
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్పై చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నెలారంభంలో 17 నుంచి 18 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో అల్పపీడన ప్రభావంతో ఈ నెల 10వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిరుజల్లులు కురియడంతో పాటు వాతావరణంలో మార్పులతో రెండు రోజులుగా విపరీతమైన చలి ప్రజలను వణికిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రేటర్ పరిధిలో కనిష్ఠంగా 15 డిగ్రీలు ఉండగా శనివారం రాత్రి ఈ ప్రభావం మరింత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు తీవ్రత తగ్గకపోవడంతో పాటు సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటివేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల తీరు కూడా తగ్గుతుండడం గమనార్హం.
నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి
గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండడంతో భాగ్యనగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేకువజాము నుంచి ఉదయం 9 గంటల దాకా మంచు దుప్పటి కమ్మేయడంతో రింగ్రోడ్ సహా ఇతర మార్గాల్లో వెళ్లే వాహనాలు వేగం బాగా తగ్గిపోయింది.