Corporate hospitals
-
Nikhila Vengala: బ్యూటీ కాంటెస్ట్లో ‘నువ్వు ఫిట్ కావు’ అన్నారు..
‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్ను గెలుచుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్కు మెంటార్గా ఉన్నాను. ఈ కాంటెస్ట్లో పాల్గొనే ఫైనల్స్కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్లో నేనొక మెంబర్గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్లో ఉండి ఆ ఫౌండేషన్కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది. ► కష్టమైనా .. సులువే.. ఎమ్ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్కి, క్యాన్సర్ హాస్పిటల్కి మెడికల్ రైటర్గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్తో ఇలాంటి కాంటెస్ట్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ► టైమ్ ప్రకారం ప్లానింగ్.. నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్ని, డ్రీమ్ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను. ► నువ్వు ఫిట్ కావు అన్నారు... బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్గా, ఎమోషనల్గా ఫిట్గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్కి తీసుకువచ్చింది. ► యాసిడ్ దాడి బాధితులకు.. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను. ► అవగాహన కలిగిస్తూ... చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ. – నిర్మలారెడ్డి -
ఆరోగ్యశ్రీలో కేన్సర్కు వైద్య సేవలందించాలి: హరీష్ రావు ఆదేశం
సాక్షి, శేరిలింగంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేన్సర్కు వైద్య సేవలు అందించాలని, వాటి బిల్లులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన ఎథోస్ రేడియోథెరపీ సిస్టమ్ను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ...ఎథోస్ రేడియోథెరపీతో ఈ ప్రాంత ప్రజలకు అధునాత టెక్నాలజీతో కూడా వైద్య సేవలు అందడం సంతోషం అన్నారు. కేన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో సూపర్స్పెషాలిటీ విభాగంలో 300 బెడ్స్ అదనంగా జతచేశామని వివరించారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో సామాజికసేవలో భాగంగా పేదలకు కేన్సర్కు వైద్యసేవలు అందించి ఆదుకోవాలని సీఓఓ డాక్టర్ ప్రభాకర్ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, అల్ల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.. -
AP: ‘కార్పొరేట్’కు కన్నుకుట్టేలా..
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2017 నుంచి ఉన్నట్లుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీవ్యవస్థలో సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయంకాలేదు. చివరి ప్రయత్నంగా 2021లో బాధితుడిని కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అతడు ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి నిర్ధారించారు. మూడ్రోజుల చికిత్స తరువాత ఆ వ్యక్తి అందరిలాగే లేచి నడవడం ప్రారంభించాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగి. గత నెల 20వ తేదీ ఉదయం విధినిర్వహణలో ఉండగా ఇతనికి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన విజయవాడ జీజీహెచ్కు తరలించారు. బ్రెయిన్స్ట్రోక్గా వైద్యులు నిర్ధారించారు. గంటన్నరలోనే వైద్యులు థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇచ్చారు. ఐదున్నర గంటల్లో బసవయ్య లేచి ఎవరి సాయంలేకుండా నడవగలిగాడు. సాక్షి, అమరావతి: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులకు అంతుపట్టని అరుదైన వ్యాధులకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. దీంతో పెద్దాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. పెద్దాస్పత్రుల్లో సేవలు పొందుతున్న వారిసంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగంపై సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయి. గణనీయంగా పెరిగిన సర్జరీలు టీడీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతిచెందడం, సెల్ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఆపరేషన్లు చేసిన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో గణనీయంగా సర్జరీల సంఖ్య పెరగడమే. 2018–19లో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు నిర్వహించారు. అప్పట్లో ఏడాది కాలంలో జరిగిన సర్జరీల కంటే ఎక్కువ సర్జరీలను ప్రస్తుతం 9 నెలల్లోనే చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని బోధనాస్పత్రుల్లో 2,42,980 మైనర్, 1,18,482 మేజర్ సర్జరీలను చేశారు. ఈ లెక్కన పరిశీలిస్తే టీడీపీ హయాంలో రోజుకు సగటున 870 సర్జరీలు నిర్వహిస్తే, ప్రస్తుతం రోజుకు సగటున 1,338 సర్జరీలు చేపడుతున్నారు. రోజుకు 22వేలకు పైగా ఓపీలు ఇక ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో రోజుకు 22 వేల మందికి పైగా అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందుతున్నారు. అదే విధంగా 2,400 మంది వరకూ ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలు అందుకుంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో 60.99 లక్షలకు పైగా ఓపీలు, 6.25 లక్షలకు పైగా ఐపీలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్ జీజీహెచ్లో 6.06 లక్షల మంది ఓపీ సేవలు పొందారు. ఆ తర్వాత విశాఖ కేజీహెచ్లో 5.34 లక్షలు, కాకినాడ జీజీహెచ్లలో 5.31 లక్షల ఓపీలు నమోదయ్యాయి. నాడు అవస్థలు.. నేడు అత్యున్నత ప్రమాణాలు టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పట్లో బోధనాస్పత్రుల్లో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర వసతుల కొరత తీవ్రంగా వేధించేది. కానీ, 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించారు. ఈ క్రమంలో మానవ వనరుల కొరతకు చెక్పెడుతూ వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీచేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఎసెన్షియల్ డ్రగ్స్కు కూడా కొరత ఉండేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మందుల కొరతకు తావులేకుండా, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులను 608 రకాల వరకూ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతోంది. ఇందులో 530కు పైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తోంది. మిగిలిన మందులను ఆస్పత్రుల్లో అవసరాలకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరోగ్యశ్రీలోనూ టీడీపీ హయాంలో కేవలం 1,059 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తే.. ఇప్పుడు ఏకంగా 3,255 రకాలకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాక.. నాడు–నేడు కింద రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రులు, కళాశాలలను బలోపేతం చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 207 పీజీ సీట్లు పెరిగాయి. ఇవేకాక.. గత ఏడాది మరో 630 పీజీ సీట్ల పెంపునకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
Andhra Pradesh: ఆరోగ్య ధీమా
పేద, మధ్యతరగతి వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆస్తులమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకునే వారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద మన వాళ్లకు ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. ఆ తర్వాతా ‘ఆరోగ్య ఆసరా పథకం’ ఆర్థికంగా భరోసా ఇస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. – సాక్షి అమరావతి గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన పి.సూరిబాబు దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు అనిల్ కుమార్ 2018లో ఇంటర్ పూర్తి చేశాడు. గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో చేరాడు. బీటెక్ పూర్తయితే కుమారుడు ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు భావించారు. 2018 చివరిలో అనిల్కు కాళ్లు తిమ్మిరిగా ఉండటం, స్పర్శ తెలియకపోవడం, నడవడానికి ఇబ్బంది పడటం సమస్యలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. క్రమంగా అనిల్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పలు చోట్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. అప్పులు చేసి మూడేళ్లలో రూ.20 లక్షలు ఖర్చు చేశారు. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్కు వెళ్లారు. వైద్య పరీక్షలు చేసి అనిల్.. ‘స్పైనల్ ఎపిడ్యూరల్ లైపోమ్యాటోసిస్’ వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. దీంతో ప్రస్తుతం అనిల్ నడవగలుగుతున్నాడు. ‘వ్యాధితో మూడేళ్లు నరకం చూశాను. చదువు ఆగిపోయింది. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఏడ్వని రోజు లేదు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఉంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చు అయ్యేది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేసి నయం చేశారు’ అని అనిల్ చెప్పాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లె గ్రామానికి చెందిన వెంకట రామయ్యదీ నిరుపేద వ్యవసాయ కుటుంబం. రామయ్య దంపతుల కుమారుడు యోగేంద్రకు ఎనిమిదేళ్లు. యోగేంద్ర ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే లాభం లేదు.. గుంటూరుకు తీసుకువెళ్లమని చెప్పారు. హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం యోగేంద్ర బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు తేల్చారు. అరుదైన జబ్బుకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద వెంకటరామయ్య ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్ ఆస్పత్రిలో గత నెలలో శస్త్ర చికిత్స చేయించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రామయ్య తనకున్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయం, కూలికి వెళితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ‘ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుని ఉండకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది’ అని రామయ్య తెలిపారు. పేదల పాలిట వరమే.. అనిల్ కుమార్, యోగేంద్రలే కాకుండా పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతూ.. సొంతంగా డబ్బు ఖర్చు చేసే స్తోమత లేక, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకునే దీన స్థితిలో ఉన్న వారి పాలిట ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ పథకం వరంగా మారింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే, ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తోంది. కేవలం వైద్యం అందించి వదిలేయకుండా, చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి వారి జీవన భృతి కోసం ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్ జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది. విశాఖ మధురవాడకు చెందిన ఎస్.కొండమ్మకు 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో, 2021 జనవరిలో నాలుగుసార్లు ఉచితంగా కీమో థెరఫీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.80 లక్షలు ఖర్చు చేసింది. గత ఏడాది మార్చిలో రూ.11 లక్షల ఖర్చుతో బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. మొత్తంగా రూ.18.80 లక్షల విలువైన చికిత్సను కొండమ్మకు ఉచితంగా అందించింది. ఈ మేలు మరచిపోలేను నేను నిరుపేదను. నాకు గుండె వ్యాధి ఉందని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కడపలో డాక్టర్కు చూపిస్తే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.2 లక్షలు అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా సర్జరీ చేస్తారని ఆరోగ్య మిత్ర చెప్పారు. తెలిసిన వారి ద్వారా హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ వారు నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇందుకు మన ప్రభుత్వం కేర్ ఆసుపత్రికి రూ.1,18,881 చెల్లించింది. నేను కోలుకుంటున్న సమయంలో ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం నా బ్యాంక్ ఖాతాకు రూ.9,500 జమ చేసింది. ఈ మేలు నేను మరచిపోలేను. నాలాంటి పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా పునర్జన్మ లభిస్తోంది. – ఎస్.అజ్మతుల్లా, నకాష్ స్ట్రీట్, కడప, వైఎస్సార్ జిల్లా రూ.12 లక్షల ఆపరేషన్ ఉచితం మా పాపకు రెండున్నరేళ్లు. పుట్టుకతో వినికిడి లోపం ఉంది. విశాఖపట్నంలోని విమ్స్లో వైద్య పరీక్షలు చేసి, రెండు చెవులకు ఆపరేషన్ చేస్తే వినికిడి లోపం పోయి పాప మాట్లాడగలుగుతుందని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.12 లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ ప్రభుత్వం మేలును జన్మలో మరవలేము. – పార్వతి, మక్కువ, విజయనగరం జిల్లా ప్రాణం పోస్తున్న 108 జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాలవాడకు చెందిన జి.శంకర్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగం నుంచి పేగులు బయటకు రావడంతో శంకర్రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్ చేశారు. కొద్ది సేపటికి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అంబులెన్స్ టెక్నీషియన్.. గాయపడ్డ వ్యక్తి పేగులపై స్టెరైల్ డ్రెస్సింగ్ ప్యాడ్స్, వాటిపై నార్మల్ సెలైన్ వేసి పేగులకు సరైన తేమ శాతం ఉండేలా ప్రథమ చికిత్స చేశాడు. ఆ వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి ఆస్పత్రికి బయలుదేరారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)లోని వైద్యుడిని సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు శంకర్రెడ్డికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. సరైన సమయంలో నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయడంతో శంకర్రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. వైఎస్సార్ జిల్లా గునకనపల్లిలో ఇటీవల ఫక్కీరప్ప అనే వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతగా తట్టిలేపినా ఉలుకు.. పలుకు లేదు. శరీరం చల్లబడింది. ఇక ఫక్కీరప్ప లేవరని భావించారు. చుట్టుపక్కల వాళ్లు ఎవరో 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. సిబ్బంది అతడ్ని అంబులెన్స్లోకి ఎక్కించారు. చికిత్స అందిస్తూ సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఫక్కీరప్ప కోలుకున్నాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోయి ఉంటే తాము బతికుండే వాళ్లం కాదని శంకర్రెడ్డి, ఫక్కీరప్పలు కొనియాడుతున్నారు. 108 తమకు పునర్జన్మ ఇచ్చిందని చెబుతున్నారు. మండలానికి ఒకటి.. శంకర్ రెడ్డి, ఫక్కీరప్ప తరహాలో అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న లక్షల మందికి 108 అంబులెన్స్లు సంజీవనిలా మారాయి. గతంలో జనాభాకు అనుగుణంగా ఉండేవి కాదు. 2020 జూలై నుంచి మండలానికో 108 అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 14:48 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19:20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 22:21 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుంటున్నాయి. 2,54,111 మంది కరోనా బాధితులు 108లో ఉచితంగా రవాణా సేవలు పొందారు. గతంలో 1,19,595 మందికి ఒకటి చొప్పున 440 అంబులెన్స్లు ఉండేవి. వీటి స్థానంలో 532 బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్), 190 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్), 26 నవజాత శిశువుల అంబులెన్స్లు 19 కలిపి మొత్తంగా 748 అంబులెన్స్ సేవలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 2,753 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. 108కు కోటి దండాలు మాది గంట్యాడ మండలం పెదవేమలి. మా అల్లుడు శ్రీనివాస్కు గంట్యాడ పోలీస్స్టేషన్కు సమీపంలో కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. బైక్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అతని కాలు విరిగిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మాట్లాడలేని స్థితిలో ఉండగా 108 ద్వారా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. త్వరగా తీసుకొచ్చినందునే బతికించగలిగామని వైద్యులు చెప్పారు. 108 అంబులెన్స్కు కోటి దండాలు. – గేడు సన్యాసమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా పునర్జన్మనిచ్చారు గర్భిణినైన నాకు గత ఏడాది నవంబర్ 13న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. మా కుటుంబీకులు నన్ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపు తప్పటంతో అదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేసారు. అప్పుడు వాహనాలు అందుబాటులో లేవు. 108కు సమాచారం ఇవ్వగానే పది నిమిషాల్లో వచ్చింది. మార్గంమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. ఆముదాలవలస చేరే సరికి నేను స్పృహ కోల్పోయాను. అంబులెన్స్ సిబ్బందే సుఖ ప్రసవం చేయించారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. 11 గంటలకు మమ్మల్ని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి చేర్చారు. నా బిడ్డకు ఆయుష్షు పోసి, నాకు పునర్జన్మనిచ్చారు. – కండాపు హేమలత, సంకిలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా -
హెల్త్ హబ్స్ టెండర్ల నిబంధనల్లో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా అంతర్జాతీయస్థాయి వైద్య సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల కార్పొరేట్ ఆస్పత్రులను హెల్త్ హబ్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. తొలుత పిలిచిన బిడ్డింగ్లో కర్నూలు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన చోట్ల కూడా ప్రముఖ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధంగా టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేకుండా, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీనీ రెండేళ్లకే పరిమితం చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థలను తీసుకువచ్చే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. నిబంధనలు మారినందున బిడ్ల దాఖలు గడువును ఈనెల 18 వరకు పెంచుతూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. బిడ్లను పరిశీలించిన తర్వాత.. ఎంపికైన సంస్థ వివరాలను ఏప్రిల్ 15న వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ఆరోగ్య శ్రీకి కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. -
4 ఏళ్ల నరకయాతన.. 3 రోజుల్లో విముక్తి
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల నరకయాతనకు గుంటూరు జీజీహెచ్ వైద్యులు మూడు రోజుల్లో విముక్తి కల్పించారు. 10 లక్షల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ రుగ్మతకు చికిత్స చేయించుకున్న రైతు కోలుకుని హాయిగా నడవగలిగే స్థితికి వచ్చాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన రైతు ఆర్.రమణయ్య కు 2017 నుంచి ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్సరే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీ వ్యవస్థ సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి, ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయం కాలేదు. నాలుగేళ్లలో సుమారు రూ.10 లక్షలను ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు సెల్ఫోన్ రింగ్ వినిపించినా, చిన్న శబ్దమైనా అతడి కండరాలు అమాంతం బిగుసుకుపోయేవి. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్కు ఈ ఏడాది సెప్టెంబర్ 6న రమణయ్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి.. రమణయ్య ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిచారు. 3 రోజుల చికిత్స అందించిన అనంతరం రమణయ్య స్వతహాగా లేచి నడవడం ప్రారంభించాడు. -
Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట
ప్రభుత్వాస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అనుసరించాలి. ఆరోగ్యం బాగోలేకపోయిన వారంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్స్లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► ఆస్పత్రుల నిర్వహణలో భాగంగా బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. ► కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్మాణాలు ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యం. ► రిసెప్షన్ సేవలు కూడా కీలకం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే.. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయి. ► జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను వినియోగించాలి. విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను ఖరారు చేయాలి. పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలి. ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్సీల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో, జనవరి 26 నుంచి రాష్ట్రం అంతటా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ► మొత్తం యాక్టివ్ కేసులు : 14,652 ► పాజిటివిటీ రేటు శాతం : 2.23 ► రికవరీ రేటు శాతం : 98.60 ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 91.66 ► ప్రైవైట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 71.04 ► 104 కాల్ సెంటర్కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ : 753 ► ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలు : 21 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు : 9 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలెండర్లు : 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ► అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,08,54,556 ► సింగిల్, డబుల్ డోసులు పూర్తయిన వారు : 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు : 3,50,39,318 -
Andhra Pradesh: పట్టణ ప్రజలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై జబ్బున పడ్డ సర్కారీ వైద్యానికి సీఎం వైఎస్ జగన్ చికిత్స చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత ప్రజలకు సర్కార్ వైద్యాన్ని చేరువ చేయడం కోసం ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి. పెరిగిన పట్టణ జనాభా, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’లుగా మార్చడంతో పాటు, కొత్తగా 301 క్లినిక్ల ఏర్పాటుకు గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు సొంత భవనాలు సమకూరుస్తూనే.. ఆగస్టు 15 నుంచి తాత్కాలిక భవనాల్లో వైద్య సేవలను ప్రారంభించింది. 30 వేల మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ లెక్కన గత టీడీపీ ప్రభుత్వం 50 వేల జనాభాకు ఒకటి చొప్పున పట్టణ ప్రాథమిక కేంద్రాలు కేవలం 73 మున్సిపాలిటీల్లో 259 మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి పట్టణాల్లో 30 వేల జనాభాకు ఒకటి చొప్పున వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గుంటూరు రెడ్డిపాలెంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ సొంత భవనాల నిర్మాణం వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న సొంత భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సొంత భవనాలు 205 ఉండగా, వీటిలో 150 భవనాలకు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి. 355 క్లినిక్లకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉండగా, 345 భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. వీటిలో 343 భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించి, శంకుస్థాపనలు చేశారు. ఈ భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఒక్కో భవనానికి రూ.80 లక్షలు ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.80 లక్షలు, సొంత భవనాల మరమ్మతులకు ఒక్కోదానికి రూ.10 లక్షలు వెచ్చిస్తోంది. కొత్తగా నిర్మించే భవనాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రోగులు వేచి ఉండే గది, అవుట్ పేషెంట్, ప్రసూతి, డ్రెస్సింగ్, లేబోరేటరి, ఫార్మసీ గదులు, ఆపరేషన్ థియేటర్, కౌన్సెలింగ్ హాల్, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ఉండేలా నిర్మిస్తున్నారు. సేవలు ఇలా.. ► ప్రతి వార్డుకు రెండు కిలోమీటర్ల దూరం లోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండే వారు. ► గతంలో 73 మున్సిపాలిటీల్లో మాత్రమే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులోకి వచ్చాయి. ► ఇప్పటికే ఉన్న 61 మంది డాక్టర్లకు అదనంగా ప్రభుత్వం 499 మందిని నియమించింది. ► గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ► వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్లలో 65 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ► ఇప్పటికే 206 రకాల మెడిసిన్స్ను ప్రభుత్వం క్లినిక్లలో అందుబాటులో ఉంచింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 32 రకాల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ల ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. నవంబర్కు పూర్తి నవంబర్ ఆఖరుకు వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళుతున్నాం. పనుల్లో నాణ్యత లోపించకుండా చూస్తున్నాం. – డాక్టర్ వి.చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్, మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చదవండి: హ్యాట్సాఫ్ టు సీయం జగన్ ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా -
''బలమెవ్వడు" మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా "బలమెవ్వడు". ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ నాయికగా నటిస్తోంది. సత్య రాచకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుంది. ఆదివారం (జూలై 11) మణిశర్మ బర్త్ డే సందర్భంగా "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే...పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం. కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్ లో స్పష్టంగా చూపించారు. సుహసినీ, నాజర్, పృథ్విరాజ్లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సత్య రాచకొండ దర్శకుడు పేర్కొన్నారు. -
లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం! దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని.. దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!! ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా? ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!! అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ! కోవిడ్–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్పై, ఫంగస్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్మింత్స్ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది... ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు! తెలిసినవి అతిస్వల్పం... మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్–19 కారక వైరస్ సంగతి చూద్దాం... కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్ ల్యాబ్లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్లలో. కోవిడ్–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట! అన్నింటా ప్రమాదమే...? సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్లలోకి ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు.. దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్ టీకాను బయోసేఫ్టీ లెవెల్–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు. ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి. విస్మరిస్తే.. ఏమవుతుంది? వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్–కోవ్–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్–కోవ్–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు. -
విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్సిటీలోని గొలగాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో అక్రమాల బాగోతం బట్టబయలైంది. కరోనా రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హెల్త్సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్ ముగ్గురు సభ్యులతో కూడిన ‘డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లైయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు. జిమ్స్లో ‘కుమార్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరుగా పలువురు కోవిడ్ పేషెంట్ల కుటుంబసభ్యులను సంప్రదించి వివరాలు సేకరించింది. వారిలో ఓ రోగి నుంచి సుమారు రూ.7 లక్షలు వసూలు చేసి, రూ.1.20 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులు లేకపోవడంతో రూ.3 లక్షలకు షూరిటీగా చెక్కు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారని మరో కుటుంబం ఆధారాలతో సహా వివరించింది. ఆ ఆధారాలతో ఈ నెల 6, 7 తేదీలలో జిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు, బిల్లులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బాధితులు చెప్పినవన్నీ నిజమేనని తేలింది. అంతేకాకుండా రెమ్డెసివర్ ఇంజక్షన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలన్నింటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్సిటీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే విధంగా దోపిడీ సాగుతోందని, వాటిపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
వైద్య సేవల రంగంలో గిరిజన యువత
సాక్షి, అమరావతి: గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ) ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. గిరిజన యువత కోసం ఏపీ ఎస్ఎస్ఐడీసీ వివిధ ఉపాధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో శిక్షణ ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒక శిక్షణా ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లో ఇప్పటివరకు 361 మంది గిరిజన యువత హాస్పిటల్ సర్వీసెస్ కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 244 మందికి ఇప్పటికే ఉపాధి లభించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ ఈడీ హనుమాన్ నాయక్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాథమికంగా రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు జీతం లభిస్తోందని తెలిపారు. విశాఖ, బేతంచర్లలో కూడా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి నర్సింగ్లో శిక్షణ ఇవ్వడం ద్వారా గిరిజన యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా 2020లో 3,300 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
కార్పొరేట్ దోపిడీపై అధికారుల కొరడా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై అధికారులు స్పందించారు. మానవత్వాన్ని మరచి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. రెండు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ కోవిడ్ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోమవారం జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో సబ్–కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత సన్రైజ్ ఆస్పత్రికి వెళ్లగా, అప్పుడే అక్కడ మరణించిన కోవిడ్ రోగి బంధువులు నిరసన తెలియజేస్తున్నారు. వారి నుంచి జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యం పొందుతున్న రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సన్రైజ్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు, అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం చికిత్స కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం చుట్టుగుంటలోని అనీల్ న్యూరో అండ్ ట్రామా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ వైద్యం చేసేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 17న దరఖాస్తు చేసుకుని, అనుమతి రాకుండానే.. అదే రోజు 12 మంది కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకున్నారని నిర్ధారించారు. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రూ.2 లక్షల జరిమానా విధించారు. జీవో నం.77 ప్రకారం వైద్యం చేయాల్సిందే.. జిల్లాలోని కోవిడ్ వైద్యానికి అనుమతులు పొందిన ఆస్పత్రుల్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.77 ప్రకారం ఫీజులు తీసుకుని వైద్యం చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తేల్చి చెప్పారు. అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదు అందినా.. సుమోటోగా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే 104కు గానీ, 1902కు గానీ ఫోన్ చేయాలని శివశంకర్ సూచించారు. -
Oxygen Cylinder Shortage in Hyderabad: అందని ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్లో వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలు నిలబెట్టే ఈ ప్రాణవాయువును కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఆక్సిజన్ను పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వాడకూడదని.. కేవలం కరోనా ఆసుపత్రులకు మాత్రమే వినియోగించాలని ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలు జారీ చేసినా ఏ కంపెనీ కూడా ఖాతర్ చేయడంలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరిగా అందక రోగులు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆక్సిజన్, ఐసీయూ పడకలపై ఉన్న రోగులకు పూర్తిస్థాయిలో కాకుండా కొంచెం కొంచెం మాత్రమే ఆక్సిజన్ అందిస్తూ నెట్టుకొస్తున్నారు. వీఐపీ రోగులైతే పైరవీలు చేయించుకొని పూర్తిస్థాయిలో ప్రాణవాయువు పొందుతుండగా.. సాధారణ రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆస్పత్రులు అయితే వారికి కొద్దిసేపు ఇచ్చి.. కొద్దిసేపు ఆపేస్తున్నాయి. రోగి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంటే తప్ప ఆక్సిజన్ వాడటంలేదు. మూడింతలు పెరిగిన డిమాండ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా ఆసుపత్రుల అవసరాలకు దాదాపు 165 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని అంచనా. అయితే, గత 2,3 రోజులుగా డిమాండ్ మూడింతలు పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 165 మెట్రిక్ టన్నుల్లో 40 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు, మిగిలింది ప్రైవేటు ఆస్పత్రులకు కావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ను నిల్వ చేసి.. అక్కడ నుంచి పైపుల ద్వారా రోగుల పడకల వద్దకు సరఫరా చేస్తారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండటంలేదు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వీటికి 99 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 60 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని అంటున్నారు. అంతేకాకుండా అవి సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా మార్చడంతో డిమాండ్ మరింత పెరిగింది. ఇష్టారాజ్యంగా ధరలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకట్రెండింటికి మినహా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ లేదు. అక్కడ సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయి. ఇది మొత్తం డ్రగ్ కంట్రోల్ విభాగం ద్వారా జరుగుతుంది. ఆస్పత్రులకే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లు అవసరం. ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించిన మేరకు వాటిని కేటాయించాలి. ఎంతమంది రోగులు ఐసీయూ, ఆక్సిజన్ పడకలపై ఉన్నారో ఆ మేరకు సిలెండర్లు ఇవ్వాలి. కానీ డిమాండ్కు తగిన విధంగా అవి రావడంలేదని అంటున్నారు. పైగా ప్రస్తుత డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నారు. 22 క్యూబిక్ లీటర్ల పెద్ద సిలెండర్ ధర గతంలో రూ. 3,080 నుంచి రూ.3,740 ఉండేది. అంటే లీటర్కు రూ.140 నుంచి రూ.170 వరకు పడేది. ఇప్పుడు దానిని రూ.7,700 నుంచి రూ.8,580 వరకు విక్రయిస్తున్నారు. అంటే.. లీటర్కు రూ.350 నుంచి రూ.390 వరకు పడుతోందన్నమాట. ఇక పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం ఇదే సిలెండర్ను రూ.10 వేలైనా వెచ్చించి కొంటున్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారనే విమర్శలున్నాయి. ఇంతగా ధరలు పెంచడంతో ఆక్సిజన్ కొనలేక కొందరు, కొరత వల్ల కొన్ని ఆసుపత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ కొంచెం ఆక్సిజన్ సైతం దక్కనీయకుండా కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు గుత్తాధిపత్యం వహిస్తున్నాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పడకలు కూడా లేవని పలువురు రోగులను ప్రైవేటు ఆస్పత్రులు వెనక్కి పంపుతున్నా.. డ్రగ్కంట్రోల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్లో రెమిడెసివీర్.. తుసిలిజుమాబ్ ఆక్సిజన్ సంగతి పక్కన పెడితే.. కరోనా రోగులకు వినియోగించే ఔషధాల విషయంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. కరోనా బాధితులకు కీలకమైన సమయంలో రెమిడిసివీర్ ఇస్తారు. కేంద్రం సిఫార్సు చేయకపోయినా తుసిలిజుమాబ్ను కూడా కొన్ని ఆసుపత్రులు ఇస్తున్నాయి. ఇవి యాంటీ వైరల్ డ్రగ్స్ అయినా కూడా కొన్ని ఆసుపత్రులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నాయి. వాస్తవానికి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులే రోగుల సంఖ్యను ఆధారం చేసుకొని ఇస్తుంటారు. అయితే, ఆస్పత్రులు మాత్రం వాటి కొరత ఉందంటూ రోగులనే తెచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రూ.5,600 ధర ఉన్న రెమిడిసివీర్ ఇంజెక్షన్ను ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నాయి. ఇక తుసిలిజుమాబ్ ధర రూ.12 వేలు కాగా, రోగుల నుంచి ఏకంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ ఆస్పత్రి ఒక రోగికి ఏకంగా రూ.75 వేలకు తుసిలిజుమాబ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రులు ఇలా రోగులను దోపిడీ చేస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేట్ లేబరేటరీల్లో రూ.550కు చేయాల్సిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1200 నుంచి రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీపీఆర్ కిట్ ధర రూ.65కి తగ్గినా.. ఆ మేరకు ధర తగ్గించడంలేదు. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
వ్యాక్సిన్కు రెట్టింపు వసూలు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిలోనూ కాసుల వేటకు దిగాయి. కరోనా వ్యాక్సిన్కు నిర్ధారించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై జనం మండిపడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆయా యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. మరికొన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు రాగా, వాటిపై కూడా జిల్లా వైద్యాధికారులతో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అవి పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బీపీ చెక్ చేస్తున్నామంటూ అదనపు వసూళ్లు ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నారు. అయితే ప్రైవేట్లో మాత్రం టీకాకు రూ. 150, సర్వీస్ చార్జి కింద రూ. 100 వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగాలని... టీకా ధరే వసూలు చేయాలని, సర్వీస్ చార్జి వసూలు చేయొద్దని డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని కొన్ని ఆసుపత్రులు అంగీకరించాయి. కానీ కొన్ని ఆసుపత్రులు ఆ మాట వినకపోగా, రెట్టింపు వసూలు చేస్తున్నాయి. విచిత్రమేంటంటే బంజారాహిల్స్లో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రెట్టింపు అంటే రూ. 500 వసూలు చేస్తోంది. దీనిపై ఆ యాజమాన్యాన్ని పిలిపించి వివరణ కోరారు. తాము బీపీ చెక్ చేస్తున్నామని, వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ తెలుసుకుంటున్నారని, అందుకే రెట్టింపు వసూలు చేస్తున్నామని వింత సమాధానం చెప్పారు. బీపీ చెక్ చేస్తే అంత వసూలు చేయాలా? వ్యాక్సిన్ వేసే ముందు డాక్టర్ ఒకసారి లబ్ధిదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సర్వసాధారణం. దానికి అంత వసూలు చేయాలా? అని వైద్య వర్గాలు యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. సర్వీస్ చార్జీ రూ. 100 వసూలు అనేది ఇటువంటి సేవలకేనని, అలాంటిది రెట్టింపు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వైద్యాధికారులు ప్రశ్నించగా, సమాధానం రాలేదు. దీంతో ఆ ఆసుపత్రికి ఇచ్చిన వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. అలాగే మరో రెండు ఆసుపత్రుల వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. ప్రభుత్వంలోనే అధికంగా వ్యాక్సినేషన్ రాష్ట్రంలో ప్రస్తుతం 354 ప్రభుత్వ, 218 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 9,68,050 వ్యాక్సిన్లు వేయగా, అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,22,952 టీకాలు వేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2,45,098 మందికి వేశారు. ప్రైవేట్లో కంటే ప్రభుత్వంలోనే ఎక్కువగా టీకాలు వేశారు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా వేయించుకుంటున్నారు. కాగా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 20 పడకలకు మించి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు టీకా వేసేందుకు అనుమతి కోరాయి. అయితే నిర్ణీత ధరకు మించి వసూలు చేయొద్దని, అలా చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. -
90 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 70 శాతం మంది వరకు లక్షణాలు లేకపోగా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంటే వైరస్ లక్షణాలు కనిపించేవారి సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది. గతంలో వైరస్ లక్షణాలున్న వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటివి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా కనిపిస్తున్నాయని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోవడం, బాగా తక్కువ లక్షణాలు ఉండటంతో చాలా మంది తమకు ఏమీకాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యక్తులకు వైరస్ వ్యాపించే ప్రమాదం నెలకొందని వైద్యారోగ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సరిహద్దులు, స్కూళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడం, చాలా మంది ఒక్కచోటికి చేరుతుండటంతో.. విద్యార్థులకు కరోనా వ్యాపిస్తోంది. టెస్టులు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండగా.. పరీక్షలు చేయక వెలుగు చూడని వైరస్ బాధితులు ఎందరో ఉన్నారని అంచనా. అలాంటి వారి నుంచి ఇండ్లలో తల్లిదండ్రులకు, పెద్దవయసు వారికి వైరస్ సోకుతోంది. ఇక కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేని సాధారణ స్థితికి వచ్చామన్న భావనతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలా రెండు నెలల్లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లోనూ బెడ్స్ నిండిపోతున్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ 50 నుంచి 60 శాతం మేరకు కరోనా కేసులతో నిండాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కరోనాకు కేటాయించిన 90 ఆక్సిజన్ బెడ్లలో 70 నిండిపోయాయి. 40 ఐసీయూ బెడ్లలో 10 నిండాయి. గచ్చిబౌలిలోని సన్షైన్ ఆస్పత్రిలో 50 ఆక్సిజన్ బెడ్లలో 30.. 20 ఐసీయూ బెడ్లలో 12 నిండాయి. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో 30 ఐసీయూ బెడ్లలో అన్నీ ఫుల్ అయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొండాపూర్లోని కిమ్స్లో 34 ఆక్సిజన్ బెడ్లలో 23, ఆరు ఐసీయూలలో నాలుగింటిలో కరోనా బాధితులు చేరారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో 58 ఆక్సిజన్ బెడ్లలో 31, 19 ఐసీయూ బెడ్లలో 13 నిండిపోయాయి. పరిస్థితి ఇలా తీవ్రంగా మారుతుండటంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ సరఫరాకు ఆర్డర్లు పెట్టడంతోపాటు 15 వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్ వయల్స్ను తెప్పిస్తున్నారు. 30లక్షల మల్టీ విటమిన్ మాత్రలకు ఆర్డర్ పెట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. ఒక్కరోజే 313 కరోనా కేసులు రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 313 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్లో వెల్లడించారు. వైరస్తో మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,664కు చేరినట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 2,98,262 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 943 మంది ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. గురువారం 62,972 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 94,82,649కు చేరుకుందని వివరించారు. కాగా.. తెలంగాణలో 1.22 శాతమే వ్యాక్సిన్ వృధా అవుతోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్లు వృధా అయినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవంగా పది శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతాయనే భావనతో.. కంపెనీలే 10 శాతం అధికంగా వ్యాక్సిన్లు ఇస్తాయని, ఈ లెక్కన మన దగ్గర వృథా చాలా తక్కువని వివరించారు. పాఠశాలలు, పక్క రాష్ట్రాల నుంచే.. పాఠశాలల విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి వ్యాప్తి జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సరిహద్దు జిల్లాల్లోనే ఉంటున్నాయి. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అర్హులైన వారంతా టీకాలు వేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
కళ్లుతిరిగే.. కార్పొ‘రేటు’.. రూ.10కి దొరికే టాబ్లెట్ 100కు!
విజయవాడ నక్కల రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుడివాడకు చెందిన ఓ రోగి స్వల్ప పక్షవాతంతో చేరారు. మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. ఆయనకు రూ.2.85 లక్షలు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి గొల్లుమనడం పేషెంట్ వంతయ్యింది. ఇందులో ఇంజెక్షన్ల ఖరీదే రూ.1.30 లక్షలు. వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రి కొన్నది రూ.65 వేలకు మాత్రమే. వైద్య శాఖలో పెద్ద హోదాలో రిటైర్ అయిన ఓ డాక్టర్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఇటీవలే ఓ 70 ఏళ్ల మహిళ కోవిడ్ బారినపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. వారం రోజులు చికిత్స చేసి రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో చూసినా నిత్యం ఇదే తంతు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరిట రోగులు, వారి కుటుంబీకుల నడ్డి విరుస్తున్నాయి. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి. చిన్న జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. జనరిక్ మందులు రాసేందుకు ససేమిరా బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్పీని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ మందుల్లోనూ అంతే రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు. చట్టం చేయడం వల్లే నియంత్రణ సాధ్యం మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం. – డాక్టర్ బి.సాంబశివారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్వహణ కష్టమవుతుంది ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు అమ్మితే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుంది. వందల మంది సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉంటాయి. 100 పడకల ఆస్పత్రిని నిర్వహించాలంటే ఇప్పుడు చాలా వ్యయమవుతోంది. ఇక జనరిక్ రాయాలంటే కొద్దిగా క్వాలిటీని చూసుకోవాలి కదా. ఎంఆర్పీ కంటే తగ్గించడం కష్టం. – డాక్టర్ మురళి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖ -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణా అంతే ముఖ్యం. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి.. వైద్యులు లేరు, సిబ్బంది లేరు అంటే బావుండదు. వైద్యులు ఎంత మంది అవసరమో అందర్నీ తీసుకోండి. భవనాలు, వైద్య పరికరాలు, ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటి నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను పాటించండి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మెరుగైన పారిశుధ్యం, ప్రమాణాలు ఉండాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలే ప్రామాణికంగా ఉండాలి. బోధన ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పడకల మీద వేసే బెడ్షీట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో అత్యుత్తమ నాణ్యత పాటించాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు, ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రుల్లో కార్పొరేట్కు దీటుగా ప్రమాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక్క వైద్య రంగంలోనే రూ.16,270 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పత్రి లోపలికి వెళ్లగానే మంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామనిపించేలా చక్కటి వాతావరణం, బెడ్స్, పరికరాలు, ఇతర వసతులు ఉండాలన్నారు. నిర్మాణం ఒకెత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు అని చెప్పారు. ఆస్పత్రుల్లో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు చూసేందుకు నైపుణ్యమున్న వారిని తీసుకోవాలని.. పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వేర్వేరుగా ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, విద్య రంగాల్లో నాడు–నేడు పనులను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. నాడు–నేడు పనులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ, ఇతరత్రా ఎలాంటి సమస్యలైనా వస్తే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పేషెంటుకు ఇచ్చిన గది నుంచి పడక వరకు ఆస్పత్రి వాతావరణం బాగుండాలన్నారు. రోగులకు అందిస్తున్న భోజనం కూడా బావుండాలని, ఇందులో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. ఎక్కడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని, ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ ఆస్పత్రిలోనూ పరికరాలు పని చేయలేదనే మాట వినిపించకూడదని, ఆస్పత్రుల నిర్వహణ ఎలా ఉండాలో స్కూళ్లలోనూ అలాగే ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సెప్టెంబర్లోగా హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయండి ► రాష్ట్రంలో మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో 1,426 క్లినిక్స్ను పునరుద్ధరిస్తున్నారు. వీటి పనులు సెప్టెంబర్లోగా పూర్తి చేయండి. ► వీటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలి. ప్రత్యేక పర్యవేక్షణతో సకాలంలో పనులు పూర్తి చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే పీహెచ్సీలు కూడా త్వరగా పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందించండి. ► పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. మే 15కు మెడికల్ కాలేజీల టెండర్లు పూర్తి ► కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు మే 15 నాటికి టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ధి పనులకు ఏప్రిల్ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారవుతాయన్నారు. ► కొత్త పీహెచ్సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, అక్టోబర్ నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ► రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివిటీపై సీఎంకు వివరించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి అంత ఉధృతి లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్ల వ్యయంతో ఒకేసారి ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైద్య విద్యా రంగంలో పెను మార్పులకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ వైద్య విద్యా రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభ్వుత్వ సామాజిక బాద్యతగా చేపట్టి భావి తరాల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై పలు సార్లు సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. కార్పొరేట్కు ధీటుగా 50 ఎకరాల్లో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలపై జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం కోసం పంపారు. పాడేరు, మచిలీపట్నం కాలేజీలపై కూడా ఈ నెలలోనే జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపనున్నారు. ఈ నాలుగు కాలేజీలకు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం బాపట్ల మెడికల్ కాలేజీల జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్లో టెండర్లను ఆహ్వానించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలపై జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం జనవరిలో టెండర్లు ఆహ్వానించేలా కార్యాచరణ రూపొందించారు. -
కార్పొరేట్ ఆస్పత్రుల ‘కరోనా కాటు’
(వెబ్ స్పెషల్): ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ప్రజలను పట్ట పగటి దొంగల్లా పలు ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వెల్లువెతున్న విషయం తెల్సిందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ఇప్పటికీ వాటి ముక్కుకు తాడేయలేక పోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్న వారు. సరైన మార్గదర్శకాల కోసం ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్’ కూడా తన వంతు ధర్మంగా రిట్ పిటిషన్లో భాగస్వామిగా చేరింది. కరోనా వైరస్ మహమ్మారి మానవాళిపై విరచుకుపడకు ముందు నుంచే దేశంలోని పలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్స పేరిట దోచుకుంటున్నాయి. మందులు, ఇంజెక్షన్లపై కార్పొరేట్ ఆస్పత్రులు 1700 శాతం లాభాలు చూసుకుంటున్నట్లు ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ గతంలో ఓ నివేదికలో కూడా వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూ కరోనా మహమ్మారి సంక్షోభం నాటికి తారా స్థాయికి చేరుకుంది. నేడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల్లో ఎక్కడా పారదర్శకత అనేది లేకుండా పోయింది. మాస్క్లు, గ్లౌజులు లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ)ను ఓ రోగికి ఎన్ని సరఫరా చేశారో, వాటి ధర ఎంతో పేర్కొనకుండా వీటికి లెవీ చార్జీలు రోజుకు అంటూ పది నుంచి పదిహేను వేల రూపాయల చార్జీలను వసూలు చేస్తున్నాయి. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ చార్జీలు, వ్యర్థ వైద్య పరికరాల తరలింపు, ఆస్పత్రి అడ్మిషన్, రోగి వైద్య చరిత్ర అంచనా, వైద్య పరికరాల వినియోగ, ముందు జాగ్రత్త, పార్కింగ్ చార్జీల పేరిట ఒక్కో రోగి నుంచి లక్షల రూపాయలు కార్పొరేట్ ఆస్పత్రులు పిండుతున్నాయని దేశంలోని మూడు నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రలు బిల్లులను పరిశీలించిన ‘ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్’ సుప్రీం కోర్టు పిటిషన్లో పేర్కొంది. (కరోనా లక్షణాలు లేనివారిలో.. వెరీ డేంజర్!) కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా రోగులపై వారి అనుమతి లేకుండా ‘ఫేవిపిరావిర్, హెచ్సీక్యూ, టోసిలిజుమాబ్, లోపినవిర్ ప్లస్ రిటోనవిర్, రెమిడిసివిర్ లాంటి మందులను ప్రయోగిస్తున్నట్లు కూడా ఏఐడీఏఎన్ ఆరోపించింది. కరోనా చికిత్సకు ఆస్పత్రులు వేస్తున్న చార్జీలు, బిల్లులు ఏకపక్షంగానే కాకుండా అహేతుకంగా ఉంటుండంతో వైద్య బీమా కంపెనీలు కూడా రోగుల బిల్లులను చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు పాక్షికంగానే బిల్లులను చెల్లిస్తున్నాయి. వ్యక్తిగత రక్షణ పరికరాలు రోగికి అవసరం లేదని, రోగి నుంచి ఆస్పత్రి సిబ్బందికి అంటురోగాలు అంటుకోకుండా వినియోగించడానికంటూ వాటి చార్జీలను పూర్తిగా చెల్లించేందుకు నిరాకరిస్తూ వచ్చిన కంపెనీలు, ఇప్పుడు పది, హేను వేల బిల్లులకు ఒకటి, రెండు వేల రూపాయలను చెల్లిస్తున్నాయి. ఎలాంటి పారదర్శకత లేకుండా కార్పొరేట్ ఆస్పత్రులు తమ ఇష్టానుసారం రోగులపై అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నాయని, వైద్య బీమాలేని రోగులకంటే బీమా ఉన్న రోగులపై వాటి వడ్డింపులు ఎక్కువగా ఉంటున్నాయని ‘జనరల్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్’ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వైద్యానికి వేర్వేరు చార్జీలను నిర్దేశించడమే కాకుండా వైద్య బీమా విషయంలో విభిన్న వైఖరులను అవలంభించడం కూడా కార్పోరేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీల నుంచి వైద్య బీమా వినియోగదారులను మినహాయించగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యానికి చార్జీలను నిర్దేశిస్తూ జూన్ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులో వైద్య బీమా వినియోగదారులను మినహాయించ లేదు. అయినప్పటికీ అక్కడి కార్పొరేట్ ఆస్పత్రులన్నీ వైద్య బీమా ఉన్న ప్రజలను ప్రభుత్వ చార్జీల నుంచి ఏకపక్షంగా మినహాయించాయి. ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీలను అమలు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారులతో కమిటీలు వేసి తనిఖీలు చేయిస్తుండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం అధికార కమిటీలు అధిక చార్జీలను వసూలు చేసిన కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి వాటిని వసూలు చేసి రోగులకు ఇప్పించాయి. అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా, హెల్త్కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ సంస్థలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చార్జీలను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. కార్పొరేట్ ఆస్పత్రుల లాబీ వల్ల, వాటి దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకరాలేక పోతున్నాయి. ఉన్న చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయలేక పోతున్నాయి. ఫిక్కీలాంటి సంస్థల్లో కూడా కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాతినిథ్యం బలంగా ఉండడంతో క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కార్పొరేట్ ఆస్పత్రుల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వాటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. (‘కరోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!) -
బాధితులతో రాయ‘బేరాలు’
సాక్షి,సిటీబ్యూరో: నియమాలు ఉల్లంఘించి కరోనా చికిత్సపై కాసులు ఏరుకుంటున్న కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మరో అడుగు ముందుకు వేశాయి. తమ నిర్వాకాలపై ఫిర్యాదు చేసిన బాధితులను నయానో, భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డాయి. ఇటీవల కరోనా చికిత్సలు చేయకుండా అనైతిక చర్యలకు పాల్పడటంతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఆసుపత్రుల ప్రతినిధులు ఫిర్యాదుదారులను దారిలోకి తెచ్చే పనులకు దిగారు. తమ ఆస్పత్రి వైద్యం, బిల్లులు, అనైతిక చర్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వారికి ఫోన్ చేయడంతో పాటు వాళ్లను నేరుగా కలుస్తున్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే అధిక బిల్లు విషయంలో చర్చిద్దామని రాజీ భేరాలు చేస్తున్నారు. (‘విరించి’పై వేటు!) కోవిడ్ వ్యాధి కోసం రోడ్ నంబర్–1లోని ఓ ఆస్పత్రిలో చేరి రూ.14.60 లక్షల బిల్లులు చెల్లించిన ఓ వృద్ధ దంపతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరితో ఆస్పత్రి నుంచి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వ్యక్తి సంప్రదింపులు జరిపి ఫిర్యాదును ఉపసంహరించుకుంటే తాము కట్టించుకున్న ఫీజులో కొంత వాపస్ చేసే విషయమై మాట్లాడతామని ప్రతిపాదన పెట్టాడు. దీంతో వారు వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అనంతరం సంబంధిత ఆస్పత్రి ప్రతినిధి ఎంతకూ ఫోన్ లేపకుండా తమని మరోసారి వంచనకు గురి చేశాడని ఆ వృద్ధ దంపతులు మీడియాను ఆశ్రయించారు. తమను రెండుసార్లు మోసం చేసిన సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఆస్పత్రి ప్రతినిధిని ‘సాక్షి’ ప్రశ్నిస్తే ‘‘మాకు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. వివాదం కోర్టులో ఉంది’’ అని పేర్కొనడం విశేషం. -
గాంధీ హౌస్ఫుల్.. వెంటిలేటర్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. ఆయనకు వెంటిలేటర్ సహాయం అవసరమైంది. ఆస్పత్రిలో 105 వెంటిలేటర్లు ఉండగా, అప్పటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితున్ని గాంధీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు బాధితుని బంధువులకు సూచించారు. విధిలేని పరిస్థితుల్లో శనివారం రాత్రి అతికష్టం మీద గాంధీకి తీసుకొచ్చారు. తీరా.. ఇక్కడ వెంటిలేటర్లు ఖాళీ లేవని వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని, ఇందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగినంత చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా పాలకుర్తికి చెందిన వ్యక్తికి మాత్రమే కాదు..కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్లో ఉన్న అనేక మంది ఆఖరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), కింగ్కోఠిలో 50, ఛాతి ఆస్పత్రిలో 28 వెంటిలేటర్ల చొప్పున ఉన్నప్పటికీ..టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారు. గాంధీ ఐసీయూ హౌస్ఫుల్ 1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటిలేటర్ దొరకని పరిస్థితి. అంతేకాదు ఆక్సిజన్, సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికైనా వెంటిలేటర్ అనివార్యమైతే..అప్పటికప్పుడు ఇతరులకు అమర్చిన వెంటిలేటర్ తొలగించి అవసరమైన వారికి అమర్చాల్సి వస్తుంది. కొత్తగా ఆస్పత్రికి చేరుకున్న వారికి వెంటిలేటర్ కావాలంటే..ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ..సమకూర్చలేని దుస్థితి. విధిలేని పరిస్థితుల్లో చాలా మందిని సాధారణ ఆక్సిజన్తోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పలు ఆ స్పత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ...ప్రతిష్టాత్మాక ఆయా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చేరాలని భావిస్తున్నారు. రోగుల బంధువుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా ఆస్పత్రులు ఆసరాగా చేసుకుంటున్నాయి. అడిగినంత చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే ఐసీయూ పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.9000 ధర నిర్ణయించగా..ఆయా ఆస్పత్రులు ఒక్కో వెంటిలేటర్ రోగి నుంచి రోజుకు రూ.80 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తున్నాయి. బాధితులు చెల్లించిన డబ్బుకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్న ఆయా కార్పొరేట్ ఆస్పత్రులపై 1200పైగా ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు రెండు మినహా మరే ఇతర ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ప్రేవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు అంటూ ఖరారు చేయక పోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. -
ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలకు సంబం ధించి ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం కన్నా అవే బలమైనవిగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలకు, చికిత్సలకు నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ప్రైవేటు ఆస్పత్రులు పట్టిం చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. ఇంత నిర్లక్ష్యంగా, లాభాపేక్షతో వ్యవహరిస్తున్న ఆస్పత్రుల లైసెన్స్లు ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి రాయితీ, లీజు పద్ధతిలో భూములు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు ఒప్పందం మేరకు పేదలకు ఉచితంగా వైద్యం చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. రాయి తీగా ఇచ్చిన భూమిని, లీజుకు ఇచ్చిన భూమిని ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవడంలేదని అడిగింది. అసలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏం జరుగు తోందని ప్రభుతాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని, ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, కరోనా చికిత్సలు అంది స్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర శానిటరీ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకోవాలని.. ఇలా దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్య దర్శి డాక్టర్ రమేశ్రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మా సనం ముందు హాజరయ్యారు. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమి స్తోందని, ఎందరో అధికారులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని సోమేశ్కుమార్ వివరించారు. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. 2 వారాల్లో అమలు చేయాలి గతంలో తామిచ్చిన ఆదేశాలను 95 శాతం వరకు అమలు చేశారని, ప్రభుత్వ పనితీరు బాగుందని, ఇంకా మిగిలిన 5 శాతం ఆదేశాలను కూడా రెండు వారాల్లో అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో తెలంగాణ ఇతర రాష్ట్రా లకు ఆదర్శంగా నిలవాలని, దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. తాము ప్రభుత్వాన్ని కించపర్చడం, తక్కువ చేసి మాట్లాడడం చేయడంలేదని.. అందరం కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాం క్షతో పనిచేద్దామని సూచించింది. తదుపరి విచార ణకు సీఎస్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం చిన ధర్మాసనం.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం హాజరుకావాలని పేర్కొంటూ సెప్టెంబర్ 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది." ఆ టెస్టుల కచ్చితత్వం ఎంత ? ‘‘ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కచ్చితత్వంపై మాకు అనుమానాలున్నాయి. 40 శాతం వరకే వీటిని విశ్వ సించాలనే వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి పరీక్ష చేసినా నెగెటివ్ అని వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టుల కచ్చితత్వంపై మా అను మానాలను నివృత్తి చేయండి’’అని ధర్మాసనం ఆదేశించింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి యాంటిజెన్ టెస్టు చేస్తే 100 శాతం పాజిటివ్ అనే వస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. ఐసీఎంఆర్ సైతం యాంటిజెన్ పరీక్షలు చేయాలని చెబుతోందని, ఇతర రాష్ట్రాలు సైతం పాజిటివ్ కేసులను గుర్తిం చేందుకు ఈ టెస్టుల మీదనే ఆధారపడ్డాయని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య 650కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చేందుకు రూ.12 కోట్లు కూడా విడుదల చేసినట్టు వెల్లడించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 86 కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామనే విషయాన్ని జీహెచ్ఎంసీ వెబ్సైట్తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ వెబ్సైట్లో పేర్కొన్నాం’’అని సీఎస్ సోమేశ్కుమార్ వివరించారు. ధర్మాసనం ఆదేశాల్లో ఇంకా ఏమున్నాయంటే కరోనా టెస్టులు చేయించుకుంటున్న వారిలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఎన్ననే వివరాలతో పాటు పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఉన్న వారెందరు? లక్షణాలు లేనివారెందరు? వంటి వివరాలను మీడియా బులెటిన్లో చెప్పాలి. పేద ప్రజలు ఐసోలేషన్లో ఉండేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ల సమాచా రాన్ని మీడియా బులెటిన్లో ప్రకటించాలి. ఏ కేంద్రంలో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నా యో తెలియజేయాలి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ మీద వస్తున్న ఫిర్యా దులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. పదే పదే జీవోలను ఉల్లంఘిస్తుంటే ఆయనా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని బెడ్స్ను పేదలకు కేటాయించేలా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన తరహాలో ప్రభుత్వం ఇక్కడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆదేశాలు ఇవ్వలేకపోతే కారణాలు ఏంటి? రసూల్పురాలోని హాకీ స్టేడియాన్ని, ఇతర స్టేడి యాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే అం శాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మరింత సమర్థంగా చేస్తారనే... ‘‘ఓ కంసాలి.. తన కుమారుడు ఎంత మంచిగా నగ తయారు చేసినా తండ్రి ఏదో లోపముందనేవాడు. ఒక రోజు భార్య భర్తను అడిగింది. మన బిడ్డ ఎంత మంచిగా నగను తయారుచేసినా ఏదో ఒక లోపం ఉందంటున్నారు. ఎందుకిలా అని ప్రశ్నించింది. ఆ నగ సరిగా లేదని కాదు. ఇంకా మంచిగా తయారు చేస్తాడనే.. లోపాన్ని ఎత్తి చూపానని చెప్పాడు ఆ తండ్రి. అలా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని కాదు.. మరింత సమర్థవంతంగా ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే లోపాలను ఎత్తి చూపుతూ, వాటిని సరిదిద్దుతారనే ఈ ఆదేశాలు జారీచేస్తున్నాం. పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేసి ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిన అవసరం ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. -
ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల విష యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆస్ప త్రుల్లోని 50 శాతం పడకలను సర్కారు స్వాధీనం చేసు కోనుంది. ఇకపై ఆ ఆస్ప త్రుల్లోని సగం పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే కరోనా చికిత్సకు సంబంధించిన వైద్యసేవలు అందుతాయి. ఆ పడకలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖే నింపుతుంది. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమా న్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో 50% పడకలను ప్రభుత్వా నికి ఇవ్వడానికి వారు అంగీకరించారని మంత్రి అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను పంపించేందుకు ప్రైవేట్, కార్పొ రేట్ ఆస్పత్రులు అంగీకరించాయని వెల్లడిం చారు. ఇందుకు సంబంధించిన విధివిధా నాలు రూపొందించేందుకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్రావుతో శుక్రవారం భేటీ కావాలని ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి కోరారు. సగం పడకలను సర్కారుకు ఇవ్వడానికి అంగీకరించిన ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. తొలినుంచీ పకడ్బందీగా.. కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వైరస్ నియంత్రణ, కరోనా చికిత్సలో పకడ్బందీ చర్యలతో ముందుకు వెళుతోంది. వైరస్ వ్యాప్తికి తగినట్టుగా పరీక్షల సంఖ్యను పెంచింది. ఎంతమంది రోగులు వచ్చినా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ఆధీనంలోకి తీసుకుని ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే ఆక్సిజన్ పడకలను కూడా పెద్ద ఎత్తున సిద్ధంచేసింది. అంతేకాకుండా కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పలుమార్లు మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడొద్దని విన్నవించారు. కరోనా చికిత్సకు ఎంత చార్జి చేయాలో కూడా ధరలను నిర్దేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చికిత్సకు రూ.4వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9వేల చొప్పున మాత్రమే రోజుకు ఫీజు వసూలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. కరోనా చికిత్స విషయంలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు సర్కారు ఆదేశాలు పాటించలేదు. పైగా రోగుల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు వసూలు చేయడం, అడ్వాన్సు చెల్లిస్తేనే రోగులను చేర్చుకోవడం, రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చార్జి చేయడం, డబ్బులు కడితేనే శవాలను ఇస్తామని వేధించడం, డబ్బులు కట్టినా బిల్లులు ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను రద్దు చేసింది. కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అయినప్పటికీ పలు ఆస్పత్రులు తీరు మార్చుకోకపోవడంతో ఇక అపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. చివరకు సగం పడకలను సర్కారుకు ఇవ్వాలని స్పష్టంచేయడంతో ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు. సర్కారు చేతికి 3,940 పడకలు... రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 118 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 7,879 పడకలు కేటాయించారు. అందులో సగం అంటే 3,940 పడకలను ఇకపై ప్రభుత్వమే కేటాయించనుంది. మొత్తం పడకల్లో 3,216 రెగ్యులర్ బెడ్స్ ఉండగా, వాటిలో 1,608 పడకలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక ఆక్సిజన్ పడకలు 3,145 ఉండగా, 1,572 బెడ్స్ను సర్కారే నింపుతుంది. 1,518 ఐసీయూ పడకల్లో 759 బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న అన్ని పడకల్లో 4,453 నిండిపోగా, 3,426 పడకలు ఖాళీగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారయ్యాక సగం పడకలను సర్కారే కేటాయిస్తుందని అధికారులు తెలిపారు. మంత్రి ఈటలతో జరిగిన సమావేశంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులతోపాటు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేష్రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యులు, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. -
లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. ఈ టెస్టు మస్ట్
నల్లగొండ జిల్లా కట్టంగూర్మండలపరిధిలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెనుఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ఆస్పత్రికి తరలించారు. ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటిలక్షణాలు కూడా లేవు. కానీఅడ్మిషన్ చేయాలంటే ముందు కోవిడ్ నిర్ధారణ కోసం సీటీ స్కాన్ చేయించాలనిఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకు రూ.6500 వసూలు చేశారు. తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వారం రోజుల క్రితం జనగాం సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయిన 45 ఏళ్ల వ్యక్తిని చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఓ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్ చేయాలంటే అంతకంటే ముందే కోవిడ్ నిర్ధారణకు సీటీస్కాన్ చేయాలని స్పష్టం చేశారు. ఆ మేరకు బంధువులు అంగీకరించి అడిగినంత చెల్లించిన తర్వాతే సీటీస్కాన్ చేశారు. ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ఒక్క నల్లగొండ జిల్లాకు చెందిన వారికే కాదు... వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిఅత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది క్షతగాత్రుల నుంచి ఇదే తరహాలోవసూళ్లకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ నిబంధనల తర్వాత రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. వర్షాలు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది పాముకాటుకు గురవుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలిక లాక్డౌన్ తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం తో మనస్థాపంతో అనేక మంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. అనేక మంది హృద్రోగులు, కిడ్నీ, కాలేయ ఫెయిల్యూర్ బాధితులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే విషయంలో నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ నిబంధనలను బూచీగా చూపిస్తున్నాయి. నిజానికి కోవిడ్ నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ఉచింతంగా చేస్తుంది. ప్రైవేటులో.. ఆర్టీపీసీఆర్కు రూ.2200 ధర నిర్ణయించింది. నిజానికి ఆర్టీపీసీఆర్తో పోలీస్తే.. ర్యాపిడ్ టెస్టు చాలా సులువు. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చుతో రిపోర్ట్ వచ్చేస్తుంది. చెస్ట్ ఎక్సరే లో కూడా కోవిడ్ ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోకుండా అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న వారందరికీ కోవిడ్ నిర్ధారణ పేరుతో అడ్మిషన్కు ముందే సీటీస్కాన్లు సిఫార్సు చేస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి రూ.6500 నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ చేస్తుంది. బాధితుల్లో ఎవరికైనా స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయితే..వారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్ చికిత్సల పేరుతో రూ.10 నుంచి 15 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నారు. రోగులను నిలువు దోపిడికి గురిచేస్తున్న ఈ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటికే వెయ్యికిపైగా ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు కేవలం రెండు ఆస్పత్రులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగిలిన వాటి విషయంలో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ చికిత్సలకు రెట్టింపు ఛార్జీలు మార్చికి ముందు గాంధీలో రోజుకు 200 నుంచి 250 సర్జరీలు జరిగేవి. ఉస్మానియాలో 150 నుంచి 200 సర్జరీలు జరిగేవి, కింగ్ కోఠిలో రోజుకు 10 నుంచి 20 చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మారాయి. ఉస్మానియా పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడం, ఇటీవల ఆ భవనంలోని వరదనీరు చేరడంతో ఆ భవనంలోని వార్డులు సహా ఆపరేషన్ థియేటర్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. వార్డుల సంఖ్యను కూడా దాదాపు కుదించాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఆయా రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిజానికి కోవిడ్కు ముందు వరకు జాయింట్ రీప్లేస్మెంట్, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, గుండె చికిత్సలకు పలు ప్యాకేజీల కింద సర్జరీలు చేసేవి. ప్రస్తుతం కోవిడ్ను బూచీగా చూపించి ఆయా సర్జరీల ధరలను రెట్టింపు చేశాయి. సాధారణ చికిత్సలకు కూడా రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో రోగుల వారు అడిగినంత చెల్లించి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విచారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీచేశారు. ఈ అంశంపై శనివారం ఆయన బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు నిర్ణయించినా.. మందులు, పీపీఈ కిట్లు, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్ ఆస్పత్రులు లాభాల కోసం మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమవంతు బాధ్యత పోషించాలని కోరారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదన్నారు. సాధారణ పరిస్థితి కంటే పది రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఫీజుల వసూలు, పడకల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించడం చేయాలని ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడకలు లేవని, కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం, మూడు నాలుగు లక్షల అడ్వాన్స్ ఇవ్వనిదే చేర్చుకోకపోవడం, రోజుకి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా బిల్లులు వసూలు చేయడం, రోగి మృతి చెందినా కూడా చార్జీలు చెల్లిస్తే తప్ప మృతదేహం అప్పగించబోమని అనడంపై మండిపడ్డారు. ఏ మాత్రం కూడా లక్షణాలు లేని వారిని కూడా అడ్మిట్ చేసుకుని విపరీతంగా చార్జీలు వసూలు చేయడం తగదన్నారు. రోగి సీరియస్ కాగానే అంబులెన్స్లో పడవేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపైనా ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి వైద్య, ఆరోగ్య శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు. ప్రజలు కరోనా గురించి భయపడకుండా ప్రభుత్వాస్పత్రిలో చేరి ఉచితంగా వైద్యం చేయించుకోవాలని కోరారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవలందించడానికి, కరోనాను జయించడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఉన్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే, మెడికల్ కాలేజీల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. నగరం నలుమూలలా ఉన్న మల్లారెడ్డి, మమత, ఆర్వీఎం, ఎంఎన్ఆర్, అపోలో, కామినేని మెడికల్ కాలేజీలలో పాజిటివ్ పేషంట్లకు పూర్తిస్థాయి వైద్యం అందేలా చూడాలని కోరారు. -
ఆస్పత్రి పడక.. తప్పుల తడక!
సాక్షి, హైదరాబాద్: పడకలు లేవంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల బండారం బట్టబయలైంది. కరోనా సేవలకు తమ వద్ద పడకలు లేవంటూ చాలా ఆసుపత్రులు బాధితులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో అనేకమంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం పడకల వివరాలను విడుదల చేసింది... రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, 57 ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా వైద్యసేవలు అందిస్తున్నాయి. వాటన్నింటిలో సాధారణ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలు అన్నీ కలిపి 12,943 వరకు ఉన్నాయి. అందులో ప్రైవేట్, కార్పొరేట్, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 4,497, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలను కరోనా వైద్యం కోసం కేటాయించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న 4,497 పడకలకుగాను 3,032 నిండిపోగా, ఇంకా 1,465 పడకలు(32.57 శాతం) ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 8,446 కరోనా పడకల్లో 2,242 నిండిపోగా, ఇంకా 6,204(73.45 శాతం) పడకలు ఖాళీగా ఉన్నాయని సర్కారు వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7,669 పడకలు (59.25%) ఖాళీగా ఉండటం గమనార్హం. ఇన్ని పడకలు ఖాళీగా ఉన్నా రోగులకు బెడ్స్ ఇవ్వకపోవడం, కొందరు మరణాల అంచుకు చేరడం గమనార్హం. వాస్తవంగా రాష్ట్రంలో 13,753 మంది మాత్రమే కరోనా పాజిటివ్ వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది ఇంట్లో లేదా ఇతరత్రా ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకా మిగిలిన 5,294 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7,669 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పడకలు అందుబాటులో లేవంటూ చాలామందిని ఇబ్బంది పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిలేక పడకలు లేవంటున్న యాజమాన్యాలు : ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు లేవని చెప్పడానికి ప్రధాన కారణం సిబ్బంది లేకపోవడమేనన్న వాదనలు ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఇటీవల 30 మంది నర్సులు రాజీనామా చేశారు. ఇతరచోట్లా కూడా తక్కువ వేతనాలకు పనిచేయడానికి వైద్యసిబ్బంది ముందుకు రావడంలేదు. అంతెందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన గచ్చిబౌలిలోని టిమ్స్ను ప్రభుత్వం కరోనా రోగుల చికిత్స కోసం సిద్ధం చేసింది. కానీ, అందులో ఇంకా పూర్తిస్థాయిలో కరోనా సేవలు ప్రారంభం కాలేదు. అక్కడ 129 మెడికల్ ఆఫీసర్ల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీచేసినా కేవలం 40 మంది మాత్రమే చేరారు. అలాగే 246 నర్సు పోస్టులకు కేవలం 200 మంది చేరారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 1,465 పడకలు ఖాళీగా ఉన్నా, పడకలు లేవంటున్నారంటే దానికి ప్రధాన కారణం వైద్య సిబ్బంది కొరతేనని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది చాలావరకు చాలీచాలని వేతనాలతో అసంతృప్తిగా ఉన్నారు. వీరికి రూ.15 వేల లోపే ఇస్తున్నారు. పైగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తక్కువ వేతనంతో పనిచేయాల్సిన అవసరం లేదన్న భావన వారిలో నెలకొంది. మరోవైపు చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆరోగ్య బీమాను పట్టించుకోవడం లేదు. డబ్బులు చెల్లిస్తేనే బెడ్ ఇస్తున్నాయి. లేకుంటే వెళ్లగొడుతున్నాయి. -
బాబోయ్! అంబులెన్స్.. విమానం మోత!
సాక్షి, సిటీబ్యూరో: జేబులో రూ.10 వేలు ఉంటే ఏకంగా విమానంలో హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లొచ్చు. బ్యాంకాక్ పోవచ్చు. ఢిల్లీకి వెళ్లి తిరిగి రావచ్చు. కానీ ఇప్పుడు నగరంలో కోవిడ్ రోగిని తీసుకొని అంబులెన్స్లో పట్టుమని 10కి.మీటర్లు కూడా వెళ్లలేం. నిజమే. ఆపదలో ఉన్న పేషెంట్కు ఆక్సిజన్ సదుపాయం ఉన్నఅంబులెన్స్లో 5 కి.మీ తీసుకెళ్లాలంటే ఏకంగా రూ.10 వేలుచెల్లించాల్సిందే. అర్ధరాత్రి, అపరాత్రి అయితే ధరలు మరింత భగ్గుమంటాయి. ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించకతప్పడం లేదు. వారం రోజుల క్రితం ఓ కరోనా బాధితుణ్ని సనత్నగర్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు తీసుకెళ్లేందుకు రూ.7500 డిమాండ్ చేసినట్లు అతని బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ నుంచి మలక్పేట్ వరకు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్సులు అరకొరగా ఉండడం, సకాలంలో ఆదుకోకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ అంబులెన్స్ల నిర్వాహకులు, డ్రైవర్లు రోగులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వైద్యం పేరిట రూ.లక్షలు దండుకుంటున్న ‘కాసు’పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా అంబులెన్స్ల దోపిడీ కొనసాగుతోంది. దీంతో కరోనా రోగులకు వైద్యమే కాదు, అంబులెన్స్ సేవలు కూడా భారంగానే మారాయి. చాలా చోట్ల 108 వాహనాలు చేతులెత్తేయడంతో ఈ దుస్థితి నెలకొంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు చనిపోతే అంబులెన్స్ల బేరానికి అడ్డూ అదుపూ అందడంలేదు. ఇటీవల హైటెక్ సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్తో చనిపోయిన రోగి మృతదేహాన్ని ఈఎస్ఐ శ్మశానవాటికకు తరలించేందుకు రూ.25 వేలు వసూలు చేశారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే ప్రభుత్వమే ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలిస్తుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చనిపోతే మాత్రం చాలా దారుణంగా ఉంది. అప్పటికే ఆ కుటుంబం ఐసోలేషన్లో ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే’ అని సాఫ్ట్వేర్ నిపుణుడు సాయితేజ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్ సోకిన వ్యక్తి బతికి ఉన్నా, చనిపోయినా అంబులెన్స్ల దోపిడీ మాత్రం భయంకరంగానే ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 108 వాహనాలు గ్రేటర్ హైదరాబాద్లో 45 మాత్రమే ఉన్నాయి. కానీ కరోనా దృష్ట్యా మరికొన్నింటిని జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలించారు. అయినా ఈ వాహనాలు సకాలంలో బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చాలామంది తమ వాహనాల్లో అప్పటికప్పుడు మార్పులు చేసి ‘అంబులెన్స్’లుగా డెస్టినేషన్ బోర్డులు తగిలిస్తున్నారు. ‘సైరన్’లో బిగిస్తున్నారు. ఇలా ఏ ప్రభుత్వ విభాగం అనుమతి లేని అంబులెన్స్లు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా వాహనాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా ఆర్టీఏ అనుమతి తప్పనిసరి. ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించేందుకు తూనికలు– కొలతలు శాఖ నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ కరోనా ఆపత్కాలాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొంతమంది వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. మారుతీ ఓమ్ని, మెటాడోర్, వింగ్లర్ వంటి వాహనాల్లో పడకలను, ఆక్సిజన్ సిలిండర్లు, సైరన్లు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ఈ తరహా అంబులెన్స్లు కలిసి తమ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. డిశ్చార్జి పేషెంట్లను కూడా వదలకుండా దోచుకుంటున్నాయి. ఏ ప్రభుత్వ విభాగం కూడా అంబులెన్స్ల దోపిడీని అరికట్టలేకపోవడం గమనార్హం. రవాణా శాఖ పూర్తిగా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అంబులెన్స్ అంటేనే భయమేస్తోంది.. సాధారణంగా అంబులెన్స్ అంటే ప్రాణాలు కాపాడుతుందనే భావన ఉంటుంది. ఆపదలో ఉన్నవాళ్లకు ఊపిరి పోస్తుంది. రోడ్డు మీద అంబులెన్స్ కనిపిస్తే తప్పనిసరిగా దారి ఇస్తాం. కానీ ఇప్పుడు అంబులెన్స్లు బెంబేలెత్తిస్తున్నాయి. సిటీలో కనీసం 5 కి.మీ దూరం వెళ్లాలంటే రూ.10 వేలు ఉండాల్సిందే.– సాయితేజ, హైటెక్ సిటీ -
నర్సులు కావలెను..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులను సైతం నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోవిడ్ కేసుల భయంతో ఇప్పటికే ఉన్నవారు చెప్పపెట్టకుండా విధులకు గైర్హాజరవుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి.. ఇక్కడి ఆస్పత్రుల్లో చేరిన నర్సులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవైపు వెంటాడుతున్న వైరస్ భయం.. మరోవైపు విరామం లేని విధులు.. వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు వీరిలో చాలా మందికి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వీరి నుంచి పిల్లకు వైరస్ సోకుతుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము విధులకు హాజరు కాలేమని, తమ సర్టిఫికెట్లు తమకు ఇచ్చేస్తే.. సొంతూరికి వెళ్లిపోతామని చెబుతున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అంతేకాదు ఇష్టం లేకపోయినా వారితో బలవంతంగా కోవిడ్ వార్డుల్లో విధులు కేటాయిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మెహిదీపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఇదే అంశంపై నర్సులు ఆందోళనకు దిగడమే కాకుండా ఆస్పత్రి యాజమాన్యం తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పేర్కొంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడి.. నగరంపై ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్పి పడకలు లేకపోవడం, ఉన్నవాటిలోనూ సరైన వైద్యసేవలు అందకపోవడంతో చాలామంది బాధితులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ.. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులే కాదు...కార్పొరేట్ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలన్నీ కోవిడ్ కేసులు నిండిపోయాయి. స్పెషాలిటీ వెద్యులు రోగిని పరీక్షించి కేవలం మందులు మాత్రమే సూచిస్తారు. ఆ తర్వాత రోగి సంరక్షణ బాధ్యత అంతా ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులే చూసుకోవాలి. ఎక్కువ సమయం కోవిడ్ వార్డుల్లో గడపాల్సి వస్తుండటంతో వా రు త్వరగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆ విభాగాల్లో సేవలకు ఇతర వైద్య సిబ్బంది అంతా భయçప³డుతున్నారు. ఇదే సమయంలో ఆయా నర్సులపై వారి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వహించడంతో వారి నుంచి ఇంట్లో వారికి వైరస్ సోకుతుందో అనే భయంతో ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు పొంచి ఉన్న వైరస్ ముప్పు.. మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయినా నిరాకరణే.. లాక్డౌన్ సమయంలో రోగులు లేక ఆస్పత్రులు వెలవెలబోయాయి. రోగులు రాకపోవడంతో బిల్లులు లేక నెలవారి ఖర్చులు కూడా ఆయా ఆస్పత్రులకు భారంగా మారాయి. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారడంతో చాలా ఆస్పత్రులు సిబ్బందిని తొలగించాయి. లాక్డౌన్ ప్రక్రియ ముగిసి.. అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కేసుల సంఖ్య పెరగడంతో ఆయా ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలామంది నర్సులు వైరస్ భయంతో ఉద్యోగాలు మానేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్ కొరత ఏర్పడింది. కొత్త వాళ్లను ఆకర్షించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో నెలకు రూ.17 వేల వరకు ఇవ్వగా.. ప్రస్తుతం సీనియర్ స్టాఫ్ నర్సులకు రూ.50 వేలకుపైగా వేతనం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉచిత వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. అయినా కోవిడ్ వార్డుల్లో పని చేసేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలోని హోటళ్లలో ఉంటున్న వారిని బయటికి వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. చెప్పాప్టెకుండా వెళ్లిపోతారేమో అనే భయంతో వారిపై నిరంతరం నిఘా ఉంచుతుండటం గమనార్హం. విదేశాల్లోనూ భారీ డిమాండ్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక వైద్యుడు సహా ఐదుగురు నర్సులు అవసరం. 600 మందికి ఒక నర్సు ఉండాల్సి ఉండగా.. మన దగ్గర 400 మందికి ఒక్కరే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేల మంది అసరం కాగా.. కేవలం ఏడు వేల మందే ఉన్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రుల అవసరాలు తీర్చాలంటే సుమారు లక్ష మంది నర్సులు అవసరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సుల్లో 70 శాతం కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఇక్కడి వేతనాలతో పోలిస్తే విదేశాల్లో వేతనాలు భారీగా ఉండటంతో చాలా మంది బ్రిటన్, కెనడా, ఐర్లాండ్ వంటి విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో నగరంలోని ఆస్పత్రుల్లో నర్సింగ్ కొరత ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చి మరీ వారిని తీసుకురావాల్సి వస్తోంది. -
కార్పొ‘రేటు’ సపరేటు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రుల విన్నపాన్ని సర్కారు మన్నించింది. సర్కారు నిర్దేశిం చిన ప్యాకేజీ కేవలం నగదు చెల్లించే వారికేనని, బీమా సంస్థ లకు వర్తించదని స్పష్టత ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రైవేట్, కార్పొ రేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజ మాన్యాలు తెలి పాయి. ప్రభుత్వం ఇటీవల ప్రకటిం చిన ప్రైవేట్ కరోనా వైద్య ఫీజుల ప్యాకేజీ ఉత్తర్వుల్లో బీమా కంపెనీల ప్రస్తావన లేదు. కేవలం ఎంత ఫీజు వసూలు చేయాలన్న అంశమే ఉంది. అయితే ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న కరోనా బాధితులు వాటి ప్రకారం చికిత్స చేయా లని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుండటం, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సర్కారు ప్యాకేజీ ప్రకారమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేయడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రులు ఇరకాటంలో పడ్డాయి. ప్రైవేట్ బీమా పాలసీ ఉన్నప్పటికీ కరోనా రోగుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విష యం వివాదాస్పదం కావ డం, రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండ టంతో కార్పొరేట్ ఆసుపత్రులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలకు సర్కారు ప్యాకేజీతో సంబంధం లేదన్నట్లుగా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్యాకేజీ ఉత్తర్వుల సవరణ కేవలం నగదు చెల్లించే సాధా రణ వార్డుల్లోని రోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న రోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. ప్రైవేట్లో సాధారణ బీమా కవరేజీ కింద కరోనా చికిత్స... కరోనా రోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరించాయి. కొన్ని ఆసుపత్రులు బీమా నుంచి వచ్చిన సొమ్ము పోను మిగిలిన సొమ్మును రోగుల నుంచి వసూలు చేశాయి. ఇటీవల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి చికిత్స కోసం రూ. 4.20 లక్షల బిల్లు వేశారు. ప్రైవేటు బీమాను అనుమతించినా ఆ సంస్థ ప్యాకేజీ ప్రకారం రోగికి రూ. 1.23 లక్షలు మాత్రమే బిల్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును రోగి చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేసింది. తాజా ఉత్తర్వులో ఇచ్చిన స్పష్టతతో నిర్దేశించిన పాలసీ ప్రకారం పూర్తి సొమ్ము బీమా కంపెనీల నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు బీమా కంపెనీలతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో వివిధ వ్యాధులకు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ బీమా పాలసీ ఉన్న బాధితులకు, ఆసుపత్రులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ప్రైవేట్ బీమా పాలసీ లేని కరోనా రోగులు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు నగదు చెల్లించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి బాధితులకు ఆరోగ్యశ్రీ లేదా ఉద్యోగుల బీమా పాలసీలను అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై గుర్రుగా ఉంది. అత్యవసర సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించే సర్వాధికారాలున్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ప్రైవేట్ బీమా పాలసీ లేనివారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సర్కారు స్పష్టత ఇచ్చింది మా విన్నపాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది. గతంలో ఇచ్చిన జీవోలో కరోనా ఫీజు ప్యాకేజీ వివరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ బీమా కంపెనీలు కూడా దాని ప్రకారమే కరోనా బిల్లుల సొమ్ము చెల్లిస్తామని చెప్పాయి. వాస్తవానికి సర్కారు ప్రకటించిన ఫీజు మాకు ఏమాత్రం సరిపోని పరిస్థితి ఉంది. గతంలో ప్రైవేట్ బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య వివిధ వ్యాధులకు ఎంవోయూ ఉంది. దాని ప్రకారం కాకుండా సర్కారు ప్యాకేజీతో ఇబ్బంది ఏర్పడింది. అయితే సర్కారు ఇప్పుడు ప్యాకేజీతో బీమా కంపెనీలకు సంబంధం లేదని చెప్పడం వల్ల గతంలో మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం బీమా కంపెనీలు వ్యాధులను బట్టి బిల్లు సొమ్ము ఇస్తాయి. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదు. రోగులపైనా ఆర్థిక భారం ఉండదు. – భాస్కర్రావు, తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆసుపత్రుల అధినేత -
కరోనా ఫీజులపై కార్పొరేట్కు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కరోనా ఫీజులను నిర్దే శించినా అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఆయా ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని భావిస్తోంది. కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా మార్చిలో జారీ చేసిన తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. అన్ని రకాల ఆస్పత్రులపై సర్కారుకు సర్వాధి కారాలు కల్పించే ఈ చట్టాన్ని ప్రయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రులను దారిలోకి తేవడంపై కసరత్తు చేస్తోంది. సర్కారు నిర్దేశించిన ఫీజులు బేఖాతరు రాష్ట్రంలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా రోగులను ఫీజుల పేరుతో దోచుకుం టున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కరోనా బాధితులకు సాధారణ వార్డులో ఐసోలేషన్కు రూ. నాలుగు వేలు (రోజుకు), ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా రోజుకు చికిత్స రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యంతో రోజుకు రూ. తొమ్మిది వేలను ఫీజుగా సర్కారు నిర్దేశించింది. ఈ ఫీజులను మించి వసూలు చేయరాదని ఆస్ప త్రుల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. కానీ చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు పది రెట్లకుపైగా ప్రతిరోజూ వసూలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు కరోనా చికిత్సకు రూ. 7–8 లక్షలు వసూలు చేస్తుండగా కార్పొరేట్ ఆస్పత్రులైతే ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంటు వ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. అంటువ్యాధుల చట్టం ఏం చెబుతోంది? కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ ఏడాదిపాటు అమలులో ఉంటుంది. కరోనా నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్), వైద్య, విద్య సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఈ చట్టం సర్వాధికారాలు కల్పించింది. వ్యాధిని నిరోధించడానికి ఎటువంటి చర్యలైనా తీసుకొనే అధికారం వారికి ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులపైనా వారికి అధికారాలుంటాయి. ఈ చట్టం ప్రకారం కరోనా లక్షణాలున్న కేసులను పరీక్షించడానికి, వైద్యం చేయడానికి అవసరమైనప్పుడు ఆస్పత్రులు ముందుకు రావాలి. వైద్యం చేసే ప్రైవేట్ ఆస్పత్రులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ భవనాన్ని నిర్బంధంగా స్వాధీనంలోకి తీసుకోవచ్చు. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని, నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా పరిగణించి తగు విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే చర్యలు... వివిధ రాష్ట్రాల్లో అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రభుత్వాలు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకున్నాయి. ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు వేసే బిల్లులను చూడటానికి ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో కనీసం ఇద్దరు ఆడిటర్లను ఏర్పాటు చేసింది. హిమాచల్ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరోనా చికిత్స కొనసాగిస్తున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలను నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇక్కడెలా చేద్దాం? కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను అడ్డుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి నిబంధనలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని, ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులను సేకరిస్తున్నామని వైద్య వర్గాలు అంటున్నాయి. చూస్తూ ఊరుకోం.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కరోనా ఫీజులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలా చేసే ఆస్పత్రులను చూస్తూ ఊరుకోం. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ రంగంలోనే పరీక్షలను పెంచాం. సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రజలు ప్రైవేట్ వైపు వెళ్లకుండా చైతన్యం చేస్తున్నాం. – ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించొద్దు..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదు.. వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా చెబుతున్నా..’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.వైద్యం అందలేదన్న దైన్యం మన రాష్ట్రంలో అసలే రాకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలన్నదే తన తపన అని చెప్పారు. మంగళవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులతో రాజ్భవన్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య చికిత్స బిల్లుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టంచేశారు. పేషెంట్ను అడ్మిట్ చేసేటప్పుడే పూర్తి పారదర్శకతతో చికిత్స వివరాలు, ఖర్చులు వివరించాలని, వారి నమ్మకాన్ని చూరగొనాలని ఆమె ఆకాంక్షించారు. ఆస్పత్రుల్లో పడకల అందుబాటు కోసం ‘బెడ్స్ పూల్’విధానం ద్వారా పేషెంట్లకు పడకల వివరాలు ముందే తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పేషెంట్లను ఆస్పత్రుల్లో పడకల కోసం అన్ని చోట్లా తిరిగే శ్రమ నుంచి ఉపశమనం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ–ప్రైవేట్ సమన్వయంతో..: కరోనా కేసులు మరిన్ని పెరిగినా ప్రభుత్వ–ప్రైవేట్ సమన్వయంతో అందరికీ వైద్యం అందించే విధం గా సిద్ధంగా ఉండాలని గవర్నర్ సూచించారు. దాదాపు 80% బాధితులకు చాలా తక్కువ స్థాయి లో లక్షణాలుంటాయని, వారికి హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించే క్రమంలో వీడియో కన్సల్టేషన్, కౌన్సెలింగ్, టెలి మెడిసిన్ పద్ధతుల్లో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. హైదరాబాద్ ఫార్మా, మెడికల్, ఐటీ హబ్గా గుర్తింపున్న దృష్ట్యా వీరంతా కలసి టెక్నాలజీ ద్వారా సమన్వయంతో రోగులకు సేవలు, వైద్యం అందించే విధంగా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు గవర్నర్ దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చారు. పేషెంట్లు రెమిడెసివిర్, ఫారావిర్ లాంటి ఖరీదైన మందులు అడుగుతున్నారని, ఎక్కువ మంది దీర్ఘకాలిక రోగాలతో వస్తున్నారని, అందుకే వైద్యం ఖర్చు పెరుగుతోందని వివరించారు. రెమిడెసివిర్ లాంటి మందుల కొరత ఉంది, తయారీ పెంచాలి, వాటిపై ప్రభుత్వ సబ్సిడీ కావాలని చెప్పారు. ఇక వెంటిలేటర్ల తయారీ పెంచాలని, వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ చెప్పారు. కాగా మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గవర్నర్ తమిళిసైతో రాజ్భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా చికిత్సకు సంబంధించిన వివరాలను ఆమెకు తెలిపారు. -
ఆ ఆస్పత్రులపై కొరడా!
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చార్జీలు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని కార్పొరేట్ ఆస్పత్రులు ఖాతరు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (సోమాజిగూడ) కేర్ ఆస్పత్రి (బంజారాహిల్స్), సన్షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్), మెడికవర్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. విపత్తుల నిర్వహణ చట్టాన్ని అమలు చేసి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ న్యాయవాది శ్రీకిషన్ శర్మ ప్రజా హిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాష్ట్రంలో కరోనా చికిత్సకు సంబంధించిన ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేటు ఆస్పత్రులు అపహాస్యం చేస్తున్నాయని ఆక్షేపించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయని ఆసుపత్రులపై కొరడా ఝుళిపించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇదే పని చేస్తుందని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు మించి వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వివరించాలని సూచించింది. చికిత్స, బిల్లింగ్లో పారదర్శకత లేదు.. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రతాప్ నారాయణ్ సంఘీ వాదనలు వినిపిస్తూ.. కరోనా చికిత్సకు ఆస్పత్రులు ఎంత ఫీజు వసూలు చేయాలో ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడంలేదని నివేదించారు. ప్రైౖవేటు ఆస్పత్రులు ఆ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నాయని, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల కరోనా చికిత్స, బిల్లింగ్ విషయంలో పారదర్శకతే లేదన్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దోపిడీకి పాల్పడే కార్పొరేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ప్రకారం వైద్య వృత్తిలో నైతిక విలువలు నిలబెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీడియా కథనాలను చూస్తుంటే ప్రైవేటు ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. రూ.1.5 లక్షల ఫీజు చెల్లించలేదంటూ ఛాదర్ఘట్లోని తుంబే ఆసుపత్రి ఓ ప్రభుత్వ వైద్యాధికారిణి సుల్తానాను నిర్భంధించినట్లు పత్రికల్లో వచ్చిందని తెలిపింది. ఇలా చేయడమంటే ప్రభుత్వ ఉత్తర్వులను అపహాస్యం చేయడమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. -
చచ్చినా వదలట్లేదు
గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో నిమ్మ బస్వ నాగరాజు (42) కరోనాతో గత నెల 25న చేరి ఈ నెల 4న మృతి చెందారు. మొత్తం రూ. 7.20 లక్షల బిల్లు అయిందని, అందులో కేవలం రూ.4 లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేందుకు ఒప్పుకుందని, మిగిలిన రూ.3.20 లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మృతదేహం ఆస్పత్రి అధీనంలోనే ఉందని పేర్కొన్నారు. ఎండీ సులేమాన్ తహసీన్ (30) కరోనాతో సికింద్రాబాద్లోని ఓ ఆస్పత్రిలో జూన్ 12న చేరి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన కుటుంబసభ్యులు రూ.11 లక్షల బిల్లును ఆస్పత్రికి కట్టగా,మొత్తంరూ.16.17 లక్షల బిల్లు అయిం దని, మిగిలిన 5.17 లక్షల బిల్లుల బకాయిలు కడితేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో చేసేది ఏం లేక వాళ్లు అడిగిన మొత్తం ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి విప త్కర సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులు ధనదాహంతో పేట్రేగుతున్నాయి. రోగి సంబంధీకుల భయాన్ని సొమ్ము చేసుకుంటూ లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. రోగి చనిపోయినా బకాయిలు కట్టనిదే మృతదేహాలను ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. కరోనా వస్తే ఆరోగ్య పరంగా కోలుకోవ డం ఒక ఎత్తు అయితే... లక్షల్లో బిల్లులను వేసి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వస్తే ఖతమేననే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘిస్తు న్నాయి. అయినవారు మరణించడంతో తీవ్ర దుఃఖంలో మునిగి ఉండే కుటుంబ సభ్యుల నుంచి రూ.లక్షల ఫీజుల బకాయిలను ముక్కు పిండి వసూలు చేసిన తర్వాతే మృత దేహాలను అంత్యక్రియలకు అప్పగిస్తున్నాయి. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) బిల్లులను తగ్గించాలని కాళ్లు చేతులు పట్టుకున్నా ఆస్పత్రుల యాజమాన్యాలు కనికరించ డం లేదు. దీంతో అప్పో సప్పో చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం తీసుకెళ్లడానికే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఫీజుల బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విషయంలో నిర్దయగా వ్యవహరిస్తున్నాయని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజుల బకాయిలు చెల్లించే స్తోమత తమకు లేదని, అయినవారి మృతదేహాలను ఆస్పత్రుల నుంచి విడిపించాలని రోజూ చాలా మంది ట్వీటర్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావుకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరికి అండగా చాలా మంది నెటిజన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఫీ‘జులుం’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గళం ఎత్తుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో కొన్ని ఆస్పత్రులు కొద్దిగా వెనక్కి తగ్గి కొంత వరకు ఫీజుల బకాయిలను తగ్గించడంతో పాటు మృతదేహాలను అంత్యక్రియలకు అప్పగిస్తున్నాయి. చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడి రోగులు మొత్తం ఫీజుల బకాయిలు చెల్లించడంలో విఫలమైతే వారిని నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమంగా నిర్భందిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000) జేబులకు స్కాన్.. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తీవ్రమైన దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదు. కరోనా చికిత్స కోసం వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితిని ముందుగానే ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు స్కాన్ చేస్తున్నాయి. చికిత్స ప్యాకేజీ వివరాలను రోగి బంధువులకు తెలియజేస్తున్నాయి. బిల్లులు ఎంతైనా చెల్లించగలరని నిర్థారణకు వచ్చిన తర్వాతే రోగులను ఆస్పత్రి గడప తొక్కేందుకు అనుమతిస్తున్నాయి. అంత చెల్లించలేమని... బిల్లులు తగ్గించాలని ఎవరైనా బతిమిలాడితే ఆస్పత్రిలో బెడ్లు లేవని మాటమార్చి తిప్పి పంపిస్తున్నాయి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అడ్వాన్స్ చెల్లిస్తేనే ఆడ్మిట్ చేసుకుంటున్నాయి. పూర్తిగా కోలుకోవడానికి 15 నుంచి 20 రోజుల దాకా ఆసుపత్రిలో ఉండాల్సి రావడంతో కార్పొరేట్ ఆసుపత్రులు భారీ బిల్లులను చేతిలో పెడుతున్నాయి. రోజుకు రూ. లక్ష.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సపై నమ్మకం లేక చాలా మంది కరోనా రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటులో చేర్పిస్తే ప్రాణాలైనా దక్కుతాయని కుటుంబసభ్యులు సైతం మొగ్గు చూపుతున్నారు. రోగుల ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురి చేసి వివిధ రకాల చికిత్సలకు ఫీజులు, మందుల ఖర్చులు పేరుతో రోజుకు కనీసం రూ.లక్షకు పైనే ఫీజులను ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు విధిస్తున్నాయి. దీంతో వారం రోజుల చికిత్సకు రూ.5 నుంచి రూ.10 లక్షలు, రెండు వారాల చికిత్సకు రూ.12 నుంచి రూ.20 లక్షల వరకు ఫీజులను ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి బిల్లు మొత్తం ఉంటోంది. జీవో గీవో..జాన్తా నై ! ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జీవో నం.248 జారీ చేసింది. ల్యాబ్ పరీక్షలు, ఆస్పత్రుల్లో కేటగిరీల వారీగా వివిధ రకాల చికిత్సలకు ఫీజుల ప్యాకేజీలను ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. ఆయా కేటగిరీల వారీగా ఏ మేరకు ఫీజులు చెల్లించాలి, అందులో కల్పించాల్సిన సౌకర్యాలేమిటనే దానిపై స్పష్టత ఇచ్చింది. కానీ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు వాటికి తిలోదకాలు ఇస్తున్నాయి. కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శించాలని సర్కారు నిబంధన విధించింది. ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. రోగి, అతని బంధువులకు సేవల వివరాలను వెల్లడించాలి. కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వాళ్లు, అతి తక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దు. వీరిని హోం ఐసోలేషన్కు పరిమతం చేయాలని కేంద్ర మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇవేవీ పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రైవేటు బీమాతో ఏం లాభమన్న ధోరణి... ప్రభుత్వ బీమా పథకాలను కరోనా చికిత్సకు జోడించలేదు. ఇక ప్రైవేటు బీమా సంస్థల పాలసీలను కూడా పట్టించుకోవడంలేదు. ఇన్సూరెన్స్ పథకాలను ఆస్పత్రులు అనుసరిస్తే బిల్లులను క్రమ పద్దతిలో రూపొందించాల్సి ఉంటుంది. ప్రతి చికిత్సకు సంబంధించిన పూర్తి సేవలు నిర్దేశించిన ధరల ప్రకారమే ఇవ్వాలి. అలాంటప్పుడే బీమా సంస్థలు ఆయా బిల్లులను ఆమోదించి నిధులు విడుదల చేస్తాయి. సాధారణ రోజుల్లో ఆస్పత్రులు ఈ తరహా కేసులను స్వీకరించేవి. కానీ కరోనా చికిత్సలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా... వైద్యులు, వైద్య సిబ్బంది కూడా రిస్క్తో కూడిన పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యాలు నిర్వహణ కింద భారీగా బిల్లులను రోగులపై రుద్దుతున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. ► అంబర్పేట్కు చెందిన మీర్ఫారూక్ అలీ ఖాన్ (67) కరోనా చికిత్స కోసం సికింద్రబాద్లోని మరో ఆస్పత్రిలో జూన్ 20న చేరి 27న మరణించారు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.లక్ష బిల్లు చెల్లించగా, చికిత్స కోసం మొత్తం రూ.4.25 లక్షల బిల్లు అయిందని, మిగిలిన రూ.3.25లక్షల బిల్లు బకాయిలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం మొండికేసింది. ► తలాబ్కట్టకు చెందిన మహమ్మద్ అబ్బాస్ అలీ కరోనాతో జూన్ 19న బేగంపేటలోని ఆస్పత్రిలో చేరగా, జూలై 4న చికిత్స పొందుతూ మరణించారు. అప్పటికే అతడి కుటుంబ సభ్యులు రూ.5.30 లక్షల బిల్లులను ఆస్పత్రికి చెల్లించగా, మిగిలిన రూ.5.25 లక్షల బిల్లు బకాయిలు చెల్లించి మృతదేహం తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. ► మనోజ్ కోఠారి (47) కరోనాతో జూన్ 20న సోమాజిగూడలోని ఓ పైవ్రేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా 28న డిశ్చార్జి రాశారు. అయితే బిల్లు సెటిల్ చేయలేదని ఆస్పత్రిలోని ఓ గదిలో అక్రమంగా నిర్బంధించి పెట్టారు. ఈ ఘటనపై ట్వీటర్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం స్పందించడంతో చివరకు ఆయనని ఇంటికి పంపారు. సర్కారు ఖరారు చేసిన ప్రకారం కరోనా ప్యాకేజీ రోజువారీగా ... 1) జనరల్ వార్డ్ + ఐసోలేషన్కు– రూ. 4 వేలు 2) ఐసీయూ(వెంటిలేటర్ లేకుండా)+ ఐసోలేషన్కు– రూ. 7500 3) ఐసీయూ(వెంటìలేటర్తో సహా)+ ఐసోలేషన్కు– రూ. 9 వేలు ఛార్జి చేయాలి. ప్యాకేజీలో భాగంగా రోగికి సీబీపీ, యూరిన్ రొటీన్, హెచ్ఐవీ స్పాట్, యాంటీ హెచ్ఐవీ, హెచ్బీఎస్, సీరం క్రియాటిన్, యూఎస్జీ, 2డి ఇకో, డ్రగ్స్, ఎక్స్రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్ చార్జెస్, మీల్స్తో పాటు ప్రొసిజర్స్ సేవలు కల్పంచాలి. ఇక ప్యాకేజీ కిందకు రానివాటిని 2019 డిసెంబర్ 31 నాటి రేట్ల ప్రకారం వసూలు చేసుకోవచ్చు. పీపీఈ, ఇంటర్వెన్షల్ ప్రొసిజర్ (సెంట్రల్ లైన్ ఇన్సర్షన్, కీమోపోర్ట్ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్ ప్రొసిజర్, బయాప్సిస్, యాసిటిక్/ప్లైరల్ టాప్పింగ్) చార్జ్ చేయాలి. కోవిడ్–19 టెస్టింగ్ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం), హైఎండ్ డ్రగ్స్ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్ న్యూట్రీషన్, టోసిల్జంబ్..)కు ఎంఆర్పీ ధరలు, హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్ పరీక్షలు) వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలతో రెండు వారాల పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందితే రూ.56 వేల నుంచి రూ.1.26లక్షల బిల్లు మాత్రమే కానుంది. అయితే, పీపీఈ కిట్ల ఖర్చులు, ఇతర రోగాలకు చికిత్సల పేరుతో అదనంగా ఫీజులను వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో దీనిని అవకాశంగా మార్చుకొని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రెచ్చిపోతుండడంతో ఉన్నతాధికారులు సైతం నివ్వెరబోతున్నారు. -
ఆరోపణలకు ఆధారాలేవీ?
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణ వైద్యం పేరుతో పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రధానంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘ఫీజుల జులుం’ఉందని దాఖలైన పిల్లోని ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా అధిక ఫీజుల్ని వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులను ప్రతివాదులుగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫీజు రోజుకు రూ.4 వేల నుంచి రూ.9 వేలు వసూలు చేయాలని, అయితే రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని పట్నం అనే సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డి.జి.నర్సింహారావు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డబ్బే ధ్యేయంగా కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి దోపిడీ చేస్తున్నాయని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల ఆగడాల దోపిడీని అడ్డుకోవాలని, వీటిలో 50 శాతం బెడ్స్ను ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా రోగులకు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎక్కడ దోపిడీ జరుగుతోందో స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆయా ఆస్పత్రులను ప్రతివాదిగా చేయాలని, ఆధారాల వివరాలు కూడా అందజేయాలని కోరిన ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
ఇంటికే కార్పొ‘రేట్’ వైద్యం
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధిత రోగులకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయి. వైరస్ సోకినా..ఏ లక్షణాలు లేకుండా హోం క్వారంటైన్లో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి ఒక్కో ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు..కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులను చేర్చుకోలేని పరిస్థితి.. ఈ క్రమంలో బాధితులు ఆస్పత్రికి రానవసరం లేకుండా, వైద్యులే వారింటికెళ్లి సేవలందించే అవకాశాన్ని నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకోసం బాధితులకు ప్రత్యేక గది, ఆండ్రాయిడ్ ఫోన్, దానికి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆన్లైన్లో రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. తగిన మందులు సూచిస్తూ, వాటిని తమ సిబ్బంది ద్వారా నేరుగా రోగి ఇంటికే పంపిస్తారు. వీటితో పాటు మాస్క్లు, శానిటైజర్లు, గ్లౌజులు ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నట్లు ప్రకటించాయి. కొన్ని ఆస్పత్రులు 14 రోజులకు రూ.14,000 ప్యాకేజీగా నిర్ణయిస్తే.. మరికొన్ని రూ.19,500 వరకు ధరలు నిర్ణయించాయి. ఆ ఫీజులతో పోలిస్తే ఈ ప్యాకేజీలే ఉత్తమం! కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల ఫీజును ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకుంటే రూ.2,200, ఆస్పత్రి సిబ్బంది బాధితుని ఇంటికెళ్లి శాంపిల్ సేకరించి టెస్టుచేస్తే రూ.2,800గా నిర్ణయించింది. పాజిటివ్ వచ్చిన వారు ఆస్పత్రిలో చేరితే.. సాధారణ ఐసోలేషన్ వార్డు చికిత్సకు రోజుకు రూ.4,000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చికిత్సకు రూ.7,500, వెంటిలేటర్తో చికిత్సకు రూ.9,000 నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ప్యాకేజీలో రక్త, మూత్ర, యాంటీ హెచ్సీవీ, హెపటైటిస్, సీరం క్రియాటినైన్, ఈసీజీ, మందులు, గుండె పరీక్షలతో పాటు ఎక్స్రే, ఆల్ట్రాసౌండ్, వైద్యుల ఫీజు, బెడ్ చార్జీ, ఆహారం వంటివి వర్తిస్తాయి. ఈ ధరలు గిట్టుబాటు కావంటూ ఆయా కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్సలను నిరాకరిస్తున్నాయి. దీనికంటే హోం క్వారంటైన్లో ఉండి, ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు పొందడమే ఉత్తమమని, చార్జీలు కూడా తక్కువేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. -
మరో 10 వేల పడకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం వైద్య ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన మరో 10 వేల పడకలను 7–10 రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులతో వైద్య, ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. తాము అన్ని విధాలుగా కరోనా చికిత్సకు రంగం సిద్ధం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు కరోనా స్టేట్ హై లెవల్ కమిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రైవేటు బోధనాస్పత్రులు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పాజిటివ్ రోగులను వాటిల్లో ఉంచి ప్రభుత్వం చికిత్స అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ, ఛాతీ, నేచర్ క్యూర్ ఆస్పత్రులతోపాటు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు బోధనాస్పత్రులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. బోధనాస్పత్రుల్లో ఫీజులపై తర్జనభర్జన... రాష్ట్రంలో 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటి అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయాలని ప్రభుత్వం భావించినా యాజమాన్యాలు మాత్రం ఎన్నాళ్లు అలా చేయగలమని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఖరారు చేసిన ఫీజుల అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు సాధారణ ఫీజులు వసూలు చేసుకొనేలా ఫిక్స్డ్ రేట్లను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు కరోనా ఐసోలేషన్ (జనరల్ వార్డు)కు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా ఐసోలేషన్కు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ సహా ఐసోలేషన్కు రూ. 9 వేల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రైవేటు బోధనాస్పత్రులకు ఈ మేరకు కాకుండా కాస్త తక్కువగా ఫీజులు ఖరారు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చకచకా ఏర్పాట్లు జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ కొన్ని పడకలను కరోనా చికిత్సకు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో 70 ఆస్పత్రులకు వెంటిలేటర్లను సరఫరా చేసింది. ఒక్కో ఆస్పత్రికి 3–4 వెంటిలేటర్ల చొప్పున సరఫరా చేశామని అధికారులు తెలిపారు. లక్ష కేసులొచ్చినా వైద్యం అందించేలా రంగం సిద్ధం చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. శనివారం నాటికి రాష్ట్రంలో 13,436 పాజిటివ్ కేసులుండగా అందులో ప్రస్తుతం 8,265 యాక్టివ్ కేసులున్నాయి. గాంధీ సహా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 500 మంది వరకు మాత్రమే చికిత్స పొందుతుండగా మరో 1,500 మంది వరకు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. మిగిలిన 6 వేల మందికిపైగా ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇళ్లలో ఉన్న వారికి చికిత్స అందించే విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న విమర్శలను సర్కారు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సరైన పర్యవేక్షణ లేదన్న భావన కూడా ఉంది. కాబట్టి దీన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
నిమ్స్ 'ఖాళీ'!
దేశంలోని ఎయిమ్స్ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లు.. కానీ.. ఎయిమ్స్కు అనుబంధంగా కొనసాగుతున్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల పదవీ విరమణ వయసు మాత్రం 60 ఏళ్లే.. దీంతో ఈ ఆస్పత్రిలో మంచి హస్తవాసి, పేరున్న వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడంలేదు. వీరి పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో కీలకమైన కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ వైద్యసంస్థలో వచ్చే జూలై చివరి నాటికి 12 మంది, 2022 నాటికి మరో 30 మంది సీనియర్ వైద్యులు రిటైర్డ్ కానున్నారు. సాక్షి, హైదరాబాద్: నిమ్స్లో వైద్యుల పోస్టులు ఒక్కొక్కటే ఖాళీ అవుతున్నాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటంతో మరికొందరు వైద్యులు బయటి వేతనాలకు ఆశపడి ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్లకే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే యత్నం చేయడంలేదు. ఫలితంగా 311 పోస్టులకు 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీ ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు.. రోగుల చికిత్సపైనా ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేక, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా.. యాజమాన్యం విముఖత చూపుతోంది. జూనియర్లే పెద్దదిక్కు అంతర్గత విబేధాలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఆఫర్లతో ఇప్పటికే చాలామంది వైద్యులు నిమ్స్ను వీడిపోయారు. 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడంతో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డయాబెటిక్ నిపుణుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేందర్, డాక్టర్ సుభాష్కౌల్, డాక్టర్ జీఎస్ఎన్రాజు సహా పలువురు ఆస్పత్రికి దూరమయ్యారు. న్యూరో ఫిజీషియన్ విభాగాధి పతి డాక్టర్ వీణాకుమారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. జూలై చివరికి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి సహా సీటీ సర్జన్ ఆర్వీకుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప, డాక్టర్ జోత్స్న, డాక్టర్ ఉషారాణి, డాక్టర్నాగేశ్వరరావు తదితరులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా విభాగాలకు ఇక జూనియర్ వైద్యులే పెద్దదిక్కు కానున్నారు. ఇప్పటికే సీనియర్లు లేక రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. ఆయా విభాగాలపై ఆధారపడిన రోగులతోపాటు సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. రెసిడెంట్లపైనే భారమంతా.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. 1986లో దీని పడకల సామర్థ్యం 500 కాగా, ప్రస్తుతం 1,500కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగిన వైద్యులు లేకపోవడంతో రెసిడెంట్లపై భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయా ల్సి వస్తుంది. ‘నిమ్స్లో రోగులకు ఇంకా సేవచేసే ఓపిక ఉంది! మరికొంత కాలం పనిచేసే అవకాశమివ్వండి’ అని పలువురు నిపుణులు నిమ్స్ పాలకమండలికి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ‘ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి సమావేశం ఉంది. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. పేరు గొప్ప.. అన్నింటా తీసికట్టు - నిమ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ముఖ్యమంత్రే దీనికి ఛాన్సలర్గా ఉంటారు. - ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇక్కడ నియామకాలు, పదోన్నతులు ఉంటా యి. ఉస్మానియా, గాంధీలో త్రిటైర్ విధానం అమల్లో ఉండగా, నిమ్స్లో ఫోర్టైర్ విధానం అమల్లో ఉంది. - ఉస్మానియాలో అసిస్టెంట్ కేడర్లో చేరిన ఓ వైద్యుడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫె సర్, చివరకు ప్రొఫెసర్ కేడర్కు చేరుకుంటారు. ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుంది. - నిమ్స్లో అసిస్టెంట్ కేడర్లోని వైద్యు డు అసోసియేట్, అడిషనల్ ప్రొఫె సర్ కేడర్లను దాటుకుని ప్రొఫెసర్ కేడర్కు చేరుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ కేడర్ రావడానికి 12 నుంచి 14 ఏళ్లు పడుతోంది. - ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే అవకాశముంది. ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందుతాయి. కానీ నిమ్స్ వైద్యుల బయటి ప్రాక్టీస్ నిషేధం. ఆరోగ్య శ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందవు. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులతో పోలిస్తే వీరి వేతనాలు చాలా తక్కువ. -
మెడికల్ టూరిజంలో ‘ప్రైవేటు’ వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఎప్పుడైనా వైద్య సదస్సులు పెడితే మెడికల్ టూరిజంలో తాము ఎంతో ఘనత సాధించినట్లు చెప్పుకొంటారు. హైదరాబాద్ను మెడికల్ హబ్ అని అభివర్ణిస్తుంటారు. కానీ కేంద్రం సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రం మెడికల్ టూరిజంలో 15వ స్థానంలో ఉంద ని పేర్కొంది. మెడికల్ టూరిజాన్ని అత్యధికంగా పెంపొందించే ప్రైవేటు ఆసుపత్రులు.. విదేశీ రోగు లను తమవైపు తిప్పుకోవడంలో, వైద్య రంగంలో వచ్చిన మార్పులపై మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2018లో తెలంగాణకు 3.18 లక్షల మంది విదేశీ టూరిస్టులు రాగా, అందులో 19 వేల మంది వరకు వైద్యం కోసం వచ్చినట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే కాస్తంత పెరిగినా, దేశవ్యాప్త పరిస్థితితో పోలిస్తే అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. తమిళనాడు టాప్.. కేంద్ర పర్యాటక శాఖ దేశంలో ఏ రాష్ట్రాలకు ఎంతమంది పర్యాటకులు వస్తారో వెల్లడించింది. 2018లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 2.88 కోట్ల మంది విదేశీయులు వచ్చారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. అందులో వైద్యం చేయించుకునేందుకు 17.32 లక్షల మంది వచ్చినట్లు అంచనా వేసింది. అంటే విదేశీ పర్యాటకుల్లో 6 శాతం వరకు వైద్యం కోసం మన దేశానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అందులో తమిళనాడుకు అత్యధికంగా 60.74 లక్షల మంది పర్యాటకులు రాగా, వైద్యం కోసం వచ్చిన వారు 3.6 లక్షల మంది ఉంటారని అంచనా. విచిత్రమేంటంటే ఎంతో వెనుకబడి ఉండే బిహార్కు 2018లో 10.87 లక్షల మంది పర్యాటకులు వస్తే, వైద్యం కోసం వచ్చిన వారు 65 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఇతర రాష్ట్రాలన్నీ కూడా మెడికల్ టూరిజంపై దృష్టి సారించాయి. అయితే కొన్ని రాష్ట్రాలకు సాధారణ పర్యాటకులు వస్తుంటారు. మెడికల్ హబ్గా వెలుగొందుతున్న ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలకు పర్యాటకులు వైద్యం కోసం కూడా అధికంగా వస్తుంటారు. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సర్వీసు ప్రొవైడర్లకు ఆర్థిక సాయం అందిస్తుంది. మెడికల్ టూరిజం ఫెయిర్స్, మెడికల్ కాన్ఫరెన్స్, వెల్నెస్ కాన్ఫరెన్స్, వెల్నెస్ ఫెయిర్స్, మెడికల్ రోడ్ షోలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తుంది. కానీ వీటిని ఉపయోగించుకోవడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక సారాంశం. మన రాష్ట్రానికి ప్రధానంగా మోకాళ్ల చికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్, యాంజియోప్లాస్టీ, యూరాలజీ, కేన్సర్ వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. టాంజానియా, సోమాలియా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఇరాక్, దుబాయ్ వంటి దేశాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రచారంలో వెనుకంజ.. హైదరాబాద్ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అనేకం మార్కెటింగ్ చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాయన్న విమర్శలున్నాయి. మార్కెటింగ్పై కంటే ఆర్ఎంపీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని కొందరు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా డిజిటల్ మార్కెటింగ్పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు మంచి పేరు తెచ్చుకోవడంకంటే లాభాలపైనే దృష్టిసారిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రంలో వైద్య ఖర్చులు, ఫీజులు అధికంగా ఉన్నాయన్న భావన విదేశీయుల్లో ఉందని చెబుతున్నారు. -
కార్పొ‘రేటు’ ఏజెంట్లు
వైద్యం.. సేవ.. అన్నమాట ఒకప్పటిది.. ప్రస్తుతం వైద్యం.. పక్కా వ్యాపారంగా మారింది. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రణాళికా బద్ధంగా సాగిపోతోందీ వ్యాపారం. ప్రస్తుతం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే కార్పొరేట్ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే పరిస్థితి. సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)ల నుంచి పట్టణాల్లో పెద్ద డాక్టర్ల వరకు రోగుల నుంచి వచ్చే కమీషన్లపైనే బతుకుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. డాక్టర్లకు లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి మరీ కార్పొరేట్ ఆసుపత్రులు వారిని పోషిస్తున్నాయి. ఆ ఖర్చులను రోగులపై రుద్దేస్తూ ఒకవైపు... మరోవైపు రోగుల సంఖ్య పెంచేలా డాక్టర్లకు సైతం టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సదరు డాక్టర్లు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీలకు కమీషన్లు ఇస్తున్న డాక్టర్లు ఆ డబ్బులను రోగులపై బాదేస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం మూడు సిరెంజీలు.. ఆరు మందు బిళ్లలుగా సాగిపోతోంది. డాక్టర్ల ముసుగులో.. అక్షరం ముక్క మెడికల్ టెర్మినాలజీ రాని ఆర్ఎంపీలంతా డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇస్తూ పిలిస్తే పలికే ఆర్ఎంపీల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా ఒక్కటేమిటి ఆర్ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలకు 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నాయి. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నాచితకా వైద్యం చేసుకునే ఆర్ఎంపీలు కార్పొరేట్ ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకుని రోగులను, వైద్యాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. జిల్లాలో వేళ్లూనుకున్న మెడికల్ మాఫియా చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి ఎక్కువ ఖర్చు చేయిస్తూ తమ వాటా తాము తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆర్ఎంపీలు ఏర్పాటు చేస్తున్న క్లినిక్ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్వో పేరుతో ఒక బృందం ఉంటుంది. ఏ ఆపరేషన్కు ఎంత కమీషన్ ఇవ్వాలి, ఏ ఆర్ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి పీఎంపీలతో కొత్త డీల్స్ కుదుర్చుకుంటూ ఉంటారు. నిత్యం రూ.కోట్లలో సాగుతున్న ఈ దందాపై అధికారులు దృష్టి సారించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘కాసు’పత్రులు కాలంతోపాటు వైద్య రంగంలో సేవాభావం కనుమరుగవుతోంది అనడానికి కార్పొరేట్ ఆసుపత్రులే ఉదాహరణ. కార్పొరేట్ వైద్యంలో చాలా భాగం కాసులే పరమావధిగా సాగుతోందనే అపవాదు ఉంది. జిల్లాలో సుమారు 2 వేల వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటే దాదాపు 50 వరకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటికీ అనుసంధానంగా సుమారు 2 వేల మంది ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రులు అంటే సామాన్యుల నుంచి కాసులు పిండే యంత్రాలుగా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల చిన్నపాటి ఆసుపత్రులన్నీ కలిసి తమకు అనుసంధానంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. రోగులను చివరి క్షణం వరకూ పీల్చి చివరి దశలో డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన రోగి నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు అనుసంధానంగా డయోగ్నోస్టిక్ సెంటర్లు సైతం ఇదే తరహా దోపిడీ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సాధారణంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీబయోటిక్స్ వాడటం వంటివి ఆర్ఎంపీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలోని కొందరు ఆర్ఎంపీలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ గర్భవిచ్చిత్తికి సైతం మందులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జిల్లాలోని ఆర్ఎంపీలు నిబంధనలు మీరి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరైతే స్టెరాయిడ్స్ కూడా రోగులపై ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెంగీ టెస్టులు రాయడం, యాంటీ బయోటిక్స్ మందులు ప్రిస్క్రైబ్ చేయడం వంటివి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. కొందరు ఆర్ఎంపీలు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా క్లినిక్లు సైతం ఏర్పాటుచేశారు. వీరిపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. – వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
రోగం మింగుతోంది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం చేస్తున్న ఖర్చు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ.7,941 కోట్లు ఖర్చు చేస్తున్నారని జాతీయ ఆరోగ్య అంచనా నివేదిక వెల్లడించింది. ఇది రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.4 శాతంతో సమానం. అంటే తలసరి వైద్య ఖర్చు రూ.3,054 ఉండటం గమనార్హం. రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యానికి చేస్తున్న ఖర్చు రూ.5,148 కోట్లు. ప్రభుత్వం, ప్రజలు కలిపి రాష్ట్రంలో వైద్యానికి చేస్తున్న ఖర్చు మొత్తం రూ.13,089 కోట్లు. ప్రజలు చేస్తున్న ఖర్చులో 70 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తోంది. మిగిలిన సొమ్ము మందుల కోసం, ఇతరత్రా ఖర్చవుతోంది. వైద్యం కోసం అవుతున్న ఖర్చులో ప్రజలు తమ జేబులో నుంచే 64.7 శాతం ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11.2 శాతం, కేంద్రం 8.6 శాతం, ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు 4.4 శాతం, స్థానిక ఆరోగ్య పథకాల ద్వారా 1.7 శాతం, ఇతర పథకాల ద్వారా 5.2 శాతం, ప్రభుత్వ ఆరోగ్య బీమాల ద్వారా 4.2 శాతం ఖర్చవుతోంది. అంటే ప్రజల జేబులే గుల్లవుతున్నాయని జాతీయ అకౌంట్స్–2018 నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ సంపాదనలో 10 శాతం వరకు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. దారుణమైన పరిస్థితి ఏంటంటే.. వైద్యానికి అవుతున్న ఖర్చు కారణంగా దేశంలో ఏటా దాదాపు 3.5 కోట్ల మంది నిరుపేదలుగా మారుతున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉందని నివేదిక తెలిపింది. వ్యాధులు చుట్టుముడుతున్నాయి.. బీపీ, మధుమేహం, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశు మరణాలు, ఎయిడ్స్, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్లు వరుసగా ఆయా స్థానాల్లో ఉన్నాయి. 2040 నాటికి వచ్చే సరికి అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు మొదటి స్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ కేన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉండే మలేరియా, 2040 నాటికి 22వ స్థానానికి చేరుకోనుంది. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రస్తుతం 5వ స్థానంలో ఉంటే, 2040 నాటికి 8వ స్థానానికి చేరుకోనుందని అంచనా. ప్రస్తుతం వ్యాధులు వస్తున్న వారిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. యూనివర్సల్ హెల్త్ కేర్.. అందరికీ ఉచిత ఆరోగ్యం తీసుకురావాలని న్యూయార్క్లో రెండ్రోజుల కిందట జరిగిన అంతర్జాతీయ నేతలు నిర్ణయించారు. దీనిపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ ప్రకారం ఎవరూ వైద్యం అందక చనిపోవడం కానీ, రోగాల బారిన పడటం కానీ జరగకూడదనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం. ఆ ప్రకారం తెలంగాణలో చూస్తే కోటి కుటుంబాలు వివిధ ఆరోగ్య పథకాల్లో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 77.19 లక్షల కుటుంబాలు, ఉద్యోగుల పథకం ద్వారా 5.75 లక్షల మంది, సింగరేణి, పోలీసు, ఈఎస్ఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మిగిలినవారు వైద్య వసతులు పొందుతున్నారు. అందుకోసం ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జబ్బు వస్తేనే వైద్యం కాకుండా జబ్బు రాకముందే స్క్రీనింగ్ చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 2025 నాటికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని మన దేశం కూడా అనుసరించాలని తెలిపింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం. శారీరక శ్రమ చేసే వారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్యను 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించాలని సూచించింది. ముందస్తు చర్యలే కీలకం : డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ అందరికీ ఉచిత వైద్యమనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది. వైద్యం కోసం ఖర్చు తడిసి మోపెడు అవుతుండటంతో ప్రజలు పేదలుగా మారిపోతున్నారు. తాజాగా న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ నేతలు యూనివర్సల్ హెల్త్ కేర్పై సంతకాలు చేశారు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కంటే ప్రజలు 70 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది మారాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వ్యాధులతో మానవ వనరులు వృథా : డాక్టర్ కమల్నాథ్, హైదరాబాద్ వ్యాధులు చుట్టు ముట్టడం, ఆసుపత్రుల వైపు జనం పరుగులు తీస్తుండటంతో మానవ వనరులన్నీ వృథాగా పోతున్నాయి. జబ్బులు రాకుండా చేయడం ద్వారానే ఈ పరిస్థితిని మార్చగలం. అందువల్ల ప్రభుత్వం అందరికీ బీపీ, షుగర్, కేన్సర్ వంటి స్క్రీనింగ్ వైద్య పరీక్షలు చేయాలి. ముందస్తుగా గుర్తిస్తే వాటిని నయం చేయడం సులువవుతుంది. -
డెంగీపై జర పైలం
దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ఒకటిగా వనపర్తి జిల్లా పొలికిపాడు పీహెచ్సీ పరిధిలోని ఆముదాలకుంట తండా నిలిచింది. గత నెల ఒకే ఒక్క రోజు ఇక్కడ 19 మందికి డెంగీ సోకింది. దీంతో ఆ గ్రామంలో ఆరోగ్య నిఘా పెంచారు. నీటి నిల్వ ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తేలింది. హైదరాబాద్లో గత బుధవారం ఒక్క రోజే దాదాపు 500 మందికి డెంగీ సోకినట్లు అంచనా. ప్లేట్లెట్లు 20 నుంచి 30 వేలకు పడిపోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వందల్లో వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డెంగీ వణికిస్తోంది. వేలాది మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్లేట్లెట్లు పడిపోతుండటం ప్రాణాలమీదకు వస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం.. ఈ జనవరి నుంచి గత బుధవారం వరకు 1,687 డెంగీ కేసులే నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 11 వేల మందిని పరీక్షించగా ఆ కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య ఎంతనేది వైద్య, ఆరోగ్యశాఖ లెక్కగట్టకపోవడం, నిఘా పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆముదాలకుంట తండాలో ఒకేసారి అన్ని కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అయినా ఇక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుస్తోంది. డెంగీ ప్రభావం ఇలా.. ఎడిస్ అనే దోమ వల్ల డెంగీ వస్తుంది. ఇది పగలే కుడుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. జ్వరం విపరీతంగా ఉన్నప్పు డు కూడా ప్లేట్లెట్ సంఖ్య తగ్గదు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్లు గణనీయంగా పడిపోతాయి. చాలా మంది ఇది గమనించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరికి తీవ్ర రక్తస్రావం అవుతుంది. ముక్కు, మలం ద్వారం లేదా బ్రష్ వేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధిక రక్తస్రావం అయితే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. 15 వేల కన్నా తగ్గినా గుర్తించకపోతే డెంగీ మరణాలు సంభవిస్తాయి. ప్లేట్లెట్ల గుర్తింపులో మతలబు.. ప్లేట్లెట్ గుర్తించేందుకు మెషీన్ కంటే మైక్రోస్కోప్ పరీక్ష మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒక రోగికి ప్లేట్లెట్ పరీక్ష చేస్తే మెషీన్ కౌంట్లో 32 వేలు చూపిస్తే, మైక్రోస్కోప్ ద్వారా మాన్యువల్గా లెక్కిస్తే 65 వేల వరకు ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రక్త కణాలు ఒక్కోసారి మూడునాలుగు కలిపి ముద్దగా ఉంటాయి. దాన్ని మెషీన్ ఒకే రక్త కణంగా లెక్కిస్తుంది. అదే మైక్రోస్కోప్ పద్ధతిలో పరిశీలిస్తే నాలుగు రక్త కణాలుగా చూపిస్తాయి. డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి -
సీఎం జగన్ స్ఫూర్తితో నేనున్నానని...
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందక మృతి చెందకూడదు. ప్రతిపేదవాడికీ నాణ్యమైన వైద్యం అందాలి.. అని నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఆ ఉదాత్త ఆశయంతోనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని తన మానస పుత్రికగా భావించి పక్కాగా అమలు చేశారు. పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. నాడు నాన్న వేసిన బాటలోనే.. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనాథగా మారిన ఆరోగ్యశ్రీని పొదివి పట్టుకొని.. మళ్లీ ఆర్తుల చెంతకు చేరుస్తున్నారు. ఇదే ఆశయ స్ఫూర్తిని విశాఖ నుంచే చాటిచెప్పారు. పదిరోజుల కిందట శారదాపీఠం సందర్శనకు వచ్చిన సందర్భంలో విమానాశ్రయంలో బ్లడ్ క్యాన్సర్తో ప్రాణాపాయంలో ఉన్న తోటి విద్యార్ధి నీరజ్ కోసం స్నేహితులు చేపట్టిన ఆందోళన చూసి చలించిన సీఎం జగన్ వెంటనే తన కార్యదర్శి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి వైద్యసాయానికి చర్యలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ బాటలోనే.. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారు.. డిఫ్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). రెండు కిడ్నీలు పాడై ఆర్ధిక బాధలతో చికిత్స కోసం అల్లాడిపోతున్న ధనోజ్కు బాసటగా నిలిచారు. ధనోజ్ దయనీయస్థితిపై నాలుగురోజుల కిందట సాక్షిలో వచ్చిన కథనంతో పాటు కుటుంబసభ్యులు పంపిన వాట్సాప్ మెసేజ్ను చూసి స్పందించిన ఆయన వారిని తనవద్దకు పిలిపించుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకంతో డబ్బుల కోసం నిన్నటి వరకు దాతల సాయం ఆశించిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఏకంగా సర్కారు అండ దొరికింది. ఎంత ఖర్చయినా సరే మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనని డిఫ్యూటీ సీఎం నాని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం మైక్యూర్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఒక్క వాట్సాప్ మెసేజ్తోనే ఆదరణ చూపిన డిఫ్యూటీ సీఎం నాని రుణం తీర్చలేనిదంటూ ధనోజ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. విశాఖలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోపణల్లో చిక్కుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చూపుతూ, నిబంధనలకు నీళ్లొదులుతూ రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. విశాఖలో ఆర్కే ఓమ్నీలో జరిగిన వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కాంక్షకు దర్పణం పడుతోంది. రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ పేద బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని రూ.70 వేలు వసూలు చేయడం, వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆటో నడుపుకుని బతుకీడుస్తున్న ఆ కుటుంబం అంత సొమ్ము చెల్లించుకోలేక వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వైద్యం అందిస్తోంది. ఇలా విశాఖలో పేద, మధ్య తరగతి రోగుల నుంచి రూ.లక్షల్లో కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి అరుదుగానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనకాపల్లి మండలం రేబాకకు చెందిన ఆటో డ్రైవర్ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్ (9)కు రెండు కిడ్నీలు పాడై పోయాయి. రెండు నెలల క్రితం ధనోజ్తో పాటు అతని సోదరుడు డెంగ్యూ జ్వరం బారినపడ్డారు. తొలుత వీరిని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినా నయం కాకపోవడంతో ఇదే ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అప్పట్లో ఇద్దరికీ రూ.1.50 లక్షలు బిల్లు చెల్లించారు. ఇటీవల ధనోజ్ ఫిట్స్తో పడిపోవడంతో తొలుత అనకాపల్లి ఆస్పత్రిలోనే చేర్చారు. అక్కడ వైద్యులు ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాబుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని, బతకాలంటే లక్షల్లో ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆటో నడుపుకుని బతికే తాము అంత ఖర్చును భరించలేమని ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలని కోరారు. ధనుష్ రోగం ఆరోగ్యశ్రీ కిందికి రాదని చెప్పి దశల వారీగా రూ.70 వేలు కట్టించుకున్నారు. వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ కుటుంబ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఈనెల 13న ‘సాక్షి’ ‘పేదింటి బిడ్డకు పెద్ద కష్టం’ శీర్షికతో కథనాన్ని ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న భావనతో కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ధనోజ్ పరిస్థితిని తెలియజేశారు. రూరల్ ఆస్పత్రులతో కార్పొరేట్కు లింకులు ఇక నగరంలోని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఆస్పత్రులతో లింకులున్నాయి. తమ వద్దకు వచ్చిన రోగులను నేరుగా విశాఖలోని ఫలానా ఆస్పత్రికి వెళ్లండంటూ పంపిస్తున్నారు. ఈ కేసుల నుంచి వచ్చే సొమ్ములో కొంత సొమ్మును పంపిన ఆస్పత్రులకు ఇస్తుంటారు. ఇదొక వ్యాపారంగా మారింది. ఉదాహరణకు ధనోజ్, అతని సోదరుడు రెండు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో అనకాపల్లిలోని లండన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నయం కాకపోవడంతో ఓమ్నీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇప్పుడు కిడ్నీ జబ్బుతో ఉన్న ధనోజ్ను ఓమ్నీకి మళ్లీ రిఫర్ చేసింది కూడా లండన్ ఆస్పత్రే. ఇలా జిల్లాలోను, నగరంలోనూ పలు ఆస్పత్రులకు ఎన్నో వ్యాపార లింకులున్నాయి. ఇదే ఇప్పుడు ఆయా హాస్పిటళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. మంత్రి నాని మానవత్వం తక్షణమే స్పందించిన మంత్రి వైద్య రికార్డులతో తన వద్దకు రమ్మని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అంతేకాదు..ఆరోగ్యశ్రీకి అర్హత ఉన్నా అందులో చేర్చకపోవడంపై ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలని, ఆరోగ్యశ్రీలో ఉచితంగా ధనోజ్కు వైద్యం అందించాలని ఆదేశించారు. కార్పొరేట్/ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి చేరుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి సూచనలతో ధనోజ్కు మెరుగైన వైద్యం అందించడానికి మంగళవారం ఉదయం నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైద్యం ఖర్చుపై ఆందోళన చెందవద్దని, ఆ సొమ్మును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. రూ. కోట్లలో బకాయిలు ఇన్నాళ్లూ ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కోట్లలో పేరుకుపోయిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించడం మానేసింది. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందజేస్తే బకాయిలు ఆలస్యంగా వస్తాయన్న ఉద్దేశంతో ఆయా ఆస్పత్రులు ఏవేవో వంకలు పెట్టి తిరస్కరిస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న రోగి కుటుంబ సభ్యులు అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని నగదు చెల్లించి వైద్యం చేయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోవడానికి ఇదో కారణమని చెబుతున్నారు. -
స్తంభించిన వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు స్తంభించాయి. కోల్కతాలో వైద్యులపై దాడిని ఖండిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు మినహాయించి మిగతా అన్నిరకాల వైద్యసేవలను నిలిపివేశారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్ వైద్యనిపుణులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రుల్లో వివిధ రకాల సేవలు అందజేసే మెడికల్, పారా మెడికల్ సిబ్బంది మొత్తం విధులను బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉస్మానియా, ఈఎన్టీ, గాంధీ, నిమ్స్, నిలోఫర్, కింగ్కోఠి, కోఠి ప్రసూతి ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, పేట్లబురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానా, మానసిక చికిత్సాలయం వంటి ప్రధాన ఆసుపత్రులతోపాటు ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యసేవలను నిలిపివేసి రోడ్లపైకి వచ్చారు. వైద్యులపై దాడులను అరికట్టాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతాచట్టం తేవాలని నినాదాలు చేశారు. సికింద్రాబాద్ సన్షైన్, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ తదితర కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్హోమ్స్ల్లోనూ వైద్యులు విధులను బహిష్కరించి ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించారు. ఔట్పేషెంట్ విభాగాల సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ రోగులు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవలను మాత్రం కొనసాగించారు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన వారికి వైద్యసేవలను అందజేశారు. తలలకు కట్టుతో వినూత్న నిరసన... కోల్కతాలో వైద్యులపై జరిగిన దాడికి నిరసన తెలిపేందుకు తల, కాళ్లు, చేతులకు కట్లు కట్టుకొని వినూత్న పద్ధతిలో డాక్టర్లు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి కోఠి, సికింద్రాబాద్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. రోగులకు ఎలాంటి బాధలు వచ్చినా నయం చేసేందుకు తాము ఉన్నామని, కానీ తమకు బాధలు వస్తే పట్టించుకొనేవాళ్లు లేరని పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల భద్రతపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు వీధినాటిక ప్రదర్శించారు. సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పీఎస్ రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్రెడ్డి, ఐఎంఏ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ సంజీవ్సింగ్ జాదవ్, కోశాధికారి డాక్టర్ శివలింగం, తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ రవికుమార్, ఉస్మానియా ఆసుపత్రి నుంచి డాక్టర్ రఘు, డాక్టర్ సిద్దిపేట్ రమేష్, డాక్టర్ కృష్ణారెడ్డి, తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు విజయేందర్గౌడ్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. -
నిమ్స్ వైద్యుల సేవలు అభినందనీయం
హైదరాబాద్/సోమాజిగూడ: ‘నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అరుదైన, క్లిష్టమైన చికిత్సలను చేసిన ఘనత ఇక్కడి వైద్యుల సొంతం. సూపర్స్పెషాలిటీ వైద్యం అందించే ఆస్పత్రికి సాధారణ రోగులు సైతం వస్తున్నారు. ఈ రోగుల నిష్పత్తికి తగినన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లేదు. అయినా వైద్యులు అందరికీ సేవలు అందిస్తున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సాధారణ రోగుల సంఖ్యను తగ్గించి, వైద్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం తొలిసారిగా ఆయన ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, కేన్సర్ విభాగాలను సందర్శించారు. ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పనుల పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా రోగుల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రోగులు ఆస్పత్రిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న డైరెక్టర్ మనోహర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రద్దీ తగ్గిస్తాం.. హృద్రోగ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు సాధారణ రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఆస్పత్రికి రోజూ సగటున ఓపీ 2000 పైగా ఉండగా, నిత్యం 1600 మంది ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. క్లిష్టమైన, అరుదైన సమస్యలతో బాధపడుతున్న వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరం ఉంటుంది. అదే సాధారణ జబ్బులతో బాధపడుతున్న వారికి జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందించడం ద్వారా నిమ్స్పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు. ఆ మేరకు ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం సహా అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిమ్స్వైద్యులు ఎంతో ఓపిగ్గా వైద్యసేవలు అందిస్తున్నారని, వారు చేస్తున్న ఈ సేవలు అభినందనీయమని ప్రకటించారు. చిన్న సమస్యను పెద్దగా చూపించొద్దు ఇటీవల ఓ రోగి కడుపులో కత్తెర ఉంచి కుట్టు వేసిన అంశంతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఎంతో అనుభవం నిష్ణాతులైన వైద్యులు ఇక్కడ ఉన్నారు. వైద్యసేవల్లో చిన్నచిన్న పొరపాట్లు సహజమేననీ, ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి, రాద్ధాంతం చేయడం మీడియాకు తగదన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదనీ, ఆస్పత్రి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు ఇస్తే..వాటిని పరిశీలించి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మెడికల్ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్ప్రైజెస్. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్ ఉత్పత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రవి కిరణ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది నెల్లూరు. బీ–ఫార్మసీ పూర్తయ్యాక.. విప్రో జీఈలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మేనేజర్గా చేరా. తర్వాత శామ్సంగ్ మెడికల్ ఎక్విప్మెంట్లో సేల్స్ మేనేజర్గా పనిచేశా. అప్పుడు గమనించింది ఏంటంటే? గ్రామాల్లోని ఆసుపత్రుల్లో మెడికల్, డయాగ్నస్టిక్ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో దగ్గర్లోని నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని! దీనికి పరిష్కారం చూపించేందుకు 2017 డిసెంబర్లో నెల్లూరు కేంద్రంగా ఆర్కే ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించాం. అందుబాటు ధరల్లో మెడికల్ ఉత్పత్తులు, మెడి కన్జ్యూమబుల్స్ని విక్రయించడం మా ప్రత్యేకత. 40కి పైగా వైద్య ఉత్పత్తులు.. స్కానింగ్ మిషన్స్, ఈసీజీ, ఫెటల్ మానిటర్స్, కార్డియో కేర్ వంటి 40 రకాలకు పైగా వైద్య ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కేబుల్స్, ప్రింటర్స్, పేపర్స్ వంటి మెడి కన్జ్యూమబుల్స్ కూడా ఉంటాయి. ఉత్పత్తుల కోసం బయోనెట్, ఫెటల్, వాటెక్ ఇండియా, డాల్ఫిన్, ఫిలిప్స్, క్రౌన్డెంట్, ఆట్రియం వంటి 12 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే సోనీ, సియామ్స్, సీమెన్స్తోనూ ఒప్పందం చేసుకోనున్నాం. నెలకు రూ.50 లక్షలు.. వైద్య ఉత్పత్తుల విక్రయంతో పాటూ ఇన్స్టలేషన్, సర్వీసింగ్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా ఇన్స్టలేషన్ చేశాం. కర్నూల్, నెల్లూరులోని 6 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 14 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఆర్కేమెడిసాల్స్.కామ్ వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాదిలో రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. మెడికల్ ఉత్పత్తుల నిల్వ కోసం నెల్లూరులో గిడ్డంగి ఏర్పాటు చేశాం. రూ.5 లక్షల లోపు ధర ఉంటే వైద్య ఉత్పత్తులను నిల్వ చేస్తాం’’ అని రవి కిరణ్ తెలిపారు. -
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
సాక్షి,హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు జాప్యం చేస్తుండటంతో ఆ పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం రూ.1200 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఓపీ డయాగ్నోస్టిక్, డిసెంబర్ 1 నుంచి ఇన్పేషెంట్ సేవల్ని కూడా నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు సోమవారం తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 240 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో రాష్ట్రవ్యాప్తంగా 240 ప్రైవేటు ఆస్పత్రులు చేరాయి. వీటిలో ఒక్క గ్రేటర్ పరిధిలోనే వందకుపైగా ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగం గా అందిస్తున్న వైద్యసేవల్లో 70% పైగా చికిత్సలు ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఒప్పందం మేర కు రోగికి చికిత్స చేసిన సదరు ఆస్పత్రికి 40 రోజుల్లో వైద్య ఖర్చులు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యంతో పాటు చెల్లిస్తున్న మొత్తంలో టీడీఎస్ను కూడా కట్ చేస్తే ఆస్పత్రులకు ఒక్కో సర్జరీపై రూ2 వేల నుంచి రూ. 3 వేలే మిగులుతున్నాయి. ఇలా 2015లో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.600 కోట్లు బకాయి పడింది. అప్పట్లో ఆస్పత్రి యాజమాన్యాలన్నీ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, తాత్కాలికంగా కొంత మొత్తాన్ని చెల్లించింది. ఆ తర్వాత పట్టించుకోకపోగా, ఏడాది నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఆ బకాయిలు మొత్తం రూ.1200 కోట్లకు పేరుకుపోయింది. దీంతో నిర్వహణ ఖర్చులు రెట్టింపవ్వడంతో ఇప్పటికే 30 ప్రైవేటు ఆస్పత్రులు మూతపడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని ఆస్పత్రులు మూతపడే అవకాశం ఉంది. పెండింగ్ బకాయిల అంశంపై ఇప్పటికే అనేక సార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈఓలకు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. లేదంటే డిసెంబర్ నుంచి సేవలను పూర్తిగా నిలిపివేయడానికి కూడా వెనుకాడబోం’అని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వి.రాకేశ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కిరణ్లు హెచ్చరించారు. -
కార్పొరేట్ ‘వివక్ష’!
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యశ్రీ ఓ మంచి పథకం. పేదలకు వరం. కానీ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దీన్ని ఓ అంటు వ్యాధిలా చూస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన రోగులను ఎలా భయపెట్టాలి? వారిని ఏవిధంగా బయటికి పంపాలన్నదానిపై ముందే అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. ప్రారంభంలో 46 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందేవి. 2018 నాటికి 341 ఆస్పత్రులకు విస్తరించాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల కుటుంబాల్లోని 2.75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఏటా 2.5 లక్షల చికిత్సలు జరుగుతున్నాయి. మొదట్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు పోటీపడిన కార్పొరేట్ ఆస్పత్రులు.. ఆ తర్వాత ఈ సేవలను భారంగా భావించాయి. ఆరోగ్యశ్రీ రోగి అంటేనే చులకనగా చూడటం మొదలు పెట్టాయి. నగదు చెల్లింపు రోగులను ఒక భవనంలో, ఆరోగ్యశ్రీ రోగులను మరో భవనంలో ఉంచుతున్నాయి. అంతే కాదు వీరికి చికిత్స చేస్తే ఎక్కడ తమ ఇమేజ్ దెబ్బతింటుందోని భావించి సీనియర్లు చికిత్సలకు నిరాకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమవద్ద పనిచేస్తున్న జూనియర్లతో సర్జరీలు చేయిస్తున్నారు. కనీసం గాలి వెలుతురు కూడా లేని చోట వీరిని అడ్మిట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను అంటు రోగులుగా చూస్తూ...వారికేదో ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి. చీదరింపులు..చీత్కారాలు నగదు చెల్లించే రోగులతో సమాన వైద్యసేవలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇస్తూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ సహా నగరంలో మరో 135 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందాయి. తీరా నెట్వర్క్లో పేరు రిజిస్టర్ అయిన తర్వాత అనేక ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కాయి. నగదు చెల్లించే రోగుల సరసన కాకుండా పార్కింగ్ ప్లేసుల్లో, ఓ మూలన ఇరుకైన రేకుల షెడ్డులో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు చేశాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు వీరి పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా అవమానకరంగా ఉంది. నగదు చెల్లించే రోగులను ఆప్యాయ పలకరిస్తూ వెంటతోడుకెళ్తూ, ఆరోగ్యశ్రీ రోగులను మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ రిజి స్ట్రేషన్ కౌంటర్కు ఓపీ, ఐపీ విభాగాలకు చాలా దూరం ఉంటోంది. అసలే అనారోగ్యం ఆపై అటు ఇటు తిరగలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ సేవల్లోనే కాదు చికిత్సల్లోనూ, మందుల పంపిణీలోనూ ఇదే వివక్ష కొనసాగుతోంది. సమస్యలు ఇవే... ♦ ఎమర్జెన్సీలో ఆస్పత్రిలో చేరిన రోగికి ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే 72 గంటల సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ అలా ఇవ్వడం లేదు. అత్యవసర సమయంలోనూ డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో జాయినైన రోగి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులదీ అదే పరిస్థితి. ♦ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల చికిత్సల విషయంలో అనేక మెలికలు పెడుతున్నారు. ప్రమాదంలో రెండు మూడు చోట్ల బోన్ఫ్రాక్చర్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదు. ఎన్ని కట్లు కడితే అన్ని వేర్వేరు ప్యాకేజీల కింద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఆరోగ్యశ్రీలో ఎన్నిఫ్రాక్చర్లు ఉన్నా ఒకే ప్యాకేజీ కింద బిల్లు చెల్లిస్తుందని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆస్పత్రి యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ బైపాస్ సర్జరీల్లో భాగంగా హృద్రోగులకు స్టంట్లు అమర్చుతారు. మార్కెట్లో 32 రకాల స్వదేశీ, విదేశీ కంపెనీల స్టంట్లు ఉన్నాయి. ఒక స్టంటు తయారీకి రూ.3 వేల నుంచి రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇటీవల వీటి ధరలను భారీగా తగ్గించింది. ఆరోగ్యశ్రీ పథకంలో నాసిరకం స్టంట్లు వేస్తున్నారని, కొంత ఖర్చు భరిస్తే మంచి స్టంట్ వేస్తామని చెబుతున్నారు. తొలత స్టంట్ వేస్తున్నారు. మూడు నెలల తర్వాత అదే రోగికి బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఒక రోగిపై రెండుసార్లు సంపాదిస్తున్నారు. అటు ఇటు తిరగలేకఇబ్బందిపడ్డా... కిడ్నీలో రాయి ఉండటంతో వైద్యుడికి చూపిద్దామని మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. ఓపీకి దూరంగా ఉన్న మరో భవనం పార్కింగ్ ప్లేసులో ఆరోగ్యశ్రీ కౌంటర్ ఏర్పాటు చేశారు. అసలే నొప్పి, ఆపై అటు ఇటూ తిరుగలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. – నవీన్, జనగాం ఈసడించుకుంటున్నారు ఆరోగ్యం బాగాలేక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్తే..ఇక్కడ ఆ సేవలు లేవని చెప్పారు. నన్ను చూసి ఈసడించుకున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను చాలా చులకనగా చూస్తున్నారు. – భవానీ, ఎల్బీనగర్ -
జబ్బు చిన్నది.. బిల్లు పే..ద్దది
సాక్షి, హైదరాబాద్: కంటి నొప్పో.. కాలి నొప్పో.. కడుపు నొప్పో.. ఏదీ వచ్చినా భయంతో వెంటనే ఆస్పత్రికి పరిగెడతాం. రోగులకు ఉండే ఈ భయాన్నే కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. వైద్యులకు టార్గెట్లు విధించి అవసరం లేకపోయినా పరీక్షలు చేయిస్తున్నాయి. సాధారణ జ్వరం, తలనొప్పితో బాధపడుతూ వెళ్లినా సీబీపీ, సీయుఇ, ప్లేట్లెట్ కౌంట్స్, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయిస్తున్నాయి. ఆ పరీక్షలను తమ ఆస్పత్రిలోనే చేయించుకోవాలంటూ మెలికపెడుతున్నాయి. అప్పటికే బయటి డయాగ్నస్టిక్స్లో పరీక్షలన్నీ చేయించుకున్నా.. ఆస్పత్రిలో మళ్లీ చేయించుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఓ సాధారణ డయాగ్నస్టిక్స్లో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)కి రూ.100 లోపే తీసుకుంటుండగా, కార్పొరేట్లో దాదాపు రూ.550 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఛాతి ఎక్సరేకు రూ.150 ఖర్చవుతుండగా, కార్పొరేట్లో రూ.550 పైనే చార్జి చేస్తున్నారు. ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్కు నిమ్స్లో రూ.5,500 చార్జి చేస్తుండగా, కార్పొరేట్లో రూ.8,500 నుంచి రూ.12 వేల వరకు తీసుకుంటున్నారు. నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నస్టిక్ సెంటర్ల సంఖ్యతో పాటు వైద్యపరికరాల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆ మేరకు వైద్య పరీక్షల ధరలు తగ్గకపోగా, మరింత పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు..ఒకే యంత్రం.. కానీ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరల్లోనే వ్యత్యాసం కన్పిస్తోంది. ’రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ తాము మాత్రం ఏమి చేయగలం. ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నాం. వారి నుంచి లక్షల్లో ప్యాకేజీలు తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని జూబ్లిహిల్స్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీలు పొంది ఉచిత సేవలు విస్మరించారు... నగరంలోని పలు కీలక కార్పొరేట్ ఆస్పత్రులకు భూములను ప్రభుత్వమే సమకూర్చింది. మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువకే వీటిని అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా ఉపాధి, తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు అప్పట్లో ఆయా ఆస్పత్రులు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే, తదితర మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. ఇలా రాయితీ పొందిన వారు ఆస్పత్రుల్లో 20 శాతం పేదలకు ఉచిత సేవలు అందించాల్సి ఉన్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. రోగ నిర్ధారణ ఖర్చులను నియంత్రించాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తోంది. నిజానికి ఆస్పత్రులతో పాటు రోగుల నిష్పత్తి, ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ స్టాఫ్, టెక్నీషియన్ల వేతనాలు తదితర ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ వ్యయ భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు. – తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేశాయి. ఎంబీబీఎస్ సీటు కోసం, కార్పొరేట్ ఆస్పత్రి నిర్వహణకు చేస్తున్న రూ.కోట్ల ఖర్చునంతా రోగులపై రుద్దుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ పల్లం ప్రవీణ్, తెలంగాణ వైద్యుల సంఘం తరచూ తలనొప్పి వస్తుండటంతో వైద్యుడికి చూపించుకుందామని హిమాయత్ నగర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. మెదడులో రక్తం గడ్డకట్టి ఉంటుందని ఎంఆర్ఐ చేసి రూ.8,500 తీసుకున్నారు. రిపోర్టు వచ్చాక ఏమీ లేదని చెప్పి.. సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు. – శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. మలక్పేటలోని ఓ ఆస్పత్రిలో చేరాను. డెంగీ జ్వరమని చెప్పి, రకరకాల పరీక్షలు చేశారు. తీరా రిపోర్టులో వైరల్ ఫీవర్ అని వచ్చింది. వైద్య పరీక్షలు, చికిత్సల పేరుతో రెండు రోజులకు రూ.23 వేలు వసూలు చేశారు. – మహ్మద్ రఫీ, చంచల్గూడ -
సామాన్యుడిపై ‘సర్జికల్’ స్ట్రైక్
సాక్షి, అమరావతి: 45 ఏళ్ల రాజేంద్రకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. హైదరాబాద్లోని(ప్యారడైజ్ సమీపంలో) ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. స్టెంట్ వేస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. స్టెంట్ వేశాక రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యాడు. స్టెంట్ ఖరీదు కాకుండానే రోగికి రూ.1.56 లక్షల బిల్లు వేశారు. స్టెంట్ ధర మరో రూ.30 వేలు అన్నారు. మొత్తం రూ.1.86 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కేవలం ఒక్క స్టెంట్ వేస్తే ఇంత బిల్లు ఎందుకైందని అడిగితే... అది అంతేనని డాక్టర్లు బదులిచ్చారు. 65 ఏళ్ల రాజేశ్వరి అనారోగ్యంతో విజయవాడలోని విజేత టాకీస్ వద్దనున్న ఆసుపత్రికి వెళ్లింది. రోజుకొకటి చొప్పున వారం రోజులు ఇంజెక్షన్ వేయాలన్నారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.6 వేలు అవుతుందన్నారు. ఆ మహిళ బంధువు ఫార్మసిస్ట్గా పని చేస్తున్నాడు. ఆ ఇంజెక్షన్ ధర మందుల దుకాణంలో అయితే రూ.2,500, అదే డిస్ట్రిబ్యూటర్ వద్ద రూ.900 అని చెప్పాడు. ఒకే మందు ధర మూడు చోట్ల మూడు రకాలుగా ఉంటుందా? అని రోగి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. సామాన్యుడికి జబ్బు చేసి కాదు, ఆసుపత్రిలో బిల్లు చూసి గుండె ఆగిపోతోంది. ఒక్కసారి అనారోగ్యం బారినపడి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రాణం నిలవడం మాటేమోగానీ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా సామాన్యుడిపై ‘సర్జికల్’ స్ట్రైక్ జరుగుతోంది. చట్టాలు కార్పొరేట్ హాస్పిటళ్లకు చుట్టాలుగా మారాయి. శస్త్రచికిత్సల పేరిట విపరీతంగా దోచేస్తున్నారు. వస్తువును తయారు చేసే కంపెనీ తక్కువ ధరకే ఇస్తోంది. దాన్ని డిస్ట్రిబ్యూటర్ కూడా తక్కువ ధరకే కార్పొరేట్ ఆసుపత్రులకు అందజేస్తున్నాడు. కానీ, ఆ తక్కువ ధర సామాన్య రోగికి వర్తించడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పిందే లెక్క, వేసిందే బిల్లు. శస్త్రచికిత్సల పరికరాల రేట్లు సామాన్యులనే కాదు సంపన్నులనూ భయపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీపై ‘సాక్షి’ పరిశీలనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 300 శాతం అధిక రేట్లు నర్సింగ్ హోమ్లు, ప్రైవేట్ ఆసుత్రులు, కార్పొరేట్ హాస్పిటళ్లు... పేరు ఏదైనా వీటి లక్ష్యం రోగుల దగ్గర ఉన్నదంతా ఊడ్చేయడమే. శస్త్రచికిత్స కోసం వెళితే ఎంత చార్జి పడుతుందో అంచనా ఉండదు. వాస్తవానికి సర్జికల్ వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అవి కార్పొరేట్ ఆసుపత్రులకు చేరి, రోగులకు వాడేసరికి ధర 200 నుంచి 300 రేట్లు పెరిగిపోతోంది. ఈ దందాపై ఆరోగ్య శాఖ, ఇటు ఔషధ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రోగికి ‘స్టెంట్’ లాభం సున్నా దేశవ్యాప్తంగా స్టెంట్ల ధరను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఏ స్టెంట్నైనా గరిష్టంగా రూ.30 వేలకు మించి అమ్మకూడదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్దేశించింది. ఏడాదిన్నర కిందటే ఇది అమల్లోకి వచ్చినా ఏపీ, తెలంగాణలో ఆ ప్రభావం కనిపించడం లేదు. ధర తగించకముందు రోగికి ఒక స్టెంట్ వేస్తే రూ.1.70 లక్షలు ఖర్చయ్యేది. ఇందులో స్టెంట్ ధర రూ.70 వేలు అవుతుందని చెప్పేవారు. కానీ, ధర తగ్గించాక స్టెంట్ ఖర్చు రూ.30 వేలు మాత్రమే. అంటే రూ.40 వేలు తగ్గించాలి. ఏ ఆసుపత్రిలోనూ ఇది అమలు కావడం లేదు. ప్రొసీజర్ రేట్లు.. అంటే థియేటర్ చార్జీలు, నర్సింగ్ చార్జీలు, డాక్టర్ చార్జీల పేరుతో పాత రేట్లనే (రూ.1.70 లక్షలు) వసూలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. రేట్లు తగ్గాయి.. ప్రొసీజర్ ఖరీదైంది దేశవ్యాప్తంగా స్టెంట్లు, మోకాలి చిప్పల ధరలు తగ్గించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వీటి రేట్లు తగ్గించారు గానీ ఆపరేషన్ చార్జీలు, నర్సింగ్ చార్జీలు, డాక్టర్ ఫీజులు పెంచేశారు. రోగులు ఎప్పటిలాగే పాత ధరలే చెల్లించాల్సి వస్తోంది. ఎంఆర్పీకి మించి ఎక్కువ వసూలు చేస్తేనే తాము చర్యలు తీసుకోగలమని ఔషధ నియంత్రణ శాఖ అధికారులను చెబుతున్నారు. ఎంఆర్పీ మేరకే తీసుకుంటే ఏమీ చేయలేమని అంటున్నారు. బడా ఆసుపత్రులు బిల్లుల్లో స్టెంట్లకు ఎంఆర్పీ ధరలే వేస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల పేరిట ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 పడకలు మొదలుకుని 200 పడకల స్థాయి వరకూ 2,868 ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి. వీటిలో ప్రతిఏటా 3 లక్షల వరకూ మేజర్ సర్జరీలు జరుగుతున్నట్టు అంచనా. మరో 80 వేల నుంచి లక్ష వరకూ మైనర్ సర్జరీలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుత్రుల్లో శస్త్రచికిత్స ద్వారా ఏటా రూ.10 వేల కోట్లకు పైగానే టర్నోవర్ జరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఒక రేటు, ఇన్సూరెన్స్ ఉంటే మరో రేటు, నగదు చెల్లించేవారికి ఇంకో రేటు వేస్తున్నారు. బిల్లుల విషయంలో ఒక ఆసుపత్రికి మరో ఆసుపత్రికి పొంతనే ఉండడం లేదు. ఎంఆర్పీని నియంత్రించవచ్చు కదా? ‘‘అసలు ఎంఆర్పీని(గరిష్ట అమ్మకం ధర) నిర్ణయిస్తున్నది ఎవరు? ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడికి రూ.30 ఖర్చయితే, ఆ వస్తువుపై ఎంఆర్పీ రూ.160 అని వేస్తున్నారు. ఎంఆర్పీని ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది? ఎంఆర్పీ అనేది వస్తువును ఉత్పత్తి చేసే కంపెనీ వేస్తోందా? లేక మధ్యలో ఎవరైనా వేస్తున్నారా? ఎంఆర్పీ వెనుక మతలబు తేల్చాల్సింది ప్రభుత్వమే’’ – డా.శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ, ఏపీ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ ఏ సేవకు ఎంత ఫీజో చెప్పాల్సిందే.. ‘‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010 ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు తమ సేవలకు ఎంత ఫీజు వసూలు చేస్తారో బోర్డు మీద వివరాలు అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్లకు కూడా ఏ స్పెషలిస్టు ఎంత వసూలు చేస్తున్నారో చెప్పాలి’’ – డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ -
‘గుండె’లు తీసిన బంట్లు
సాక్షి, హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన అనిల్కుమార్కు బీపీ, షుగర్ సహా ఏ అనారోగ్య సమస్యా లేదు. ఓ రోజు కడుపునొప్పి రావడంతో దారిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఓసారి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లమన్నాడు. కార్పొరేట్లో ఏవేవో పరీక్షలు చేసి గుండె సమస్య ఉందని, వెంటనే స్టెంట్ వేయాలని చెప్పారు. అనిల్ అందుకు అంగీకరించడంతో మరుసటి రోజే ‘ఆరోగ్యశ్రీ’కింద స్టెంట్ వేసేశారు. నిజానికి అనిల్కు ఆ స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! వరంగల్కు చెందిన ఓ రైతు గుండెలో నొప్పి రావడంతో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు అందించాల్సిన వైద్య వివరాలను సదరు ఆసుపత్రి ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపింది. రోగి గుండెకు స్టెంట్ వేయాలని ప్రతిపాదించాయి. ఈ వివరాలను ఆరోగ్యశ్రీలోని ఓ వైద్య నిపుణుడు పరిశీలించి.. స్టెంట్ అవసరం ఉండదు కదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వారు అందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పుడు అవసరం లేదుగానీ త్వరలో అవసరం ఉండవచ్చు. అయినా ఉన్నతాధికారులు చెప్పాలి గానీ.. ధ్రువీకరించాల్సింది నువ్వు కాదు’’అంటూ దబాయించారు. మరుసటి రోజు ఆస్పత్రి ప్రతిపాదించిన ఆపరేషన్కు అనుమతి వచ్చేసింది! ...ఇలా ఒకటీ రెండు కాదు.. ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న గుండె ఆపరేషన్లలో కార్పొరేట్ ఆస్పత్రుల అక్రమాలకు లెక్కేలేదు. స్టెంట్లు, బైపాస్ సర్జరీల వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల నిర్వహణ అడ్డగోలుగా మారింది. గుండె ఆపరేషన్లపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కింది స్థాయి సిబ్బంది ఈ లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం ఉండడం లేదు. లోపాలను సరిచేయకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే.. తమకు కాసులు వస్తే చాలన్నట్టు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి. అవసరం లేకున్నా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అక్రమాలను నిరోధించాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. గుండె ఆపరేషన్లే ఎక్కువ.. ఆరోగ్యశ్రీలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్టెంట్ల అమర్చడం, బైపాస్ సర్జరీలు కలిపి ఏటా సగటున 17 వేల ఆపరేషన్లు అవుతున్నాయి. ఇందులో స్టెంట్ల కేసులు 15 వేలు, బైపాస్ శస్త్ర చికిత్సలు 2 వేల దాకా ఉంటున్నాయి. ఒక్కో బైపాస్ ఆపరేషన్కు సగటున రూ.1.14 లక్షలు, స్టెంట్కు రూ.54 వేల చొప్పున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తోంది. ఎక్కువ డబ్బులు వచ్చే శస్త్ర చికిత్సలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు వీటిని లాభదాయక వ్యవహారంగా మార్చేశాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు కావడంతో ప్రజల్లోనూ ఎక్కువ ఆందోళన ఉంటోంది. దీన్ని అదనుగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు చెలరేగిపోతున్నాయి. అవసరం లేకపోయినా స్టెంట్లు అమర్చడం, నేరుగా బైపాస్ శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో.. ముందుగా స్టెంటు వేయడం వంటివి చేస్తున్నాయి. ఒక స్టెంట్ వేశాక ఆరు నెలల్లోపే మళ్లీ రెండో స్టెంట్ వేయాలని రోగులను హెచ్చరిస్తున్నాయి. ఇలా రెండు రకాలా డబ్బులు ఆర్జించిన తర్వాత అదే రోగికి బైపాస్ చేయాలని చెబుతున్నాయి. పెరిగిపోతున్న ‘రెండో స్టెంట్’ సాధారణంగా రోగులకు గుండె పనితీరు నిర్ధారణ పరీక్షలు (యాంజియోగ్రామ్) నిర్వహిస్తే వారిలో 60 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక స్టెంట్ అవసరం ఉంటుందని, ఇక రెండో స్టెంట్ అవసరం ఇంకా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పరీక్షల్లో మాత్రం రెండో స్టెంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది రెండో స్టెంట్ వేసుకున్న వారి సంఖ్య ఏకంగా 50.80 శాతం వరకు నమోదైంది. అవసరం లేకున్నా రెండో స్టెంట్ అమర్చడంతో ఆరోగ్యశ్రీలో ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు వృథా అవుతున్నట్లు అంతర్గత విచారణలో నిర్ధారించారు. అయినా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీలోని వైద్య నిపుణుల సహకారంతోనే ఈ అక్రమ, అనవసర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గుర్తించిన కొన్ని లోపాలివీ ►గుండె శస్త్ర చికిత్సలలో ఎక్కువగా అవసరం లేనివే ఉంటున్నాయి. గుండె పని చేసేందుకు ఉపయోగపడే స్టెంట్ అమర్చాలంటే రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువగా పూడిక ఉండాలి. కానీ 30 శాతం పూడిక ఉన్నా స్టెంట్ వేస్తున్నారు ► అవసరం లేకున్నా రెండో స్టెంట్ వేస్తున్నారు ► బైపాస్ సర్జరీ రోగుల్లో గుండెకు రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం 70 శాతం వరకు ఉంటుంది. ఇది 40 శాతం కంటే తగ్గిపోయినప్పుడే ఐఏబీపీ చికిత్సను ఉపయోగిస్తారు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు, ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రులు ప్రతి ఒక్కరికీ ఐఏబీపీ రకం చికిత్సనే చేస్తున్నాయి. 98 శాతం బైపాస్ సర్జరీల్లో ఐఏబీపీని ఉపయోగించినట్లు తేలింది. బీమా కంపెనీల ఆందోళన అడ్డగోలుగా గుండె ఆపరేషన్లపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య బీమా ఉందా అని వైద్యుల నుంచి వచ్చే మొదటి ప్రశ్న. ఉంది అని అనడమే ఆలస్యం అన్ని టెస్టులు చేయాలంటూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షలు చేశామని, గుండె సమస్య ఉందని చెబుతారు. ఇప్పుడైతే స్టెంట్తో సరిపోతుందని, నిర్లక్ష్యం చేస్తే బైపాస్ చేయాల్సి రావచ్చని భయపెడతారు. సదరు వ్యక్తి స్టెంట్ వేయడానికి ఒప్పుకొని అంగీకార పత్రం రాస్తాడు. వెంటనే స్టెంట్ అమరుస్తారు. ఒక నెలలో అసాధారణంగా ఈ తరహా కేసులు మా దృష్టికి రావడంతో మేం వాటిని పరిశీలించాం. పరీక్షల నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని పరిశీలిస్తే మేం పరిశీలించిన పది కేసుల్లో నాలుగు కేసుల్లో అసలు ఎలాంటి హృద్రోగ సమస్యలే లేవు. ఇద్దరికీ సమస్య ఉన్నా మందులతో నయమయ్యే స్టేజీలోనే ఉంది’’అని ఓ బీమా కంపెనీ ప్రతినిధి అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేశారు. -
ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఆటకట్టు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రోగులు చస్తున్నా సరే వైద్యం చేయడానికి ముందుకు రారు ప్రభుత్వ వైద్యులు. రోగులు చచ్చాక కూడా వైద్యం చేస్తారు కార్పొరేట్ వైద్యులు’ అన్న వాక్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యుల కాసుల కక్కుర్తిని సూచిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిని పక్కన పెడితే దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి, రోగుల హక్కుల పరిరక్షణ కోసం ఓ ఆన్లైన్ వేదిక త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. ‘ప్రైవేట్హాస్పటల్స్వాచ్. ఆర్గ్’ అనే పేరుతో వస్తున్న ఆ ఆన్లైన్ వేదిక సైట్ ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది. రోగుల హక్కులపై ఇటీవల రెండు రోజులపాటు జరిగిన దక్షిణ ఆసియా స్థాయి వర్క్షాప్ సందర్భంగా సైట్పేరును ఖరారు చేశారు. ముంబైకి చెందిన సతి, సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ వర్క్షాప్ను నిర్వహించాయి. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కెన్యా దేశాలతోపాటు భారత దేశంలోని 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 60 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి రంగంలో జరగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం కోసం ఈ వెబ్సైట్ను తీసుకొస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో చదువుకొని, ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తీసుకొని, పన్ను రాయతీలు అనుభవిస్తూ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారుల్లో నడుస్తున్నాయని ‘జన్ స్వస్థ్ అభియాన్’ జాతీయ కన్వీనర్ డాక్టర్ అభయ్ శుక్లా ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులు జవాబుదారిగా వ్యవహరించేందుకు తమ వెబ్సైట్ పబ్లిక్ వేదికగా పనిచేస్తుందని, ఆస్పత్రుల అన్యాయాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ల రూపంతో వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. -
అమ్మలకు ‘కోత’వేదన
సాక్షి, అమరావతి: నాటు వైద్యం చేసే మంత్రసాని స్థానంలో నీటుగా తెల్లకోటు వేసుకునే మంత్రగాళ్లు వచ్చారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ కన్నతల్లులకు కడుపులు కోసేస్తున్నారు. సాధారణంగా చేయాల్సిన ప్రసవాన్ని కూడా సిజర్స్తో చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పాపాయి పుట్టిన ఆనందం కంటే ఆ ఆస్పత్రి వేసే బిల్లుతో ఆ కుటుంబం భయపడుతున్న దుస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే చాలు బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు పోయిందనో లేదా మరో కారణమో చెప్పి పదినిముషాల్లో కడుపు కోయడం, బిడ్డను తీయడం డాక్టర్ల వంతయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా విస్మయం వ్యక్తం చేసింది. దురదృష్టంఏంటంటే దేశంలోనే అత్యధిక కోత ప్రసవాలు తెలుగురాష్ట్రాల్లోనే జరగడం. ఇక్కడ జరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ప్రపంచంలో మరేదేశంలో జరగడం లేదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాలను భారీ వ్యాపారంగా వైద్యులు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం సిజేరియన్ ప్రసవాల ద్వారా జరుగుతున్నట్టు అంచనా. తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్లు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాబున్నిసా డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సిజేరియన్ చెయ్యాలని, లేకపోతే కష్టమని డాక్టర్లు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి రూ. 55 వేలు చెల్లించి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని భయపెట్టి డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ప్రసవాల తీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రతి వంద మందిలో 58 మందికి కోతల ద్వారానే ప్రసవం జరుగుతోంది. దీనివల్ల బిడ్డకంటే తల్లి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి ప్రసవాలు హైదరాబాద్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీలో 40.1 శాతం సిజేరియన్ ప్రసవాలే అవుతున్నాయి. ఈ సిజేరియన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిజేరియన్ ప్రసవాల ద్వారా ఏటా రూ. 4 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. రెండు రాష్ట్రాల్లో ఏటా ఆరున్నర లక్షల ప్రసవాలు జరుగుతుండగా, సగటున ఒక్కో ప్రసవానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు అయితే రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు కూడా బిల్లులు వేస్తున్నాయి. హైదరాబాద్లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ ప్రసవానికి కూడా లక్ష రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు ఎక్కడ? ప్రైవేటు ఆస్పత్రులు లేదా నర్సింగ్హోంలు వంటి వాటి పర్యవేక్షణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు చేయాలి. జిల్లా వైద్యాధికారులదే అమలు బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లా వైద్యాధికారి కూడా ఆస్పత్రులకు వెళ్లి సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. వేలల్లో నర్సింగ్ హోంలు ఉన్నా, ప్రసవాలు అడ్డదిడ్డంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 10 శాతానికి మించి సిజేరియన్లు జరగకూడదు. అది కూడా అత్యవసర పరిస్థితి అయినపుడే సిజేరియన్ చెయ్యాలి. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తే మాతా శిశుమరణాలను నియంత్రించడం కష్టమని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి మందికీ 40 శిశు మరణాలు సంభవిస్తుండగా, తెలంగాణలో 37 శిశు మరణాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లక్షకూ 140 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. సాధారణ ప్రసవం వల్ల... - సాధారణ ప్రసవం వల్ల తల్లికి త్వరగా పాలు పడతాయి - ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. దీనివల్ల తల్లి క్షేమంగా ఉంటుంది - బిడ్డకు ఇమ్యూనిటీ (వ్యాధినిరోధకత) ఎక్కువగా ఉంటుంది - సాధారణ ప్రసవంలో రక్తస్రావం తక్కువ.. దీనివల్ల తల్లి త్వరగా కోలుకుంటుంది - ప్రసవానంతరం ఎక్కువగా మందులు వాడవలసిన అవసరం ఉండదు సిజేరియన్ ప్రసవం వల్ల.. - సిజేరియన్ వల్ల తల్లికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది - రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది - బిడ్డకు స్తన్యమివ్వడానికి అప్పటికప్పుడు పాలు పడవు - సిజేరియన్ కాన్పు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితీ ఉంటుంది - తల్లికీ, బిడ్డకూ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది - తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండోదీ సిజేరియన్ చేయాలి - రెండు ఆపరేషన్ల వల్ల తల్లికి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి - సిజేరియన్ వల్ల ప్లాస్ (మాయ) ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్ల తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రమాదం కలుగుతోంది గర్భిణి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి గర్భిణికి రక్తపోటు, మధుమేహం వంటి ఇబ్బందులు లేనపుడు సాధారణ ప్రసవం మంచిది. అలాంటి ఇబ్బందులు ఉన్నపుడు సిజేరియన్ ప్రసవం తప్పదు. సాధారణ ప్రసవమా, సిజేరియన్ ప్రసవమా అన్నది పూర్తిగా గర్భిణి ఆరోగ్యం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంతేగానీ గర్భిణి రాగానే సిజేరియన్ చేయడం మంచిది కాదు. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప సాధారణ ప్రసవమే సురక్షితం తల్లికీ బిడ్డకూ సాధారణ ప్రసవం అన్ని విధాలా సురక్షితం. కానీ చాలా చోట్ల డాక్టర్లు డబ్బు కోసం, వేచియుండే ఓపిక లేకపోవడం వల్ల సిజేరియన్ చేస్తున్నారు. ఎక్కువ మాతా మరణాలు సిజేరియన్ వల్లే జరుగుతున్నాయి. తొలికాన్పులో సిజేరియన్ సరిగా చెయ్యకపోవడం వల్ల రెండో కాన్పులో ఇబ్బంది పడుతున్నవారున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ల పోకడ ప్రమాదకరంగా మారింది. – డా.కె.రాజ్యలక్ష్మి, ప్రొఫెసర్, ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్, హైదరాబాద్ -
కార్మిక వైద్యానికి ‘కార్పొరేట్’ షాక్!
బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మహేశ్ నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈఎస్ఐ కార్డుదారుడు కావడంతో అత్యవసర సేవల కింద సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఈఎస్ఐ ఇన్పేషెంట్ సౌకర్యం లేదని చెప్పడంతో బంజారాహిల్స్లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఏకంగా ఈఎస్ఐ సేవలు అందించలేమంటూ బోర్డు కనిపించింది. దీంతో చేసేదేం లేక సొంత ఖర్చుతో చికిత్సకు సిద్ధమయ్యారు. సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆరోగ్య సేవలు సంకటంలో పడ్డాయి. ఈఎస్ఐసీ చందాదారులకు వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం పేరిట నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. దాంతో అత్యవసర సేవల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందకపోతుండటంతో అత్యవసర వైద్యం కోసం చాలా మంది కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ ఆస్పత్రులు చికిత్సకు నిరాకరిస్తుండటంతో వెనుదిరుగుతున్నారు. 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులు.. రాష్ట్రవ్యాప్తంగా 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులున్నాయి. ఒక్కో కార్డుపై సగటున నలుగురు సభ్యులున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 58.4 లక్షల మందికి ఈఎస్ఐసీ సేవలు అందాలి. ఈఎస్ఐసీ సేవల నిమిత్తం ఒక్కో కార్డుదారుడు తన వేతనం నుంచి 6.5 శాతం మొత్తాన్ని నెలనెలా కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నాడు. ఈఎస్ఐకి నెలకు దాదాపు రూ.70 కోట్ల వరకు రాష్ట్రంలోని కార్మికులు చెల్లిస్తుండగా.. ప్రభుత్వం కూడా తనవాటా విడుదల చేస్తోంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల పరిధిలో అందని సేవలను గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈక్రమంలో హైదరాబాద్లోని 39 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఈఎస్ఐసీ గుర్తింపు ఉంది. అయితే మెజారిటీ ఆస్పత్రులు ఈఎస్ఐసీ సేవలకు మంగళం పాడాయి. కొన్ని ఆస్పత్రులు ఏకంగా సేవలందించట్లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చెల్లింపుల్లో జాప్యమే కారణం! కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈఎస్ఐ సేవల పరిస్థితి ఏడాది కాలంగా గందరగోళంగా మారింది. సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదనే ఆరోపణలతో సేవలు నిలిపేస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. 6 నెలలు, ఏడాది పాటు నిధులే ఇవ్వట్లేదని, దీంతో తప్పని పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. 11 ఆస్పత్రులకు నోటీసులు.. ఈఎస్ఐసీ కార్డుదారులకు సేవలందించకపోవడంపై కార్పొరేషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో స్పందించిన ఈఎస్ఐసీ అధికారులు ఇప్పటివరకు 11 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా స్పందించి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స
విశ్లేషణ మన వైద్య సేవల వ్యవస్థ పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్నది. కాబట్టి ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థ పట్ల దృఢంగా వ్యవహరించా ల్సిన సమయం ఇదే. దీనికితోడు ప్రభుత్వరంగ వైద్య సేవలను మెరుగుపరచాలి. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి లైసెన్స్ను రద్దు చేయడంపై చాలా గగ్గోలు రేగుతోంది. హరి యాణా ప్రభుత్వం కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన భూమి లీజును రద్దు చేసింది. దీనిపై కూడా కొంత అలజడి రేగినా, అది ఢిల్లీలో దానికంటే తక్కువే. ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలూ రెండు పెద్ద ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాయి. ఒకటి ఒక నవజాత శిశువు బతికే ఉన్నా, చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చింది. మరొ కటి ఒక డెంగ్యూ రోగి చికిత్సకు ఊహింపశక్యం కానంత పెద్ద సంఖ్యలో సిరంజ్లను వాడినట్టు చూపడం సహా భారీగా బిల్లులను వడ్డించింది. ఢిల్లీ ఆసుపత్రి లైసెన్స్ను ఉపసంహరించడాన్ని అక్కడి ఇన్పేషంట్లను గాలికి వది లేయడం అన్నట్టు చూస్తున్నారు. కానీ అలా జరగలేదు. అందరు ఇన్పేషెంట్లనూ డిశ్చార్జ్ చేసేవరకు చికిత్స అందించడాన్ని అనుమతించారు. హరియాణా ప్రభుత్వం తీసుకున్న చర్య పర్యవసానం కూడా ఇంచుమించు అలాంటిదే. ప్రభుత్వం తీసుకున్నది సరైన రీతిలో తీసు కున్న చర్యేనా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉదా హరణకు, ఢిల్లీ విషయంలో మొత్తంగా ఆ కార్పొరేట్ సంస్థపైన చర్య తీసుకోవడం కంటే ఆ ఘటనతో ప్రమేయం ఉన్నవారిపైన చర్య తీసుకోల్సిందంటూ అందుకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుందని అనుకోవడా నికి లేదు. న్యాయమూర్తులు ఏం తీర్పు చెబుతారో తెలి యదు. కానీ భారీ అసుపత్రులు, ప్రత్యేకించి ఆసుప త్రుల నెట్వర్క్ ఉన్న సంస్థలు తమకు మచ్చ రావడాన్ని భరించలేవు. చచ్చే వరకు అన్నట్టు కడదాగా పోరాడ తాయి. నా వాదన సరళమైనదే. పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్న ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థతో దృఢంగా వ్యవహరించాల్సిన సమ యం ఇదే. వాటికి అలవాటుగా మారిన తప్పుడు పద్ధ తులకు బాధ్యత వహించకుండా వాటిని తప్పించుకు పోనివ్వకూడదు. ఇటీవలి కాలంలో ఆసుపత్రులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయనీ. గుండె, ఎముకలకు సంబంధించిన ఇంప్లాంట్ ఉపరకరణాల నుంచి సిరం జ్ల వరకు దాదాపు అన్నిటి నుంచి భారీగా లాభాలు చేసుకుంటున్నాయని తెలిసిందే. ఇన్పేషెంట్ను ఇలా చూసి వెళ్లినందుకు డాక్టర్ చార్జీలు సహా దాదాపుగా మన ఊహకందే ప్రతిదానికీ వసూలు చేసే అధిక చార్జీలకు ఈ లాభాలు అదనం. బెడ్లు ఖాళీగా ఉండకూడదని వారాంతానికి ముందు పేషంట్లను డిశ్చార్జ్ చేయ కుండా ఉండటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే, కేవలం ప్రైవేట్ ఆసుపత్రులపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం తప్పు. ప్రైవేటు రంగంలో అమల్లో ఉన్న తప్పుడు పద్ధతు లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ప్రజా ధనంతో ఏర్పడిన వైద్య సేవల వ్యవస్థ పేషెంట్లను వారి స్తోమతకు సరితూగని ప్రైవేట్ రంగం వైపు తరిమేస్తుం డగా, ప్రైవేట్ రంగం భారీగా విస్తరించి పోతున్నదో తెలుసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 10న నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నిర్ధారణలను ప్రచరించింది. గ్రామీణ కుటుంబాలలో నాలుగింట ఒకటి, పట్టణ కుటుంబాలలో ఐదింట ఒకటి ఆసుపత్రి ఖర్చుల కోసం ‘‘తప్పనిసరై అప్పు చేయాల్సి’’ వస్తోంది. ఉచితంగా లేదా దాదాపు ఉచితంగా సేవలందించే ప్రభుత్వ ఆసు పత్రుల చికిత్సకు సైతం పైన అయ్యే ఖర్చులు భరిం చాల్సి రావడం వల్ల చాలా మంది చితికిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారిని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటారు. వైద్యంపై తలసరి వ్యయం అ«ధి కంగా ఉన్న, మంచి వైద్య సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో వైద్య రుణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని వెల్లడి కావడం ఆసక్తికరం. కుటుంబాల ఆర్థిక స్థితిగ తుల్లో కల్లోలాన్ని రేపేది ప్రైవేటు ఆసుపత్రులే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేవి కూడా అందుకు ఎలా కారణం అవుతున్నాయో ఇది వివరిస్తుంది. అధ్వాన సదుపాయాలు, అధ్వాన రోగనిర్ధారణ, అధ్వాన చికిత్స, భౌగోళికంగా అందుబాటులో లేకపోడం మన ప్రభుత్వ వైద్య సేవల ప్రధాన లక్షణాలు. పట్టించుకునేవారు ఎవరూ లేరన్నట్టుంది ఇది. ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు హఠాత్తుగా ఇలా విరుచుకు పడటం పట్ల అసంతృప్తి ఉండొచ్చునేమో గానీ, మిగతా పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థల నుంచి కూడా అదే స్థాయి నిబద్ధతను, సమర్థతను ఎవరు డిమాండు చేస్తారు? అనేదే అసలు సమస్య. ఢిల్లీ ప్రభుత్వం అంద రికీ అందుబాటులో ఉండే మంచి వైద్య సదుపాయాల వ్యవస్థను మొహల్లా (బస్తీ) క్లినిక్లను ఏర్పాటు చేసి నట్టు తెలుస్తోంది. కానీ మీడియా వాటిని పెద్దగా వెలుగులోకి తేలేదు. ఢిల్లీ ప్రభుత్వం, ముందు తమ సొంత వ్యవస్థను సక్రమంగా నడిపాకే ఇతరులను కూడా అలా చేయాలని కోరాలనే సరైన వైఖరిని చేపట్టినట్టు అనిపి స్తోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
నిమ్స్లో తప్పని నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన మల్లారెడ్డి మెదడులో కణితి ఏర్పడింది. చికిత్స కోసం ఇటీవల ఆయన నిమ్స్ వైద్యులను ఆశ్రయించాడు. ఇప్పటికే చాలామంది వెయిటింగ్లో ఉన్నారని, చికిత్స చేయాలంటే కనీసం నెల రోజులు ఆగాలని వైద్యులు సూచించారు. రాజేంద్రనగర్కు చెందిన వరాల నారాయణ వెన్నునొప్పితో వైద్యులను ఆశ్రయించగా, ఆపరేషన్ థియేటర్లు ఖాళీగా లేవని, రెండు నెలల తర్వాత రావాలని చెప్పారు. ఇలాగే మెదడులో కణతులు, వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పలువురు రోగులు నిమ్స్లో చికిత్స కోసం నిరీక్షిస్తున్నారు. ఆ ఆస్పత్రులు నిరాకరించడం వల్లే.. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ఆరోగ్యశ్రీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో తల గాయాల చికిత్సకు కేవలం రూ.70 వేల వరకే ఇస్తుండటంతో అవి తలగాయాల బాధితు లను చేర్చుకోవడం లేదు. దీంతో వారంతా నిమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. రోజూ వచ్చిపడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా వచ్చి చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. కాలంచెల్లిన వాటితోనే... నిమ్స్లో 1991లో డాక్టర్ రాజారెడ్డి హయాం లో సమకూర్చిన వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లే నేటికీ దిక్కవుతున్నాయి. మరోవైపు న్యూరో సర్జరీ వైద్యులు ఎక్కువ శాతం సదస్సులు, సమావేశాల పేరుతో విదేశాల్లోనే గడుపుతున్నారు. ఆ విభాగాధిపతే తరచూ విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ టేబుల్స్, అనస్థిషియన్ల్ కొరత సాకుతో ఇక్కడి కేసులను వాయిదా వేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లోని సర్జరీలకు హాజరవుతున్నారు. -
కార్పొరేట్గా కేంద్రాస్పత్రి?
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిని ప్రైవేటు సంస్థకు అప్పగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో కేంద్రాస్పత్రిని ప్రైవేటు పరం చేసేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తియినట్టు సమాచారం. ఇప్పటికే ఆస్పత్రిలోని పలు విభాగాలను చంద్రబాబు సర్కార్ ప్రవేటు పరం చేసింది. వైద్య పరీక్షలు, రేడియాలజీ, ఓపీ ఆన్లైన్, శానిటేషన్, సెక్యూరిటీ విభాగాలను ప్రైవేటు పరం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు విజయవాడలో పూర్తిఅయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులు ఎవరూ బయటకు చెప్పడం లేదు. చిత్తూరులో ఇలానే... చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని అపోలో ఆస్పత్రికి అప్పగించేశారు. అదే తరహాలో మన కేంద్రాస్పత్రిని కూడా ప్రైవేటు పరం చేయనున్నారు. ఆస్పత్రిని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే అంతా వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. రెగ్యూలర్ ఉద్యోగాల భర్తీ ఉండదు. ఉద్యోగాల భర్తీని ప్రైవేటు సంస్థ నియమించుకుంటుంది. ఆస్పత్రిపై పెత్తనం మొత్తం ప్రైవేటు సంస్థకు వెళుతుంది. 1980లో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రూ. 300 కోట్లు విలువ చేసే ఆస్పత్రి ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళుతుంది. సదరు ప్రైవేటు సంస్థ వారు ఏడాదికి కోట్లాది రుపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు రోగులు నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. రెగ్యూలర్ ఉద్యోగులు సైతం వారు చెప్పినట్టే నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో లేని సేవలు అని చెప్పి డబ్బులు వసూలు చేయోచ్చు. ఫైల్పై సంతకం అయిపోయిందట.. ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. కేంద్రాస్పత్రిని ప్రైవేటు పరం చేసే ఫైల్పై సంతకం అయిపోయిందనే వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు. ప్రస్తుత సేవల వివరాలు.. కేంద్రాస్పత్రిలో రోజుకు 1000 నుంచి 1200 మంది వరకు ఔట్ పేషేంట్స్ వస్తారు. అదేవిధంగా 200 పడకలు ఉన్నాయి. 200 మంది వరకు ఇన్పేషెంట్స్ చికిత్స పొందుతారు. ఆస్పత్రిలో గైనిక్, కంటి, ఎముకల, చర్మ, మెడికల్, జనరల్సర్జరీ, పిల్లల విభాగం, మానసిక విభాగం, దంత, ఈఎన్టీ విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్టీ సెంటర్, బ్లడ్బ్యాంక్, బ్లడ్కాంపొనెంట్ యూనిట్, సిటిస్కాన్, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్సరే, ఈసీజీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. -
మెడికల్ షాపుల బంద్ విజయవంతం
35 వేల దుకాణాల్లో నిలిచిపోయిన విక్రయాలు సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల విక్రయాలకు అనుమతి ఇవ్వొద్దని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన బంద్ రాష్ట్రంలో విజయవంతమైంది. దాదాపు 35 వేల మెడికల్ షాపులు బంద్లో పాల్గొన్నాయని రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి వేణుగోపాల్శర్మ తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాపులు, కొన్ని చైన్ షాపులు మాత్రం తెరిచే ఉన్నాయని చెప్పారు. బంద్ వల్ల పలుచోట్ల రోగులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల మాత్రం అత్యవసర మందులను విక్రయించినట్లు దుకాణదారులు తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ షాపులపై ఆధారపడి 2 లక్షల మంది దాకా జీవిస్తున్నారు. బంద్ వల్ల రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల వ్యాపారానికి నష్టం వాటిల్లింది. ఆన్లైన్ విక్రయాల వల్ల యువతీ యువకులు నిద్ర మాత్రలు, మత్తు మందులను కొనుగోలు చేస్తున్నందున ఆ విధానాన్ని రద్దు చేయాలని మెడికల్ షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. -
అనవసర ‘కోత’లపై పంజా!
సిజేరియన్ల నియంత్రణకు ‘క్లినికల్’ చట్టం - కొత్త చట్టం ఆమోదం నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు - అసుపత్రులకు గ్రేడులు.. ఏకీకృత ఫీజులు - వైద్య చికిత్సలన్నింటినీ ఆన్లైన్లో ఉంచేలా రూపకల్పన - చట్టం అమలుపై ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో త్వరలో సమావేశం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అనవసర సిజేరియన్ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పంజా విసరనుంది. దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయని వెల్లడైన నేపథ్యంలో వాటిని నియంత్రించాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని’ ఆధారం చేసుకొని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. చట్టం ప్రకారం రోగుల హక్కులను కాపాడేలా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు త్వరలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకాధికారిని నియమించి, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. తర్వాత చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేస్తారు. మొత్తం వివరాల సేకరణ.. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎన్ని జరుగుతున్నాయి, ఆరోగ్యశ్రీని, వివిధ ఆరోగ్య బీమాలను దుర్వినియోగం చేయడం ద్వారా అనవసర శస్త్రచికిత్సలు ఎన్ని చేస్తున్నారు.. వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లా మొదలు రాష్ట్రస్థాయి వరకు ఫిర్యాదులున్న ఆసుపత్రుల జాబితాను కూడా తయారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే తమ ఆసుపత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, ఇతరత్రా సమగ్ర సమాచారం కోరుతూ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫీజుల నియంత్రణ.. ఆన్లైన్లో రిపోర్టులు ప్రత్యేకాధికారిని నియమించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్), ఆరోగ్యశ్రీ మాదిరిగా ఏకీకృత ఫీజులను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఆసుపత్రులను గ్రేడులుగా విభజించి.. గ్రేడుల వారీగా ఫీజులను నిర్ధారిస్తారు. ఈ మేరకు ఒకే గ్రేడ్ ఉన్న ఆసుపత్రులన్నింటి లోనూ ఏకీకృత ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది. చికిత్సకయ్యే ఖర్చుల జాబితాను ఆసుపత్రి ముందు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ప్రతీ రోగి వివరాలను, అతనికి అందిన శస్త్రచికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలి. ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే దానికి సరైన కారణం చెప్పాలి. వైద్యుడు తప్పు చేసినా సంబంధిత ఆసుపత్రి కూడా బాధ్యత వహించాలి. ఉదాహరణకు నిఖిల్ రెడ్డికి ఎత్తు పెంచే ఆపరేషన్ చేసిన డాక్టర్పైనే చర్య తీసుకున్నారు. ఈ ప్రస్తుత చట్టంతో సంబంధిత ఆసుపత్రిపైనా చర్య తీసుకోడానికి అవకాశం కల్పించారు. వీటిని అమలు చేసేందుకు త్వరలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. విపరీత ధోరణులకు ముకుతాడు ప్రైవేటు వైద్య రంగంలో వ్యాపార విపరీత ధోరణులకు ఈ చట్టం ముకుతాడు వేయనుంది. వృత్తికి ఇబ్బంది లేకుండా వ్యాపార ధోరణులను ఇది అరికడుతుంది. అనవసర ఆపరేషన్లను అడ్డుకోవడానికి వీలుకలుగుతుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, రిటైర్డ్ డీఎంఈ -
వైద్యం చేయలేం!
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కార్పొరేట్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్యాంకు ఖాతాలు ఓవర్ డ్రాఫ్ట్కు చేరడంతో ఈ నెలలో సిబ్బందికి ఇంకా జీతాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితి నెలకొంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిరుపేదలకు అందిస్తున్న వైద్యానికి సంబం«ధించిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, బయటకు చెప్పలేని స్థితిలో ఆస్పత్రుల నిర్వాహకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాగైతే వైద్యం ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే వైద్య సేవ పథకాన్ని అమలు చేయడం తమవల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ఏ ఆస్పత్రి నిర్వాహకుడైనా ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు జిల్లాలకు రూ.250 కోట్ల బకాయి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు రూ.250 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లో వంద వరకూ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా, ప్రతి ఆస్పత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ బకాయి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మధ్య త రహా ఆస్పత్రులకు సైతం ఒక్కోదానికి రూ.3 కోట్లు బకాయి ఉండటంతో నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. సమ్మె నోటీసు ఇస్తే కొద్దిగా విదిల్చారు జనవరిలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ పథకం సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) ఆధ్వర్యాన సమ్మె నోటీసు ఇచ్చిన సమయంలో కొద్ది మొత్తంలో బిల్లులు విడుదల చేసినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికే రూ.3 కోట్లకు పైగా బకాయి ఉన్న ఆస్పత్రులకు రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ విడుదల చేశారని చెప్పారు. ప్రభుత్వం తమ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయకపోతే నిర్వహణ కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న కాలంలో సేవలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని పేర్కొంటున్నారు. తక్కువ ప్యాకేజీలైనా... ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీలు తొమ్మిదేళ్ల కిందట నిర్ణయించినవే నేటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ... ఇప్పటికీ ఆస్పత్రి నిర్వహణ వ్యయం మూడు రెట్లు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా పేదలనే సేవా భావంతో వైద్యం చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు తక్షణమే విడుదల చేయాలి రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్యసేవ ఎంపానల్మెంట్ ఆస్పత్రులకు ప్రభుత్వ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పథకం కూడా నిర్యీర్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు వ్యాధులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాస్పత్రులే దిక్కుగా మారాయి. పేదలకు మెరుగైన వైద్యం కలగానే మారే రోజులు వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రులకు ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్,వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు -
స్టెంటు.. బిల్లులో స్టంటు
►ధరలు తగ్గినా మారని బిల్లు ►రోగుల జేబుకు కార్పొరేట్ చిల్లు ►కొరవడిన నియంత్రణ ►ప్రొసీజర్ల పేరిట అదనపు బాదుడు ►లబోదిబోమంటున్న రోగులు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స సమయంలో అమర్చే స్టెంట్లు కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నాయి. రాయలసీమలో మెడికల్ హబ్గా పేరొందిన తిరుపతిలో కొంతకాలంగా ఈ దోపిడీ జరుగుతోంది. ఇటీవల కాలంలో స్టెంట్ల ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ధరల స్థిరీకరణకు అన్ని చర్యలు తీసుకుంది. అయినా ఇక్కడ స్టెంట్ల విషయంలో మార్పు లేదు. స్టెంట్ల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించినా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. పాత స్టెంట్లను అమర్చుతూ అదేధరను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం క్రితం తిరుపతికి చెందిన ఓ ఉద్యోగి(45 )కి గుండె పోటు రావడంతో అర్ధరాత్రి నగరంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో పూడికను తొలగించే (యాంజియోప్లాస్టీ) ఆపరేషన్ చేయాలన్నారు. దీనికి ఖరీదైన స్టెంట్లు పెట్టాలని అందుకు రూ.1.60లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి డిశ్చార్జీ అయ్యేలోగా దాదాపు రూ.2.40 లక్షల వరకు పిండేశారు. పీలేరుకు చెందిన ఓ మహిళ (30)కు గుండె నొప్పి రావడంతో అత్యవసర వైద్యం కోసం తిరుపతిలోని ఓ పేరున్న ప్రయివేట్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు రక్తాన్ని తొలగించాలని వైద్యులు తెలిపారు. అత్యవసర వెద్యం పేరుతో రూ.1.80 లక్షల విలువ చేసే స్టెంట్స్ ఆపరేషన్ చేసినా ప్రొసీజర్స్ పేరుతో రూ.2.25 లక్షలు బిల్లు ఇచ్చారు. తలకుమించిన భారమైనా అప్పు చేయకతప్పలేదు. తిరుపతి మెడికల్: గుండె ఆపరేషన్లలో వినియోగించే స్టెంట్స్ పరికరం గతంలో చాలా ఖరీదు ఉండేది. రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు కూడా వివిధ కంపెనీల స్టెంట్లు ఉన్నాయి. వీటి గురించి సరైన అవగాహన రోగులకు లేకపోవడంతో ఎక్కువ రేటును ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టెంట్ల ధరలను స్థిరీకరించి తగ్గించింది. రూ.90వేలకు దొరికే స్టెంట్ ధర ప్రస్తుతం అన్ని రకాల పన్నులతో కలిపి రూ.31,800 లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కసారిగా 70 శాతం ధరలు తగ్గిపోయిందని భావిస్తే పొరబాటే. తిరుపతిలోని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వీటి విషయంలో తమ ధోరణి మార్చుకోలేదు. స్టెంట్ల, ప్రొసీజర్స్ బిల్లులు వేరువేరుగా ఇవ్వాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. స్టెంట్ ధర తగ్గినా బిల్లు బాదుడు నుంచి ఉపశమనం కలగడం లేదని రోగులు వాపోతున్నారు. ఇటీవలే స్టెంట్లపై ధరను కచ్చితంగా ముద్రించాలని ఔషధ నియంత్రణ మండలి స్పష్టం చేసింది కూడా.. అయినా ఆస్పత్రులకు ఇవేమీ పట్టడం లేదు. ఇక్కడి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మందుపూత స్టెంట్ను ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం మందుపూత స్టెంట్తోపాటు అత్యాధునికమైన రక్తనాళాల్లో కరిగిపోయే స్టెంట్ను ఉపయోగిస్తున్నారు. మందుపూత స్టెంట్ రూ.30 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ధర ఉంటే, కరిగిపోయే స్టెంట్ ధర మాత్రం రూ.1.60 లక్షల వరకు ధర ఉంటోంది. సాధారణ స్టెంట్లు (కరగకుండా ఉండే) రూ.68వేలు, రూ.80 వేలు, రూ.90వేలు చొప్పున అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వినియోగిస్తున్నారు. స్టెంట్ను ప్రభుత్వం సూచించిన విధంగా రూ.31,800 వేలకు విక్రయిస్తున్నట్లు కొన్ని ఆస్పత్రులు చెబుతున్నా మరో రూపంలో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి. ప్రొసీజర్స్ పేరుతో దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టెంట్ ధర బిల్లులో రూ.31,800 వేసినా, వివిధ రకాల సేవల పేరుతో రూ.1.60 నుంచి 2.10 లక్షలు వరకు వసూలుచేస్తున్నారు. రోగి ఆర్థిక స్థితిని బట్టి కూడా చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి. పాత స్టెంట్లను వేస్తూ అదే ధర వసూలు చేస్తున్నాయనే వాదన కూడా ఉంది. స్విమ్స్లో ఇందుకు భిన్నం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్లో స్టెంట్లు, ఆంజియోప్లాస్టీ, ఫేస్మేకర్, వాల్వ్ వంటి గుండె ఆపరేషన్లు ఏడాదికి 5వేల వరకు చేస్తున్నారు. సగటున రోజుకు 5 స్టెంట్ల ఆపరేషన్లు చేస్తున్నారు. స్విమ్స్లో 99 శాతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రూ.65వేలు విలువైన స్టెంట్ల ఆపరేషన్లను క్యాష్లెస్ పేరుతో అందిస్తోంది. ప్రభుత్వం సూచించిన రూ.31,800 ధరలకు స్టెంట్ ధర నిర్ణయిస్తే స్విమ్స్లో కొన్నేళ్లుగా రూ.23,625లకే స్టెంట్లను రోగులకు అందించడం విశేషం. -
ఆదేశాలిచ్చినా కౌంటర్లు దాఖలు చేయరా?
కార్పొరేట్ ఆస్పత్రులపై హైకోర్టు అసహనం సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు చేయని పలు కార్పొరేట్ ఆస్పత్రులపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సోమవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని నిరోధించి మెరుగైన సేవలు ప్రజలు అందేలా చేసేందుకు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన నరేందర్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులిచ్చింది. -
‘కాసు’పత్రులకు చెక్!
- కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలు వసూళ్లకు కళ్లెం - కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుకు అనుగుణంగా - రాష్ట్రంలో చట్టం తేనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు వసూలు చేస్తున్న భారీ ఫీజులను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు చట్టం తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) చట్టం– 2010 ఉంది. దాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర చట్టాన్ని తెలంగాణకు వర్తింపజేసేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ఆమోదించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ కొన్ని మార్పులు చేర్పులతో మరో చట్టం తీసుకొస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగంలో కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. రోగులకు నిర్దిష్ట ప్రమాణాల మేరకు వైద్యం, వసతులు, సేవలు అందించాలన్నదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రమాణాలకు పెద్దపీట: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలుకు ఇప్పటిదాకా ఒక కొలమానం అంటూ లేదు. ఒకే చికిత్సకు ఒక్కో ఆస్పత్రి ఒక్కోరకంగా రోగుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిపై ఎలాంటి నియంత్రణా లేదు. దీంతో రోగులు గత్యంతరం లేక తమ ఆస్తులను ప్రైవే టు ఆస్పత్రులకు ధారపోస్తున్నారు. అంతేకాదు.. అవ సరమున్నా లేకున్నా వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయ డం పరిపాటిగా మారింది. ఎందుకు శస్త్రచికిత్స చేస్తు న్నారో కూడా అంతుపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక క్లినిక్లైతే ఇరుకు సందుల్లో ఎలాంటి ప్రమాణాలు లేకుండానే నడిపించేస్తున్నారు. మరోవైపు డయాగ్నస్టిక్ సెంటర్లు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. వీటిల్లోని దాదాపు సగానికిపైగా కేంద్రాల్లో ప్రమాణాలు పూజ్యం. ఇలా ప్రతీ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నాలుగు రాష్ట్రా లు కేంద్ర చట్టాన్ని వర్తింపజేసుకొని కొత్త చట్టాన్ని తీసు కొచ్చాయి. ప్రతీ ప్రధానమైన శస్త్ర చికిత్సలకు కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఇక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొనసాగిస్తారు. కొత్త ముసాయిదా బిల్లులో ముఖ్యమైన అంశాలివీ.. కొత్త చట్టం రూపొందించాక రాష్ట్రస్థాయిలో ఒక కౌన్సిల్ నియమిస్తారు. దానిద్వారా మొత్తం చికిత్సలను ఆన్లైన్ చేస్తారు. ∙కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీ హెచ్ఎస్), ఆరోగ్యశ్రీలో మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ∙క్లినిక్లు, ఆçస్పత్రులు, నర్సింగ్హోంలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఏవైనా ఈ కౌన్సిల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఉన్న వాటికే అనుమతి ఇస్తారు. ∙ప్రతీ ఆçస్పత్రిపై 15 రోజులకోసారి సమీక్ష జరుగుతుంది. ఒక చికిత్స అనవసరంగా చేస్తే తగు చర్య తీసుకునే అధికారం రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్కు ఉంటుంది. ∙చిన్న చిన్న గల్లీల్లో ఎలాంటి కనీస వసతులు లేకుండా క్లినిక్ల ఏర్పాటుకు అనుమతించరు. ∙ప్రస్తుతం సీజీహెచ్, ఆరోగ్యశ్రీ ధరల కంటే రెండింతలకు మించి కార్పొరేట్ ఆస్పత్రులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొత్త చట్టంతో ఇలాంటి పరిస్థితికి చెక్ పడుతుంది. ∙ప్రతీ రోగి వివరాలను.. అతనికి అందిన శస్త్రచికిత్స వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో పొందుపరచాలి. -
ఇదేం ‘వెల్నెస్’!
వెల్నెస్ సెంటర్కు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఒకటే కేంద్రం కావడంతో వైద్యులపై ఒత్తిడి జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ఉద్యోగుల ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్ పేషెంట్ (ఓపీ) వైద్యసేవల కోసం ఖైరతాబాద్లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్నెస్ కేంద్రం కిటకిటలాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి ఇది ఒక్కటే ఉండటంతో వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం నగదు రహిత ఆరోగ్య సేవలకోసం కార్డులు జారీచేశాక... వారికి ఉచితంగా ఓపీ సేవలు కూడా అందించేందుకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని పాత జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున... హైదరాబాద్లో 6 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటగా ఖైరతాబాద్లో నెల కొల్పారు. ఇంకా మిగిలినచోట్ల వీటిని ఏర్పాటు చేయకపోవ డంతో ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పైగా వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు నేరుగా వెళ్లడానికి అవకాశం లేకపోవడం... వాటిల్లోకి వెళ్లాలంటే వెల్నెస్ సెంటర్ వైద్యులే సిఫారసు చేయాల్సి ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఓపీ.. వైద్యులకు బీపీ ప్రస్తుతం ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, 15 మంది పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరందరినీ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే ఆయుష్, యోగ, ప్రకృతి చికిత్సా కేంద్రం కూడా ఉంది. ప్రస్తుతం రక్తపరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ సహా వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సరాసరి 350 మంది వరకు ఓపీ సేవలకోసం వస్తున్నారు. 350 మందిలో సుమారు 20 మంది వరకు తదనంతర చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు సిఫారసు చేయించుకుంటున్నారు. ఓపీ పెరుగుతుండటంతో వైద్యులపై కూడా ఒత్తిడి పెరుగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రోగులకు తగినంత సమయం ఇవ్వడంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. నగరంలో మరో ఐదు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే స్పందన కరువు రాత్రిళ్లు అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇంకా తమ వద్ద అమలవడం లేదంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లొచ్చన్న ప్రభుత్వ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని పలువురు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు, జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గోటిచుట్టు.. ‘నోటు’ పోటు
ఆసుపత్రుల్లో రోగులకు తప్పని కరెన్సీ కష్టాలు - పెద్ద నోట్లు నిరాకరిస్తూ పలుచోట్ల నోటీసు బోర్డులు - కేంద్రం మినహారుుంపు ఇచ్చినా యాజమాన్యాల ఇష్టారాజ్యం - చేసేది లేక కొన్నిచోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లిస్తున్న రోగులు - డబ్బులు కట్టనివారి డిశ్చార్జ్లు తాత్కాలికంగా నిలిపివేత సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకూ కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. ‘పెద్ద నోట్ల’నుంచి కేంద్రం ఆస్పత్రులకు మినహారుుంపు ఇచ్చినా.. హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు పాతనోట్లను తీసుకునేందుకు నిరాకరించారుు. బిల్లు చెల్లించకపోతే చికిత్సలు నిలిపి వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో రోగులు అష్టకష్టాలు పడ్డారు. కొందరు రోగులు చేసేది లేక తమ బంధువులను ఆస్పత్రులకు పిలిపించుకుని వారి వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించారు. కార్డులు లేని వారు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బిల్లులు చెల్లించని వారి డిశ్చార్జ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక వివిధ ప్రమాదాల్లో గాయపడే క్షతగాత్రులను ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకు వస్తే వైద్యులు వారికి సీటీ, ఎంఆర్ఐ సిఫార్సు చేస్తుంటారు. శుక్రవారం ఇలా వచ్చినవారు ఇబ్బందులపాలయ్యారు. సమయానికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నిర్ణరుుంచిన ధరల ప్రకారం వారు ఆయా టెస్టులకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పాతనోట్లు ఇవ్వగా తీసుకునేందుకు బిల్లింగ్ స్టాఫ్ నిరాకరించడంతో వారంతా ఇబ్బంది పడ్డారు. మందుల దుకాణాలు ‘నో..’ హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ, ఉస్మాని యా, సుల్తాన్బజార్, పేట్లబురుజు, నిలోఫర్, ఎంఎన్జే సహా పలు ప్రభుత్వ, కార్పొరేట్ సూ పర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, జనరల్ నర్సింగ్ హోం, క్లినిక్స్ల అవుట్ పేషంట్ విభాగానికి రోజు కు సగటున 50-60 వేల మంది రోగు లు వస్తుంటారు. వైద్యులు రాసిన మందులు తీసుకునేందుకు ఆయా ఆస్పత్రుల ముందు న్న ఫార్మసీలకు వెళ్లగా వారు పాతనోట్లను నిరాకరించారు. ఆ దుకాణాల్లో కార్డు సౌలభ్యం కూడా లేక పోవడంతో రోగులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. కార్డు సౌలభ్యం ఉన్న చోట వాస్తవ బిల్లుకు అదనంగా 5 శాతం చెల్లించేందుకు అంగీకరించిన వారికే మందులిచ్చారు. ఇక డయాగ్నోస్టిక్ సెంటర్లలోనూ కష్టాలు తప్పలేదు. విజయ, కోణార్క్, సత్య వంటి పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లు మినహా మిగిలినవన్నీ పాత నోట్లను నిరాకరించారుు. ఎక్స్రేకు చిల్లర ఇవ్వమన్నారు నా కూతురు అనిత తొమ్మిది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తీసుకొచ్చాను. కాలికి రాడ్ వేశారు. మూడు రోజుల నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడం లేదు. డాక్టర్లు రాసిన ఎక్స్రే టెస్టుకు రూ.500 నోటు ఇస్తే చిల్లర ఇవ్వమంటున్నారు. కూలీ పని చేసుకుని జీవించే మాకు బ్యాంక్లకు వెళ్లి మార్చుకోవడం తెలియదు. పండ్లు, బ్రెడ్ కోనాలన్న కష్టంగా ఉంది. - నర్సమ్మ, కీసరగుట్ట చిల్లర ఇవ్వలేదు నా భార్యకు నెలలు నిండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాను. రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే తీసుకోవడం లేదు. ఆస్పత్రిలో డాక్టర్ కన్సల్టేషన్ రూ.300. ఈ బిల్లు చెల్లించేందుకు రూ.500 నోటు తీసుకుని కౌంటర్కు వెళ్తే చిల్లర కూడా ఇవ్వలేదు. పాత నోట్లు చెల్లవని బోర్డు పెట్టాం కనిపించటం లేదా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బ్యాంక్లోకి వెళ్లి మార్పిడి చేరుుంచే సమయంలేక తప్పని పరిస్థితుల్లో టెస్టులు చేరుుస్తున్నాను. - సీహెచ్ సుమన్, అభ్యుదయనగర్ కాలనీ, హైదరాబాద్ -
హెల్త్ కార్డులతో ‘కార్పొరేట్’ చికిత్స
అందించాలని వైద్యారోగ్య మంత్రిని కోరిన పీఆర్టీయూ, ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, రవీందర్ కోరారు. ఔట్ పేషెంట్ సదుపాయం కూడా కల్పించేలా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయులంతా నెలవారీ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మూడుసార్లు మాట్లాడామని, చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీల రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారని వారు పేర్కొన్నారు. -
సీఎం ఆదేశించినా పట్టదా..
కార్పొరేట్ ఆస్పత్రులపై ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఫైర్ సాక్షి, ఖమ్మం: ‘హెల్త్కార్డులుండీ.. వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టు కుటుంబాలను రాజధానిలోని 9 కార్పొరేట్ ఆస్పత్రులు అడ్మిట్ చేసుకోకుండా నానుస్తున్నాయని, ఇలా చేస్తే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని, సీఎం స్వయంగా ఆదేశించినా.. ఇంత జాప్యమా.. తెలంగాణలో ఇది కుదరదు.’ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని వ్యాపారంగా చేశారని, ఉద్యోగుల కుటుంబాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రులకు 15రోజులు గడువిస్తున్నామని, ఆ తర్వాత చర్యలకు వెనుకాడమన్నారు. గత ప్రభుత్వాలు అపోలో ఆస్పత్రికి రూ.వేలకే రాజధాని నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూమిని ఇచ్చాయని, ఉద్యోగులకు వైద్యం అందించాల్సిన విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత మీది కాదా..? అని ప్రశ్నించారు. -
ఉద్యోగుల కార్పొరేట్ వైద్య ప్యాకేజీ 40% పెంపు!
కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపానికి సర్కారు అంగీకారం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 40 శాతం పెంచడానికి సర్కారు సుముఖంగా ఉంది. ఆరేడేళ్ల క్రితం వివిధ వ్యాధులకు నిర్ధారించిన ప్యాకేజీ సొమ్ము ప్రస్తుత ధరల ప్రకారం లేదని... కాబట్టి పెంచడమే సరైందని సర్కారు భావించింది. అందుకే పెంపునకు అంగీకారం తెలిపింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులను ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఉద్యోగుల వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్య కార్డుల కింద కేవలం ఆరోగ్యశ్రీలోని నెట్వర్క్ సహా ఇతర ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే ఉద్యోగులకు వైద్యం చేస్తున్నాయి. తమకు గిట్టుబాటు కాదంటూ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం ఈ కార్డుల కింద ఉద్యోగులకు వైద్యం చేయడం లేదు. దీంతో ఈ అంశం మొదటి నుంచీ అపరిష్కృతంగానే ఉండిపోయింది. చివరకు ప్యాకేజీ సొమ్మును 40 శాతం వరకు పెంచుతామని ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలిపింది. కార్పొరేట్ వైద్యంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఉద్యోగ సంఘాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్గౌడ్, కారం రవీందర్, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బుధవారం కూడా మరోసారి సమావేశం కానున్నారు. గురువారం కార్పొరేట్ యాజమాన్యాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. దసరా నుంచి అమల్లోకి రావాలి: దేవీప్రసాద్, గౌరవాధ్యక్షుడు, టీఎన్జీవో కార్పొరేట్ వైద్యం కోసం ఉద్యోగుల తరఫున కొంత సొమ్ము భరిస్తాం. దసరా నుంచి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అవకాశం ఉన్నా అన్ని వ్యాధులకు చికిత్సలు అందించడం లేదు. ఉద్యోగుల నుంచి నెలవారీ ప్రీమియం వసూలు రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారు కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతుంటారు. దాదాపు 230 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు మొదట్లో ఒప్పుకున్నాయి. కానీ తాజాగా 40 శాతం ప్యాకేజీ పెంచాలని కోరుతున్నాయి. ఇది ప్రభుత్వానికి భారమైతే గెజిటెడ్ ఉద్యోగులు నెలకు రూ. 300, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ. 200 ప్రీమియంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని... ఆ ప్రకారం నెలకు రూ. 75 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య భారాన్ని ప్రభుత్వమే భరిస్తుం దని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో కేసీఆర్ అన్నారని... కాబట్టి ప్రీమియం వసూలుపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కార్పొరేట్ ఆసుపత్రి పై హైకోర్టు సీరియస్
-
కనీస అవసరాలపై సర్కారు నిర్లక్ష్యం
హైదరాబాద్: ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బాగ్లింగంపల్లిలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఐద్వా, డివైఎఫ్ఐ, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్కా రామయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ వైద్య సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి జి.ఝాన్సీ మాట్లాడుతూ.. విద్య, వైద్యం అంగడి సరుకుగా మారిందని, కొనగలిగే శక్తి ఉన్నవారికే అవి అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. -
నోటికి తాళాలు..!
సమాచారంపై అధికారులకు ఆంక్షలు వైఫల్యం బయటపడుతుందన్న భయం విశాఖపట్నం: వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నోటికి ప్రభుత్వం తాళాలేస్తోంది. ఆ శాఖకు సంబంధించిన సమాచారమేదీ మీడియాకు, ముఖ్యంగా ‘సాక్షి’కి అందజేయరాదని ఆంక్షలు విధిస్తోంది. సాక్షి ప్రతినిధులు ఈ శాఖకు సంబంధించి ఏ సమాచారం అడిగారో ముందుగా తమకు తెలియజేస్తే, ఇవ్వాలో వద్దో చెబుతామని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు, కింది స్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. మరే ఇతర శాఖల్లోనూ లేని విధంగా వైద్య ఆరోగ్యశాఖలో తూ.చ. తప్పకుండా ‘పెద్దల’ ఆదేశాలను అమలు చేస్తున్నారు. కావలసిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా పంపుతున్నారు. అటు నుంచి ‘ఓకే’ అంటే సమాచారం ఇస్తున్నారు. లేదంటే మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియకుండా పోయే ప్రమాదం తలెత్తింది. ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం (దీనిని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు) కింద 2007 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది లబ్ధి పొందారన్న విషయాన్ని ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన వివరాలను 2014 నుంచి మాత్రమే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం అమలయిన 2007 నుంచి 2014 వరకు ఎంతమంది ప్రయోజనం పొందారో తెలిసే వీలు లేకుండా చేసింది. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఆయన హయాంలో పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అనేకమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందారు. పైసా ఖర్చు లేకుండా వేల సంఖ్యలో గుండెకు శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. వైఎస్ మరణానంతరం సీఎం పీఠమెక్కిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ వచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. ఆర్యోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు. క్రమేపీ ఈ పథకం కింద వైద్యం, శస్త్రచికిత్సలు చేసిన ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.వందల కోట్ల బకాయిలను చెల్లించడం మానేశారు. దీంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ (నేటి ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో వైద్యానికి ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం అర్హులైన పేద, మధ్య తరగతి వారికి పూర్తి స్థాయిలో అందకుండా పోతోంది. ప్రభుత్వం తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తే ఈ వ్యవహారమంతా ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో మీడియాకు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం బయటపడకుండా ప్రభుత్వం ఇలా జాగ్రత్త పడుతోంది. -
ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ
- ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు సఫలం - నెల రోజుల్లో బకాయిల చెల్లింపునకు సర్కారు సంసిద్ధత - ప్యాకేజీలు, ఎంవోయూ సమీక్షకు కమిటీ - ఆస్పత్రుల తీరుపై మంత్రి అసంతృప్తి - మళ్లీ ఇలా చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకటించాయి. పెండింగ్లో ఉన్న బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తామని.. ప్యాకే జీ, ఎంవోయూలకు సంబంధించి సమీక్షిం చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. దీనిపై సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించిన ఆసుపత్రుల ప్రతినిధులు.. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రుల తీరుపై అసంతృప్తి... చర్చల సందర్భంగా ఆస్పత్రుల తీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలి సింది. తరచుగా వైద్య సేవలు నిలిపివేయడం సమంజసం కాదని ఆయన ఆస్పత్రుల ప్రతినిధులను మందలించినట్లు సమాచార ం. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తగ్గినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో నిమ్స్ డెరైక్టర్ మనోహర్, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల తరఫున డాక్టర్ భాస్కర్రావు, ప్రైవేటు ఆసుపత్రుల తరఫున డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ సురేశ్గౌడ్ ఉంటారు. ఇక నెల రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్న అంశంపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు కోరగా మంత్రి నిరాకరించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రులకేనా? ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో 70శాతం వరకు నిధులు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకే చేరుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. 2016-17 బడ్జె ట్లో ఆరోగ్యశ్రీకి రూ.464 కోట్లు కేటాయించా రు. వీటిలోనూ 70 శాతం దాకా ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేసే అంశాన్ని సర్కారు సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికంగా శస్త్రచికిత్సలు చేసేలా చూడాలని అధికారులకు సూచించింది. ఇటీవల ఎముకలకు (ఆర్థోపెడిక్) సంబంధించిన శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించాలని సర్కారు నిర్ణయించి, అంతర్గత ఉత్తర్వులూ ఇచ్చింది. కానీ నిరసన రావడంతో వెనక్కి తీసుకుంది. -
నిఖిల్రెడ్డికి న్యాయం చేయండి
ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆరోగ్య వుంత్రికి ఫోను గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఎంపీ వీహెచ్ ఆందోళన గాజులరామారం: కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి అదుపు లేకుండా పోతోందని ఆ బాధితుల్లో తానూ ఒకడినని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వాపోయారు. ఎత్తు పెరగడానికి ఖైరతాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం సుచిత్రలోని అతడి నివాసానికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. చిన్న ఆపరేషన్కు రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు తనకు రూ. 1.70 లక్షలు చార్జ్ చేశారన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. నిఖిల్ రెడ్డి తల్లితండ్రులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎందుకు చర్యల తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ఆయన హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డితోఫోన్లో మాట్లాడారు. అనంతరం వీహెచ్ ఆస్పత్రి విషయమై ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేయించుకుని మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డికి నష్టపరిహారంగా రూ. 5 కోట్లు హాస్పటల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్లోబల్ ఆస్పత్రి ఎదుట ఎంపీ వీహెచ్ ఆందోళన ఖైరతాబాద్: ఎత్తు పెంచుతామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వుంగళవారం రాత్రి ఎంపీ వి.హన్మంతరావు, నిఖిల్రెడ్డి తండ్రి గోవర్ధన్రెడ్డితో కలిసి గ్లోబల్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసి రెండు నెలలవుతున్నా నిఖిల్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడ న్నారు. నిఖిల్రెడ్డి విషయంలో సర్జరీ ప్రయోగాత్మకంగా చేశారని, ఇది అనైతిక శస్త్రచికిత్సగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు కారణమైన డాక్టర్ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆందోళన విరమించారు. -
వాట్సప్ వైద్యం
రోగి ఫొటోలు సెల్ఫోన్లో తీసి.. వాట్సప్లో పంపి.. ఎక్కడో ఉన్న వైద్యుల సూచనల మేరకు వైద్యం మంచిర్యాలలో కార్పొరేట్ హంగుల ఆసుపత్రుల్లో చోద్యం రోడ్డు ప్రమాదంలో తలకు, ఛాతికి తీవ్ర గాయాలైన ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కార్పొరేట్ హంగులతో కూడిన ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణులున్నట్లు బోర్డులు పెట్టడంతో ప్రభుత్వాసుపత్రిని వదిలి, ఈ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. బోర్డు మీద పేరున్నా.. తీరా అక్కడ వైద్యులు మాత్రం ఉండరు.. ఎంబీబీఎస్ డాక్టర్లే రోగిని పరీక్షించి, గాయాలైన ప్రాంతాలను సెల్ఫోన్లలో ఫొటోలు దించి, వాట్సప్లో ఎక్కడో ఉన్న వైద్య నిపుణులకు పంపుతారు. ఆ ఫొటోలను పరిశీలించిన స్పెషలిస్టులు ఫోన్లో చెప్పినట్లుగా ఇక్కడి జూనియర్ వైద్యులు వైద్యం చేస్తారు. అదృష్టం బాగుండి నయమైతే ఒక్క రోజులోనే రూ.50 వేల నుంచి రూ.లక్ష బిల్లు.., అదృష్టం బాగాలేక వైద్యం వికటించి ప్రాణం మీదికొచ్చిందంటే కరీంనగర్కు రెఫర్. - ఇదీ తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో కాసుల కోసం కొత్త పుంతలు తొక్కుతున్న కార్పొరేట్ హంగులతో కూడిన ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న చోద్యం ఆదిలాబాద్: కేవలం రోగి ఫొటోలనే కాదు, ఆ రోగిని రోగ నిర్ధారణ రిపోర్టులను సైతం వాట్సప్లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్స్రేలు, గుండె నొప్పికి సంబంధించిన ఈసీజీలు, ఇతర నివేదికలు పంపి, వాటి ఆధారంగా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కళ్లు జిగేల్ మనిపించే లైట్లు.. ఇట్టే ఆకర్షించే బోర్డులు.. నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలు.. వైద్యుల బోర్డుపై గుండె నిపుణులు, ఆర్థోపెడిక్, సర్జన్, న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, ఈఎన్టీ, పిడియాట్రిక్, న్యూరాలజిస్టు, ఎండీడీఎం.. ఇలా చాంతాడంత ప్రత్యేక వైద్య నిఫుణులున్నట్లు బోర్డులు. ఇలా అమాయకుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని కాసులు దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలో పదుల సంఖ్యలో ఇలాంటి ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కానీ.. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా ఆసుపత్రిలో చేర్పిస్తే ప్రత్యేక వైద్య నిపుణులు ఉండరు. కేవలం ఇద్దరు, ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లతోనే కార్పొరేట్ కహానీ నడిపిస్తున్నారు. రోజులో 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలందిస్తామని చెబుతున్న ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదు. రూ.లక్షల్లో బిల్లులు.. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ, బిల్లులు మాత్రం రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లోని ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా బెడ్ చార్జీలు, నర్సింగ్ చార్జీలు, వైద్య నిఫుణుల బిల్లులు, మందులు.. ఇలా రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అత్యసరం కావడంతో నిరుపేదలైతే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. ఏజెంట్లతో దందా.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఒక్కో రోగిని రిఫర్ చేసినందుకు గాను, రోగి బిల్లుపై సదరు ఏజెంట్లకు రూ.వేలల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి బిల్లుపై 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ కట్టబెడుతూ తమ వ్యాపారాన్ని మూడు బెడ్లు.. ఆరు పేషెంట్లు.. అన్న చందంగా కొనసాగిస్తున్నారు. -
ఆస్పత్రికి పోతే అప్పుల పాలే
- బిల్లులు లక్షల్లో.. ప్రభుత్వాల రీయింబర్స్మెంట్ వేలల్లో - లబోదిబోమంటున్న ఉద్యోగులు.. పెన్షనర్లదీ అదే దుస్థితి - ఒప్పందం ఉల్లంఘించి లక్షల్లో బిల్లులు - వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు - ఆస్పత్రుల నియంత్రణలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం - ఏటా సగటున 50 వేలమందిపై రూ.300 కోట్ల భారం - నగదు రహిత వైద్యం అమలు చేయకపోవడంతో నష్టపోతున్న వైనం సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఉద్యోగులు, పెన్షనర్లను.. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ ఆస్పత్రులు కలసి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద రీయింబర్స్మెంట్ వస్తుంది కదా అనే ధైర్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు చివరకు ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న బిల్లులు చూసి లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రేట్ల ప్రకారం వైద్య చికిత్సలు చేయాల్సిన ఆస్పత్రులు.. ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి అధిక బిల్లులతో రోగులను పిండుకుంటున్నాయి. మరోవైపు లక్షల్లో బిల్లులు వేస్తున్న ఆస్పత్రులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. పూర్తిగా నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారమని అధికారులు సూచిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏటా సగటున యాభైవేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల కారణంగా అప్పులపాలవుతున్నారు. ఏదైనా జబ్బుతో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారంటే ఆ అప్పునుంచి ఏళ్ల తరబడి కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఏటా పరిశీలనకు 50 వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లు 8.5 లక్షల మంది ఉండగా, తెలంగాణలో 5 లక్షల వర కు ఉన్నారు. వీరికి సంబంధించిన మెడికల్ బిల్లులు ఏటా సగటున 50 వేల వరకు వైద్య విద్యా సంచాలకుల పరిశీలనకు వస్తున్నాయి. ఈ 50 వేల దరఖాస్తులకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇస్తున్న బిల్లుల అంచనా రూ.700 కోట్లకు పైనే. కానీ ఉద్యోగులకు రాష్ర్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ (సీజీహెచ్ఎస్) రేట్ల కింద రీయింబర్స్మెంట్ చేస్తున్నది మాత్రం రూ.400 కోట్లు మాత్రమే. అంటే సగటున 50 వేలమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ఏటా రూ.300 కోట్ల మేర భారం పడుతోందన్నమాట. ఆస్పత్రులకు ముందు సొమ్ము చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అమలుకు నోచని నగదు రహిత వైద్యం ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమల్లోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గత రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెల నెలా ప్రీమియం డబ్బు వసూలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. ప్రీమియం కొంత అధికంగా తీసుకునైనా తమకు నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. తూతూ మంత్రంగా కార్పొరేట్ ఆస్పత్రులతో భేటీలు జరుపుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆస్పత్రుల్లో చేరితే డబ్బులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ ఆరు మాసాల్లోపో సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తుండటంతో అప్పులపాలవుతున్నారు. పొంతనలేని రేట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న రేట్ల ప్రకారమే కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించాల్సి ఉండగా.. అవి వేస్తున్న బిల్లులు మాత్రం మూడు, నాలుగు రెట్లు ఉంటుండడం గమనార్హం. కొన్ని జబ్బులకు సంబంధించిన రేట్లను పరిశీలిస్తే... - కంటికి సంబంధించిన ఏ జబ్బుకైనా సీజీహెచ్ఎస్ కింద గరిష్టంగా రూ.18 వేల రీయింబర్స్మెంట్కే అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు జబ్బును బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు వేస్తున్నాయి. - లాంగ్బోన్ సర్జరీకి ప్యాకేజీ రేటు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా.. ఆస్పత్రులు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. - మోకాలి చిప్ప మార్పిడికి ఒక్కో దానికి రూ.1.56 లక్షలు ఉంటే కార్పొరేట్ బిల్లు రూ.2 లక్షలకు పైగానే వస్తోంది. - గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలే ఇస్తుంది. కానీ ఆస్పత్రుల బిల్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతోంది. - గుండెకు స్టెంట్లు (2) వేస్తే ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలు ఇస్తుండగా రూ.4 లక్షలు పైనే వేస్తున్నారు. - తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేస్తే వచ్చే బిల్లు రూ.20 వేలకు మించి లేదు. కానీ ఆస్పత్రులు రూ.70 వేలు బిల్లు వేస్తున్నాయి. - హెర్నియా సర్జరీకి (మందులు, సేవలు కలిపి) రూ.50 వేలు మించి లేదు. కానీ రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ వస్తేనే న్యాయం జరుగుతుంది కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వేస్తున్న విషయం వాస్తవమే. కానీ వాటిని నియంత్రించలేకపోతున్నాం. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధికంగా బిల్లులు చెల్లిస్తున్నదీ వాస్తవమే. దీనికి పరిష్కారం నగదు రహిత వైద్యం మినహా మరొకటి లేదు. త్వరలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాం. - డాక్టర్ ఎన్.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుకురావడం లేదు.. పెన్షనర్లు లక్ష రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. వారి ఆవేదన వర్ణనాతీతం. మాకు ఉచిత వైద్యమొద్దు. డబ్బు తీసుకుని కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు మూడు ప్యాకేజీల ఆప్షన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదు. - పి.వెంకటరెడ్డి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం ఆదేశాలతోనే సరి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నాలుగు నెలల క్రితం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులే ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ ఇప్పటివరకు ట్రస్ట్ ఏర్పాటుకు జీవో లేదు, మేనేజింగ్ కమిటీ లేదు. హైదరాబాద్లోని 15 కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చెన్నై, బెంగళూరుల్లో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ వర్తింప చేయాలని సీఎం చెప్పారు.. కానీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నా నగదు రహిత వైద్యం అందడం లేదు. - కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ -
ఎన్టీఆర్ వైద్యసేవకు బకాయి సుస్తీ
పేద రోగులు వైద్యసేవల కోసం మునుపటిలా కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టెక్కేందుకు సంశరుుస్తున్నారు. ఆరోగ్యశ్రీ (ప్రస్తుత పేరు ఎన్టీఆర్ వైద్యసేవ) కార్డు వెంటబెట్టుకుని వెళ్లడానికి వెనుకాడుతున్నారు. తమను చేర్చుకుని వెంటనే సేవలందిస్తారా లేదా అనే సందేహం వీరిని వెంటాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. చేర్చుకుని సేవలందిస్తే సర్కారు నిధులు విడుదల చేస్తుందా లేదా అనే మీమాంస కార్పొరేట్ ఆస్పత్రులను వెంటాడుతోంది. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రోగులను చేర్చుకోవడం పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదని భోగట్టా. అంతేకాదు తమ బకాయిల కోసం ఉద్యమించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు సిద్ధపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం దూరమయ్యేలా ఉంది. * ఎన్టీఆర్ వైద్యసేవకు నిధులు విడుదల చేయని సర్కారు * కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు * వైద్యసేవలు నిలిపివేయాలనే యోచనలో ఆస్పత్రి యాజమాన్యాలు శ్రీకాకుళం సిటీ : ఎన్టీఆర్ వైద్యసేవలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. రిమ్స్తో పాటు పాలకొండ, టెక్కలి, పాతపట్నం, సీహెచ్సీల్లో ఈ పథకం కింద వైద్య సేవలందుతున్నాయి. వీటితో పాటు ఎంపిక చేసిన కార్పొరేట్ ఆస్పత్రులు బగ్గు సరోజనీదేవి, కిమ్స్ సాయిశేషాద్రి, సిందూర, జీఎంఆర్, జెమ్స్లలో కూడా వైద్య సేవలు అందుతున్నాయి. 2007లో అప్పటి ముఖమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు కార్పొరేట్ స్ధాయి వైద్యం అందించాలన్నదే ముఖ్య ఉద్ధేశంగా ఆయన ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చింది. ఎన్టీఆర్ వైద్యసేవగా తెర పైకి తీసుకువచ్చింది. పేదప్రజలకు అందిస్తున్న వైద్యానికి రకరకాలు మెలికలు పెట్టి కుదించేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలుచేస్తున్నా ప్రభుత్వం సరిగ్గా నిధులు చెల్లించడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రపదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(ఆషా) ఆందోళన కూడా చేపట్టాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రభుత్వానికి, ఆషాకు మద్య పలుపర్యాయాలు చర్యలు జరిగినా ఫలితం అంతంతమాత్రమే. ఈనెల 11వ తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం తన హామీని అమలు చేయకపోవడంతో ఆషా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవలను బంద్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఇదే జరిగితే పేద రోగులకు ఇక్కట్లు తప్పవు. శ్రీకాకుళం పట్టణంలో డేఅండ్నైట్ జంక్షన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో నిర్వహించిన 407 (ఈఎన్టీ, జనరల్సర్జన్,గైనిక్, యూరాలజీ తదితర విబాగాలకు) శస్త్ర చికిత్సలకు మూడునెలలుగా రూ. 60 లక్షలకు పైగా బకాయిలు రాలేదని తెలిసింది. ఇది ఒక ఆస్పత్రి బకాయి మాత్రమే. మరో నాలుగు ఆస్పత్రులకు రూ. కోట్లల్లోనే బకాయిలన్నట్లు తెలియవచ్చింది. ఈ బకాయిల పరిస్థితి రోగులను ప్రభావితం చేస్తోంది. ఈ పథకం కింద సేవలదించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. రోగులను చేర్చుకుంటే మరింత బకారుులు పేరుకుపోవడం తప్ప ఫలితం లేదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సలు సకాలంలో జరగడంలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యసేవలు బంద్ చేపట్టనున్న సమచారం అధికారికంగా తమకు చేరలేదని ఎన్టీఆర్ వైద్యసేవల జిల్లా కో-ఆర్డినేటర్ రాజేష్ పేర్కొనడం విశేషం. -
కాలం చెల్లితే.. కాసులే..
కంపెనీ ఆస్పత్రిలో మందుల దందా ► తక్కువ కాలపరిమితి, నాణ్యతలేని మెడిసిన్ కొనుగోలు ► కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు ► కార్మికుల జీవితాలతో చెలగాటం ► పట్టించుకోని సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి వ్యాప్తంగా యూజమాన్యం నిర్వహిస్తున్న డిస్పెన్సరీలలో నాణ్యత లేని మందులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఎన్ని మందులు వాడినా రోగాలు నయం కావడంలేదని కార్మికులు లబోదిబో మంటున్నారు. ఇందుకు నాణ్యత లేని నాసిరకం, తక్కువ కాలపరిమితి కలిగిన మందులే కారణమని తెలుస్తోంది. కొంతమంది సింగరేణి అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి స్థానిక డిస్ట్రిబ్యూటర్ల నుంచి లో గ్రేడ్ మందులను అదీ ఎక్స్పైరీ తేదీ ముగియడానికి దగ్గరగా ఉన్నవి కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 11 డిస్పెన్సరీలు ఉన్నారుు. నిత్యం వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు వివిధ ఆరోగ్య సమస్యలపై వస్తూ ఉంటారు. వారికి అవసరమైన మందుల కొనుగోలు నిమిత్తం యూజమాన్యం ప్రతి ఏడాది రూ.20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వీటన్నిటికీ కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రి నుంచే మందులు సరఫరా చేస్తుంటారు. సాధారణంగా మందుల కొనుగోళ్లకు టెండర్ విధానం(ఎల్11) అమలు చేయాల్సి ఉంటారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ఫార్మసిస్టు ఓకే చేసిన తర్వాత ఆర్డర్ ఇవ్వాలి. అరుుతే ఇక్కడ టెండర్ సిస్టం కాకుండా లోకల్ పర్చేజ్ విధానం అమలవుతోంది. చిన్నచిన్న ఫార్మా కంపెనీలకు చెందిన మందులను డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి మందులు నేరుగా కొనుగోలు చేయడానికి యాజమాన్యం కల్పించిన వెసులుబాటు(లోకల్ పర్చేజ్) కొంత మంది అవినీతిపరులకు వరంగా మారింది. మామూలుగా మందులు కనీసం ఏడాది నుంచి మూడు, నాలుగేళ్ల కాల పరిమితితో ఉంటారుు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు నాణ్యతలేని(లో గ్రేడ్) మందులను అది కూడా కేవలం ఆరునెలల కాలపరిమితి మాత్రమే మిగిలి ఉన్నవి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మందులకు డిస్ట్రిబ్యూటర్లు కమీషన్ 50 శాతం వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాటిని కొనుగోలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంపిల్ ఒకటి.. మెడిసిన్ మరొకటి లో గ్రేడ్ మందుల్లో అసలు మందు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి. తొలుత శాంపిల్స్ ఒకరకం చూపిస్తారు.. సరఫరా చేసేది మరోరకం ఉంటారుు. అవి పనిచేస్తాయో.. చేయవో కూడా తెలియదు. అయినప్పటికీ సంబంధిత ఉన్నత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటినే సరఫరా చేస్తుండడంతో ఎన్ని వాడినా రోగాలు నయం కాకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని కార్మిక కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. చివరకు విసిగిపోరుు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు వల్ల ఆరు నెలల కాలంలోనే మళ్లీ మందులకు డబ్బులు వెచ్చించాల్సి రావడం కంపెనీకి సైతం ఆర్థిక భారంగా మారుతోంది. సబ్స్ట్యూట్ మందులతో సమస్య కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది మందులు వాడుతున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారు వాడే మందులు స్థానికంగా దొరకవు. వాటికి బదులు సింగరేణి ఆస్పత్రుల్లో ఇచ్చే సబ్స్ట్యూట్(ప్రత్యామ్నాయ) మందులు వాడితే జబ్బు నయం కాక ఇబ్బందులు పడుతున్నారు. అసలు సింగరేణి ఆస్పత్రుల్లో డాక్టర్లు మెడిసిన్ కోర్సు రాసిన తర్వాత ఫార్మాసిస్టులు మందులు ఇచ్చి పంపించేస్తారు. తిరిగి వాటిని వైద్యులకు చూపించి డోస్, నాణ్యతను తెలుసుకునే అవకాశం సైతం ఉండదు. అవి ఎలాంటివో వైద్యులు తెలుకునే పరిస్థితీ లేదు. -
ఏటా రూ.వెయ్యి కోట్లు .. ఇదీ ‘అందాల’ వ్యాపారం
కాసుల కోసం కాస్మొటిక్ చికిత్సలు వైద్యుల అనైతిక చర్యలు నిబంధనలను పట్టించుకోని వైనం గ్లోబల్ ఆస్పత్రి వైద్యునికి నోటీసులు సిటీబ్యూరో: అందం కోసం ఆరాట పడుతున్న వ్యక్తుల బలహీనత...కాస్మొటిక్ వైద్యులకు... కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి.. ఇలాంటి వారి ఆశను ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. తాము కోరుకున్న రూపం వస్తోందో...లేదో కానీ ఇలాంటి ‘ఆశావహులు’ భారీ మొత్తంలో నష్టపోతున్నారు. కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ‘అందం...శరీరాకృతి’ చికిత్సల పేరిట నగరంలో ఏటా రూ.వెయ్యి కోట్ల వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. ఇలాంటి చికిత్సలు అధిక శాతం విఫలమవుతుండడం గమనార్హం. సమస్యను గుర్తిం చేసరికే కోలుకోలేని నష్టం జరిగిపోతోంది. అత్యవసర శస్త్ర చికిత్సలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నిటికీ బంధువుల అనుమతి అవసరం. బోయిన్పల్లికి చెందిన గోవర్థన్రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి(22) విషయంలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఇవేవీ పట్టించుకోలేదు. ఐదడుగుల కంటే తక్కువ ఉన్న వారికే ఎత్తును పెంచే శస్త్రచికిత్స చేయాలనేది నిబంధన. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్ రెడ్డికి శస్త్రచికిత్స చేయడాన్ని పరిశీలిస్తే కాసుల కోసం నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు ఎంతకు దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు చప్పుడు కాకుండా.. ఇప్పటి వరకు అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయడం... సాధారణ కడుపు నొప్పికి కూడా అంపెండిసైటిస్ పేరుతో శస్త్రచికిత్స చేయడం, సరోగసీ పేరుతో మాతృత్వాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముతున్న వైనం నగరంలో చాలా కాలంగా కొనసాగుతున్నదే. తాజాగా వైద్యులు రూటు మార్చారు. కష్టపడకుండానే సన్నబడాలని.. ముక్కు, ముఖం అందంగా కనిపించాలని... ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించాలని ఆరాట పడేవారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. లెఫోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీ, రీనోప్లాస్టీ (ముక్కు వంకరలు సరి చేసుకోవడం), లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు వేసుకోవడం), హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వ ంటి శస్త్రచికిత్సలు దాదాపు అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు చేస్తున్నాయి. నగరంలో బెరియాట్రిక్ సర్జరీలు నెలకు 100-150 వరకు... లైఫోసక్షన్ శస్త్రచికిత్సలు 1500-2000 వరకు జరుగుతున్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, రీనోప్లాస్టీ, బ్రెస్ట్, లాసిక్ సర్జరీల సంఖ్య లెక్కే లేదు. ఇటీవల పొట్టిగా ఉన్న వారి ఎత్తు పెంచేందుకూ చికిత్సలు పెరిగాయి. వీటి ద్వారా ఏటా రూ.వెయ్యి కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ఎంసీఐ నిబంధనలు ఇవీ.. నిజానికి బోన్ క్యాన్సర్, పోలియో, ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకరలు పోవడం, ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినవారికి ఈ తరహా చికిత్సలు చేయవచ్చు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఐదడుగుల కంటేతక్కువ ఎత్తు... ఒక కాలు పొడవు... మరొక కాలు పొట్టిగా ఉన్న వారికి ఈ తరహా శస్త్రచికిత్సలతో రెండు నుంచి మూడు అంగుళాల వరకు ఎత్తు పెంచుకునే అవ కాశం ఉంది. ఎముకలను పెంచినంతసులభంగా కండరాలు, నరాలను పెంచలేరు. అంతకు మించి ఎత్తు పెంచితే కండరాలు, నరాలు బిగుసుకుపోతాయి. మోకాళ్ల పనితీరు దెబ్బ తింటుంది. రోగి కోలుకోవడానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. బెడ్రెస్ట్, వీల్ చైర్కే పరిమితం కావాల్సి ఉంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల శస్త్రచికిత్స చేయించుకున్న భాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని సీనియర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత ్సలో ఉన్న రిస్క్... ఆ తర్వాత తలెత్తే పరిణామాలను ముందే రోగి సహా బంధువులకు వివరించాలి. పూర్తి స్థాయి కౌన్సెలింగ్ తర్వాతే శస్త్రచికిత్స చేయాలి. కానీ నగరంలోని కొంతమంది వైద్యులు ఇవేవీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స చేస్తున్నారు. వైద్యుడికి నోటీసులు కాస్మొటిక్ శస్త్రచికిత్సల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఆస్పత్రులు, వైద్యులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ రవీందర్రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా... కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా నిఖిల్రెడ్డికి ఎత్తుపెంచే శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్కు బుధవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఆయనను విచారించనున్నట్లు స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తేలితే సంబంధిత వైద్యుడిపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
వైద్య ధర్మం ఏమైంది?
‘కాసు’పత్రులుగా ఎప్పుడో అపకీర్తి గడించిన కార్పొరేట్ ఆసుపత్రుల చరిత్రలో ఇది మరో వికృత అధ్యాయం! ఎత్తు పెరగాలని మనసుపడి వచ్చిన ఓ యువకుడి పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకోకుండా, అతని రక్తసంబంధీకులకు కనీస సమా చారం ఇవ్వకుండా కాళ్లు రెండూ కోసిన వైనమిది. ఎక్కడో మారుమూల ప్రాం తంలో కాదు... హైదరాబాద్ మహానగరంలో ఇది చోటుచేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతిపరుస్తోంది. ఏదైనా సమస్యతో ఒక రోగి తమ వద్దకు వచ్చినప్పుడు అతనికి సంబంధించిన సమస్త వివరాలూ కనుక్కోవడం వైద్యుల కనీస బాధ్యత. ఆ తర్వాతే రోగికి అందించాల్సిన వైద్యం గురించి అయినా, శస్త్ర చికిత్సల గురించి అయినా చర్చించాలి. అత్యవసరంగా చికిత్స అవసరమైన రోగి విషయం వేరు. ప్రాణాలు కాపాడటమే అక్కడ ప్రధానమవుతుంది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ గ్లోబల్ ఆసుపత్రికొచ్చిన నిఖిల్ రెడ్డి సంపూర్ణ ఆరో గ్యంతో ఉన్న యువకుడు. అతని సమస్యల్లా ఆరడుగుల పొడవుతో ఆకర్షణీ యంగా కనబడటం ఎలాగన్నదే! ఈ మాదిరి కోరికతో వచ్చిన ఇరవెరైండేళ్ల కుర్రవాడికి వైద్యులు ఏం చెప్పాలి? అలాంటి శస్త్ర చికిత్సలో ఇమిడి ఉండే సంక్లిష్టతల గురించి ఏకరువు పెట్టాలి. శస్త్ర చికిత్సవల్ల ఎదురుకాగల సమస్యల గురించి చెప్పాలి. అది విఫలమైనపక్షంలో ఏం జరిగే అవకాశం ఉందో కూడా తప్పనిసరిగా తేటతెల్లం చేయాలి. అసలు ఈ మాదిరి ఆపరేషన్ ఎవరికి, ఎలాంటి సమయాల్లో అవసరమవుతుందో వివరించాలి. ఆ శస్త్ర చికిత్స తర్వాత దాదాపు తొమ్మిదినెలలపాటు మరొకరిపై ఆధారపడటం తప్పదుసుమా అని హెచ్చరిం చాలి. ఇన్ని చెప్పాక...‘అయినాసరే, చేయించుకు తీరతాన’ని అంటే అలాంటి యువకుడి మానసిక పరిణతి గురించి ఆలోచించాలి. మీ తల్లిదండ్రులనో, వారు అందుబాటులో లేకపోతే మీ రక్త సంబంధీకులైన పెద్దవాళ్లనో తీసుకురమ్మని సలహా ఇవ్వాలి. అలా వచ్చినవారికి సైతం ఆ శస్త్ర చికిత్స గురించి అన్నీ చెప్పి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రారంభించాలి. అన్నిటికన్నా ముందు ఆ యువకుడికి పొడవు పెరగాలన్న వాంఛలోని నిరర్ధకత గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ వయసు పిల్లల్లో తమను తాము ఎదుటివారితో పోల్చుకునే తత్వం అతిగా ఉంటుంది. అవతలివారితో పోలిస్తే తాము తీసికట్టుగా ఉన్నామన్న భ్రమ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే తాము ముందుకు దూసు కెళ్లగలమన్న విశ్వాసం ఉంటుంది. ఆ పిల్లలతో పోలిస్తే వయసులోనూ, చదువు లోనూ, అనుభవంలోనూ అధికులుగా ఉండే వైద్యులు అలాంటి ధోరణులను కట్టడి చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి వ్యాపార దృక్పథం ఆవరించి ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఇలాంటి ప్రవర్తనను ఆశించలేం. అయిదు నక్ష త్రాల హోటళ్లను తలపించే రీతిలో ధగధగలాడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల మాటెలా ఉన్నా మన చట్టాలు ఇప్పటికీ వైద్యాన్ని సేవారంగంగానే గుర్తిస్తున్నాయి. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు దాన్ని పక్కా బిజినెస్గా చూస్తున్నా కళ్లుమూసు కుంటున్నాయి. ఈ మాదిరి ఆసుపత్రుల ప్రచారార్భాటాలపై చాలా ఆంక్షలే ఉన్నాయి. కానీ అవి ఏమేరకు అమలవుతున్నాయో చూసే నాథుడేడీ? అలా చూసే దక్షతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటే ఇన్ని అక్రమాలు ఎలా చోటు చేసుకుంటాయి? రోగులు అనైతిక, అహేతుక విధానాల బారినపడకుండా రక్షించేందుకు 2010లో కేంద్రం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎనిమిదేళ్లు కావస్తున్నా చాలా రాష్ట్రాలు దాన్నింకా సమ్మతిస్తూ తీర్మానించలేదు. అలా సమ్మతించినట్టు చెప్పిన రాష్ట్రాలు సైతం దాని అమలులో శ్రద్ధ తీసు కోవడంలేదు. వైద్యం వ్యాపారమయం అయినప్పుడే మానవీయత మంచంపట్టింది. కనుకనే తమ చర్యలో తప్పేమీ లేదని గ్లోబల్ ఆసుపత్రి సీఓఓ శివాజీ చటో పాధ్యాయ అంత బింకంగా చెప్పగలిగారు. పొడవు పెరగడానికి శస్త్ర చికిత్స చేయించుకుంటానని వచ్చిన నిఖిల్ నేపథ్యం గురించి తెలుసుకోని వైద్యులు ఆ శస్త్ర చికిత్సకు అతని స్నేహితుడి సంతకం సరిపోతుందనుకోవడంలో వ్యాపార ధర్మం ఉంది తప్ప మానవీయత లేదు. అదే ఉంటే శస్త్ర చికిత్స అనంతరం తలెత్తగల ఇన్ఫెక్షన్ల గురించీ, ఆ ప్రక్రియ పర్యవసానంగా ఏర్పడగల నరాల సంబంధమైన సమస్యల గురించీ నిఖిల్కు వివరించేవారు. ఆ యువకుడికి సొంతంగా నిర్ణయించుకోగల వయసు వచ్చింది గనుకే మరెవరి అనుమతీ అవసరం లేదనుకున్నామని చటోపాధ్యాయ చేసిన వాదనలో పసలేదు. పాశ్చాత్య సమాజాల విషయంలోనైతే బహుశా ఆ వాదన సరిపోవచ్చునేమో! కానీ మన కుటుంబాల్లో పిల్లలకు అంత స్వేచ్ఛ ఉండదు. వారికి సంబంధించిన విషయాల్లో, మరీ ముఖ్యంగా ఇలాంటి శస్త్ర చికిత్సల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది. ఇది చటోపాధ్యాయకు తెలియదనుకోవడానికి లేదు. బయటికెళ్లి వస్తానని చెప్పిన కుమారుడు ఏమైపోయాడో తెలియక తల్లడిల్లి... అతని ఆచూకీ కోసం తెలిసినవారందరి దగ్గరా గాలించి... చివరకు గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు నిఖిల్ని అలాంటి స్థితిలో చూస్తా మని ఊహించి ఉండరు. నిక్షేపంగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా ఐసీయూలో కనబడటాన్ని చూసి కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రుల విషయంలో సైతం ఆసుపత్రి యాజమాన్యం పద్ధతిగా వ్యవహరించలేకపోయింది. ఇలాంటి ఉదం తాలు ఇకపై జరగకూడదనుకుంటే పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలు అమలులో ఉండాలి. తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు వెళ్లాలి. ఆసు పత్రులకు జవాబుదారీతనాన్ని అలవాటు చేయాలి. ప్రతిదీ వ్యాపారమయమై, అన్ని వ్యాపారాలూ రాజకీయంతో పెనవేసుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చర్యలను ఊహించడం సాధ్యమేనా? -
ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నా పట్టించుకోరా?
కార్పొరేట్ ఆసుపత్రుల్లో వసూళ్లపై మండలిలో సభ్యుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని, వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికార, విపక్ష ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయం వాస్తవం కాదని మంత్రి సి.లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాధానంపై శాసనమండలిలో పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లుల వసూలు, బీపీఎల్ కుటుంబాలకు 30 శాతం ఉచిత చికిత్స, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటుపై తీసుకున్న చర్యలేమిటని సభ్యుడు ఫారుఖ్హుస్సేన్ ప్రశ్నిం చారు. లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. బిల్లుల వసూలు లేదని, బీపీఎల్ కుటుంబాలకు 30శాతం ఉచిత చికిత్స అందించాలనే నియమం లేదని, ప్రత్యేక విభాగం ఏర్పాటు లేదని చెప్పడంతో పలువురు విభేదించారు. సరైన ప్రమాణాలు, అనుమతులు లేని ఆసుపత్రులపై తీసుకుంటున్న చర్యలేమిటని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు ప్రశ్నిం చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంతా దోపిడీ జరుగుతోందని, వీటిపై కమిటీ వేయాలని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేయడానికి టాస్క్ఫోర్స్ను వేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో డబ్బులు కట్టనిదే వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయిందని కె.రాజగోపాల్రెడ్డి అన్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని అల్తాఫ్ రిజ్వీ సూచించారు. మంత్రి సమాధానమిస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తామని, జిల్లాల్లో ఐసీయూలు కూడా లేని పరిస్థితి ఉన్నందున ఇప్పటికే మహబూబ్నగర్లో ప్రారంభించామని, కరీంనగర్, సిద్ధిపేటలలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం నిజమేనని, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి, గతంలో జరిగిన లోపాల్ని సరిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వైన్ఫ్లూ కేసులు తగ్గాయి స్వైన్ఫ్లూ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీలు ఎం.రంగారెడ్డి, ఎమ్మెస్ ప్రభాకరరావు, మహ్మద్ అలీ షబ్బీర్ వేసిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. 2015తో పోల్చితే స్వైన్ఫ్లూ కేసులు గణనీయంగా తగ్గాయని గతంలో 2,956 కేసులు బయటపడగా 101 మరణాలు సంభవించాయని, ప్రస్తుతం 44 కేసులు రాగా 4 మరణాలున్నాయని, డెంగ్యూ కేసులు కూడా గతేడాది 1,831 కేసులు రాగా, ఇద్దరు మరణించారని, ఈ ఏడాది 21 కేసులకు ఒక్క మరణం కూడా లేదన్నారు. విషజ్వరాల నియంత్రణకు పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అందని సేవలు తగ్గని రోగాలు
విజయనగరంఫోర్ట్: గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు. నిరుపేద రోగిని సైతం కార్పొరేట్ ఆస్పత్రులు స్వాగతం పలికి చికిత్స అందించేవి. నేడు అందుకు భిన్నంగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవపై జిల్లా ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఉచితంగా అందాల్సిన వైద్యానికి కాసులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనల పేరుతో వైద్య సిబ్బంది సకాలంలో సేవలు అందించడం లేదు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమవ్వడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే ఎన్టీఆర్ వైద్యసేవపై అధికశాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చంనీయాంశమైంది. జిల్లాలో 11 ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉంది. వీటిలో 3 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా 8 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల రోగులకు వైద్య సేవలు అందని పరిస్థితి. 133 రకాల వ్యాధులను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చారు. అయితే ఆ వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు చేతి చమురు వదిలించుకుని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా నరాల సంబంధ వ్యాధులకు వైద్యులు లేకపోవడంతో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సిన అగత్యం దాపురించింది. కేంద్రాస్పత్రిలో ల్యాప్రోస్కోపిక్ పరికరం ఉన్నప్పటికీ దానిని వినియోగించడం లేదు. సాధారణ పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేయడం వల్ల రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి ఆశక్తి చూపడం లేదు. దీనికి తోడు ఆస్పత్రిలో చేరాక 20-25 రోజులైతే గాని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయని పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎన్టీఆర్వైద్య సేవ పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసుకున్న రోగుల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే విషయాలను సర్వే సిబ్బందికి రోగులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ సర్వే ప్రకారం ఎన్టీఆర్ వైద్య సేవ పథకంపై విజయనగరం జిల్లా ప్రజలు చెప్పిన అభిప్రాయం ఈ విధంగా ఉంది: వైద్యం సరిగా అందడం లేదని 11.49 శాతంమంది, అన్ని వ్యాధులకు వర్తించడం లేదని 9.2 శాతం మంది, అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని 7.47 శాతం మంది, నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారని 5.17 శాతం మంది, వైద్య నిపుణులు తగినంతమంది లేరని 4.49 మంది, అన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు 24.43 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరిష్కారం ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు, పరికరాల కొరత కారణంగా సేవల్లో కాస్త జాప్యం జరుగుతోంది. రోగులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. కె. అజయ్సాయిరాం , ఎన్టీఆర్ వైద్య సేవ కో ఆర్డినేటర్ -
రింగు బాటలో..
♦ ‘ఔటర్’ జంక్షన్లను రవాణా ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం ♦ ఔటర్ కారిడార్లలో సర్కారీ భూములపై హెచ్ఎండీఏ కన్ను ♦ భూముల జాబితా పంపమని జిల్లా యంత్రాంగానికి లేఖ ♦ సేకరించే భూముల్లో ఐటీఐఆర్, రవాణా ఆధారిత కేంద్రాల అభివృద్ధి హైదరాబాద్ మహానగరాభివృద్ధి (హెచ్ఎండీఏ) ప్రభుత్వ/అసైన్డ్ భూముల లెక్క తీస్తోంది. ఔటర్రింగ్రోడ్డు సమీపంలోని సర్కారీ భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. ఐటీ పెట్టుబడుల అభివృద్ధి ప్రాంతం (ఐటీఐఆర్), రవాణా ఆధారిత కేంద్రాలు (టీఓజీసీ), కౌంటర్ మాగ్నెట్ సిటీలు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)ప్రాజెక్టుల అభివృద్ధికి గుర్తించిన భూముల జాబితాను పంపమని జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. రాజధానిని విశ్వనగరంగా మలచాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఔటర్రింగ్రోడ్డు జంక్షన్లను రవాణా ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతి కారిడార్కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని ఐటీఐఆర్ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదమూడు ఔటర్ కారిడార్లను ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ)గా మలిచేదిశగా ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదిత ప్రాంతాల్లో వివిధ హబ్లకు చోటు కల్పించేలా మాస్టర్ప్లాన్ను రూపొందించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. దీంట్లో భాగంగా బొంగ్లూరు జంక్షన్ను టెక్స్టైల్, అపరెల్, ఎలక్ట్రానిక్స్,ఐటీ, తుక్కుగూడ ఐటీఐఆర్, ఏరోస్పేస్, హర్డ్వేర్ కంపెనీల స్థాపనకు వీలుగా అభివృద్ధి చేయనున్నారు. పెద్దఅంబర్పేట కారిడార్ సమీపంలో మీడియా, ఆటోమొబైల్, హోల్సేల్ మార్కెట్లను నెలకొల్పేలా మాస్టర్ప్లాన్ను తయారుచేస్తున్నారు. ఘట్కేసర్ ఐటీ,హెల్త్, ట్రాన్స్పోర్టునగర్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొలువుదీరనున్నాయి. కీసర ఉన్నత విద్యాసంస్థలు, శామీర్పేట పార్కులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు, మేడ్చల్ లాజిస్టిక్, హెల్త్ గుండ్లపోచంపల్లి, శంషాబాద్ కొత్త మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆస్పత్రులు, కోకాపేట ఐఎఫ్సీ, బడా ఐటీ సంస్థలు, ఐటీఐఆర్.. తెల్లాపూర్ లాజిస్టిక్ సిటీ , పటాన్చెరు ఆటోమొబైల్, పండ్ల మార్కెట్, ఫౌల్ట్రీ, దుండిల్ బయోటెక్, ఫార్మా కంపెనీలు, ఆదిబట్ల ఐటీఐఆర్, ఏరోస్పేస్, హార్డ్వేర్ ఆధారిత కేంద్రాల అభివృద్ధికి అనుగుణంగా మాస్టర్ప్లాన్కు రూపకల్పన చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో వర్కింగ్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఔటర్రింగ్రోడ్డు కారిడార్లలో సర్కారు, అసైన్డ్ భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు లేఖ రాశారు. మేహ శ్వరం, యాచారం, వికారాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో సర్కారు భూముల జాబితా, మ్యాపులు, నీటి వనరులు, భూ స్థితిగతులపై నివేదిక పంపమని కోరారు. -
అర్బన్ ‘హెల్’ సెంటర్లు
లేస‘మాత్ర’మైనా అందని వైద్యం షుగర్, బీపీ మాత్రలు లభించక రోగుల అవస్థ కానరాని ప్లూయిడ్స్ డ్రెస్సింగ్ మెటీరియల్ నిడదవోలు : విరోచనాలు, వాంతులు, జ్వరం వంటి తదితర రోగాలతో పట్టణ ఆరోగ్య కేంద్రాల(అర్బన్ హెల్త్ సెంటర్లు)కు మీరు పరుగుతీశారా!.. అంతే వేగంతో వెనక్కి వచ్చేస్తారు. ఇక ప్రమాదాల్లో గాయాలపాలైన వారిని అక్కడికి తీసుకెళ్తే కనీస ప్రాథమిక చికిత్స అందక విలవిల్లాడిపోతారు. కనీసం అక్కడ డ్రెసింగ్ చేసే దిక్కు కూడా కనిపించక నరకం అనుభవిస్తారు. ఎందుకంటే అక్కడ సెలైన్లు(ఐవీ ప్లూయిడ్స్, ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ మెటీరియల్, షుగర్ పరీక్ష చేసే కిట్లు.. అంతెందుకు కనీసంలో కనీసం జ్వరానికి వాడే పారాసిట్మాల్ మాత్రలు కూడా దొరకవు. ఇదీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి. -నిడదవోలు హెల్త్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యాలివీ.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థలో 7, భీమవరంలో మూడు, తాడేపల్లిగూడెంలో మూడు, నరసాపురంలో రెండు, పాల కొల్లు, నిడదడవోలు, కొవ్వూరు, తణుకు మునిసిపాలీటి పరిధిలో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ హెల్త్ సెంటర్లున్నాయి. పట్టణ శివారులలో వెనుకబడిన ప్రాంతాలు (స్లమ్ ఏరియా) లలో ఎస్సీ, ఎస్టీ, నివాస ప్రాంతాలలో పేదలకు సత్వర వైద్యమందించేందుకు ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అయితే రోగాలతో ఆవస్థలు పడుతూ హెల్త్ సెంటర్లకు వస్తున్న రోగులకు మందు బిళ్లలు లేకపోవడంతో నానా ఆవస్థలు పడుతున్నారు. ప్రతి కేంద్రంలో షుగర్ పరీక్షలకు అవసరమైన షుగర్ పరీక్షా యంత్రం లేకపోవడంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రయివేట్ లేబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వేసవిలో వడదెబ్బకు గురైన వారికి అందించాల్సిన సెలెన్స్ (ఐవి ఫ్లూయిడ్స్)కూడా లేవు. నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్తో పాటు జిల్లాలోని ప్రతి సెంటర్లో ఇదే దుస్థితి నెలకొంది. -
కాన్పు చేయరు.. కోయడమే!
♦ ఏటా 4.5 లక్షల మందికి సిజేరియన్ల ద్వారానే ప్రసవాలు ♦ ప్రవేటులో 90%, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60% సిజేరియన్లే ♦ ఈ తరహా కాన్పులతో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి చెక్ పెట్టేందుకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో సాధారణ ప్రసవాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. గర్భిణుల కడుపుపై కత్తి పెట్టనిదే బిడ్డను బయటకు తీయడానికి ఎక్కువ మంది వైద్యులు సిద్ధపడటంలేదు. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులైతే ప్రసవాలను భారీ వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. మరోవైపు ప్రసవం సులువుగా కాకుండా ప్రమాదమైతే ఎలా అన్న భయాందోళనలతో కొన్ని కుటుంబాలు సిజేరియన్కు మొగ్గుచూపుతున్నాయి. వారి బలహీనతలను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. మరీ విచిత్రమేంటంటే ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టి ఆ ప్రకారం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తున్న పరిస్థితి కూడా ఇటీవల కనిపిస్తోంది. ఏటా ఆరు లక్షలపైనే ప్రసవాలు వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాన సంఖ్యలో జరుగుతున్నాయి. మూడు దశాబ్దాలుగా సాధారణ ప్రసవాలు తగ్గి సిజేరియన్ సంస్కృతి పెరిగింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 90 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఏటా 4.5 లక్షల ప్రసవాలు సిజేరియన్ ద్వారానే సంభవిస్తున్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్కు రూ. 25 వేల నుంచి 40 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనైతే రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేయాలంటే అనువైన వాతావరణం ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అటువంటి వాతావరణం, వసతులున్నా కూడా చాలా కేసుల్లో సిజేరియన్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అటువంటి వాతావరణం ఉండట్లేదు. ఒకే వార్డులో పది మంది గర్భిణీలను పడుకోబెట్టి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రసవం ఏమాత్రం సాధ్యంకాదని వైద్యులు చెబుతున్నారు. ఒక గదిలో అత్యంత ప్రశాంత వాతావరణంలో తల్లిని, వైద్యుడిని, నర్సును అవసరాన్ని బట్టి భర్తను గర్భిణీ పక్కన ఉంచి కాన్పు చేయాలి. అలా చేస్తే చాలావరకు సాధారణ ప్రసవాలు జరుగుతాయని నిమ్స్ వైద్యుడు తాడూరి గంగాధర్ చెప్పారు. గర్భిణీ పరిస్థితి సాధారణ ప్రసవానికి సహకరించే పరిస్థితి లేనప్పుడు మాత్రమే సిజేరియన్కు వెళ్లాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులూ అందుకోసం సమాయత్తం కావాలని కోరతామని తెలిపారు. సిజేరియన్తో దుష్ఫలితాలు సిజేరియన్తో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. సాధ్యమైనంత వరకు సిజేరియన్కు వెళ్లకుండా సాధారణ ప్రసవం జరిగేలా చూడాలని అమెరికా ప్రసూతి సంఘం స్పష్టంచేసింది. సిజేరియన్ వల్ల అనేక ప్రమాదాలున్నాయని చెప్పింది. సిజేరియన్ అవసరమా? లేదా? అన్న విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంది. దీని ప్రకారం సిజేరియన్ వల్ల కలిగే దుష్ఫలితాలు ఇవీ... ►తల్లి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ►రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. ► కడుపులో కొన్నిచోట్ల గాయాలు సంభవిస్తాయి. అవి భవిష్యత్తులో ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ► తల్లి సాధారణ స్థితికి రావడానికి వారాలు, నెలలు కూడా పడుతుంది. ఆరు నెలల వరకు అంతర్గతంగా నొప్పులూ ఉంటాయి. ► ప్రసూతి మరణాల్లో సిజేరియన్ ద్వారా జరిగే కాన్పుల్లోనే ఎక్కువ. ► సిజేరియన్ చేశాక మందుల వాడకం పెరుగుతుంది. ఇదీ శరీరంపై ప్రభావం చూపుతుంది. ► అలాగే బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. శ్వాస సమస్యలూ ఉత్పన్నమవుతాయి. -
రోగులకు నరకం చూపుతున్నారు
- రోగుల విషయంలో ‘కార్పొరేట్’ తీరు బాధాకరం: గవర్నర్ - అనవసర పరీక్షలు, చికిత్సలపై సీరియస్ - మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు - బతికుండగానే రోగికి నరకం చూపుతున్నారు - చిన్న సమస్యతో వెళ్తే నన్ను కూడా వదల్లేదు - వైద్య ఖర్చుల నియంత్రణకు నేనే చొరవ తీసుకుంటా - కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా భేటీ అవుతా - క్యాన్సర్ కేర్ ఇండియా-15 సదస్సులో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘‘రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులు చూస్తుంటే భయమేస్తోంది. ఆర్థిక స్తోమత లేక చాలామంది వైద్యానికి దూరమవుతున్నారు. అనేకమంది రోగుల మృతికి ఇదే కారణం. కొందరు వైద్యులు సంపాదనే ధ్వేయంగా పని చేస్తున్నారు. బ్రెయిన్డెడ్ అయి, వ్యక్తి ఇక బతకడని తెలిసినా కూడా వైద్యం పేరుతో బిల్లులు వసూలు చేస్తున్నారు’’ అంటూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రులు అనుసరిస్తున్న తీరు చూస్తే బాధగా ఉందన్నారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన‘అఖిల భారత క్యాన్సర్ కేర్-2015’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చికిత్సల పేరుతో రోగులను దోచుకుంటున్న వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి బాధను అర్థం చేసుకునేందుకు కూడా వైద్యులు ప్రయత్నించడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు కనీస సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రోగి బాధను పూర్తిగా వినకుండానే వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల నేను ఓ చిన్న సమస్యతో ఓ ఆస్పత్రికి వెళ్తే నలుగురు వైద్యులు నాకు టెస్టులన్నీ చేశారు. ఎక్స్రే కూడా తీశారు. తీరా ఏమీ లేదని తేల్చారు. అవసరం లేకపోయినా టెస్టులు రాస్తూ రోగులకు బతికుండగానే నరకం చూపుతున్నారు’’ అన్నారు. వైద్య సేవల్లో పారదర్శకత కోసం ఆస్పత్రి ఖర్చులపై కామన్ చార్ట్ ఏర్పాటు చే యాల్సిందిగా ఆస్పత్రులను తాను అనేకసార్లు కోరినా ఇప్పటిదాకా ఒక్కరూ స్పందించలేదంటూఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న చికిత్స వ్యయాన్ని నియంత్రించేందుకు తానే స్వయంగా చొరవ తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. సంపాదనంతా ఆస్పత్రి ఖర్చులకే రాష్ట్రంలో వైద్యవిధానం బాగా లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సగటు మనిషి సంపాదనలో ఎక్కువ శాతం ఆస్పత్రి ఖర్చులకే అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆస్పత్రులు, వైద్యుల దృక్పథం మారాల్సిన అవసరముందన్నారు. ‘‘పలు ఆస్పత్రులు రాజకీయ నేతలకు, వీఐపీలకు వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తున్నాయి. అదేదో నిరుపేద రోగులకు ఇస్తే బాగుంటుంది. చాలామంది వైద్యులు హైదరాబాద్ను తమ సొత్తుగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పేదలకు సేవచేయకుండా ఇక్కడే ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం. వైద్యులు తాము పాటిస్తున్న నైతిక నియమావళిని సమీక్షించుకోవాల్సిన అవసరముంది. రోగుల దృష్టిలో వైద్యులు దైవంతో సమానం. వారి బాధను అర్థం చేసుకొని, బతుకుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే’’ అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్, టీబీ, మధుమేహం వంటి వ్యాధుల నిర్మూలనకు ప్రతి కార్పొరేట్ ఆస్పత్రీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఇందుకు కేటాయించాలని సూచించారు. ‘‘ఆస్పత్రులు తమ వైద్య సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించాలి’’ అని సూచించారు. సదస్సులో క్యాన్సర్ కేర్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జేకే సింగ్, జనరల్ సెక్రటరీ రేణుసైగల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ టీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అమలాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవల తీరుపై అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయన్నారు. 'డబ్బు సంపాదన కోసం వైద్య విలువలు మరిచి.. సిగ్గూ ఎగ్గూ వదిలేసే స్థాయికి దిగజారే ఆస్పత్రులు పుట్టుకురావడం దురదృష్టకరం. చనిపోయినవారికి కూడా వెంటిలేటర్ అమర్చి డబ్బులు గుంజుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయి' అని రవీంద్రబాబు అన్నారు. ప్రభుత్వాస్పత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ ఆస్పత్రులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. దిక్కూమొక్కూలేని అనాథలు మాత్రమే ధర్మాస్పత్రులకు వెళుతున్నారు' అని ఎంపీ వ్యాఖ్యానించారు. మెజారిటీ వర్గంవారు నిర్వహించే పండుగలు, ఆర్మీ జవాన్లను ఉద్దేశించి కూడా రవీంద్రబాబు గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
స్వైన్ఫ్లూకు ‘ప్రైవేట్’లో ఉచిత సేవలు
* ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం * అనుమానితులకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ, డెంగీ జ్వరాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో స్వైన్ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. స్వైన్ఫ్లూ అనుమానితులకు రక్తపరీక్షలు చేసే వరకు ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. ‘స్వైన్ఫ్లూ పరీక్షలను తప్పనిసరిగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నింటినీ ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగా ఇవ్వాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది స్వైన్ఫ్లూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేయడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్వైన్ ఫ్లూ పరీక్ష చేయాలంటే రూ. 3,500 ఖర్చు అవుతుండడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఐపీఎంలో పరీక్ష చేసినట్లుగా ఇచ్చిన పత్రాలను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందజేసి స్వైన్ఫ్లూ బాధితులు ఉచిత వైద్యం పొందవచ్చని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ఇతరత్రా వైద్య చికిత్సలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారాలు, సెలవుల్లోనూ ఐపీఎంలో పరీక్షలు ఐపీఎంను ఆదివారాలు, సెలవుల్లోనూ ఒకపూట తెరిచి ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. స్వైన్ఫ్లూ బాధితులకు హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 25 మందికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని వివరించారు. స్వైన్ఫ్లూ బారిన పడకుండా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరపీడితులు జనసమ్మర్థంలోకి రాకూడదని, కరచాలనం చేయొద్దని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రామంతాపూర్లోని హోమియో ఆసుపత్రిలోనూ హోమియో మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. -
‘ప్రాథమిక’మే ప్రథమం!
ఇదీ ఏడు చేపల కథే. కాకపోతే ఇవన్నీ రాజకుమారులు వేటాడేసి.. ఎండలో పెట్టిన చిన్న చేపలు కావు. దేన్నయినా అమాంతం మింగేసే షార్క్లు! ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి మొదలుపెడితే... ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మా కంపెనీలు, నియంత్రణ వ్యవస్థలు, బీమా కంపెనీలూ అన్నీ షార్క్లే. తినటానికి అలవాటుపడ్డవే. ఎండకపోవటానికి చిన్నచేపలు సాకులు చెబితే.. ఇవి మాత్రం మా నోటి దగ్గరకు వస్తే తినకుండా వదిలిపెడతామా? అని ఎదురు ప్రశ్నిస్తాయి. మరి వీటి రోగం కుదిరేదెలా? వాణిజ్య కేంద్రాలుగా మారిపోయిన వైద్యాలయాల్ని మార్చటమెలా? ఈ వైద్య విధ్వంసాన్ని ఆపటమెలా? ఐదు రోజులుగా ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు వచ్చిన స్పందన అనూహ్యం. పలువురు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల ధనదాహాన్ని కళ్లకు కట్టారు. కొందరు సూచనలూ చేశారు. స్థలాభావం వల్ల అన్నిటినీ ప్రచురించటం అసాధ్యం. అందుకే అత్యధికుల సూచనల ఉమ్మడి సారాంశం ప్రచురిస్తున్నాం. - సాక్షి ప్రత్యేక బృందం * ‘వైద్య విధ్వంసం’కు ఇదే ప్రథమ చికిత్స * ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన * అన్ని వర్గాల నుంచి సూచనల వెల్లువ పీహెచ్సీలే కీలకం ఈ విధ్వంసానికి ప్రథమ చికిత్స చేయాలంటే తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పటిష్టం చేయాలన్నది నిష్ఠుర సత్యం. దగ్గర్లో చక్కని వసతులు, వైద్యుడు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమైపోతాయి. కానీ ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని చూస్తే... ఎక్కడా కనీస మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండటమూ కష్టమే. ఇక పరికరాల ఊసెత్తకపోతేనే మంచిది. అందుకే ఏ చిన్న జ్వరం, దగ్గు, జలుబుకైనా పెద్దాసుపత్రికో, డబ్బులుంటే ప్రైవేటు ఆసుపత్రికో పరుగెత్తాల్సిన దుస్థితి. దీనికితోడు ఇటీవల బాగా పెరిగినజాఢ్యం ఏమిటంటే నేరుగా స్పెషలిస్టుల్ని సంప్రతించటం. చిన్నచిన్న నొప్పులొచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా మొద ట సంప్రతించాల్సింది జనరల్ ఫిజీషియన్నే. కొన్ని జ్వరాలు, చిన్నచిన్న నలతలు వచ్చి నిర్ణీత కాలంలో తగ్గిపోతాయి. ఇది గ్రహించేది ఫిజీషియన్ మాత్రమే. అప్పటికీ తగ్గకుంటే సదరు ఫిజీషియనే ఏ స్పెషలిస్ట్ను సంప్రతించాలో రిఫర్ చేస్తాడు. కానీ చెయ్యి నొప్పి వస్తోందంటే నేరుగా ఆర్థోపెడిక్నో, న్యూరాలజిస్ట్నో, ఛాతీలో కాస్తా నొప్పిగా అనిపిస్తే నేరుగా కార్డియాక్ విభాగానికి వెళ్లడం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫిజీషియన్ను సంప్రతించినప్పుడు... తనకు పెట్టిన టార్గెట్ మేరకు ఆ ఫిజీషియన్ వారిని అవసరం లేకపోయినా స్పెషలిస్ట్ల దగ్గరకు పంపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కాకపోతే ఇలా జరిగేది తక్కువసార్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టంగా ఉంటే... అక్కడి ఫిజీషియన్ల చేతుల్లోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది చాలామంది వ్యక్తంచేసిన అభిప్రాయం. అందరికీ బీమా ధీమా ఉండాలి... ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద... ప్రభుత్వ హెల్త్ కార్డుల కింద బీమా పొందినవారు... ప్రైవేటు బీమా కంపెనీల నుంచి నేరుగా బీమా తీసుకున్నవారు... తాము ఉద్యోగం చేసే ఆఫీసుల ద్వారా బీమా పొందినవారు.. ఇలా అందరినీ కలిపినా ఇంకా చాలామంది బీమా లేనివారు ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే నామమాత్రపు ప్రీమియంతో ప్రజలందరికీ సామాజిక బీమాను తప్పనిసరి చేయాలన్నది మరో సూచన. డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బీమా పరిధిలో ఉండేలా ప్రభుత్వమే చొరవచూపాలి. అప్పుడు ప్రతి ఒక్కరికీ తనకేం జరిగినా బీమా ఉందనే భరోసా ఉంటుంది. ప్రభుత్వం తరఫున చికిత్స అందుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ బీమా సరిపోదనుకునే వారు, కాస్త స్థితిమంతులు వేరే బీమా చేయించుకోవచ్చు. అలా చేస్తే ఈ సామాజిక బీమాలో క్లెయిముల సంఖ్య తక్కువే ఉంటుంది. ఫలితంగా బీమా కంపెనీలు తిరస్కరించటం, ఆసుపత్రులు కూడా అనుచిత విధానాలకు పాల్పడటం వంటివి కూడా తక్కువే ఉంటాయి. డాక్టర్లు అందరిలాంటి వారేనా? డాక్టర్లూ అందరిలాంటి వారేనని, ఇక్కడ కూడా మిగతా రంగాల మాదిరిగా కొందరు తప్పులు చేయొచ్చని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కొందరు వైద్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో సామాన్యులు ఏకీభవించలేదు. ‘‘ఒక ఐటీ ఉద్యోగితో డాక్టర్లను పోల్చలేం. ఎందుకంటే ఐటీ ఉద్యోగి పడే కష్టం ఎక్కడో జీడీపీలో కనిపిస్తుంది. కానీ డాక్టరు కష్టం రోగుల మొహాల్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని కోయటానికి ఎవరికైనా అనుమతిస్తాడంటే... అది డాక్టరుకే. అలాంటి డాక్టరు తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి’’ అనేది మెజారిటీ మాట! వైద్యుడి హిస్టరీ కనిపించదేం? మనం డాక్టర్ల దగ్గరకు వెళ్లేటపుడు వారినో, వీరినో అడిగో లేదా వారికున్న మంచిపేరు చూసో వెళ్తుంటాం. కానీ వాస్తవంగా ఆ డాక్టరు అప్పటిదాకా చేసిన ఆపరేషన్లెన్ని? అందులో విజయవంతమైనవెన్ని? పేషెంట్లు సదరు డాక్టరు విషయంలో ఏం చెప్పారు? ఇలాంటి హిస్టరీ ఎక్కడా కనిపించదు. ఏ ఆసుపత్రీ చెప్పదు కూడా. రూ.100 పెట్టి సినిమా చూసినప్పుడో, ఓ రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడో అది బాగుందో లేదో తెలుసుకునే అవకాశం ఉన్నపుడు... తన ప్రాణాన్ని అప్పగించే రోగికి తనకు వైద్యం చేసే వైద్యుడి వృత్తిగత చరిత్ర తెలియజేస్తే తప్పా? ఇందుకు రోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, దాన్ని నిజాయితీగా ప్రదర్శించటం వంటివి ఆసుపత్రులు చేసి తీరాలన్నది పలువురి లేఖల్లో వ్యక్తమైంది. ఇక ఎన్నికల ముందు అన్ని అంశాలనూ చర్చించే రాజకీయ పార్టీలు... వైద్యంపై తమ విధానాన్ని ప్రకటించాలన్నది మరికొందరి భావన. వాణిజ్య శక్తులపై గట్టి నియంత్రణ! మొత్తంగా వైద్యంపై పటిష్ఠమైన నియంత్రణ ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నియంత్రణ వ్యవస్థలది ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే.. ఎలుకల కోసం నిఘా వేసే స్థాయి. రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణ కోసం 2007లో ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను తెచ్చినా... ఇది కేవలం ఆస్పత్రుల ఏర్పాటు, లెసైన్సులు, రెన్యువల్ వంటి అంశాలకే పరిమితమవుతోంది. బాధిత రోగులకు అన్యాయం జరిగినప్పుడు ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏ చట్టంలోనూ లేదు. అలోపతిక్ ఆస్పత్రులను మాత్రమే కవర్ చేసే ఈ చట్టం పరిధిలో... ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలున్నా వీటికెలాంటి అధికారాలూ లేవు. ఇక ఆసుపత్రులపై ఫిర్యాదుల్ని చూసేది జిల్లా వైద్యాధికారి. అప్పిలేట్ అథారిటీ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటున్నారు. ప్రతి ఆసుపత్రీ... ఏ చికిత్సకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నోటీసు బోర్డులో విధిగా చూపించాలన్నది ఈ చట్టం పెట్టిన నియమం. కానీ దీన్ని పాటిస్తున్న ఆసుపత్రులు ఒక్కటీ ఉండదు. ఒకవేళ దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా... దిగ్గజాల్లాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ఆయన చర్యలు తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! పరిహారం ఉండాలి.. నిషేధించాలి.. ‘కాసు’పత్రుల నియంత్రణకు జిల్లా స్థాయిల్లో బలమైన నియంత్రణ వ్యవస్థలుండాలని, ఒకవేళ వాటివల్ల జరిగిన పొరపాటు రుజువైతే సదరు ఆసుపత్రి భారీ పరిహారాలు చెల్లించటంతో పాటు మళ్లీ సేవ లందించకుండా నిషేధించాలనేది కొందరి సూచన. ఇటీవల దిల్సుఖ్నగర్లో జరిగిన సంఘటన చూస్తే... వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. అది వైద్యుడి నిర్లక్ష్యమేనని తేల్చిన రాష్ట్ర వైద్య మండలి... తనను మందలించి వదిలిపెట్టింది. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీ లు చేస్తే... అది ఆ డాక్టరును కొన్నాళ్లు వైద్యం చేయకుండా నిషేధించింది. ఇలా మందలించి వదిలిపెట్టే స్థాయిలో శిక్షలుంటే ఏ డాక్టరు భయపడతాడన్నది సమాధానం లేని ప్రశ్నే. ఈ పోరు కొనసాగిద్దాం.. ‘వైద్య విధ్వంసం’పై ఈ-మెయిల్స్, లేఖల రూపంలో అసంఖ్యాకంగా స్పందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు. స్థలాభావం వల్ల కొన్నిటినే ఇక్కడ ప్రచురించినా... మిగిలిన వాటిని కూడా సందర్భానుసారం ప్రచురించే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారాల సూచనలతో తగు వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అందజేస్తాం. వైద్యానికి సంబంధించి ఏ సంఘటననైనా, ఏ అభిప్రాయాన్నయినా sakshihealth15@gmail.com ద్వారా మీరు ఎప్పుడైనా మా దృష్టికి తేవొచ్చు. వాటిని తగు వేదికపై ప్రస్తావిస్తాం. - ఎడిటర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు, రోగికి కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వారికి సమీపంలోనే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులలో జరిపే ప్రతి టెస్ట్కూ ప్రభుత్వమే ఫీజు నిర్ణయించాలి. - బి.శివప్రసాదం, పరకాల(వరంగల్) హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ఉచితంగా కాకున్నా ప్రజలు- ప్రభుత్వం కలిసి 50-50 భాగస్వామ్యంతో దీన్ని కొనసాగించాలి. అప్పుడు సామాన్యులకు వైద్యమనేది భారం కాకుండా ఉంటుంది. - రమేష్, ఖమ్మం ప్రజారోగ్య సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి ‘వైద్య విధ్వంసం’పై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు అక్షర సత్యాలు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోని వైద్యం గురించి చెప్పుకోవడం.. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంటుంది. అది బాధాకరమైనా సత్యం! కార్పొరేట్ ఆసుపత్రుల్లో సమర్థులైన వైద్యులతో అధునాతన చికిత్స అందుతుందని భావిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం.. ప్రతి ఒక్కరినీ అలాంటి చికిత్సకు అర్హుడిగా చేయడానికి వేసిన ఒక అడుగు. అయితే ఆ పథకాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ఆసుపత్రులు తమ లాభార్జనకు వాడుకున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ పథకాన్ని లోపాలు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పౌరసమాజ కమిటీలను నియమించాలి. నైతిక వర్తనతో ఉండే రిటైరైన ఉద్యోగులు, విశ్రాంత విద్యావంతులను, చదువుకున్న గృహిణులు, కొంత సమయం వెచ్చించగలిగే యువతీయువకులను అందులో భాగం చేయాలి. వీళ్లతో ‘ప్రజారోగ్య సంరక్షణ కమిటీ’లు ఏర్పాటు చేసి, వాటికి కొంత సాధికారిత కల్పిస్తే ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుంది. - డాక్టర్ ఏపీ విఠల్, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా అత్యవసర చికిత్స చేసే వైద్యులు ఎక్కడ? కోట్లు పెట్టి ఆసుపత్రులు పెట్టేవారు.. అత్యవసర సమయాల్లో చేసే చికిత్సలను పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయినప్పుడు.. రోగి ఊపిరితిత్తుల్లోనికి రెండు నిమిషాల్లోనే గొట్టం (ఎండోట్రాకియల్ ట్యూబ్) వేయగలిగే డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. డ్యూటీ నర్సుకు గానీ, డ్యూటీ డాక్టరుకు గానీ, స్పెషలిస్టు డాక్టర్లకుగానీ ఈ చికిత్స విధానాన్ని నేర్పరెందుకు? అన్ని ఆసుపత్రులు ఈ ట్యూబ్ను అమర్చగల నిపుణులనూ, ట్యూబ్నూ అందుబాటులో ఉంచుకోవాలి. ఏ వైద్య విధానానికి సంబంధించిన కోర్సు అయినా.. అది పూర్తయ్యేనాటికి ‘బేసిక్ లైఫ్ సపోర్టు’ (బీఎల్ఎస్), అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్ఎస్) అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. రోగులు సైతం.. అత్యవసర చికిత్స అందించగల నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలను అడగాలి. - డాక్టర్ బ్రహ్మారెడ్డి, సూపరింటెండెంట్, ప్రజావైద్యశాల, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు, కర్నూలు అవి నిరూపితమయ్యే తప్పులు కావు అనవసరంగా పరీక్షలు రాయడం, రోగిని పిండుకోవడం వంటివి చెప్పుకోవడానికేగానీ వాటిని నిరూపించలేరు. ఆ టెస్టు ఎందుకు చేశారని అడిగితే... ‘ఆ పరీక్ష ద్వారా నే జబ్బు కనుక్కోవచ్చని అనుకున్నా’ అని వైద్యుడు అంటా డు. ఇది తప్పు అని చెప్పలేం. అయినా ప్రొసీజర్ ప్రొటోకాల్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ వంటివి అమలు చేయకపోవడంతో ప్రశ్నించలేక పోతున్నాం. రోగి అవగాహన పెంచుకుని డాక్టరును ఎంపిక చేసుకోవాలి. అయినా హోటళ్లకు, హాస్పిటల్లకూ పెద్దగా తేడా ఉందని నేననుకోవడం లేదు. - డా.కె.వెంకటేష్, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ఎంసీఐ మాజీ సభ్యుడు టార్గెట్లు ఉంటే నమ్మకమైన వైద్యం దొరకదు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టెంట్లు, ఇంప్లాంట్స్ వంటివాటితో రోగిని పీల్చేస్తున్నారు. ఇక్కడే రోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు వీటిపై తక్షణమే వ్యయ నియంత్రణ (కాస్ట్ రెగ్యులేటరీ) చేయాలి. కార్పొరేట్ ఆస్పత్రులు విధించే బిజినెస్ టార్గెట్లతో రోగికి-వైద్యుడికి మధ్య నమ్మకమైన వైద్యం సాగడం సాధ్యం కాని పని. - డా.కె.రమేశ్రెడ్డి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎంసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ సభ్యుడు -
జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు
⇒కార్పొరేటు, ప్రైవేటు హాస్పిటళ్ల నిలువుదోపిడీ ⇒అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలు పరీక్షలు ⇒యంత్రాలు ఖాళీగా ఉంటే నష్టమంటూ వైద్యులకు టార్గెట్లు ⇒రాత్రివేళల్లోనూ మిషన్లు పనిచేయిస్తే.. నజరానాలు ⇒పరీక్షల ఫీజులు డయాగ్నస్టిక్ సెంటర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ⇒రిఫరల్స్ పేరిట ప్రైవేటు అంబులెన్సులకూ వాటా ⇒బ్రోకర్ల వ్యవస్థతో విష వలయంలా మారిన ప్రైవేటు వైద్యం సాక్షి ప్రత్యేక బృందం: కిడ్నాపరు గొంతుపై కత్తి పెడతాడు. డబ్బులిస్తావా! చంపేయాలా? అని బంధువులకు ఫోన్ చేస్తాడు. అంత డబ్బులివ్వలేని వాళ్లకు కనీసం ఏ పోలీసులకో చెప్పే అవకాశం ఉంటుంది. తమ వారిని రక్షించుకునే చాన్సు కొంతయినా ఉంటుంది. కానీ.. ఆసుపత్రి బెడ్పై ఉన్న వ్యక్తికి అప్పటికప్పుడు సర్జరీ చేయాల్సిందేనని డాక్టరు చెబితే!? రెండు సందర్భాల్లోనూ ప్రాణానికి ప్రమాదమే. కాకపోతే ఇక్కడ వేరొకరి సాయం తీసుకోవటమో... మరొకరిని సంప్రదించటమో దాదాపు అసాధ్యం! ఎందుకంటే అంత సమయం ఉండదు. ఆ వైద్యుడో.. ఆసుపత్రో తన విధి తాను నిర్వర్తించి చికిత్స చేస్తే ప్రాణం దక్కొచ్చు. ఆస్తులు అమ్మి, అప్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ వారు అదే అవకాశంగా తీసుకుని డబ్బే పరమావధిగా... అందినంత గుంజి పడేయాలని భావిస్తే...!! పైన చెప్పిన కిడ్నాపర్లకూ వీళ్లకూ తేడా ఏమీ ఉండదు. దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు, కొందరు డాక్టర్ల విషయంలో జరుగుతున్నది ఇదే!! చికిత్స మాట దేవుడెరుగు. పరీక్షల నుంచే దోపిడీ మొదలైపోతోంది. సదరు ఆసుపత్రులు చేసే పరీక్షలకే ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి చికిత్స ఊసు మరిచి పోయి వెనుదిరిగిన పేదలున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది దందా కాదా..? ఉదాహరణకు ఆదిలాబాద్కు చెందిన రమేలి రాజేశ్వర్నే తీసుకుందాం. నెల కిందట ఆయన తండ్రికి గుండెనొప్పి వచ్చింది. అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘ఏం కాదు. మామూలు నొప్పే’ అని చెప్పి పంపేశాడాయన. ఐదారు రోజులు గడవకుండానే మళ్లీ ఛాతీలో నొప్పి!! నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చారు. బాగా పేరున్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. యాం జియోగ్రామ్ సహా కొన్ని పరీక్షలు చేశారు. కాకపోతే అవేవీ ‘ఆరోగ్య శ్రీ’ పరిధిలోకి రావన్నారు. ఆ పరీక్షలకే.. రూ.40 వేలు బిల్లయింది. ఇన్ని పరీక్షల తర్వాత బైపాస్ సర్జరీ చేయాలని తేల్చారు ఆసుపత్రి వైద్యులు. ఆ సర్జరీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదంటూ.. దానికి రూ.4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఎన్ని అమ్మినా అంత డబ్బు తేలేనని రాజేశ్వర్ చెప్పటంతో.. మాత్రలిచ్చి పంపించేశారు. మరో ఆసుపత్రయితే బాగుంటుందేమోనని భావించిన రాజేశ్వర్.. తన తండ్రిని ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతకుముందు ఆసుపత్రిలో చేసిన పరీక్షల రిపోర్ట్లు అన్నీ చూపించాడు. అక్కడి డాక్టర్లు మళ్లీ పరీక్షలు చేయాల్సిందేనన్నారు. అప్పుడే కరెక్ట్గా చెప్పగలమనటంతో అక్కడా పరీక్షలు చేయిం చాడు. వాటికి రూ.20 వేలు ఖర్చయ్యాయి. అక్కడ కూడా సర్జరీ అవసరమన్నారు. అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని... కాబట్టి జీవితాంతం మందులు కొనసాగించాలని చెప్పి పంపేశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాజేశ్వర్ తండ్రి పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆయనకు ఎలాంటి చికి త్సా జరగలేదు. ముందు ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలానే ఉన్నాడు. కాకపోతే బైపాస్ అవసరమని తేల్చడానికి రూ.60 వేలు ఖర్చయింది. ఆ మేరకు రాజేశ్వర్ అప్పులపాలయ్యాడు. అయినా ఒక ఆసుపత్రిలో పరీక్షలు చేశాక.. మరో ఆసుపత్రి కూడా అవే పరీక్షలు చేయటంలో అర్థమేంటి? ఇది దందా కాదా? అవే పరీక్షలకు ఒక ఆసుపత్రిలో రూ.20 వేలై తే మరో ఆసుపత్రిలో రూ.40 వేలు ఎందుకైంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే. ప్రైవేటు ఆసుపత్రు ల్లో దోపిడీ అనేది పరీక్షల నుంచే మొదలవుతోంది. ఎమ్మారైతో ఏమార్చి.. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేని పరీక్షలు చేయటంలోనే కాదు.. ఆ పరీక్షలకు వసూలు చేసే ఫీజుల్లోనూ ‘ప్రత్యేకత’ ప్రదర్శిస్తుంటాయి. కార్పొరేట్ లెక్కల ప్రకరాం.. ఒక ఎమ్మారై మిషిన్ను ఖాళీగా ఉంచితే కూడా దానివల్ల వాటికి నష్టం వస్తుంది. అందుకోసం ఆసుపత్రుల యాజమాన్యాలు తమ డాక్టర్లకూ, విభాగాల నిపుణులకు కోటాలు విధిస్తాయి. అవసరం లేకపోయినా ఎమ్మారై పరీక్షలు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. తమ సంస్థలో పనిచేసే డాక్టర్లనేగాక, బయట తమకు తెలిసిన ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లను కూడా ఇందులో భాగం చేస్తారు. వాళ్లంతా తమ దగ్గరకు వచ్చే రోగులకు ‘‘ఎమ్మారై పరీక్ష యం త్రాలు బిజీగా ఉంటాయి. అదిగో.. అక్కడ రాత్రిళ్లు కాస్త ఖాళీగా ఉంటుంది. మంచి టెక్నీషియన్ ఉంటారు. రాత్రిళ్లు చేయించుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది’’ అని ప్రలోభపెట్టి, అవసరం లేకపోయినా ఆ పరీక్షలు చేయిస్తుంటారు. ఇలా పంపిం చినందుకు వారికి తగిన ప్రతిఫలం ముడుతుంది. కాస్త నిజాయితీగా ఉండి, మనస్సాక్షి అంగీకరించక.. ఇందుకు ఒప్పుకోని డాక్టర్లను సదరు ప్రైవేటు యాజ మాన్యాలు వేధించి బయటకు పంపేస్తాయి కూడా! అవసరం లేకున్నా పరీక్షలూ... రోగ నిర్ధారణ పరీక్షలు బీమా పరిధిలోకి రావు. ఆరోగ్య బీమా ఉన్నవారు కూడా సొంత ఖర్చులపై చేయించుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఏదైనా ఆసుపత్రిలో 24 గంటలపాటు అడ్మిట్ అయితే.. అప్పుడు చేయించుకున్న పరీక్షలకు బీమా వర్తిస్తుంది. ఈ లొసుగును ఆసరా చేసుకున్న కొంతమంది.. హెల్త్ చెకప్ కోసమని ఆసుపత్రిలో చేరి 24 గంటలపాటు అడ్మిట్ అవుతున్నారు. ఇదే అదనుగా వారికి భారీ రేట్లతో మొత్తం పరీక్షలు చేసి బీమా కంపెనీల నుంచి సొమ్ము గుంజుతున్నాయి ఆసుపత్రులు. బీమా కంపెనీలు అధిక సంఖ్యలో పాలసీదార్ల నుంచి ప్రీమియం వసూలు చేసి.. దాన్ని క్లెయిమ్ చేసిన కొద్ది మందికి చెల్లిస్తూ ఉంటాయి. ఈ క్లెయిమ్లు పెరిగే కొద్దీ బీమా కంపెనీలు ప్రీమి యం మొత్తాన్ని కూడా పెంచేస్తుంటాయి. అంటే అంతిమంగా నష్టపోయేది పాలసీదారులే. ఏజెంట్లకు ముద్దుపేరు... రిఫరల్స్ మనం అద్దె ఇల్లు చూయించినందుకు బ్రోకర్కు కమీషన్ ఇస్తాం. కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి కూడా అంచెలంచెలుగా ఈ బ్రోకర్ల వ్యవస్థ ఉంది. కాకపోతే దీన్ని గౌరవంగా ‘రిఫరల్’ వ్యవస్థగా పిలుస్తుంటారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వాటి చుట్టు పక్కలుండే ఆర్ఎంపీలు రోగుల్ని పంపిస్తుంటారు. ఉదాహరణకు గుంటూరులో ఉండే డాక్టరు.. తన పేషెంట్కు చిన్న చీటీ ఇచ్చి హైదరాబాద్కు పంపిస్తాడు. ‘అరె! ఈ డాక్టర్ పెద్దాసుపత్రికి పంపిస్తున్నాడు. చాలా మంచాయన’ అని సంతోషిస్తూ హైదరాబాద్కు వస్తారు. అయితే అలా పంపినందుకు ఆ ఆర్ఎంపీకి కమీషన్ ముడుతుందనే విషయం వారికి తెలియదు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వాళ్లకు అందే డబ్బును ‘ఆర్ఎంపీ రిఫరల్’గా వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు అంబులెన్స్ల వాళ్లు రోగిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళితే వారికి చెల్లించే మొత్తాన్ని ‘అంబులెన్స్ రిఫరల్’గా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటితోపాటు ప్రైవేటువ్యక్తుల్ని ఏజెంట్లుగా పెట్టుకుని పక్కా మార్కెటింగ్ చేస్తున్న కొన్ని ఆసుపత్రులకు ‘మనీ’తత్వం తప్ప మానవత్వం ఉందనుకోగలమా? ప్రభుత్వ ఉద్యోగులకు సహాయకులుగా.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చికిత్స కోసం చేసే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ నిధుల చెల్లింపు విభాగం కూడా ఉంటుంది. రోగుల నిధులను ఇవి పెద్ద మొత్తాలలో విడుదల చేస్తుం టాయి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ సంస్థలు ఆశించినంత వేగంగా పనిచేయవు. డబ్బు అందడంలో జాప్యం జరిగితే దాన్ని కూడా తీవ్ర నష్టంగానే పరిగణిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు.. ఇలా నిధులందించే విభాగాల ఉద్యోగులకు సహా యం కోసం ప్రైవేటు సిబ్బం దిని ఏర్పాటు చేస్తున్నా యి. ‘ఇన్ని ఫైల్స్ క్లియర్ చేసినందుకు ఇంత మొత్తం’ అనే రీతిలో ముడుపులు అందజేయటం వీరి పని. కేంద్రం ఇచ్చే రేట్లకు మూడునాలుగు రెట్లు! వ్యాధి నిర్ధారన పరీక్షల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లు చూస్తే గుండె గుభేలుమంటుంది. పేరున్న డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా సీజీహెచ్ఎస్ కింద కేంద్రం నిర్దేశించిన రేట్లకు మించి భారీగా వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువనే చెప్పాలి. రేట్ల తేడా ఇదిగో... రాయితీలు పొందారు.. సేవలు మరిచారు.. ఎమ్మారై, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాలి. అయితే హైదరాబాద్లో ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన హాస్పిటళ్లు సైతం వీటిని అమలు చేయడం లేదు. ఒకే కంపెనీకి చెందిన యంత్రాల్లో, ఒకే పరీక్షలకు వేర్వేరు చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం.. ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు. దోపిడీలో ఆర్ఎంపీల పాత్ర ఇదీ.. కరీంనగర్ హెల్త్: కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్ఎం పీలతో రోగులను రప్పించుకుంటూ ఎంత పక్కాగా దోపిడీకి పాల్పడుతున్నాయో తెలిపే ఘటన ఇదీ. మంగళవారం కరీంనగర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలోకి వెళ్లగా సాక్షి విలేకరికి కనిపించిన దృశ్యాలివీ.. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్కు చెందిన ఎన్.సమ్మక్క(54) కాళ్లు, కీళ్లు, మెడ నొప్పులతో బాధపడుతోంది. ఆమె నివాసముండే ప్రాంతంలో ఓ ఆర్ఎంపీ.. ఆమెను కరీంనగర్లో పేరున్న కార్పొరేట్ ఆస్పత్రికి అంబులెన్స్లో తీసుకొచ్చాడు. డ్రైవర్ రిసెప్షన్ సిబ్బంది ఇచ్చిన కవర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఆర్ఎంపీ ఆసుపత్రిలోనికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చా డు. సమ్మక్కను లోపలికి తీసుకువెళ్లాడు. న్యూరోఫిజిషియన్.. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నా రు. ‘‘నరాల సమస్య ఉందమ్మా. మంచి మం దులు రాస్తాను. ముందుగా మెదడు, వెన్నుపూసకు వేర్వేరు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు చేయిం చండి’’ అని చీటీ రాసిచ్చాడు. స్కానింగ్ వద్దకు వెళితే అక్కడ.. ‘‘రూ.12 వేలు ఇవ్వండి. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షకు మరో వెయ్యి..’’ అన్నారు. కొంచెం తగ్గించండని రోగి బతిమాలుకోగా పక్కనే ఉన్న ఆర్ఎంపీ అక్కడున్న సిబ్బం దికి సైగచేశాడు. కార్పొరేట్ ఆస్పత్రిలో బిల్లు తగ్గింపు ఉండదని నచ్చచెప్పాడు. సమ్మక్క రూ.13 వేల బిల్లు చెల్లించింది. అరగంటలో రిపోర్టు అందింది. డాక్టర్ దాన్ని పరిశీలించి రూ.2,700 మందులు రాశాడు. ఈ మందులు రెండు వారాలకే రాశాడని చెబుతూ ఆ ఆర్ఎంపీ.. డాక్టర్ను కలిసేందుకు లోపలికి వెళ్లాడు. కాసేపటికే డాక్టర్ ఇచ్చిన కమీషన్ కవర్ను జేబులో సర్దుకుంటూ నవ్వుతూ బయటకి వచ్చాడు. ఓ తండ్రి గుండెకోత.. సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుం టున్న బాబు మరణించాడన్న గుండెకోత ఓవైపు.. మృతదేహం అప్పగించాలంటే లక్షల బిల్లు కట్టాలంటూ ఆసుపత్రి ఒత్తిడి మరోవైపు! ఈ రెండింటి మధ్య ఓ తండ్రి గుండె విలవిల్లాడిపోయింది. ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘‘ప్లేట్లెట్లు పడిపోవడంతో ఆగస్టు 29న బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రిలో నా కొడుకు ప్రజయ్ నిహాల్(తొమ్మిది నెలలు) జాయిన్ చేశాం. శుక్రవారం వరకు రికవరీ అవుతున్నారని చెప్పి, శనివారం ఉదయం నుంచి సీరియస్గా ఉందన్నారు. ‘మేం చేయాల్సింది అంతా చేశాం.. మీ బాబును కాపాడలేకపోయాం’ అని మంగళవారం చెప్పారు. రూ.6.43 లక్షల బిల్లుకుతోడు మరో రూ.50 వేల నాన్ మెడికల్ బిల్లు ఇచ్చా రు. ఇన్సూరెన్స్ కంపెనీ క్లియరెన్స్ వచ్చాకే బిల్లు క్లియర్ చేసి బాడీని తీసు కెళ్లమన్నారు. ఈ పరిస్థితి మరెవరికీ రావొద్దు’’ - వినయ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కూకట్పల్లి, హైదరాబాద్ వైద్య పరీక్ష కార్పొరేటు ఆసుపత్రులు సీజీహెచ్ఎస్(రూ.ల్లో) ఓపీడీ కన్సల్టేషన్ 500 - 600 135 ఈసీజీ పరీక్ష 180 - 300 58 సీరమ్ క్రియాటినిన్ 200 - 250 58 టీఎస్హెచ్ 500 - 600 104 హీమోగ్రామ్ (రక్తపరీక్ష) 500 - 700 140 2డి ఎకో 1,500 - 2,000 1,242 ఎల్ఎఫ్టీ 900 - 1,000 245 చాతీ ఎక్స్రే 300 - 500 69 బ్లడ్ షుగర్ రాండమ్ 160- 250 25 హెచ్బీఏ1సీ 850 - 1000 616 బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ 200 - 250 25 లిపిడ్ ప్రొఫైల్ 850 - 1,000 616 యూఎస్జీ అబ్డామిన్ 1,200-1,500 371 విటమిన్-డి 2,500 - 3,000 633 కదులుదాం.. కదిలిద్దాం సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు, మెయిల్స్ పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com -
వికటిస్తే విరుగుడు
చేయూతనివ్వాల్సింది... చేటుతెచ్చారు... కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అంటే లక్షల్లో ఖర్చు తప్పనిసరి. అంత ఖర్చు భరించినా... అక్కడా మోసం జరిగితే ఎవరిని అడగాలి?! కేతిరి సాయిరెడ్డి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్లో వ్యాధికి తగిన వైద్యం చేయని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యంపై అతను ఎలాంటి పోరాటం చేశారో ఆయన మాటల్లోనే... భుజం నొప్పి అని ఆసుపత్రికి వెళితే... ‘‘ఓ రోజు అర్ధ్దరాత్రి.. కుడి భుజం నుంచి చేతి వరకు విపరీతమైన నొప్పి. తెల్లవార్లూ నొప్పిని ఓర్చుకుని, ఇక భరించలేక హైదరాబాద్లోని ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్లాను. మంచి అనుభవజ్ఞుడనే పేరున్న న్యూరో ఫిజీషియన్ వచ్చారు. అన్ని చెకప్లూ చేశారు. వారు తేల్చి చెప్పినదేంటంటే.. ‘ఇది చాలా అరుదుగా వచ్చే గులియన్బ్యారీ సిండ్రోమ్’ అని. శరీరంలో ఒక్కో అవయం చచ్చుపడేలా చేయడం ఆ వ్యాధి లక్షణం అని చెప్పారు. చాలా భయపడ్డాను. ఇతర మందులతో పాటు ఐదు రోజుల పాటు ఐదు ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నారు. ఒక్కో ఇంజక్షన్కు రూ.7,500లు. చెప్పినట్టే చేయించుకున్నాను. మూడు నెలలు ఫిజియోథెరపీ అవసరం అంటే, అన్ని రోజులూ ఫిజియోకేర్లో చేరాను. చెప్పినవన్నీ వాడాను. చెయ్యమన్నవన్నీ చేశాను. అయినా ఫలితం లేదు. మళ్లీ అదే ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స తీసుకున్నాను. ఏడాది పాటు... ఇలాగే గడిచింది. ఒక సమస్యకు బదులు మరో సమస్య... మా స్నేహితుడు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడు. నన్ను కలవడానికి వచ్చి, రిపోర్టులు చూశాడు. ‘ఇది స్పాండిలోసిస్ సమస్య, ట్రీట్మెంట్ తప్పుగా జరిగింది. మెడలో ఉండో నరాలు కంప్రెషన్కు లోనయితే ఇలాంటి నొప్పి వస్తుంది’ అన్నాడు. నమ్మబుద్ధి కాలేదు. మా స్నేహితుడే మరో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అతను కూడా అదే నిర్ధారించాడు. ‘ఏడాది క్రితం కార్పొరేట్ హాస్సిటల్లో తీసిన ఎక్స్రేలో కూడా ఇదే విషయం స్పష్టంగా చూపుతోంది’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాను. తర్వాత, వాళ్లు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట్లో సరైన వైద్యం అందకపోవడం వల్లే చెయ్యికి బలం లేకుండా పోయింది. ఆ ప్రభావం వల్ల అన్నం కూడా సరిగ్గా కలుపుకొని తినలేను. ఏం చేయాలి? ఏడాది పాటు నేను అనుభవించిన నరకం, మానసిక క్షోభ, డబ్బు ఖర్చు...ఎంతో నమ్మకం మీద పెద్ద ఆసుపత్రిలో చేరితే ఇలా జరిగింది. ఫోరంలో కేసు... కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన అన్ని రిపోర్టులను, బిల్లులను జత చేసి, వినియోగదారుల ఫోరంలో కేసు వేశాను. స్టేట్ కమిషన్ ఉస్మానియా వైద్యులతో చర్చించింది. మొదటి రిపోర్ట్లోనే ఎలాంటి సమస్య ఉందో తేల్చింది. వెంటనే రూ.25,000 లు ఆసుపత్రి నుంచి నష్టపరిహారం అందేలా చూసింది. అయితే నేను అనుభవించిన క్షోభకు ఇది పెద్ద అమౌంట్ కాదు. అందుకని జాతీయ వినియోగదారుల ఫోరంలో మళ్లీ కేసు వేశాను. అక్కడ 2 లక్షల రూపాయల ఫైన్ ఆసుపత్రికి వేసి, ఆ మొత్తం నాకు వచ్చేలా చేసింది. ఇందుకు 5-6 ఏళ్ల పాటు సమయం పట్టింది. కానీ, జరిగిన నష్టానికి కొంతైన పరిహారం అందింది. భయపడకుండా న్యాయం కోసం పోరాడితే మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.’’ - కేతిరి సాయిరెడ్డి, కరీంనగర్ మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే... వెంటనే వినియోగదారుల ఫోరమ్కి ఫిర్యాదు చేయండి. వినియోగదారుల హక్కుల రక్షణకు, పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వినియోగదారుల రక్షణ మండళ్లను ఏర్పాటు చేశారు. ఎలా ఫిర్యాదు చేయాలంటే... వస్తు, సేవలు పొందిన రోజు నుండి రెండు సంవత్సరాలలోగా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు.ఫిర్యాదు పత్రంలో ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి, నిందితుల వివరాలు సమగ్రంగా పేర్కొనాలి. బాధితుడు తనకు జరిగిన నష్టంపై వివరించాలి. నష్టాన్ని ధ్రువపరిచే పత్రాలను, బిల్లులను ఐదు సెట్లు తయారు చేసి, ఫిర్యాదు దరఖాస్తుతో జతచేయాలి. ఏ మేరకు నష్టపరిహారాన్ని కోరుతున్నామో స్పష్టంగా రాయాలి. జిల్లాఫోరంలో అయితే లక్ష రూపాయల లోపు నష్టపరిహారానికి రూ.100లు, ఐదు లక్షల లోపు అయితే రూ.200, పది లక్షల లోపు అయితే రూ.400, అదే 20 లక్షల లోపు అయితే 500 చొప్పున రుసుం చెల్లించాలి. -
కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్!
* అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం * ఆర్థికంగా భారమైతే మీకేంటని ఉద్యోగ నేతల నిలదీత * సర్కారుకు వాస్తవాలు చెబుతున్నామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వంపైపడే ఆర్థికభారం గురించి అధికారులు చెబుతున్న వివరాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందకుండా అధికారులే అడ్డుగా మారారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలు అందిస్తే ప్రభుత్వంపై రూ. 500 కోట్లు అదనపు భారం పడుతుందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా సీఎస్ రాజీవ్శర్మకు వివరించారు. ఈ సందర్భంగా.. అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దిగినట్లు తెలిసింది. ప్రభుత్వంపై ఎంత భారం పడితే మీకెందుకని... ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంలో అధికారులే అడ్డుగా ఉన్నారని నేతలు నిలదీసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కూడా నేతల తీరుపట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాదే. ఎంత భారం పడుతుందో చెప్పకుండా.. ఆర్థికశాఖ ఆమోదం లేకుండా ముందుకు సాగడం కష్టం. మీకేమైనా అభ్యంతరాలుంటే సీఎం వద్ద, వైద్య మంత్రి వద్ద తేల్చుకోండి’ అని ఒక ఉన్నతాధికారి ఘాటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి నుంచీ వెనుకంజే: మొదటి నుంచీ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచితంగా ఇవ్వాలని, మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ ఈ రెండింటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని... మహా అయితే రూ. 150 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారులు అంటున్నారు. ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. -
మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలకు 500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వారికి వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీపై ఆయా ఆసుపత్రుల విముఖత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. వైద్య సేవలపై అనేకసార్లు ప్రభుత్వానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లోనూ పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా తాజాగా కసరత్తు పూర్తిచేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏ మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు నివేదించారు. రూ. 500 కోట్లు అదనం: ప్రభుత్వానికి, కార్పొరేట్ యాజమాన్యాలకు మధ్య ప్రతిష్టంభనకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని.. మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. వీటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీశా) తిరస్కరించింది. ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది టీశా ప్రతినిధుల అంటున్నారు. ప్రస్తుతమున్న మెడికల్ ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేస్తున్నారు. నిమ్స్ మాదిరిగా మెడికల్ ప్యాకేజీ, ఓపీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని సురేశ్చందా అంచనా వేశారు. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో సీఎస్తో సమావేశం కావాలని.. ఆర్థికశాఖకు భారంపై నివేదించి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. -
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్లో ఉన్నట్లుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ క్రెడిట్ ప్రాతిపదికన చికిత్స అందించేందుకు అనుమతివ్వాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ఆసుపత్రి నుంచి బిల్లులు వచ్చాక ఆ చార్జీలను సర్కారు విడుదల చేయనుంది. గత నవంబర్ నుంచి రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగదు రహిత చికిత్స విధానాన్ని రాష్ట్రంలో 230 ఆసుపత్రులు అమలు చేస్తుండగా.. 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు అమలు చేయడం లేదు. అందుకే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ధరలను 25% పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రతి జబ్బుకూ ఇంత ఖర్చవుతుందని చెప్పలేమని కార్పొరేట్ ఆసుపత్రులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చా యి. దీనిపై ప్రభుత్వం కొన్ని రకాల చికిత్సలకు ప్యాకేజీల్లేకుండా అనుమతివ్వాలని యోచి స్తోంది. అయితే ఉద్యోగి ఇలాంటి చికిత్సలకు వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ) ఆధ్వర్యంలో నియమించే కమిటీ అనుమతి పొందాలనే నిబంధన విధించాలని భావిస్తోంది. చికిత్స తర్వాత ఆ బిల్లును డీఎంఈ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆసుపత్రికి మంజూరు చేస్తుంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. -
డబ్బు లేకుంటే రోగి చావాల్సిందేనా?
పేదలు, మధ్యతరగతికి వైద్య సేవల భారంపై గవర్నర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజ లు వైద్య సేవలను అందుకోలేని స్థితిలో ఉన్నారని... రోజురోజుకు వైద్య బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరును ఆయన తప్పుబట్టారు. సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆధ్వర్యంలోwww.hepa titisccure.inవెబ్సైట్ను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. చికిత్సకు డబ్బులేని కారణంగా రోగి చనిపోవాల్సిందేనా? డబ్బులిస్తేనేగానీ వైద్య సేవల్ని పొందలేకపోవడమంటే వైద్య సేవలు సమాజంలో అందుబాటులోకి వచ్చినా దండగేనని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. మన ప్రభుత్వాలు ఆరోగ్యంపై వేలకోట్లు ఖర్చు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నా ఎక్కడో లోపం ఉందని...అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవలను అందుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కనీస లాభాలతో వైద్యసేవలను ఎందుకు అందించట్లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చర్చించుకొని పేద, మధ్య తరగతికి అందుబాటులో ఉండేలా వైద్య చికిత్సలకు ఒకేరకమైన ధరను నిర్ణయించేలా ఎందుకు చొరవ తీసుకోవట్లేదన్నారు. కార్పొరేట్ సామాజికబాధ్యత అంటే స్కూళ్లకు కుర్చీలు, బల్లలివ్వడమే కాదని పేర్కొన్న గవర్నర్...ఆరోగ్యంపై పరిశోధనలకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అప్పుడే భా వితరాలకు ప్రయోజనం చేకూర్చినవారమవుతామన్నారు. హెపటైటిస్-సీ చికిత్సకు అమెరికాలో రూ. కోటి ఖర్చు అయితే, మన దగ్గర రూ. 60వేల నుంచి రూ. లక్ష వరకే కావడం అభినందనీయమన్నారు. ఎయిడ్స్ కంటే ప్రమాదకరం... హెపటైటిస్-సీ వ్యాధి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. హెపటైటిస్ బీ, సీలతో ఏటా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 10 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. ఖమ్మంలో హెపటైటిస్-సీ ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఇది కనిపిస్తోందన్నారు. ఒకసారి వాడిన ఇంజక్షన్లనే మళ్లీ వాడటం, రక్త మార్పిడి తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వ్యాధి సోకుతుందన్నారు. ఒకే టూత్బ్రష్ను ఎక్కువ మంది వాడడం వల్ల కూడా వస్తుందన్నారు. -
సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో కార్పోరేట్ ఆస్పత్రులు!
