
సుప్రీం ఉత్తర్వుల కాపీ చూసి స్పందిస్తాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూసిన తర్వాతే దానిపై స్పందిస్తామని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఈ నెల 31వ తేదీలోగా కౌన్సెలింగ్ను పూర్తిచేయాలని న్యాయమూర్తి మౌఖిక వ్యాఖ్యలు చేసినట్టు తమ న్యాయవాది తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.
వచ్చేనెల చివరి వరకు కూడా కౌన్సెలింగ్ నిర్వహణకు సమయముందని భావిస్తున్నామన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ వాదన నెగ్గిందనే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని, విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.