించి సోలార్ ప్యానెల్ను రూపొందించారు. దీనిని ఇటీవలే ప్రయోగాత్మకంగా పరిశీలించామని.. అయితే స్వల్పస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్త ఫోబి పియర్స్ వెల్లడించారు. ఈ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేయగలమన్నది స్పష్టమైందని.. దీనిని మెరుగుపర్చి సాధారణ వినియోగానికి తగినట్టుగా సిద్ధం చేయడం అసలు లక్ష్యమని తెలిపారు. ఈ సాంకేతికతతో కేవలం సోలార్ ప్యానెల్స్తో మాత్రమేకాకుండా.. వేడి వెలువడే ఏ చోట అయినా విద్యుత్ ఉత్పత్తికి వీలవుతుందని పేర్కొన్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వినూత్న విద్యుత్.. పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతతో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అధునాతన రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ప్రైౖవేటు సెక్టర్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ ఇటువంటి ప్రాజెక్టునే స్థాపిస్తోంది. 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. దీని కోసం కేవలం ఒక టీఎంసీ నీరు సరిపోతుంది. ఇలా ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే ఇది పెద్దది. ఈ నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల సాంకేతికత, వాటి ప్రయోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉత్పత్తి చేస్తుంది.. నిల్వ చేస్తుంది పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ (పీఎస్హెచ్) ఒక రకంగా జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. వీటి మధ్య టర్బైన్ల గుండా నీరు ఒకదాని నుండి మరొక దానికి (డిశ్చార్జ్) కదులుతున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది శక్తిని నిల్వ చేయగలదు, అవసరమైనప్పుడు దానిని విడుదల చేయగలదు. ఎగువ రిజర్వాయర్ (రీచార్జ్) లోకి నీటిని తిరిగి పంప్ చేస్తున్నందున దానికి అవసరమైన విద్యుత్ను అందించానికి పీఎస్హెచ్ ఒక పెద్ద బ్యాటరీలా పనిచేస్తుంది. రెండు విధాల పని ఈ విద్యుదుత్పత్తి కేంద్రాలు జలాశయాల్లోని నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఎక్కువ నీరు అవసరం ఉండదు. విద్యుత్ ఉత్పత్తికి ఎగువ జలాశయం నుండి జనరేటర్ని తిప్పే టర్బైన్ల ద్వారా నీరు ప్రవహించి, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్లోకి నీటిని తిరిగి పంప్ చేయడానికి టర్బైన్లు వెనుకకు తిరుగుతాయి, అప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా రెండు విధాలా ఉపయోగకరంగా ఉంటాయి. హైడ్రో పవర్తో ఇవీ ప్రయోజనాలు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకాల ద్వారా విద్యుత్ను సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందికి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తక్కువ గాలి, సూర్యరశ్మి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభదాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ ప్లాంట్లు సామర్థ్యంలో 82 శాతం వరకు పని చేస్తాయి. 80 సంవత్సరాలకంటే ఎక్కువ జీవితకాలం దీని అదనపు ప్రయోజనం. సౌర విద్యుత్ సూత్రమిది ప్రపంచంలో ఒక సంవత్సరం ఉపయోగించే విద్యుత్ కంటే ఒక గంటలో వెలువడే సౌర శక్తి ఎక్కువ. కానీ అంత విద్యుత్ను మనం వినియోగించుకోలేము. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సోలార్ పానెల్లోని ఫొటో వోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలక్ట్రాన్లుగా మార్చి విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక్కో మాడ్యూల్ ఒకటిన్నర చదరపు మీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. అది 40–60 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 4–12 శాతం లాస్ అవుతుంది. గాలి చేసే మేలు పవన విద్యుత్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మూడు రెక్కలు గల గాలి మరను దీనికోసం వాడుతుంటారు. మన పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందు నుంచీ నావలను నడపడానికి, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్ శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తో పోలిస్తే తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు. సౌర విద్యుత్తో మరింత ఉపయోగం భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల విద్యుత్ సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగెళ్లిపోతాయి. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్ను హీట్ ఇంజన్ (ఉష్ణోగ్రత భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది)ల నుంచి, ఫొటో వోల్టాయిక్ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. చిన్న, మధ్య తరహా అవసరాల కోసం మొదట్లో ఫోటో వోల్టాయిక్స్నే వాడేవారు. ఆ తరువాత వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ప్లాంట్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో లక్షలకొద్దీ సౌర ఫలకాలు విద్యుత్ గ్రిడ్లో భాగం కావడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఫొటో వోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడలో ఉంది. ఇది ఏటా 2,050 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. -
రాబోయే రోజుల్లో ఆ రంగంలో 80 వేల మెగావాట్ల విద్యుత్!
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్య వేధిస్తోంది. మరోవైపు కర్బణ ఉద్ఘారాలు తగ్గించాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండింటికి విరుగుడుగా కాలుష్య రహితంగా గ్రీన్ ఎనర్జీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రోజుల్లో 50,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, విండ్ పవర్ ద్వారా 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ ఇంజనీరింగ్ కంపెనీలో చర్చిస్తున్నట్టు తెలిపింది. -
సోలార్ పవర్లో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ఈ రంగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి భారత్ చేరగా.. మన దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. మెర్కామ్ ఇండియా తాజా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2021లో మన దేశం రికార్డు స్థాయిలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించింది. దీన్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 2020లో దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెరుగుదల 3.2 గిగావాట్లు మాత్రమే ఉంది. అంటే 2020తో పోలిస్తే 2021లో పెరుగుదల 210 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్ 2021 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 49 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరిగాయి. ఇవి రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పునరుత్పాదక రంగంలో మొదటి మూడు రాష్ట్రాలుగా ఇవి నిలిచాయి. కోవిడ్–19 కారణంగా 2020లో నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు 2021లో స్థాపించడంతో ఇది సాధ్యమైంది. ఎదురవుతున్న సవాళ్లు మనదేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌరశక్తిలో ఐదో స్థానంలో, పవన విద్యుత్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మనదేశం ఈ ఏడాది 175 గిగావాట్ల ఇన్స్టలేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనుకుంటోంది. అయితే కస్టమ్స్ సుంకం, దిగుమతుల్లో ఎదురవుతున్న పరిమితులు, గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు, అధిక జీఎస్టీ.. తదితర అంశాల్లో పునరుత్పాదక విద్యుత్ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. -
‘సౌర విద్యుత్’లో ఏపీ మరో ఘనత
సాక్షి, అమరావతి: సోలార్ పార్కుల అభివృద్ధికి రూ.580.80 కోట్లు కేటాయించి దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సౌర విద్యుత్ స్థాపిత సామర్ధ్యంలో దేశంలోనే మూడో అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మెర్కామ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 2021 డిసెంబర్ చివరి నాటికి క్యుములేటివ్ యుటిలిటీ స్కేల్ సోలార్ ఇన్స్టలేషన్లు 41.5 గిగావాట్లుగా ఉన్నాయి. డిసెంబరు 2021 నాటికి 8.9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో యుటిలిటీ స్కేల్ సోలార్ ప్రాజెక్ట్లలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక 7.5 గిగావాట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 4.3 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో ఏపీ మూడో స్థానంలో ఉంది. 4 గిగావాట్ల సామర్థ్యంతో తమిళనాడు 4వ స్థానంలో, 3.9 గిగావాట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అయిదో స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం స్థాపిత సౌర విద్యుత్ సామర్ధ్యంలో 10 శాతానికి పైగా వాటాను రాష్ట్రం దక్కించుకుంది. అయితే అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులను రక్షించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజస్థాన్లో రాబోయే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. ఈ పక్షి కొన్ని పవర్ ప్రాజెక్టుల ప్రాంతాలలో నివాసం ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రాజెక్టులు ఆలస్యమైతే ఏపీలో ఇటువంటి ప్రాజెక్టులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సౌర విద్యుత్కు ఏపీ ప్రాధాన్యం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యమిస్తోంది. సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నాణ్యమైన సౌర విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి పొందాయి. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్ యూనిట్ రూ.2.49 పైసలు చొప్పున ఇచ్చేందుకు ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్తును పాతికేళ్ళపాటు కొనుగోలు చేయనుంది. ఈ చర్యతో భవిష్యత్తులో ఏపీ స్థానం మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. -
సెకీ విద్యుత్ కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రానికి నోటీసులు
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండళ్లకు కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏటా 7 వేల మెగా వాట్లను యూనిట్ రూ.2.49కే కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తక్కువ ధరకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కాదని ఎక్కడో రాజస్తాన్లో ప్లాంట్లు ఏర్పాటు చేసిన సెకీ నుంచి ఎక్కువ రేటుకు కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి మండలి నిర్ణయం వల్ల ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రతి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
సోలార్ పవర్లో భారత్ రికార్డ్ ! మెర్కామ్ ఇండియా రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా సోలార్ ఆధారిత విద్యుదుత్పత్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఏకంగా మూడు రెట్లకు పైగా (335 శాతం) అదనపు సామర్థ్యం.. అంటే 7.4 గిగావాట్లు కొత్గగా సమకూరినట్టు మెర్కామ్ ఇండియా రీసెర్చ్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. ఏడాది క్రితం (2020) ఇదే కాలంలో 1.73 గిగావాట్ల సామర్థ్యమే ఏర్పడినట్టు పేర్కొంది. ‘‘2021 మూడో క్వార్టర్లో (జూలై–సెప్టెంబర్) 2,835 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం కొత్తగా సమకూరింది. అంతకుముందు జూన్ క్వార్టర్తో పోలిస్తే ఇది 14 శాతం అధికం. వార్షికంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన సామర్థ్యంతో పోలిస్తే 547 శాతం అధికం’’ అని వివరించింది. ముడి సరుకుల తయారీ వ్యయాలు పెరగడం, మాడ్యూళ్ల అందుబాటు, ధరల్లో ఎన్నో అస్థితరలు, కొన్ని రాష్ట్రాల్లో రవాణా చార్జీలు పెరగడం వంటి సవాళ్లు ఉన్నా కానీ సోలార్ ఇన్స్టాలేషన్లు పెరిగినట్టు తెలిపింది. 2022లోనూ జోరే ‘‘విడిభాగాల అధిక ధరలు, రాజస్థాన్లో ట్రాన్స్మిషన్ అంశాలు ఉన్నా కానీ.. 2022 సంవత్సరం కూడా ఇన్స్టాలేషన్ల పరంగా ఎంతో బలంగా ఉంటుంది. చెల్లింపుల సమస్యలు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు వృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి. మోనో పెర్క్మాడ్యూళ్ల ధరలు సగటున 15 శాతం పెరిగాయి. ఒక్కో కంటెయినర్ చార్జీలు కూడా 9,000 డాలర్లకు పెరిగింది’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ప్రభు తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి 40 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేయనుండడంతో దేశీయ తయారీదారులు దీన్నుంచి లబ్ది పొందేందుకు ఇన్స్టాలేషన్లను వేగంగా ఏర్పాటు చేస్తున్నట్టు మెర్కామ్ వివరించింది. దిగుమతులు ప్రియం కానున్నందున వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి కొనుగోళ్ల విధానాల్లో సమూల మార్పు చోటు చేసుకోనున్నట్టు అంచనా వేసింది. చదవండి: సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ -
‘సెకీ’ విద్యుత్తో లాభమే
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ను రైతుల కోసం కొనుగోలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2024 నుండి 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను ప్రత్యేక డిస్కమ్ ద్వారా అందిస్తుందని తెలిపారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం అత్యంత లాభదాయకమని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రి వివరించారు. టీడీపీ హయాంలోనే అనవసరంగా అధిక ధరకు సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత విద్యుత్ కోసం ట్రాన్స్కో, డిస్కంలు గత రెండేళ్లలో రూ.3,762 కోట్ల విలువైన నెట్వర్క్ను పెంచుకున్నాయని, డిమాండ్ను పెంచడానికి 20 కొత్త ట్రాన్స్కో సబ్స్టేషన్లు, 162 కొత్త డిస్కం సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. టెండర్ ధర ప్రకారం యూనిట్ ధర రూ.2.49 ఉంటుందన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ద్వారా విద్యుత్ చట్టం ప్రకారం టారిఫ్ నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్కు యూనిట్కు రూ.6.99, పవన విద్యుత్ యూనిట్కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)లో స్పష్టంగా ఉందన్నారు. నిజానికి 2016లో టీడీపీ ప్రభుత్వం ఇదే సెకీ నుంచి యూనిట్కు రూ.4.57 (గాలివీడు)తో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లు కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. డిస్కంలపై భారం ఉండదు సెకీ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయడం ద్వారా ప్రస్తుత డిస్కంలపై భారం పడదని, అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడంతో పోలిస్తే 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తుందని, అదే ఇక్కడైతే సెంట్రల్ గ్రిడ్ చార్జీలు 25 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టును రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేస్తే, విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లు తదితరాల ఖర్చును రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే విద్యుత్కు కేంద్రం సెంట్రల్ గ్రిడ్ చార్జీలను మినహాయిస్తోందన్నారు. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, మొదట సెంట్రల్ గ్రిడ్ను ఉపయోగించి తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 మె.వా. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన మొత్తం భూమి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్రం వద్ద ఉందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన థర్మల్ ప్లాంట్లు ఏవీ లేవని, ఆయన హయాంలో కృష్ణపట్నం ఖర్చు మెగావాట్కు రూ.5.5 నుంచి రూ.9.3కి పెరిగిందని మంత్రి వివరించారు. -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
‘గ్రీన్’ విద్యుత్పై 20 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. పర్యావరణ హిత విద్యుత్కు సంబంధించి వివిధ రూపాల్లో తమ పెట్టుబడులు మొత్తం మీద 50–70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ల తయారీ భాగస్వాములు మొదలుకుని సౌర.. పవన విద్యుత్ వ్యాపారాలకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పారిశ్రామిక క్లౌడ్ ప్లాట్ఫాంలు మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయని వివరించారు. వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మూడు రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు అదానీ పేర్కొన్నారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన సస్టెయినబిలిటీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా గౌతమ్ అదానీ మాట్లాడారు. మన వైద్య, విద్య, రవాణా తదితర వ్యవస్థల్లో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులను నిలువరించేందుకు టీకాలైనా ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పుల చికిత్సకు ఎలాంటి టీకాలు లేవని అదానీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా.. సైన్స్, విధానాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 28 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ .. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ 28 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాను గతేడాది చెప్పానని అదానీ పేర్కొన్నారు. అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం ముప్ఫయ్యో వంతుగా ఉన్న భారత్ తలసరి ఆదాయం 2050 నాటికి మూడో వంతుకు చేరుతుందన్నారు. రాబోయే రోజుల్లో అనేక దశాబ్దాల పాటు భారత్ రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలదని అదానీ చెప్పారు. మరోవైపు, పర్యావరణ హిత విధానాలను, స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అక్టోబర్ 6 దాకా సదస్సు.. రాబోయే తరాలకు కూడా వనరులను మిగిల్చే విధంగా.. ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకునేందుకు పాటించాల్సిన విధానాలపై (సస్టెయినబిలిటీ) చర్చించేందుకు ఇజ్రాయెల్, కోస్టారికాల భాగస్వామ్యంతో టై నిర్వహిస్తున్న సదస్సు అక్టోబర్ 6 దాకా జరగనుంది. ఇందులో 64 దేశాల నుంచి 25,000 పైచిలుకు సంస్థలు పాల్గొంటున్నాయి. తొలి రోజున ఇరు దేశాల్లోని వ్యవసాయ, సాంకేతిక తదితర రంగాల స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా ఇజ్రాయెల్, భారత్లోని టై విభాగాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ సదస్సు ఊతంతో రాబోయే రోజుల్లో స్టార్టప్లకు దాదాపు 100 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కే అవకాశం ఉందని టీఎస్ఎస్ 2021 చైర్పర్సన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కి హేలీ (వర్చువల్గా), కోస్టా రికా దౌత్యవేత్త క్లాడియో అన్సోరెనా, ఇజ్రాయెల్ డిప్యుటీ చీఫ్ ఆఫ్మిషన్రోని క్లెయిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మార్గం సుగమం: పంట పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులు సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)కు అమ్ముకునేందుకు మార్గం సుగమమైంది. ‘ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తన్ మహాభియాన్ (పీఎంకుసుమ్)’పథకం కింద రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ల నుంచి డిస్కంలు కొనుగోలు చేయాల్సిన విద్యుత్ ధర యూనిట్కు రూ.3.13గా ఖరారైంది. దీనిపై గతంలోనే జారీ చేసిన టారిఫ్ ఆర్డర్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) మళ్లీ ఫైనల్ చేసింది. ఈ పథకం కింద పంజాబ్లో యూనిట్కు రూ.2.74, మధ్యప్రదేశ్లో రూ.3.07, జార్ఖండ్లో రూ.3.05 టారిఫ్ నిర్ధారించారని.. మన రాష్ట్రంలో ఎక్కువగా నిర్ణయించినందున తగ్గించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిం ది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆధ్వర్యంలో.. పీఎం కుసుమ్ పథకం కింద రైతులు, రైతుల గ్రూపులు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల ఉత్పాదక సంస్థ (ఎఫ్పీఓ)లు, నీటి వినియోగ సంఘాలవారు ఎవరైనా 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లాంట్ల నిర్మాణానికి సగటున ఒక్కో మెగావాట్కు రూ.3.60 కోట్ల వ్యయం అవుతుంది. కనీసం 30శాతం పెట్టుబడి పెట్టగలిగితే.. బ్యాంకుల నుంచి మిగతా 70% వరకు రుణం లభించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పంపుసెట్లన్నింటినీ సౌర విద్యుత్తో నడపాలన్న లక్ష్యంతో.. పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు, సోలార్ వాటర్ పంపుల ఏర్పాటు దిశగా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ 2019లో పీఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణకు లక్ష్యం 500 మెగావాట్లు పీఎం కుసుమ్ కింద 2020–21లో దక్షిణ డిస్కం (టీఎస్ఎస్పీడీసీఎల్) 300 మెగావాట్లు, ఉత్తర డిస్కం (టీఎస్ఎన్పీడీసీఎల్) 200 మెగావాట్లు కలిపి మొత్తం 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతులతో ఏర్పాటు చేయించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ట్రాన్స్మిషన్ నష్టాలు, సబ్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా.. 33/11 కేవీ సబ్స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో వీటిని నిర్మించాలి. ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ను తీసుకుని గ్రిడ్కు సరఫరా చేయడానికి అవకాశమున్న సబ్స్టేషన్లు, అక్కడ అందుబాటులో ఉన్న సర్ప్లస్ సామర్థ్యం వివరాలను డిస్కంలు తమ వెబ్సైట్లో ప్రకటించాలి. ఆయా చోట్ల రైతుల నుంచి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వా నించాలి. రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటు కోసం రివర్స్ బిడ్డింగ్ లేదా క్లోజ్డ్ బిడ్డింగ్ విధానంలో బిడ్లను డిస్కంలు ఆహ్వానించే అవకాశం ఉంది. తక్కువ ధరను సూచించిన బిడ్లను ఎంపిక చేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకుంటారు. ఈ పీపీఏ కాల వ్యవధి 25 ఏళ్లుగా ఉంటుంది. డిస్కంలకు ప్రోత్సాహకాలు పీఎం కుసుమ్ కింద ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల నుంచి కొనే ప్రతి యూనిట్ (కేడబ్ల్యూహెచ్) విద్యుత్కు 40 పైసల చొప్పునగానీ.. లేదా మెగావాట్కు ఏడాదికి రూ.6.6 లక్షల చొప్పునగానీ.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని ప్రోత్సాహకంగా డిస్కంలకు చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. ప్లాంట్ నుంచి వాణిజ్యపర ఉత్పత్తి (సీఓడీ) ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందుతుంది. మొత్తంగా ఐదేళ్లలో ఒక్కో మెగావాట్కు రూ.33 లక్షల చొప్పున డిస్కంలకు ప్రోత్సాహకాలు రానున్నాయి. కాలుష్య నివారణలో భాగంగా డిస్కంలు తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలని, లేకుంటే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కుసుమ్ కింద కొనే విద్యుత్ను ఈ కేటగిరీ కింద పరిగణించనుంది. డెవలపర్లతో ఏర్పాటు చేయించుకోవచ్చు.. రైతులు, ఇతర లబ్ధిదారులు స్వయంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉంటే.. వారు డెవలపర్లతో ప్లాంట్లను ఏర్పాటు చేయించుకోవచ్చు. అయితే ప్లాంట్ల ఏర్పాటు కోసం డెవలపర్లకు తమ స్థలాలను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. ►భూమికి ఏడాది లెక్కన అద్దెను గానీ.. లేదా ఏడాదిలో ఉత్పత్తయ్యే విద్యుత్లో యూనిట్కు కొంత మొత్తం చొప్పున డబ్బులనుగానీ అద్దెగా తీసుకోవచ్చు. ►ఈ అద్దె డబ్బులను నేరుగా ►డిస్కంల నుంచే తమ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా కోరవచ్చు. ►ఇలా తమ భూములను అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల జాబితాను డిస్కంలు తమ వెబ్సైట్లో పొందుపర్చనున్నాయి. ►ప్లాంట్ ఏర్పాటు చేసే లబ్ధిదారులు/ ►డెవలపర్లే ప్లాంట్ నుంచి సబ్స్టేషన్ వరకు 11 కేవీ లైన్ వేయాల్సి ఉండనుంది. ►సాగులో లేని బీడు భూముల్లోనే ►ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. -
తిరుపతిలో సౌరకాంతులు
స్మార్ట్సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. ఆధునికతను అందిపుచ్చుకుని సరికొత్త పద్ధతుల్లో ప్రాజెక్ట్లను చేపట్టి దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ప్లాంట్ను నిర్మించింది. ఈ ప్లాంట్ దేశంలోనే రెండో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్గా నిలిచింది. – తిరుపతి తుడా ఇటీవల స్మార్ట్సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ప్లాంట్ 3వ ర్యాంక్ను సాధించింది. అలానే మరో 6.746 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కాలుష్య నియంత్రణకు కట్టుబడి నెలవారీ విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లను వివిధ రూపాల్లో నిర్మించారు. గత 6 నెలల నుంచి 4.74 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రాగా.. గతనెల నుంచి మరో 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి వచ్చింది. దీనిద్వారా నగరపాలక సంస్థ విద్యుత్ వాడక ఖర్చులు భారీగా తగ్గాయి. నెలకు రూ.2.8 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇందులో రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్రతినెల ఆ మేరకు ఆదా అవుతుండటంతో మరిన్ని సోలార్ ప్లాంట్లు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.18 కోట్లతో కైలాసగిరి రిజర్వాయర్లో.. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా రూ.18 కోట్లు వెచ్చించి శ్రీకాళహస్తి సమీపంలోని కైలాసగిరి రిజర్వాయర్లో 4 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నీటిపై నిర్మించిన ఈ సోలార్ ప్లాంట్ దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్గా రికార్డుల్లో నిలిచింది. తూకివాకం గ్రీన్సిటీలో రూ.24 కోట్లతో 6 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం, పాఠశాలలపై రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యానళ్ల ద్వారా 0.746 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్ట్లు సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని సోలార్ ప్రాజెక్ట్లను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష తెలిపారు. సోలార్ ఉత్పత్తిలో ఇప్పటికే తిరుపతి మేటిగా నిలిచిందని చెప్పారు. -
‘సోలార్’.. మేమే ఇస్తాం
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. అంతే కాదు ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్కు 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును తామే అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల ప్రాజెక్టును అందిస్తామని తెలిపింది. కిలోవాట్ అవర్కు రూ.2.49 చొప్పున సౌర విద్యుత్తు అందిస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్లు పిలిచిన విషయం కేంద్రం దృష్టికి రావడంతో ఆ ప్రాజెక్టుకు బదులుగా దీన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు ‘ఎస్ఈసీఐ’ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం తెలిపారు. తమ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఎస్ఈసీఐ లేఖలో పేర్కొంది. వినూత్న విధానాలకు ప్రశంసలు.. నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతాంగానికి చీకు చింతా లేకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఆకర్షించింది. ఈ మహాయజ్ఞంలో తామూ పాలుపంచుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ముందుకు వచ్చింది. తక్కువ వ్యయంతో పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలను ఎస్ఈసీఐ ప్రశంసించింది. 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచితంగా విద్యుత్ అందించేందుకు 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను సరఫరా చేస్తామంటూ ప్రతిపాదించింది. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పధకం ద్వారా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపింది. ట్రాన్స్మిషన్ చార్జీల మాఫీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం 6,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవగా కొందరు కాంట్రాక్టర్లు కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్)కు రూ.2.49 చొప్పున టారిఫ్ ప్రతిపాదించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే అదే టారిఫ్కు తాము 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను అందిస్తామని ఎస్ఈసీఐ తెలిపింది. 9 వేల మెగావాట్లను మూడేళ్లలో అంటే 2024, 2025, 2026లో మూడు వేల మెగావాట్ల చొప్పున అందుబాటులోకి తెస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు, సరఫరాపై అంచనాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. తమ ప్రతిపాదనకు ఏపీ అంగీకరిస్తే సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వెచ్చించే వ్యయం రాష్ట్రానికి మిగులుతుందని, అది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. తాము ఇప్పటికే టెండర్లు పిలిచి సోలార్ పవర్ ప్రాజెక్టులకు కాంట్రాక్టు ఇచ్చినందున దాని నుంచి ఏపీకి సరఫరా చేస్తామని తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టం (ఐఎస్టీఎస్) చార్జీల మాఫీ కూడా ఏపీకి వర్తింపజేస్తామని పేర్కొంది. -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని ఏర్పాటు చేయనుంది. సోలార్లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్గా స్విట్జర్లాండ్లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
సోలార్ పవర్లో మనం సూపర్..
సాక్షి, తుక్కుగూడ (హైదరాబాద్): సోలార్ విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ– సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ 750 మెగావాట్ల సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ కంపెనీని గురువారం మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఏడాది ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో 17,000 పరిశ్రమలను తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ప్రస్తుతం పని చేస్తున్నాయన్నారు. కరోనా సమయంలో రూ.483 కోట్లతో ప్రీమియర్ కంపెనీని నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో రెండేళ్లలో 2,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రూ.1,200 కోట్లను పెట్టుబడి పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో యువత నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆగస్టు 5న ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కంపెనీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు చిరంజీవ్ శాలుజా, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, మాజీ డీజీపీ తేజ్దీప్కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కాన్వాయ్ అడ్డగింత.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ–సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభం కోసం వస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ని బీజేపీ, బీజేవైఎం నాయకులు శ్రీశైలం జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులుకు సోలార్ పవర్..
సాక్షి,ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, ల్యాబ్లు, పాడి రైతుల అభివృద్ధి కోసం అమూల్ సంస్థతో కలిసి పనిచేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రైతుల వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా కొన్ని సాంకేతిక కారణాలతో తొలి విడతలో 6400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జిల్లాకు 1200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కేటాయించారు. దొనకొండ మండలం రుద్ర సముద్రం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు నుంచి 600 మెగావాట్లు, సీఎస్పురం సోలార్ పార్కు నుంచి మరో 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఆ మేరకు కలెక్టర్ ప్రవీణ్కుమార్, జాయింట్ కలెక్టర్ జేవీ మురళి భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) ద్వారా సోలార్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జీఈసీఎల్ ద్వారా డీఈని నియమించారు. మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అడిగిన మొత్తం 5930.88 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 1558.67 ఎకరాలు, అసైన్డ్ భూమి 2137 ఎకరాలు, పట్టా భూమి సుమారు 300 ఎకరాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు కలిపి మొత్తం సుమారు 4 వేల ఎకరాలు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్కు కేటాయించారు. ఎక్కడెక్కడ..ఎంతెంత భూమి.. సీఎస్పురం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు కోసం 3,363 ఎకరాలు అవసరం కాగా 289 ఎకరాల ప్రభుత్వ భూమి, 1366 ఎకరాల అసైన్డ్ భూమి, 194 ఎకరాల పట్టా భూములను సమకూర్చారు. సీఎస్పురం మండలంలోని పెదగోగులపల్లి, దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లి గ్రామాల్లో భూములు కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దొనకొండ మండలంలో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కుకు సంబంధించి అవసరమైన మొత్తం 2567.88 ఎకరాల్లో ఇప్పటికే 1269.67 ఎకరాల ప్రభుత్వ భూమి, 547 ఎకరాల అసైన్డ్ భూములు అందజేశారు. సోలార్ పార్కు కోసం పట్టా భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున లీజు కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. లీజుకు చెల్లించే మొత్తానికి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున పెంచుతూ లీజు చెల్లిస్తారు. -
రిలయన్స్కు... కొత్త ‘ఇంధనం’
ముంబై: చమురు నుంచి రిటైల్, టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వ్యాపార వృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్ సెల్ తయారీ ప్లాంటు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది. ‘2035 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ గతేడాది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను నేడు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం. నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నాం‘ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అమలు ఇలా ..: రిలయన్స్ 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు అంబానీ చెప్పారు. ఇందులో సింహభాగం రూఫ్టాప్ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను నిల్వ చేసేందుకు అత్యాధునిక బ్యాటరీల తయారీ కోసం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్తో పాటు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించగలిగే హరిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీలో అంతర్గతంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ నిర్వహణ.. నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఫైనాన్స్ పేరిట రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 5జీ ముందుగా మేమే తెస్తాం.. దేశీయంగా పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను తమ కంపెనీయే ముందుగా అందుబాటులోకి తెస్తుం దని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇతర భాగస్వాములతో కలిసి దేశీయంగా రూపొందించిన 5జీ సొల్యూషన్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఇవి 1 జీబీపీఎస్ పైగా స్పీడ్తో పనిచేసినట్లు చెప్పా రు. దేశవ్యాప్తంగా తమ డేటా సెంటర్లలో, నవీ ముంబైలోని ట్రయల్ సైట్లలో 5జీ నెట్వర్క్ను ఇన్స్టాల్ చేసినట్లు అంబానీ పేర్కొన్నారు. ఏజీఎం నేపథ్యంలో గురువారం షేరు బీఎస్ఈలో 2.35% తగ్గి రూ. 2,153 వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్లో జియో–గూగుల్ ఫోన్.. టెక్ దిగ్గజం గూగుల్తో కలిసి రూపొందించిన చౌక 4జీ స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 10 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ పేరిట దీన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ కాగలదని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ను 2జీ విముక్త దేశంగా మార్చాలంటే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్ఫోన్ అవసరం. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం జియో, గూగుల్ కలిసి జియోఫోన్ నెక్ట్స్ రూపొందించాయి‘ అని అంబానీ తెలిపారు. దీనికోసమే ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు ఏజీఎంలో వర్చువల్గా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 5జీకి సంబంధించి కూడా గూగుల్ క్లౌడ్, జియో జట్టు కట్టాయని ఆయన వివరించారు. ఫోన్ ధర కీలకం.. దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్ఫోన్ రిలయన్స్కి ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని పేర్కొన్నాయి. కరోనా వైరస్కు పూర్వం భారత మార్కెట్లో రూ. 5,000 పైగా రేటున్న స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్ వాటా అయిదు శాతమేనని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. రూ. 