హైదరాబాద్:ముఖ్యమంత్రి సంక్షేమ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)లో వెలుగుచూసిన అవినీతి అంశంతో కార్పోరేట్ ఆస్పత్రులకు సంబంధాలు ఉన్నాయా? సంక్షేమ నిధికి వచ్చే నిధులను పలు ఆస్పత్రులు దుర్వినియోగం చేశాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో సీఐడీ విభాగం చేపట్టిన దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన వెలుగుచూస్తున్నాయి. ఆ స్కాంతో 54 కార్పోరేట్ ఆస్పత్రులకు సంబంధాలున్నట్లు తాజాగా గుర్తించారు. నకిలీ బిల్లులు, లెటర్ హెడ్ లు స్పష్టించి స్కాంకు పాల్పడ్డట్లు సీఐడీ గుర్తించింది. హైదరాబాద్ నగరంతో పాటు,వరంగల్, కరీంనగర్ లోని 20 కార్పోరేట్ ఆస్పత్రులకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఒక వెయ్యి రెండొందల 51 దరఖాస్తులపై సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసింది. -
అయితే ‘మాకేంటి ?’
సీఎం ఆదేశాలు బేఖాతర్ హెచ్ఎండీఏలో మారని అధికారుల తీరు సిటీబ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశమంటే.... ఎలా ఉంటుందో.. దాని ప్రభావం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హెచ్ఎండీఏలో మాత్రం ఇలాంటి ఆదేశాలు చెల్లవు. అక్కడ ప్రతి పనికీ ఓ ‘లెక్క’ ఉంటుంది. ఆ ‘లెక్క’ ప్రకారమే పనులు జరుగుతాయి. లేదంటే... ఆ ఫైళ్లకు బూజు పట్టాల్సిందే. అందుకు నిదర్శనం కావాలంటే చూడండి...గచ్చిబౌలిలో కార్పొరే ట్ హాస్పిటల్స్ నిర్మాణానికి అనువుగా మాస్టర్ ప్లాన్లో రోడ్డు అలైన్మెంట్ను మార్చాల్సిందిగా స్వయంగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. హెచ్ఎండీఏ అధికారులు వీటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సంబంధిత కార్పొరేట్ సంస్థలు వచ్చి తమను కలిశాకే అనుమతులివ్వాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా ఫైల్ను తొక్కి పెట్టేసినట్లు వినికిడి. ఆశయానికి గండి... గచ్చిబౌలిలో స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ నిర్మించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం సర్వే నం.136లో 5 కార్పొరేట్ సంస్థలకు ఏడెకరాలు విక్రయించింది. క్వాలిటీ కేర్ మెడికల్ (1 ఎకరా), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (1.9), మ్యాక్స్ విజన్ (1.7), రెయిన్బో ఇన్స్టిట్యూట్ (1.1), సర్వే జన ఇన్స్టిట్యూట్ (సన్ షైన్) 1.2)లు మొత్తం 5.19 ఎకరాలు కొనుగోలు చేశాయి. రోడ్డు కోసం 1.11 ఎకరాలు, పార్కింగ్కు 10 గుంటల విస్తీర్ణం కేటాయిస్తూ మొత్తం 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్లలో రోడ్డు అస్తవ్యస్థంగా ఉండటంతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సంస్థల వారు ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రోడ్డుఅలైన్మెంట్ మార్చాలని హెచ్ఎండీఏను కోరారు. దీనిపై 2012లో హెచ్ఎండీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆస్పత్రులు నిర్మించలేకపోయారు. పట్టించుకోని డెరైక్టర్లు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఆదేశించారు. ఆ మేరకు ఎంఏ అండ్ యూడీ నుంచి అప్రూవల్ ఇచ్చేశారు. ఇది జరిగి నెల రోజులైనా హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ సంస్థలు తమను కలవాలన్న ఉద్దేశంతో ఫైల్ను తొక్కిపెట్టేశారు. ఈ అంశం తన పరిధిలోకి రాదంటూ ప్లానింగ్ డెరైక్టర్-1, తనకు సంబంధం లేదంటూ డెరైక్టర్-2లు ే ఫైల్ను అటూ ఇటూ చక్కర్లు కొట్టిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారంతా బడా వ్యాపారవేత్తలు కావడంతో ఇక్కడి డెరైక్టర్ స్థాయి అధికారులను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. హెచ్ఎండీఏలోని అక్రమార్కులను ఓవైపు ఏసీబీ వెంటాడుతున్నా... అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
కార్పోరేట్ వైద్యం అందరికీ అందాలి: గవర్నర్
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ఆసుప్రతులు మెట్రో నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్యసేవలను అందించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కార్పోరేట్ వైద్యం అన్నివర్గాల వారికి అందేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నరసింహన్ సూచించారు. ఇరవై వేల కార్నియా మార్పిడిలతో రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన బృందాన్ని గవర్నర్ సన్మానించారు. కంటికి చికిత్స చేసి చూపునివ్వడం అంటే ప్రపంచానికి వెలుగునివ్వటమే అని ఆయన అన్నారు. -
చర్చలుండవు.. ఇక నోటీసులే!
* రోజురోజుకూ జటిలమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత వైద్యం * ఇరు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఇబ్బందులు * అవస్థలు పడుతున్న 60 లక్షల మంది లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అందించేందుకు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తే వారితో ఇకపై చర్చలు జరిపేది లేదని, నోటీసులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఉద్యోగుల నగదు రహిత వైద్యం మరింత జటిలంగా మారింది. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో ప్యాకేజీలు సరిపోవడం లేదని, తెలంగాణలో ఓపీ సేవలు ఉచితంగా చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు తెగేసి చెప్పాయి. రెండు ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో తాజాగా రీయింబర్స్మెంట్నే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీనివల్ల ముఖ్యంగా పెన్షనర్లు లక్షలాది రూపాయలు ముందు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు కలిసి దాదాపు 60 లక్షల మంది వైద్యం విషయంలో నలిగిపోతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తొలగిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు హెచ్చరికలు జారీచేసింది.నిర్ణయించిన ప్యాకేజీలకు ఉద్యోగులకు నగదు రహిత వైద్యానికి ఒప్పుకోకపోతే వాటిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి కూడా తొలగిస్తామని హెచ్చరించింది. ఎన్ఏబీహెచ్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్) హోదా ఉన్న ఆస్పత్రులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీలకంటే 25 శాతం ఎక్కువగా ఇస్తున్నామని, ఆ హోదా లేని ఆస్పత్రులకు పేర్కొన్న ప్యాకేజీల రేట్లే ఇస్తామని, అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చేది లేదని ఒప్పుకోకుంటే నెట్వర్క్నుంచి తొలగిస్తామని తెలిపింది. ఆరోగ్యశ్రీ వదులుకోవడానికీ సిద్ధమే ఆరోగ్యశ్రీ కంటే ఉద్యోగుల నగదురహిత వైద్య ప్యాకేజీలు ఘోరంగా ఉన్నాయి.ప్యాకేజీ కంటే మాకే ఎక్కువ ఖర్చవుతుంటే ఆస్పత్రులు ఎలా మనగలుగుతాయి? ఎంవోయూ కుదిరే వరకు ఉద్యోగులకు వైద్యం అందించలేం. ఒకవేళ ఆరోగ్యశ్రీని వదులుకోవాలని ఆదేశిస్తే సిద్ధమే. - డాక్టర్ రమణమూర్తి, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు చిన్న సమస్య పెద్దది చేస్తున్నారు ఇది చాలా చిన్న సమస్య. చిన్న చర్చ ద్వారా పరిష్కారం అయ్యేదాన్ని ఎందుకో పెద్దది చేస్తున్నారు. రెండ్రోజుల్లో తెలంగాణ సీఎంను కలవబోతున్నాం. ఏపీ ప్రభుత్వంలా ఉద్యోగుల వైద్యానికి ఒప్పుకోకపోతే ఆరోగ్యశ్రీ నుంచి తప్పిస్తాం అంటే... దానికీ సిద్ధంగా ఉన్నాం. - డా. ఏవీ గురవారెడ్డి, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు -
రూ.30 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి
‘ఆరోగ్యశ్రీ’ సేవలను 60 శాతం వరకు పెంచుతాం డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎంజీఎం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రులకు రూ.30 కోట్లు వెచ్చించి రూపురేఖలు మారుస్తానని, కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో మెరుగైన వైద్య సేవలందిస్తామని ఉప ముఖ్య మంత్రి రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని టీబీ హాస్పిటల్, జీఎంహెచ్, ఎంజీఎం, కేఎంసీ, సీకేఎం, ఉర్సు, ఆయుష్, ఈఎస్ఐ, రీజనల్ ఐ ఆస్పత్రులను ఆదివారం ఆయన సందర్శించిన విషయం తోలిసిందే. రాత్రి ఎంజీఎంలో బస చేసిన ఆనంతరం సోమవారం తెల్లవారు జామున మెడికల్, సర్జికల్ వార్డులను పరిశీలించారు. ఆనంతరం ఆస్పత్రిలోని రోగులకు అందిస్తున్న డైట్ విభాగాన్ని పరిశీలించారు. డైట్లో అల్పాహారంగా అందిస్తున్న చపాతీలను రాజయ్య తయారుచేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మనోహర్ ఫైర్ వుడ్ స్ట్రీమ్ను గ్యాస్కు మార్చనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ పెట్టుబడితో ఫైర్వుడ్ను గ్యాస్కు కన్వర్షన్ చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఎంజీఎంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని 60 శాతం పెంచడంతో వైద్యులు ఇన్సెంటీవ్స్ పొందే ఆవకాశం ఉంటుందన్నారు.ఆస్పత్రులను క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళికలు తయారుచేశామని, వాటిన్నింటికీ నెలరోజుల్లోనే టెండర్లు పిలుస్తామన్నారు. సీమాంధ్ర నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రులు నరకకూపంగా మారాయన్నారు. డాక్టర్లు మానవతా ధృ క్పథంలో వైద్యసేవలందించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలపై ఆరు నెలల కార్యాచరణ ఉంటుందన్నారు. పక్కా ప్రణాళికతో సమసల్యను పరిష్కరిస్తామన్నారు. టీబీ ఆస్పత్రిలో స్థానిక ప్రజల కోరిక మేరకు 10 ఫీట్ల ఎత్తుతో రాతి గోడను నిర్మించనున్నట్లు వెల్లడించారు. రూ.10 కోట్లతో ఎంజీఎం ఆస్పత్రి ఆధునికీకరణ ఎంజీఎం ఆస్పత్రిలో రాత్రి 12 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయా డిపార్లమెంట్ల హెచ్ఓడీలు పవర్ పారుుంట్ ప్రజెంటేషన్ ద్వారా రాజయ్యకు వివరించారు. ఈ మేరకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.10 కోట్లు అవసరమని అంచనా వేశారు. రూ.4 కోట్లను నెలరోజుల్లో మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రిలో రూ. 46 లక్షలతో విద్యుత్ సమస్య తీరుస్తామన్నారు. హన్మకొండలోని జీఎంహెచ్ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించి, 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ కడియం శ్రీహరి తన నిధుల నుంచి వారం రోజుల్లో అంబులెన్స్, ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 66 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ అరుున సీకేఎం ఆస్పత్రిలో 200 మంది ఇన్పేషంట్ల సంఖ్య ఉంటోందని, ఇందుకనుగుణంగా రూ. 10 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీకేఎం ఆస్పత్రికి ఎంపీ సీతారాంనాయక్ తన నిధుల నుంచి వారం రోజుల్లో అంబులెన్స్తోపాటు ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు, రీజినల్ ఐ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు కంటి అద్దాలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని సరోజన ఆస్పత్రితో పాటు వరంగల్ రీజినల్ కంటి ఆస్పత్రిలో రోగులకు కంటి అద్దాలు అందించేందుకు సంవత్సరానికి రూ.2 కోట్ల మేరకు ఖర్చు కానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సీకేఎంకు అనుబంధంగా ఉన్న ఉర్సు ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. రూ. 2 లక్షలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లోగా మెప్మా, అంగన్వాడీ, ఆశ వర్కర్ల సహాయంతో ఆస్పత్రిలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్కతామన్నారు. విలేకరుల సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట మనోహర్, ఆర్ఎంఓలు, వైద్యులు పాల్గొన్నారు. -
అమలు చేస్తారా.. అటకెక్కిస్తారా?
ఉద్యోగులకు నగదు రహిత వైద్యంపై ఏపీ సర్కారు నిర్లిప్తం హెల్త్ కార్డుల ప్యాకేజీల ధరలకు వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు పథకం అమలు చేస్తున్నామంటూ.. హెల్త్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసే విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. నవంబర్ 1 నుంచే ఈ పథకం అమలులోకి తెస్తున్నామని ప్రకటించిన టీడీపీ సర్కారు.. ఆ మాటను నిలబెట్టుకోలేదు. అనేక రకాల ఆంక్షలు, అలవిమాలిన నిబంధనలు పెట్టటంతో.. ఇలాగైతే నగదు రహిత వైద్యం తాము అమలు చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఒకవైపు నగదు రహిత వైద్యం అమలు కాని పరిస్థితులు ఉంటే.. మరోవైపు.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం రద్దవుతుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే పేర్కొంది. ఇటు నగదు రహిత వైద్యం లేక.. అటు రీయింబర్స్మెంటూ లేక ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. చేతులెత్తేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 1వ తేదీ నుంచి నగదు ప్రమేయం లేని వైద్యం అందిస్తామంటూ హెల్త్ కార్డులు ఇచ్చారు. హెల్త్ కార్డుల పథకం కింద ప్రభుత్వం నిర్ధారించిన ప్యాకేజీల ధరలకు తాము వైద్యం అందించలేమని కార్పొరేట్ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలకే ఉద్యోగులకూ వైద్యం అందించాలని, ఆరు నెలల తర్వాత సమీక్షించి కొత్త ధరలు నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి. ఓపీ సేవలు ఎండమావే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలని తాజాగా జీవో జారీచేశారు. దీనికోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ స్పెషలిస్టులతో ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసలే స్పెషలిస్టులు లేరు. ఉన్న కొద్దిమంది రూ. 50 కీ, రూ. 100 కూ ఓపీ సేవలకు రారనేది వైద్యవిద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.సూపర్ స్పెషలిస్టులు అసలే లేరు. ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న రోగుల్లో 20 శాతం మందికి కూడా రక్తపరీక్షలు చేయడానికి సదుపాయాలు లేవు. ఉద్యోగులకు పరీక్షలు చేయడం సాధ్యం కాదని అధికారులు నివేదించారు. వైద్యం అందక ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. సంతకాలే జరగలేదు ‘‘రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకూ అవగాహనా ఒప్పందాలపై ఎలాంటి సంతకమూ జరగలేదు. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులేవీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఓపీలు ఫ్రీ అంటే ఎలా కుదురుతుంది? ఎంప్లాయిస్ హెల్త్ స్కీం చెయ్యలేకపోతే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవాలని అంటున్నారు. దానిక్కూడా మేము సిద్ధమే.’’ - డాక్టర్ గురవారెడ్డి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ ఆశించిన స్థాయిలో పథకం లేదు ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో హెల్త్ కార్డుల పథకం లేదు. తిరుపతి స్విమ్స్, హైదరాబాద్లోని నిమ్స్లో కూడా ట్రీట్మెంటు ఇవ్వబోమని చెప్తున్నారు. అలాగే.. చిత్తూరు, అనంతపురం ఉద్యోగులు అటు చెన్నై, ఇటు బెంగుళూరులలో వైద్యం చేయించుకుంటారు. ఢిల్లీలో ఉన్న ఏపీ ఉద్యోగుల విషయంలో స్పష్టత లేదు. మేం ఆర్థికశాఖ, వైద్యశాఖ కార్యదర్శులను కలిసి సమస్యలు వివరించాం. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ను మరో రెండు నెలలు పొడిగించాలని కోరాం. ఇందుకు వైద్య శాఖ కార్యదర్శి అంగీకరించారు.’’ - అశోక్బాబు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఈహెచ్ఎస్పై కుదరని ఏకాభిప్రాయం విజయవాడ: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్.. ఆశ ప్రతినిధులు, ఎన్జీఓ అసోసియేషన్ నేతలతో మూడు గంటల పాటు చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తాము వైద్యం అందించలేమని ఆషా తేల్చిచెప్పింది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న రీయింబర్స్మెంట్ వైద్య సేవలను ఈహెచ్ఎస్ సమస్య పరిష్కారం అయ్యేవరకూ కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి కామినేని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డులున్న వారందరికీ ఉచిత కన్సల్టేషన్తో పాటు ఇన్వెస్టిగేషన్స్ (రక్తపరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ వంటివి) కూడా ఉచితంగా చేయాలని పేర్కొంది. ఈ విషయంలో ఆశ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ను స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం చేస్తాం కానీ.. ఉచితంగా చేయలేమని మంత్రికి తేల్చి చెప్పారు. -
పేరు మార్పుతో పేదలకు తిప్పలు
ఆరోగ్యశ్రీ’లో టీడీపీ మార్పు, చేర్పులు అవసరమైన పత్రాల ముద్రణలో జాప్యం సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్న అధికారులు సకాలంలో చికిత్స అందక రోగుల అగచాట్లు కాకినాడ క్రైం : నిరుపేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సను అందుబాటులోకి తెచ్చి, పునర్జన్మను ప్రసాదిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం ‘పేరు మార్పు’ ప్రక్రియతో సకాలంలో ఆదుకోవడం లేదు. పథకం పేరు మార్చాలని నిర్ణయించిన సర్కారు అవసరమైన పత్రాలు ముద్రించక పోవడంతో కొందరికి చికిత్సలో జా ప్యం తప్పడం లేదు.పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఏర్పాటు చేసిన రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ 1.80 లక్షల మంది రూ.428 కోట్లు వ్యయమయ్యే వైద్యసేవలు అందుకున్నారు. కాగా ఆరోగ్య శ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు, లోగో మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందించే పత్రాలను ముద్రించడం మానివేశారు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు తెల్ల రేషన్ కార్డు లేని వారికి, రచ్చబండలో రేషన్ కార్డు పొందిన వారికి, నవజాత శిశువులకు, తాత్కాలిక రేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేసేందుకు కలెక్టరేట్లో ఆరోగ్య శ్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయానికి రోజూ సుమారు 10 మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే నెల రోజుల నుంచి పత్రాలు లేకపోవడంతో వారిని వెనక్కి పంపివేస్తున్నారు. దీంతో అత్యవసరమైన వారు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. పది రోజులు మాత్రమే అర్హత ఉండే అనుమతి పత్రం జారీపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఇంకా పత్రాలు రాలేదంటున్నారని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు సత్వరం వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. రెండు రోజుల్లో రావచ్చు.. ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులంటూ సర్టిఫికెట్ ఇచ్చే పత్రాలు లేకపోవడం తో జారీ చేయడం లేదని ఆ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నాం జనేయులు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లామని, రెండు రోజుల్లో పత్రాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. అయితే రోగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాస్పత్రిలో చేర్చి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని, అత్యవసరమైన వారికి జీజీహెచ్లోని సీఎంసీఓ కార్యాలయం ద్వారా సర్టిఫికెట్ అందజేసే ఏర్పాటు చేశామని చెప్పారు. -
పారా మెడికల్ @ కెరీర్
వైద్య రంగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య సేవలు విస్తరించడం..ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం.. వెరసి రోగులకు చికిత్సనందించడంలో వైద్యులకు సహాయంగా నిలిచే పారా మెడికల్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. రక్త పరీక్ష నుంచి రేడియాలజీ వరకు.. సిటీస్కాన్ నుంచి ఎండోస్కోపి వరకూ.. పారామెడికల్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమైనవి. ఒక రకంగా చెప్పాలంటే వీరి తోడ్పాటు లేకుండా ఆయా విభాగాల పర్యవేక్షణ సాధ్యం కాదు. స్వల్ప వ్యవధి గల కోర్సుల ద్వారానే ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఉపాధిని, ఉద్యోగ అవకాశాలను అందించే పారామెడికల్ కెరీర్ గురించి తెలుసుకుందాం.... వైద్య సేవల విస్తరణ వేగంగా జరుగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు నగరాల్లోనే కాకుండా చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఏర్పాటవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి తక్షణమే ఉపాధి లభిస్తోంది. పారామెడికల్ కోర్సులు విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాయి అంటున్నారు నిపుణులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం కల్పించే ఈ కోర్సుల్లో చేరితే ఆకర్షణీయమైన కెరీర్కు మార్గం పడినట్లే. అవకాశాలు: విస్తరిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్లో డాక్టర్కు అనుబంధంగా సేవలు అందించ డానికి పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరి. డయాగ్నోస్టిక్ సెంటర్స, ఎక్స్-రే యూనిట్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఈసీజీ సెంటర్లు, ఆపద సమయాల్లో రక్తం అందించే బ్లడ్ బ్యాంక్లు మనకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లోను కనిపిస్తాయి. వీటికి సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బంది చాలా అవసరం. ఇటీవల కాలంలో గుండె సంబంధ శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగింది. హృద్రోగ చికిత్సను అందించే ఫిజిషియన్కు సహకరించే పర్ఫ్యూషన్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్లు పాత్ర కీలకంగా మారింది. ఈ విభాగాల్లో సిబ్బందికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి పారామెడికల్ కోర్సు పూర్తయిన వెంటేనే ఉద్యోగం లభించడం ఖాయం. అర్హత: పారామెడికల్ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ (సెన్సైస్) విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సంబంధిత పర్యవేక్షణ విభాగం జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్), గాంధీ మెడికల్ కాలేజీ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అందులో నైపుణ్యం ఉన్న వారిని నేరుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎయిమ్స్ కూడా ఇటువంటి కోర్సులను అందిస్తోంది. సాధారణంగా ఈ కోర్సుల కాలవ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు వేతనం లభిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లోనైతే రూ.10 వేల నుంచి 12 వేల వరకు అందుతుంది. తర్వాత అర్హత అనుభవం ఆధారంగా నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు పారామెడికల్కు సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్లు వివిధ రకాల కోర్సులను అందజేస్తున్నాయి. వీటికి సరైన గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్స్టిట్యూట్లలో చేరడం మంచిది. ఎన్ఎస్డీసీ-హెచ్ఎస్ఎస్సీ ఏర్పాటు: దేశంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా సుక్షితులైన పారామెడికల్ సిబ్బంది తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ-జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ)..హెల్త్కేర్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ (హెచ్ఎస్ఎస్సీ)ను ఏర్పాటు చేసింది. ఇది పారామెడికల్కు సంబంధించి 29 విభాగాలను గుర్తించింది. ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సు సిలబస్ను రూపొందించడంలో నిమగ్నమైంది. హెచ్ఎస్ఎస్సీ వివిధ అనుబంధ సంస్థల ద్వారా అందజేసే ఈ కోర్సులకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. అభ్యర్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని భావిస్తే వారిని హెచ్ఎస్ఎస్సీ పరీక్ష (అసెస్మెంట్)కు పంపొచ్చు. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణులతో కూడిన ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ సదరు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, రిపోర్ట్ కార్డు అందజేస్తుంది. దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా పారామెడికల్ ఉద్యోగాల కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్ టె క్నీషియన్ విధి. ఈ కోర్సు తర్వాత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీగా బీఎస్సీ(ఎంఎల్టీ) చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ (సెన్సైస్) తర్వాత బీఎస్సీ ఎంఎల్టీలో ప్రవేశం పొందొచ్చు.. డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది..? దానికి రేడియేషన్ ఎంత ఇవ్వాలి.. రేడియేషన్ అవసరం ఉందా,లేదా అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్ హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మిషిన్ ఎంపిక, అమరికలో పర్ఫ్యూషన్ టెక్నీషియన్లు బాధ్యత తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధ శస్త్ర చికిత్సలు పెరుగుతుండటంతో వీరి అవసరం పెరుగుతోంది. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ ఎంఆర్ఐ, ఎక్స్రే, సిటీస్కాన్, ఆల్ట్రా సౌండ్ వంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్లకు వీరు సహాయపడతారు. డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణ, ‘బ్రోంకే స్కోపి’టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు. సర్టిఫికెట్ ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ బ్లడ్ బ్యాంక్ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్బ్యాంక్కు సంబంధించిన అన్ని రికార్డులను, ఇతర విధులను నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత. సర్టిఫికెట్ ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా(మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్లు, డాక్టర్లకు తగువిధంగా సహాయపడుతుంటారు. సర్టిఫికెట్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ల్యాబ్ నిర్వహణ, ఫిల్మ్స్ డెవలప్మెంట్, ఇమేజింగ్ టెక్నాలజిస్ట్/రేడియాలజిస్ట్లకు సంబంధిత వ్యవహారాల్లో తగిన విధంగా సహాయం చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు. సర్టిఫికెట్ ఇన్ ఎమర్జెన్సీ పారా మెడిక్ టెక్నాలజిస్ట్ ఎమర్జెన్సీ సమయంలో గోల్డెన్ అవర్గా పరిగణించే సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి కావల్సిన రెస్పిరేటరీ, కార్డియాక్ సపోర్ట్ అందివ్వడం, రిహ్రై డేషన్, రక్తం పోకుండా చూడడం వంటి అత్యవసర విధులను వీరు పర్యవేక్షిస్తుంటారు. సర్టిఫికెట్ ఇన్ టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్ ఒక వ్యక్తికి ఏదైనా ఆనారోగ్యం కలిగితే.. దానికి సంబంధించిన మెడికల్ డయోగ్నోసిస్, ట్రీట్మెంట్ వంటి అంశాలపై సమాచారాన్ని టెలిమెడిసిన్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉపయోగించి టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్లు అందిస్తారు. ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ పుట్టుకతో మాట్లాడటంలో వచ్చిన లోపాలు, పదాలు/శబ్దాలను స్పష్టంగా పలకలేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం వంటి లోపాలను లాంగ్వేజ్ టెక్నిక్స్ ద్వారా సరిచేయడం వీరి ప్రధాన బాధ్యత. సర్టిఫికెట్ ఇన్ ఈసీజీ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ హృదయ స్పందనను రికార్డ్ చేసే ఈక్విప్మెంట్ ద్వారా రోగి హార్ట్ బీట్, తదితర అంశాలను రికార్డ్ చేసి సంబంధిత ఫిజీషియన్కు ఆ రికార్డులను అందజేస్తాడు. తద్వారా హార్ట్, వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్కు చికిత్స అందించడంలో సహాయపడతాడు. సర్టిఫికెట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ వివిధ పరీక్షల్లో భాగంగా తీసిన ఎక్స్రే ఫిల్మ్స్ను డెవలప్ చేయడం, సంబంధిత ల్యాబ్ నిర్వహణ వంటి బాధ్యతలను డార్క్ రూమ్ అసిస్టెంట్ నిర్వహిస్తాడు. -
వైద్య సౌకర్యాల కోసం రూ.113 కోట్లు
- పీహెచ్సీలను కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం - విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు - మెదక్ ఏరియా అస్పత్రిని 200 పడకలుగా మారుస్తాం - డిప్యూటీ సీఎం రాజయ్య మెదక్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్లకు దీటుగా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సిఫారసుల మేరకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన కాళోజీ మెడికల్ పీజీ యూనివర్సిటీ తెలంగాణకు ఒక వరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారన్న విషయాన్ని గ్రామీణులు తెలుసుకోవాలన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష ్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే 1,273 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. దంత వైద్యులు, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రులలో మెస్ చార్జీలు, శానిటేషన్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి పీహెచ్సీని 30 పడకల ఆస్పత్రిగా, నియోజకవర్గ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచుతామన్నారు. దీంతోపాటు బ్లడ్బ్యాంకును ఏర్పాటుచేసి, అవసరమైన పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల బృందం సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నుస్రత్, సంతోష్ప్రసాద్లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైద్యులు, కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం రాజయ్యను సన్మానించారు. -
చట్టం చట్టుబండలు !
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకున్న వారి గురించి, ఆరోగ్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆస్తిపాస్తులు అమ్మేసుకున్నవారి గురించి తరచూ వింటూనే ఉంటాం. ముందస్తుగా ఏ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. గుంటూరు మెడికల్ : వివిధ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఏ ఆపరేషన్కు ఎంత ఖర్చు అవుతుందో తెలిసేలా అందరికి కనిపించే ప్రదేశాల్లో వివరాలను ఉంచాలని ఏపీ అల్లోపతిక్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2007 స్పష్టం చేసింది. జిల్లాలో ఈ చట్టం 2008 నుంచి అమలులోకి వచ్చినా నేటికీ చాలా ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసి రోగులకు మేలు కలిగేలా చేయాల్సిన వైద్యాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడం వల్ల చట్టం లక్ష్యం నీరుగారిపోతోంది. చట్టం ఏం చెబుతోంది... = ఏపీ అల్లోపతిక్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -2007 ప్రకారం అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు తప్పని సరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. = తమ తమ ఆస్పత్రుల్లో వైద్యం చేసే వైద్యుల పేర్లు, వారి అర్హతలు, ఆపరేషన్లు చేసినందుకు, వారి సేవలను వినియోగించుకున్నందుకు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తప్పని సరిగా రోగులకు కనిపించే విధంగా బోర్డు పెట్టాలి. = ఈ విధంగా చేయటం వల్ల రోగులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. వివరాలను ముందుగా తెలుసుకుని తమకు అను కూలంగా ఫీజులున్నట్లయితే రోగులు వైద్యం పొందటం లేదా ఇతర ఆస్పత్రులకు వెళ్లటం జరుగుతుంది. = జిల్లాలో 2008 నుంచి ఇప్పటి వరకు 1082 ఆస్పత్రులు, ల్యాబ్లు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నాయి. = రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కూడా ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను పెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ రోగులను అందినకాడికి దండుకుంటున్నార నే ఫిర్యాదులు తీవ్రంగా వినిపిస్తున్నాయి. = జిల్లా కలెక్టర్గా బి.రామాంజనేయులు పనిచేసిన కాలంలో జిల్లాలో డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నారని స్వయంగా ఆయనకు ఫిర్యాదులు అందటంతో చట్టాన్ని అమలు చే యాలని జిల్లా ైవె ద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో సుమారు 960వరకు ఆస్పత్రులు,ల్యాబ్లు రిజిస్టర్ చేయించుకుని కొన్నాళ్ల పాటు ఫీజుల వివరాలను వెల్లడించారు. = తనిఖీల సమయంలో కొత్తపేట బోసుబొమ్మ సెంటర్లో పేరు గాంచిన ల్యాబ్లలో సైతం అర్హతలేని వారిచేత ల్యాబ్ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు. = అదే ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పదోతరగతి కూడా పాస్కాని వారిచేత ఎక్సరేలు తీయిస్తూ ఆస్పత్రి నిర్వాహకులు జిల్లా వైద్యాధికారులకు దొరికిపోయారు. = తదుపరి ఆ చట్టం గురించి పట్టించుకున్న నాథులే కరువయ్యారు. అవసరం ఉంటేనే రిజిస్ట్రేషన్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల అనుమతి కావాల్సిన వారు, స్టేట్ మెడికల్ రియింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు, మెడికల్ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఆస్పత్రుల నిర్వహాకులు మినహా ఇతరులెవ్వరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇలాంటి సౌకర్యాలను ప్రభుత్వం ఇస్తున్న దృష్టా తప్పని సరి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వాస్తవానికి ఎవరైనా రోగులు ఆస్పత్రిలో పొందిన వైద్య సేవలపై అసంతృప్తి కలిగి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన ప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్పత్రుల నిర్వాహకులకు ఊరట కలుగుతుంది. -
1.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు
మావకరపాలెం, న్యూస్లైన్: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షా 5వేల 507మందికి శస్త్రచికిత్సలు జరిగాయని ఆ పథకం జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్.వి.పార్వతీశం తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాన్ని పరి శీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సర్జరీలకు రూ.269.83 కోట్లు ఖర్చయ్యాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 1,523 వైద్యశిబిరాల్లో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యనిపుణులు 2లక్షల 89వేల 112 మంది రోగులకు వై ద్యపరీక్షలు నిర్వహించారన్నారు. వీరిలో 16,798 మందిని ఈ శిబిరాల్లో గుర్తించి మెరుగైన వైద్య సేవలందించామన్నారు. జిల్లాలో నెలకు నాలుగు శి బిరాలు ఏర్పాటుచేసి రో గులకు వైద్యసేవలు అం దిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రత్యే క శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. శస్త్రచికిత్సలకు సంబంధించిన బిల్లులను సకాలంలో ఆస్పత్రులకు చెల్లిస్తున్నామన్నారు. రోగుల పేర్లు తప్పుగా నమోదు చేస్తే అలాంటి వారి బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో స్థానిక ఆరోగ్యమిత్ర మేరీ జీవాబాయి పాల్గొన్నారు. -
పురిటికష్టాలు
గుంటూరు మెడికల్ ,న్యూస్లైన్ :పెద్దాసుపత్రిలోనే పడకలు లేవంటే ఇక పల్లెటూళ్లలోని ఆరోగ్య కేంద్రాల్లో మంచాలు కూడా ఉండవంటే నమ్మక తప్పదు. కాన్పుకోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్ళేందుకు ఆర్థిక స్థోమతలేని పేదరోగులు ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడకు వెళితే కనీసం మంచాన్ని కూడా ఇచ్చే స్థితిలే ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. మంచాలను కొనేందుకు డబ్బులు లేవా అంటే ఉన్నాయి. వాటిని వైద్యాధికారులు తమకు లబ్ధి చేకూర్చే వాటి కోసం వినియోగిస్తున్నారు. జిల్లాకు జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. వాటితో గర్భిణులు, బాలింతలకు ఎంతో చేసే అవకాశం ఉంది. స్వలాభమే తప్ప రోగుల సంక్షేమం పట్టని అధికారులు, వారి సమస్యలపై చొరవ చూపని ప్రభుత్వం వెరసి సర్కా రు దవాఖానాలకు వచ్చే వారికి పురిటికష్టాలు తప్పటం లేదు. జీజీహెచ్లో..... సుమారు ఆరు జిల్లాల నుంచి జీజీహెచ్కు రోగులు వస్తుంటారు. కాన్పుల విభాగంలో 120 పడకలను కేటాయించినప్పటికీ ప్రతి రోజూ 200 మందికి పైగానే బాలింతలు వార్డులో ఉంటున్నారు. రోజూ 30కి పైగా కాన్పులు జరుగుతున్నాయి. ఒక్కో పడకపై ఇరువురు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పురిటినొప్పులకంటే పడకలు లేక బాలింతలు పడుతున్న కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేకపోవటంతో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. రాత్రి వేళల్లో కాన్పుకోసం ఆస్పత్రులకు వచ్చేవారు తెల్లవార్లు వైద్యుల రాకకోసం ఎదురు చూస్తున్నారు. పురిటినొప్పులు తట్టుకోలేక బంధువులు కాన్పుచేయమని అడిగినా గోడు వినేవారు ఉండరు. కాన్పుల నిపుణులు విధులకు డుమ్మా కొడుతూ పీజీ వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందిపై భారం మోపుతున్నారు. గ్రామీణ, పురపాలక పట్టణ ఆస్పత్రుల్లో అర్హులైన, సమర్థులైన గైనకాలజిస్టులు లేకపోవటం, కాన్పుచేసే ఆపరేషన్ థియేటర్స్, ఇతర వైద్య పరికరాలు కూడా అలంకార ప్రాయంగానే ఉండటంతో వారంతా జీజీహెచ్నే ఆశ్రయిస్తున్నారు. రోజు రోజుకు కాన్పుల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా పడకలను, వైద్యులను, సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. పర్యవసానంగా సర్కారీ దవాఖానాల్లో పురిటికష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. కాన్పు అనంతరం బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా జీజీహెచ్లో ఉంటున్న కొందరు తల్లులు కటిక నేలపైనే ఉండాల్సివస్తున్నది. కాన్పుకు ముందు,తర్వాత కూడా కష్టాలు తప్పటం లేదు. -
పేద గుండె పగిలింది..
=కేజీహెచ్ కార్డియాలజీలో నిలిచిన ఆపరేషన్లు =వారం రోజులుగా మూతపడ్డ క్యాథ్ల్యాబ్ =ఏడాదిన్నరగా మూతపడ్డ కార్డియో థొరాసిక్ విభాగం =కాసుల కక్కుర్తిలో అధికారులు.. ప్రయివేటు ఆస్పత్రులకు పండగ విశాఖపట్నం-మెడికల్,న్యూస్లైన్: పెద్దాసుపత్రి (కేజీహెచ్)కి హార్ట్ ఫెయిలయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో గుండె జబ్బుల విభాగంలోని క్యాథ్ల్యాబ్ వారం రోజులుగా మూలకుచేరింది. ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగే కార్డియో థొరాసిక్ విభాగం ఏడాదిన్నర క్రితమే మూతపడింది. దీంతో ఓపెన్ హార్టు సర్జరీల సమయంలో గుండెకు కృత్రిమంగా రక్తాన్ని పంప్చేసే హీమోథెర్మ్ యంత్రం మరమ్మతులకు లోనైంది. ఫలితంగా ప్రస్తుతం ఎటువంటి గుండె జబ్బులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అందుబాటులో లేకుండా పోయాయి. యాంజీయోగ్రామ్, యాంజీయోప్లాస్టీ వంటి కీలక హద్రోగ చికిత్స ప్రక్రియలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో రోగులు గత్యంతరం లేక అప్పులు చేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఓపెన్ హార్టు సర్జరీలు చేయడంలో కీలకపాత్ర పోషించే పెర్ప్యూజినిస్టు పోస్టు పదేళ్లుగా ఖాళీగాఉంది. ఆరోగ్య శ్రీ ప్రారంభమైన 2008 నుంచి 2011 వరకూ కాంట్రాక్టు పద్దతిలో కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పెర్ప్యూజినిస్టుని తీసుకువచ్చి ఆసమయంలో ఆరోగ్యశ్రీ కింద 150కి పైగా ఓపెన్హార్టు శస్త్రచికిత్సలు ఇక్కడ నిర్వహించారు. అప్పటినుంచి పెర్ప్యూజినిస్టును శాశ్వత ప్రాతిపదికన గాని కాంట్రాక్టు పద్దతినగాని నియమించి మరమ్మతుకుగురైన హీమోథెర్మ్ యంత్రాన్ని బాగుచేయించాలని అనేకపర్యాయాలు ఆస్పత్రి అధికారులను ఓపెన్ హార్టు సర్జరీ వైద్యులు విన్నవిస్తున్నా అడుగడుగునా సహాయనిరాకరనే ఎదురవుతుందని వైద్యులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో టీబీ ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులకు సోకే రుగ్మతులకు చేసే ఆపరేషన్లు మాత్రమే ఇక్కడ అరకొరగా రెండేళ్లుగా సాగుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు ఓపెన్ హార్టు సర్జరీ కేసులను తరలించేందుకే ఆస్పత్రి అధికారులు మొగ్గుచూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రులు విధులించే కాసులకు కక్కుర్తిపడి ఓపెన్ హార్టు సర్జరీ విభాగాన్ని రెండేళ్లుగా మూసేశారన్న ఆరోపణలకు బలం చేకూరుకుంది. ప్రస్తుతం మూతపడిన కార్డియాలజీ విభాగంలో వున్న క్యాథ్ల్యాబ్లో చెడిపోయిన ఉపకరణం జర్మనీ నుంచి రప్పించాల్సివుండడంతో అప్పటిలో చికిత్సలు అందే అవకాశం లేదు. పనిలో పనిగా క్యాథ్ల్యాబ్ వార్షిక నిర్వహణ, కాంట్రాక్టు ఒప్పందం ముగిసినందున, నిర్వహణ ఒప్పందాన్ని తిరిగి పునరుద్దరించాలని ఆస్పత్రి అధికారులు భావిస్తుండడంతో కొంతకాలం నిరుపేద హద్రోగులకు క్యాథ్ల్యాబ్ సేవలు అందని దాక్షగా కనిపిస్తున్నాయి. సహాయకులు లేకపోవడంతో గుండె ఆపరేషన్లు నిర్వహించే నిపుణుడికి పనిలేకుండా పోయింది. -
‘సూపర్’ దోపిడీ
=అవసరం లేకున్నా టెస్టులు రాసేస్తున్న వైద్యులు =రోగ నిర్ధారణ పేరుతో నిలువు దోపిడీ =ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో రేటు =టెక్నాలజీ పెరిగినా తగ్గని ఖర్చులు =ఇదీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు సాక్షి, సిటీబ్యూరో : తలనొప్పికి ఎంఆర్ఐ స్కాన్... అసిడిటీకి టూడీ ఎకో టెస్ట్.. మోకాలి నొప్పికి.. స్పైన్ ఎక్స్రే.. ఇదీ నగరంలో పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు. ‘అవసరమున్నా లేకున్నా ఎడాపెడా టెస్టులు రాసేయ్... అందిన కాడికి రోగులను దోచేయ్’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకొని వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేస్తున్నాయవి. రోగనిర్ధారణ పరీక్షల పేరుతో పేషెంట్లను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందే ఈ ‘సూపర్’ ఆస్పత్రులు.. ఆ మేరకు ఉచిత సేవలందించే బాధ్యత మాత్రం విస్మరిస్తున్నాయి. ఓ సాధారణ డయాగ్నోస్టిక్స్లో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)కి రూ.50 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.350కి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చెస్ట్ ఎక్స్రేకు బయట రూ.100-150 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం రూ.500 వరకు చార్జీ చేస్తున్నారు. అదే విధంగా తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్కు రూ.2000 చార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 8500 నుంచి రూ. 12,000 వరకు వసూలు చేస్తున్నారు. నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నోస్టిక్ సెం టర్ల సంఖ్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మిషనరీ ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. కానీ వైద్య పరీక్షల ఖర్చులు తగ్గకపోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మిషన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీగా వ్యత్యాసం కానవస్తోంది. వైద్యులకూ టార్గెట్లు... నగరంలోని పలు కార్పోరేట్ ఆస్పత్రులు అందులో పనిచేస్తున్న వైద్యులకు టార్గెట్లు పెడుతున్నాయి. దీంతో వారు అవసరం లేకపోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘నేను కొంతకాలంగా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యతో బాధపడుతున్నాను. వైద్యుడికి చూపించుకుందామని ఎర్రమంజిల్ సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే, అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపిలే కాదు, సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టూడీఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్ని చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే కడుపులో ఏమీ లేదన్నారు. చివ రకు మసాలాలు కలిగిన ఆహారం తగ్గిస్తే సరిపోతుందన్నారు’ అని బంజారాహిల్స్కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ప్యారడైజ్లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్స్రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకు పైగా బిల్లు వేసి చేతికిచ్చారు. పరీక్షలన్నీ చేయించుకురి రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదని చెప్పి పంపారు’ అని నల్లగొండకు చెందిన రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేము మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని సోమాజిగూడలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీలు పొందినా.. ఉచిత సేవలేవి? రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్స్రే తదితర మిషన్లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు గానూ ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా.. నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదు. డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ, ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్స్రే యంత్రాలే ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కన్పిస్తూ ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నిర్వహణ వ్యయం పెరగడం వల్లే.. నిజానికి ఆస్పత్రులతో పాటు ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. దీనికి తోడు పదేళ్ల క్రితం ఎంఆర్ఐ ధర రూ.1.5 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.3-6 కోట్లకు చేరింది. పెరిగిన ధరల భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు. - డాక్టర్ భాస్కర్రావు, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైట్కాలర్ వ్యాపారమైన వైద్యం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేశాయి. ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది వైద్యులు రోగుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా ప్రతి చిన్న సమస్యకూ ఎంఆర్ఐ వంటి ఖరీదైన టెస్టులు రాస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తూ రోగుల దృష్టిని మరల్చుతున్నారు. - డాక్టర్ నాగేందర్, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు, తెలంగాణ వైద్యుల సంఘం తలనొప్పితో వెళ్తే ఎంఆర్ఐ రాశారు ఇటీవల తలనొప్పి రావడంతో కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ తీసుకోవాలన్నాడు. రూ.8500 చెల్లించి బ్రెయిన్ ఎంఆర్ఐ తీయించాను. రిపోర్టు తీసుకుని మళ్లీ వైద్యుడి వద్దకు వెళ్తే, తీరా ఏమీ లేదని చెప్పి సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు. - ఎన్.కేశవరాజు, నల్లగొండ