
దాడికి పాల్పడ్డ ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి. గాయపడ్డ దర్శకుడు శరత్ కుమార్
మంగారెడ్డిపై క్రిమినల్ కేసు
హైదరాబాద్: వర్ధమాన దర్శకుడు పోలవరపు శరత్కుమార్పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేశారు. వీడియో ఎడిటింగ్కు ఒప్పుకోలేదన్న కారణంతో... గురువారం అర్ధరాత్రి 12.45 ప్రాంతంలో ఆమె సన్నిహితుడు కిషన్తో కలిసి రాడ్తో శరత్కుమార్ తలపై బలంగా కొట్టారు. అందవికారుడిగా చేయాలనే ఉద్దేశంతో అతడి జుత్తు కత్తిరించారు. సెల్ఫోన్ ధ్వంసం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఐపీసీ సెక్షన్ 324, 448 కింద క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివి...
నిజాంపేట బాలాజీనగర్లో ఉండే ఫిలింమేకర్ శరత్కుమార్ కమలాపురికాలనీలోని తన స్నేహితుడు రాకేష్ ఇంటికి వస్తుంటారు. గతంలోనే పరిచయమున్న మంగారెడ్డి చాటింగ్లోకి వచ్చి.. వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలని శరత్కుమార్ను కోరారు. తనవల్ల కాదని శరత్ చెప్పారు. ఆగ్రహించిన మంగారెడ్డి గురువారం అర్ధరాత్రి తన సన్నిహితుడు కిషనతో వచ్చి స్నేహితుడి గదిలో నిద్రిస్తున్న శరత్పై రాడ్తో దాడి చేశారు. అడ్డువచ్చిన అతని స్నేహితుడు రాకేష్నూ కొట్టారు. శరత్ జుత్తు కత్తిరించి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని స్థానిక నిఖిల్ ఆసుపత్రికి తలరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలంటే చిన్నచూపు: పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగారెడ్డి శుక్రవారం బంజారాహిల్స్ పోలీ స్ స్టేషన్కు వచ్చారు. ఘటనపై ఆమె స్పందిస్తూ... తరచూ అసభ్యకర మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్న శరత్ను నిలదీసేందుకే అతని ఫ్లాట్కు వెళ్లానన్నారు. తలుపు నెడుతున్న క్రమంలో శరత్ తలకు తాకిందని, దాంతో అతను వెనకాలున్న బీరువాకు కొట్టుకున్నాడన్నారు. తాను దాడి చేశాననడంలో వాస్తవం లేదన్నారు. శరత్పై తానూ కేసు పెడతానన్నారు. కాగా, శరత్కుమార్ చిత్రం ‘శీష్మహల్’ విడుదలకు సిద్ధంగా ఉంది.