Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion1
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Aqua farmers worry with Companies cut prices under pretext of US tariffs2
‘కౌంట్‌’ డౌన్‌.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!

గతంలో బస్తా ఫీడ్‌ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయి­పోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్‌ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్‌లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్‌ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్‌ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్‌ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్‌ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్‌ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్‌ ఆక్వా జోన్‌ ప్రాంతం. యూనిట్‌ రూ.4 చొప్పున కరెంట్‌ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలో యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్‌ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్‌ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్‌ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్‌ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్‌ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్‌ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్‌ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్‌ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్‌ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్‌ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్‌ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్‌ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్‌ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్‌ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్‌ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్‌ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్‌ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లు, ఎక్స్‌ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్‌ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్‌ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్‌ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్‌ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్‌ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్‌ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్‌ వన్‌ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్‌ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్‌ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్‌ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ సరఫరా కోసం ఏపీ ఫిష్‌ ఫీడ్, సీడ్‌ యాక్టులను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్స్‌ ఏర్పాటుతో ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్‌ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్‌ సంక్షోభ సమయంలో సీనియర్‌ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్‌ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్‌ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్‌ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్‌ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్‌ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్‌ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్‌ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్‌ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్‌ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ముడి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్‌ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్‌ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్‌ పెంపు వాయిదా పడ్డా కౌంట్‌ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్‌ సలహాదారుడు

Rasi Phalalu: Daily Horoscope On 14-04-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు,చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.6.24 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రా.10.17 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.4.30 నుండి 6.14 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప.12.32 నుండి 2.20 వరకుసూర్యోదయం : 5.49సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. సన్మానాలు. విద్యావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృషభం... నూతన ఉద్యోగలాభం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మిథునం... ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.కర్కాటకం.. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.సింహం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.కన్య... మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.తుల.... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.వృశ్చికం.... సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.ధనుస్సు... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.మకరం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.కుంభం.. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Indian Families Are Impacting Law and Society says Justice Nagarathna4
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు 

బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్‌పర్సన్‌ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్‌ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు.

Ponguleti Srinivas Reddy Comments with Media5
ఎన్నికల రెఫరెండమే!

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం, పోర్టల్‌ను రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘భూ భారతి’చట్టాన్ని, పోర్టల్‌ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం నుంచే భూభారతి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్‌ ఉండదని తెలిపారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమా లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్‌ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవద్దని, అలా చేస్తే పోర్టల్‌ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తొలుత 3 మండలాల్లో భూభారతిభూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతు న్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావా దేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్‌ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ధరణిని తెచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలిపారు. పార్ట్‌ బీలోని భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ధరణిలో 33 మాడ్యూల్స్‌ ఉండగా, భూభారతిలో 6 మాత్రమే ఉంటాయని వెల్లడించారు. భూభారతి అమలు కోసం ఎంపికచేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూభారతిలో ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు ఐదు స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాల వికేంద్రీకరణ చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే మొదటివారంలో గ్రామ పాలనాధికారులువచ్చేనెల మొదటివారంలో గ్రామాల్లో రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లను నియమిస్తామని మంత్రి ప్రకటించారు.

China Aims To Operate World First Hybrid Fusion-Fission Nuclear Plant By 20306
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం! 

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్‌ వాహనాలను చార్జ్‌ చేయడానికి సమానమైన విద్యుత్‌ కావాలని అంచనా. ఆన్‌లైన్‌ డేటాను రెప్పపాటులో ప్రాసెస్‌ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్‌ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్‌లైన్‌లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్‌ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్‌ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్‌ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్‌ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్‌సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్‌ టెక్నాలజీలో బీవైడీ టాప్‌ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్‌ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్‌ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్‌ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్‌ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్‌ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్‌ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్‌లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్‌ విద్యుత్‌ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్‌ చైనా మారి్నంగ్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్‌ ఇగ్నిషన్‌ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ థర్మో న్యూక్లియర్‌ ఎక్స్‌పరమెంటల్‌ రియాక్టర్‌ (ఐటీఈఆర్‌) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్‌ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆర్నాడ్‌ బేర్‌ట్రెండ్‌ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Chandrababu Naidu government to privatize the maintenance of Ambedkar statue7
రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం!

సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పైనా చందబ్రాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తోంది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక, న్యాయ మహాశిల్పంపై స్వార్థ రాజకీయం విషం చిమ్ముతోంది. ఆ మహనీయుడి స్ఫూర్తిని భావితరాలకు అందకుండా.. బడుగు, బలహీనవర్గాలు సమున్నతంగా తలెత్తకుండా చేసే కుట్ర చేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో నెలకొల్పిన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని పబ్లిక్‌ –ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లను కూడా పిలవనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా తాజాగా ప్రకటించారు. ప్రపంచంలోనే మహోన్నత నేత విగ్రహ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాల్సి ఉండగా ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించుకోవడం ద్వారా తన ఉద్దేశమేంటో చంద్రబాబు ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైభవంగా వెలుగొందిన అంబేడ్కర్‌ సామాజిక, న్యాయశిల్పంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధికారంలోకొచ్చింది మొదలు అడుగడుగునా నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు సామాజిక, న్యాయ మహాశిల్పంపై అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే వంటి ముఖ్య సందర్భాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి కనీసం విద్యుత్‌ లైట్లు కూడా లేకుండా చేసింది. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని డ్వాక్రా స్టాల్స్, ఇతర కార్యకలాపాలకు కేటాయించే ప్రయత్నం చేస్తోంది. తొలుత సందర్శకులను నిరుత్సాహపరిచి అటువైపు వెళ్లే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేలా కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. పారిశుధ్య నిర్వహణను సైతం గాలికొదిలేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా సామాజిక, న్యాయ మహాశిల్పం ప్రాంతం భాసిల్లింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య చర్యలతో పదుల సంఖ్యలో కూడా సందర్శకులు రాని దుస్థితి నెలకొంది. ఇప్పుడు అంబేడ్కర్‌ విగ్రహానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే విగ్రహానికి సమీపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్‌ రెస్టారెంట్‌ ఇతర నిర్మాణ పనులను నిలిపేసింది. అలాగే అంబేడ్కర్‌ విగ్రహానికి వెనుక వైపున గత ప్రభుత్వం చేపట్టిన భారీ కన్వెన్షన్‌ హాల్‌ (ఒకేసారి 2,000 మంది కూర్చునేలా) నిర్మాణాన్ని ఆపేసింది. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు నిర్వహణకే కట్టబెడుతుండటంపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

First defeat for Delhi Capitals in the 18th season of IPL8
పరుగుల వేటలో ఢిల్లీ ‘రనౌట్‌’

వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్‌ పడింది. ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్‌ నిగమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్‌ పొరెల్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్‌ శర్మ, కుల్దీప్, మోహిత్‌ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్‌ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కరణ్‌ శర్మ 3 వికెట్లు, సాంట్నర్‌ 2 వికెట్లు పడగొట్టారు. తిలక్‌ తడాఖా... గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్‌ రెండో ఓవర్‌లో సిక్సర్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్‌లో రికెల్టన్‌ 2 ఫోర్లు, రోహిత్‌ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌ (12 బంతుల్లో 18)ను లెగ్‌స్పిన్నర్‌ విప్రాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్‌ కోల్పోగా... సూర్యకుమార్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్‌ కూడా ఔట్‌ కాగా... తిలక్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్‌ కాగా... తిలక్‌కు నమన్‌ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్‌ 26 బంతుల్లో ఈ సీజన్‌లో రెండో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కదంతొక్కిన కరుణ్‌.. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్‌ నాయర్‌ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్‌సెంచరీ చేయని నాయర్‌ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే మెక్‌గుర్క్‌ (0) ఔట్‌ కావడంతో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టిన నాయర్‌... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్‌లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో 6, 4, 6తో కరుణ్‌ 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్‌లో 6, 4 కొట్టిన నాయర్‌... కరణ్‌ శర్మ ఓవర్‌లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్‌ ఔట్‌ కాగా... మరో ఫోర్‌ కొట్టిన అనంతరం కరుణ్‌ వెనుదిరిగాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (9), స్టబ్స్‌ (1) విఫలం కాగా... కేఎల్‌ రాహుల్‌ (15), అశుతోష్‌ శర్మ (17), విప్రాజ్‌ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్‌ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) విప్రాజ్‌ 18; రికెల్టన్‌ (బి) కుల్దీప్‌ 41; సూర్యకుమార్‌ (సి) స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 40; తిలక్‌ (సి) పొరెల్‌ (బి) ముకేశ్‌ 59; హార్దిక్‌ (సి) స్టబ్స్‌ (బి) విప్రాజ్‌ 2; నమన్‌ (నాటౌట్‌) 38; జాక్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–43–0; ముకేశ్‌ 4–0–38–1; విప్రాజ్‌ నిగమ్‌ 4–0–41–2; కుల్దీప్‌ 4–0–23–2; అక్షర్‌ 2–0–19–0; మోహిత్‌ 3–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెక్‌గుర్క్‌ (సి) జాక్స్‌ (బి) దీపక్‌ చహర్‌ 0; పొరెల్‌ (సి) నమన్‌ (బి) కరణ్‌ శర్మ 33; కరుణ్‌ నాయర్‌ (బి) సాంట్నర్‌ 89; రాహుల్‌ (సి అండ్‌ బి) కరణ్‌ శర్మ 15; అక్షర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 9; స్టబ్స్‌ (సి) నమన్‌ (బి) కరణ్‌ శర్మ 1; అశుతోష్‌ (రనౌట్‌) 17; విప్రాజ్‌ నిగమ్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) సాంట్నర్‌ 14; స్టార్క్‌ (నాటౌట్‌) 1; కుల్దీప్‌ (రనౌట్‌) 1; మోహిత్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–24–1; బౌల్ట్‌ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్‌ 4–0–43–2; హార్దిక్‌ పాండ్యా 2–0–21–0; కరణ్‌ శర్మ 4–0–36–3. ఐపీఎల్‌లో నేడులక్నో X చెన్నై వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Personal Cyber Insurance a Protection Against Digital Threats9
బీమాతో సైబర్‌ మోసాలకు చెక్‌!

