ఆరోపణలకు ఆధారాలేవీ? | Submit Evidence, Court Tells Petitioner Against Private Hospitals | Sakshi

ఆరోపణలకు ఆధారాలేవీ?

Published Thu, Jul 2 2020 11:45 AM | Last Updated on Thu, Jul 2 2020 12:01 PM

Submit Evidence, Court Tells Petitioner Against Private Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణ వైద్యం పేరుతో పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రధానంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ‘ఫీజుల జులుం’ఉందని దాఖలైన పిల్‌లోని ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా అధిక ఫీజుల్ని వసూలు చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రతివాదులుగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫీజు రోజుకు రూ.4 వేల నుంచి రూ.9 వేలు వసూలు చేయాలని, అయితే రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని పట్నం అనే సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డి.జి.నర్సింహారావు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డబ్బే ధ్యేయంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి దోపిడీ చేస్తున్నాయని పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల ఆగడాల దోపిడీని అడ్డుకోవాలని, వీటిలో 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా రోగులకు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎక్కడ దోపిడీ జరుగుతోందో స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆయా ఆస్పత్రులను ప్రతివాదిగా చేయాలని, ఆధారాల వివరాలు కూడా అందజేయాలని కోరిన ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement