
ఔను! మమల్ని టార్గెట్ చేశారు!
డబ్లింగ్: తమ కంపెనీపై యూరోపియన్ యూనియన్ రూ. లక్ష కోట్ల (13 బిలియన్ యూరోల) పన్ను జరిమానా విధించడంపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ తీవ్రంగా స్పందించారు. ఈ జరిమానా పనికిమాలిన రాజకీయ చర్య అని ఆయన విమర్శించారు. అమెరికా వ్యతిరేక భావజాలం ఈ తీర్పునకు కారణం కావొచ్చునని ఆయన ఓ దినపత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఐర్లాండ్తో కలిసి గట్టిగా పోరాడుతామని, నిజాలతో, చట్టాలలో ప్రమేయం లేకుండా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన మండిపడ్డారు. 'మేం ఏ తప్పు చేయలేదు. మేం కలిసి ముందుకు సాగుతాం. ఐర్లాండ్ను ఎంచుకొని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదు' అని కుక్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీలపై వ్యతిరేకత వల్ల తమపై ఇంత భారీమొత్తంలో జరిమానా విధించి ఉంటారని ఆయన పేర్కొన్నారు.
'యాపిల్ను టార్గెట్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఇందుకు అమెరికా వ్యతిరేక సెంటిమెంటు ఒక కారణం కావొచ్చు' అని కుట్ ఆ పత్రికతో వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ చేసుకున్న పన్నుమినహాయింపు ఒప్పందాలను సాకుగా పెట్టుకొని యూరప్లో తన ఉత్పత్తుల అమ్మకాలపై యాపిల్ పన్ను ఎగ్గొడుతున్నదని, ఇందుకు దాదాపు రూ. లక్ష కోట్ల జరిమానాను చెల్లించాలని యూరోపియన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.