5,000 లోపు సెగ్మెంట్పై ఏ సంస్థా పెద్దగా ఆధిపత్యం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్తో 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్ మూడు రెట్లు వృద్ధి చెందగలదని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న రిలయన్స్ రిటైల్ను.. ప్రపంచ టాప్ 10లో ఒకటిగా చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో రిలయన్స్ రిటైల్తో 10 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మరెంతో మందికి జీవనోపాధి కల్పించగలదని అంబానీ తెలిపారు. పరిశోధన, డిజైన్, ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకోవడంపై రిలయన్స్ రిటైల్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్లో ఒక కోటి పైగా వ్యాపారులను భాగస్వాములుగా చేసుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రేటింగ్ అప్గ్రేడ్: ఫిచ్ భారీ ప్రణాళికలతో ముందుకెడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ను ‘బీబీబీ’కు అప్గ్రేడ్ చేసినట్లు ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వివిధ వ్యాపార విభాగాల నుంచి వచ్చే నగదు ప్రవాహం, రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిచ్ తెలిపింది. ఇది భారత సార్వభౌమత్వ రేటింగ్ కన్నా ఒక అంచె ఎక్కువ కావడం గమనార్హం. బోర్డులోకి ఆరామ్కో చైర్మన్.. సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్కోతో ప్రతిపాదిత 15 బిలియన్ డాలర్ల డీల్ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంబానీ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపార విభాగంలో ఆరామ్కో 20 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి 2020 మార్చి నాటికి ఇది పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. తాజాగా సౌదీ ఆరామ్కో చైర్మన్, సావరీన్ వెల్త్ఫండ్ పీఐఎఫ్ చీఫ్ యాసిర్ ఆథ్మాన్ అల్–రుమయ్యాన్ (51) .. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ తెలిపారు. బోర్డు సభ్యుడైన యోగేంద్ర పి త్రివేది (92) రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన స్థానాన్ని యాసిర్ భర్తీ చేస్తారని అంబానీ పేర్కొన్నారు. -
గత సర్కారు పాపం.. డిస్కమ్లకు శాపం
సాక్షి, అమరావతి: ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విద్యుత్ సంస్థలకు శాపంగా మారింది. అవసరం లేకున్నా విద్యుత్ తీసుకోవడం ఒకటైతే, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకోవడం మరో కోణం. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల–పీపీఏల) విషయంలో ఇదే తేల్చి చెప్పింది. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలన్నీ డిస్కమ్లను నిలువునా అప్పులపాలు చేసే విధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని కొంతమందికి కట్టబెట్టే ఈ విధానంపై పునఃసమీక్ష అవసరమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలిరోజుల్లోనే భావించింది. రాష్ట్రంలో 2015 వరకు 91 పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయి. వాటి సామర్థ్యం కేవలం 691.55 మెగావాట్లు. కానీ ఆ తర్వాత 2019 వరకు ఏకంగా 3,494 మెగావాట్ల సామర్థ్యంగల 133 ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు గరిష్టంగా యూనిట్కు రూ.3.74 చెల్లిస్తే.. 2015 నుంచి యూనిట్కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ పీపీఏల వల్ల డిస్కమ్లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలి. సోలార్ విద్యుత్ విషయంలోనూ ఇదేవిధంగా కొనసాగింది. 2014 వరకు రూ.384 కోట్ల విలువ చేసే 92 మెగావాట్ల మేరకు 11 పీపీఏలు ఉండేవి. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 పీపీఏలు జరిగాయి. వీటివిలువ రూ.22,868 కోట్లు. ఫలితంగా ఇప్పటికీ పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కడా లేని ధర 2015–19 మధ్య ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు అప్పటి ప్రభుత్వం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడలేదు. వాళ్లనుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చినా లెక్కజేయలేదు. 2014లో సోలార్ విద్యుత్ను యూనిట్ రూ.6.99 ధరతో పీపీఏ చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ యూనిట్ రూ.6.88 ధరకి పీపీఏ చేసుకుంది. 2016లో సోలార్ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయి. అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్ ధర రూ.6.80. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్ రూ.4.66 ధరతో నెడ్క్యాప్, జెన్కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుంది. ఆ తర్వాత కాలంలోఅన్ని రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ.2కు పడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్నిబట్టి వీటివెనుక రాజకీయ కారణాలున్నాయనే విమర్శలొచ్చాయి. పవన విద్యుత్ పీపీఏల విషయానికొస్తే 2014లో అన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.50 ఉంటే.. మన రాష్ట్రంలో రూ.4.83 చొప్పున జరిగాయి. తమిళనాడు, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.46 కొనసాగినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్కు రూ.4.84తోనే ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ప్రైవేటు పట్ల అపరిమిత ప్రేమ చూపించడం వల్ల.. ఇప్పుడు డిస్కమ్లు ఆర్థికభారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. -
ఆర్టీసీలో సౌర కాంతులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. తన ఆస్తులను మరింత సమర్థంగా సద్వినియోగం చేసుకునే వ్యూహంలో భాగంగా బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. రెస్కో విధానంలో రాష్ట్రంలో 838 సోలార్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది. నాలుగు ప్లాంట్లు రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లను ఆర్టీసీ నెలకొల్పింది. మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కాకినాడలలో ఒక్కొక్కటి 100 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ప్లాంట్కు రూ.37 లక్షల వరకు వెచ్చించింది. ప్రతి ప్లాంట్ ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఏడాదికి రూ.14 లక్షల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఓపెక్స్, ఇన్సిడెంటల్ చార్జీలు కలుపుకుని ఆ సోలార్ ప్లాంట్ల స్థాపన వ్యయం నాలుగేళ్లలో వెనక్కి వస్తుంది. ఐదో ఏడాది నుంచి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. రెస్కో విధానంలో 838 ప్లాంట్లు ఇకపై రెస్కో విధానంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదట దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో 400 ప్లాంట్లు నెలకొల్పేలా కార్యాచరణ సిద్ధం చేసింది. మిగిలిన 438 ప్లాంట్లను రాబోయే రెండేళ్లలో నెలకొల్పుతుంది. ఇందు కోసం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రెస్కో విధానంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై మొత్తం 838 రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తుంది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించి కంపెనీని ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ ఆర్టీసీ భవనాలపై రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పి 25 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. ఆదా ఇలా.. ► ప్రస్తుతం బస్స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్కు రూ.10.15 చొప్పున, పారిశ్రామిక అవసరాల కిందకు వచ్చే గ్యారేజీలు, వర్క్ షాపులకు యూనిట్కు రూ.6.76 చొప్పున విద్యుత్ చార్జీలను ఆర్టీసీ చెల్లిస్తోంది. ► టెండర్ దక్కించుకున్న సంస్థ ఆర్టీసీకి 25 ఏళ్ల పాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం వెయ్యి కిలోవాట్ల ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ను యూనిట్కు గరిష్టంగా రూ.5గా సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్లో ఆ రేట్లు ఇంకా తగ్గుతాయి. ► సోలార్ విద్యుత్ వల్ల బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్పై రూ.5 చొప్పున, గ్యారేజీలు, వర్క్షాపులకు యూనిట్కు రూ.3 వరకు ఆర్టీసీకి ఆదా అవుతుంది. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికలో భాగంగానే బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం. ఆర్టీసీపై వ్యవస్థీకృత భారం పడకుండా ఉండేందుకు ఎన్ఆర్ఈడీసీఏపీ భాగస్వామ్యంతో రెస్కో విధానంలో ఈ ప్లాంట్లను నెలకొల్పుతాం. దీనివల్ల ఆర్టీసీ ఆస్తులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు విద్యుత్ చార్జీల భారం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. – ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ -
పల్లెపల్లెకూ 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: రాయలసీమలో విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏపీ ట్రాన్స్కో ఈ రెండినీ సమన్వయం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. కొత్త లైన్ల ఏర్పాటు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు రూ.1,349 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ఏపీ ట్రాన్స్కో ఉన్నతాధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. దీనివల్ల ప్రతీ పల్లెకు మరింత నాణ్యమైన విద్యుత్ అందబోతోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ వల్ల లో ఓల్టేజీ సమస్యను నివారించవచ్చని తెలిపారు. సీమ, కోస్తాంధ్ర అనుసంధానం రాయలసీమ, కోస్తా ఆంధ్రను అనుసంధానం చేసే 400 కేవీ లైను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్కో సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లాలోని తాళ్లయపాలెంలో 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ను ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఇది దోహద పడుతుంది. అనంతపురం జిల్లా హిందుపూర్, చిత్తూరు జిల్లా రాచగున్నేరి, ప్రకాశం జిల్లా పొదిలిలో గల 400 కేవీ సబ్ స్టేషన్లలో బస్ రియాక్టర్లను పెట్టడం వల్ల ఈ జిల్లాలలో 400 కేవి లైన్లలో వోల్టేజీ సమస్యలు పరిష్కరించొచ్చు. స్విచ్చింగ్ స్టేషన్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బ, వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 220 కేవీ స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోని 132 కేవీ సబ్ స్టేషన్ను 220 కేవీకి పెంచుతున్నారు. సిఎస్పురం, రుద్రసముద్రం సోలార్ పార్కుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. శరవేగంగా సోలార్ లైన్లు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, కర్నూలులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం విద్యుత్ను ఇతర కోస్తాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని తలారిచెరువు 400 కేవీ సబ్ స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి 400 కేవీ సబ్ స్టేషన్ వరకు 400 కేవీ లైన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని ట్రాన్స్కో ఉన్నాతాధికారి తెలిపారు. డిమాండ్ కన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అయితే, ఆ విద్యుత్తును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అదనపు విద్యుత్ను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్రం యోచిస్తోంది. -
రివర్స్ టెండరింగ్తో చౌకగా సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా చౌకగా సౌర విద్యుత్ అందబోతోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. గతంలో రూ.3 వరకు ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఇకపై గరిష్టంగా 2.58కే లభించనుంది. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలి విడతలో భాగంగా 6,400 మెగావాట్లకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. పూర్తి పారదర్శకంగా న్యాయ సమీక్ష చేపట్టిన కార్పొరేషన్.. రివర్స్ టెండరింగ్ కూడా చేపట్టి అతి తక్కువకు విద్యుత్ ఇచ్చే సంస్థలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పది ప్రాంతాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థల వివరాలను గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బుధవారం మీడియాకు విడుదల చేసింది. -
దొనకొండలో సోలార్ 'వెలుగులు'
దొనకొండ: రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో 1,000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెవెన్యూ సిబ్బంది సుమారు 5,000 ఎకరాల భూమిని సర్వేచేసి నివేదిక తయారుచేశారు. మండలంలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించారు. రూ.4,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం ఒకే చోట లేనందున ప్రభుత్వం రైతుల నుంచి 2,000 ఎకరాల దాకా లీజుకు తీసుకోవాల్సి ఉంది. అలా 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఎకరాకు రూ.25,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే రెండేళ్లకోసారి ఐదు శాతం అధికంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కలెక్టర్ పోల భాస్కర్తో కలసి నెట్ క్యాప్ బృందం ఈ భూములను పరిశీలించింది. నివేదిక తయారు చేశాం.. సర్వేయర్లు, వీఆర్వోలు రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి గ్రామాల్లోని పొలాలను సర్వే చేసి ప్రభుత్వ, అసైన్మెంట్, పట్టా భూములను గుర్తించారు. నివేదిక పూర్తి చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే అందజేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. – తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు -
'కష్టమైనా' కొంటున్నాం
సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి చెందిన పవన, సౌర విద్యుత్ను తీసుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పష్టంచేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నప్పటికీ పవన, సౌర విద్యుత్ను వచ్చినంతా తీసుకుంటున్నామని తెలిపింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలవల్ల కోత పెట్టలేని పరిస్థితి ఉందని వివరించింది. సాధ్యమైనంత వరకూ థర్మల్ విద్యుత్ను తగ్గించిన తర్వాతే వాటి వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. అదికూడా నిబంధనలకు అనుగుణంగా, గ్రిడ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే కేవలం 4 శాతంలోపే కోత పెడుతున్నామని తెలిపింది. ఈ సందర్భంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ లభ్యత, తీసుకున్నదీ గణాంకాలతో సహా ఇంధన శాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలు.. మా విద్యుత్ తీసుకోవాల్సిందే.. ► సాధారణంగా సెప్టెంబర్లో రోజుకు 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది వర్షాలవల్ల ఒక్కసారిగా పడిపోయింది. 14న ఏకంగా 143 ఎంయూలకు.. 26న 146 ఎంయూలకు పడిపోయింది. నెలాఖరు వరకూ పెద్దగా మార్పులేదు. ► ఒక్కసారే రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గితే.. ఉత్పత్తి తగ్గించడం తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకపోతే గ్రిడ్కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ► కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 16 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరులను అనుమతించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఏలు చేయడంవల్ల 26 శాతం ఈ విద్యుత్ వస్తోంది. డిమాండ్ లేకపోయినా తమ విద్యుత్ తీసుకోవాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలపై భారం పడకూడదనే స్వల్పంగా ఉత్పత్తి తగ్గింపు నిబంధనల ప్రకారం కేవలం 3.78 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాం. దీనివల్ల ఆ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు. ముందుగా జెన్కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన తర్వాతే.. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండబట్టే అలా చేశాం. ఇది పీపీఏలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాన్ని ప్రైవేటు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు అర్థం చేసుకోవాలి. అవసరం లేకున్నా తీసుకుంటే, ప్రజలపై భారం పడుతుంది. – శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపట్టడానికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) శాస్త్రీయంగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ లభించే వీలుంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. తొలిదశలో 6,050 మెగావాట్లకు టెండర్ డాక్యుమెంట్ను రూపొందించింది. ప్రస్తుతం దీనిని న్యాయ సమీక్షకు పంపారు. అనంతరం టెండర్లు పిలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల పంపుసెట్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. దీని వ్యయం రూ. 8,400 కోట్లు. మరో పదేళ్లలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ► పెరిగే డిమాండ్ను తట్టుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంపై ఏపీజీఈసీఎల్ కసరత్తు చేసింది. ఫలితంగా ఎక్కువ రేడియేషన్ ఉన్న ప్రాంతాల వైపు మొగ్గు చూపింది. ► ఇప్పటి వరకూ సూర్యశక్తిని విద్యుత్గా మార్చడానికి సాధారణ మాడ్యూల్స్ వాడేవారు. కొత్తప్లాంట్లలో సూర్యాస్తమయం సమయంలో సూర్యశక్తి తగ్గిన తర్వాత కూడా కొంతసేపు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అత్యాధునిక మాడ్యూల్స్ వాడబోతున్నారు. ► సూర్యుడు ప్రసరించే దిశను బట్టి శాస్త్రీయ కోణంలో అంచనాలు వేసి పది ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎత్తయిన ప్రదేశాలతో పాటు, సూర్యశక్తి ఎక్కువ ప్రదేశంలో (ప్యానల్స్ అన్నింటి మీద) ప్రసరించేలా జాగ్రత్త వహించారు. దీనివల్ల తక్కువ సమయంలోనే రేడియేషన్ వచ్చే వీలుందని అధికారులు తెలిపారు. ► మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సోలార్ విద్యుత్ ప్లాంట్లు 18 నుంచి 22 శాతం పీఎల్ఎఫ్తో పనిచేస్తున్నాయి. ప్రతిపాదించిన పది ప్రాంతాల్లో పీఎల్ఎఫ్ 25 శాతం తగ్గకుండా ఉత్పత్తి జరిగే వీలుందని అధికారులు తెలిపారు. అంటే సాధారణంగా 6,050 మెగావాట్లకు రోజుకు 31 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే, కొత్త విధానం ద్వారా రోజుకు 36 మిలియన్ యూనిట్ల వరకూ ఉత్పత్తి అవుతుంది. ► దీంతో రోజుకు దాదాపు రూ. కోటి వరకూ ఆదా అయ్యే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి. -
అదానీ గ్రీన్- వొడాఫోన్ ఐడియా జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్తోపాటు.. మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ సోలార్ విద్యుదుత్పత్తిలో అదానీ గ్రూప్.. ప్రపంచ నంబర్వన్గా ఆవిర్భవించినట్లు మెర్కామ్ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. నిర్వహణ, నిర్మాణంలో ఉన్న యూనిట్లతోపాటు.. ఇంతవరకూ దక్కించుకున్న ప్రాజెక్టుల రీత్యా అదానీ గ్రూప్ టాప్ ర్యాంకులో నిలుస్తున్నట్లు వివరించింది. యూఎస్లో 2019లో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యంకంటే అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియో అధికమని మెర్కామ్ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. పూర్తిస్థాయిలో సమీకృత సౌర విద్యుదుత్పత్తి కంపెనీగా అదానీ గ్రూప్ నిలుస్తున్నట్లు అభిప్రాయపడింది. జీవిత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా 1.4 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలదని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి జూన్లో 8 గిగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదానీ గ్రీన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2.5 గిగావాట్ విద్యుత్ సామర్థ్యాన్ని గ్రూప్ కలిగి ఉన్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 544 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు తాజాగా మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇందుకు ఈ నెల 4న(శుక్రవారం) బోర్డు సమావేశంకానున్నట్లు తెలియజేసింది. పబ్లిక్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ కేటాయింపు, ప్రయివేట్ ప్లేస్మెంట్ తదితర మార్గాలలో నిధుల సమీకరణపై బోర్డు చర్చించనున్నట్లు వెల్లడించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికిప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 8 శాతం జంప్చేసి రూ. 9.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 10.15 వరకూ ఎగసింది. -
భరోసా ఉంటేనే.. పవన, సౌర విద్యుత్ ఒప్పందాలు
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై డిస్కమ్లకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం అవసరమైన విద్యుత్ ఇవ్వగలిగే శక్తి ఉన్న సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్లో జరిగే పీపీఏలన్నింటికీ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు పంపిన ఈ మార్గదర్శకాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వివరించారు. ఇవీ నిబంధనలు! ► పునరుత్పాదక ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్ను పోటీ బిడ్డింగ్ ద్వారానే డిస్కమ్లు తీసుకోవాలి. వీటితో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవచ్చు. ► పవన, సౌర విద్యుత్నే డిస్కమ్లు పూర్తిగా నమ్ముకుంటే గాలి తగ్గినప్పుడు, సూర్యరశ్మి లేనపుడు సమస్యలొస్తున్నాయి. ఉత్పత్తి తగ్గి షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అందకపోతే అప్పటికప్పుడు మార్కెట్లో విద్యుత్ కొనుగోలు సవాల్గా మారుతోంది. ► పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్నారు. అందువల్ల వీటి మీదే నమ్మకం పెట్టుకోవద్దని కేంద్రం సూచించింది. పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థలు పీపీఏ ప్రకారం 85 శాతం విద్యుత్ ఉత్పత్తిని కచ్చితంగా చేయాల్సిందే. పీక్ అవర్స్లో కూడా విద్యుత్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 49 శాతం సంప్రదాయ విద్యుత్ను అందించాలి. ► 51 శాతం పునరుత్పాదక ఇంధనం, 49 శాతం «థర్మల్, జల, ఇతరాలు విద్యుత్ ఇస్తామన్న భరోసా ఇస్తేనే పీపీఏ చేసుకోవాలి. ► ఎక్కడి నుంచి సంప్రదాయ విద్యుత్ తీసుకుంటున్నారో పీపీఏ సమయంలో అంగీకారంతో పొందుపర్చాలి. ఇలాంటి పీపీఏలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) కూడా డిస్కమ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే...? ► గ్రీన్ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా తీసుకోవాలని కేంద్రం 2015లోనే అన్ని రాష్ట్రాలకూ షరతులు పెట్టింది. ఈ టార్గెట్ను ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దాటింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ లభ్యతలో పవన, సౌర విద్యుత్ వాటా 50 శాతం వరకూ ఉంటోంది. ► అయితే, ప్రకృతి అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి పడిపోతోంది. అప్పటికప్పుడు థర్మల్ విద్యుత్ను అందుబాటులోకి తేలేకపోతున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎక్కువ ధరకు విద్యుత్ తీసుకోవడంతో డిస్కమ్లపై అధిక భారం పడుతోంది. ఇక మీదట పీపీఏ చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి విద్యుత్ సంస్థలు బయటపడొచ్చు.