డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 5 తేది నుంచి 20 వరకు కొనసాగనున్నట్టు లోకసభ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైన అంశాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 20 వరకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని కార్యదర్శి వెల్లడించారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీతో నవంబర్ 11 తేదిన జరిగిన భేటిలో శీతాకాలం సమావేశాలపై నిర్ణయం తీసుకున్నట్టు లోకసభ కార్యదర్శి తెలిపారు.
ఈ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం యూపీఏ ప్రభుత్వానికి కీలకంగా మారిన తరుణంలో ఈ శీతాకాలపు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.