
రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పరీకర్లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే లోక్సభకు రాజీనామా చేయనున్నారు.
ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్సభ ఎంపీలు కాగా, మనోహర్ పరీకర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గోవా ముఖ్యమంత్రిగా మార్చి 14న పరీకర్ ప్రమాణస్వీకారం చేశారు. మార్చి 19న యోగి, మౌర్య ప్రమాణం చేశారు. ఆరు నెలల్లో వీరు ముగ్గురు తమ రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు.