
షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రజలు రెడీ
వరంగల్ లోక్సభా స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ - బీజేపీ నిర్ణయించాయి. రెండు పార్టీల సమన్వయ సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విలేకరులతో మాట్లాడారు.
టీఆర్ఎస్ అన్ని రకాలుగా విఫలమైందని, ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే కేంద్రానికి - రాష్ట్రానికి అనుసంధానంగా ఉంటారని ఆయన చెప్పారు. ఇక కేసీఆర్ ఫాంహౌస్కు మాత్రమే పరిమితం అవుతున్నారని, ఆయనది నిర్లక్ష్య పరిపాలన అని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని ఆయన చెప్పారు.