
త్రిశంకు లోక్సభ!
ఏడు తూర్పు, దక్షిణాది రాష్ట్రాల తీరు
ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ముందంజలో కాంగ్రెస్
సత్తా చాటనున్న ప్రాంతీయ పార్టీలు
లోక్నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ అంచనా
న్యూఢిల్లీ: కొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలు హంగ్ ఫలితాలు ఇవ్వనున్నాయా? అధికారంలో ఉన్న, లేని ప్రాంతీయ పార్టీలు సత్తా చాటనున్నాయా? జాతీయ పార్టీలకు అగ్నిపరీక్ష ఎదురుకానుందా? లోక్నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలు అవుననే అంటున్నాయి! తూర్పు, దక్షిణ భారతంలోని ఏడు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో లోక్సభ ఎన్నికల్లో త్రిశంకు ఫలితాలు రానున్నట్లు తేలింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో ఈ సర్వే నిర్వహించారు.
మొత్తం 232 స్థానాలున్న వీటిలో ఏ జాతీయ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని తేలింది. సర్వే ఫలితాల ప్రకారం.. 36 నుంచి 62 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా, 22 నుంచి 40 సీట్లతో బీజేపీ రెండో పెద్ద పార్టీగా అవతరించే అవకాశముంది. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలో సత్తా చాటనుంది. బీజేపీ బీహార్, కర్ణాటకల్లో మంచి పనితీరు కనబరచనుంది.
మిగిలిన పార్టీలు వాటి సొంత రాష్ట్రాలకే పరిమితమై, ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపకపోవచ్చు. నరే ంద్ర మోడీని ప్రధాని రేసులో దింపిన బీజేపీ తాననుకున్న లక్ష్యం సాధించాలంటే ఉత్తర, పశ్చిమ భారతంలోని లోక్సభ సీట్లను స్వీప్ చేయాల్సిందే. ఒడిశా, పశ్చిమ బెంగాల్లకు సంబంధించి లోక్నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలను ‘సాక్షి’ మంగళవారం వెల్లడించడం తెలిసిందే. 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు 20-28, కాంగ్రెస్కు 5-9, బీజేపీకి 0-2 వస్తాయని, 21 సీట్లున్న ఒడిశాలో అక్కడి అధికార బీజేడీకి 10-16, కాంగ్రెస్కు 3-9, బీజేపీకి 0-4 వస్తాయని సర్వేలో తేలింది.