ఐటీ ఉద్యోగి వంశీరామ్‌ (32) మొబైల్‌కు ఒక సందేశం వచ్చింది. విద్యుత్‌ బిల్లు గడువు ముగిసిపోయిందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్‌ నిలిపివేస్తామని అందులో ఉంది. వెంటనే లింక్‌పై క్లిక్‌ చేసి చెల్లించేశాడు వంశీ. కానీ, ఖాతా నుంచి రూ.80,000 డెబిట్‌ అయిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇలాంటివి రోజుకు వేలాది ఘటనలు జరుగుతున్నాయి. గ్రోసరీ షాపింగ్, సోషల్‌ మీడియా ముచ్చట్లు, వర్తకులకు క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, బ్యాంకింగ్‌ సేవలు.. నేడు లావాదేవీలన్నీ మొబైల్‌ ఫోన్ల నుంచే. దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌ రూపంలోకి మళ్లాయి. సౌకర్యంగా ఉండడంతో అందరూ స్మార్ట్‌ఫోన్‌ నుంచే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ఇది సైబర్‌ మోసాలకు అడ్డాగా మారిపోయింది. ఏటా 15 లక్షల సైబర్‌ మోసాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్‌ మోసాల నుంచి రక్షణ కల్పించుకోవడంపై తప్పకుండా దృష్టి సారించాలి. దీని గురించి అవగాహన కల్పించే కథనం ఇది... 2018లో సైబర్‌ నేరాలు 2.08 లక్షలు కాగా, ఇప్పుడు ఏటా 15 లక్షలకు చేరాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితులు అందరూ బయటకు చెప్పుకోలేరు. కనుక, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. సైబర్‌ నేరాలతో ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో వేదనకు గురికావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి ఆదుకునేదే సైబర్‌ ఇన్సూరెన్స్‌. దేశంలో 84 శాతం ఇంటర్నెట్‌ యూజర్లు ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. షాపింగ్, బ్యాంకింగ్‌ లేదా సోషల్‌ మీడియా చాటింగ్, ఆన్‌లైన్‌ కార్యకలాపాలు ఏవైనా సరే... ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ డేటా లీకేజీ, సైబర్‌ దాడులు, మోసాల రిస్క్‌ ఉంటుంది. సైబర్‌ నేరస్థులు డీప్‌ఫేక్‌ టెక్నాలజీ, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో దాడులకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌ను సైతం తప్పుదోవ పట్టించి.. నకిలీ లింక్‌ ద్వారా బ్యాంక్‌ ఖాతా ఊడ్చేస్తున్న ఘటనలు వింటున్నాం. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని విశ్రాంత జీవుల నుంచి జీవితకాల పొదుపు నిధులను మాయం చేస్తున్నారు. నేడు ప్రపంచం మొత్తం డిజిటల్‌గా అనుసంధానమై ఉంది. దీంతో నేరగాళ్లు ఏదో ఒక దేశంలో ఉండి, మరో దేశంలోని వారిని సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఒకవైపు సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతుంటే.. మరోవైపు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, తాము జాగ్రత్తగా ఉంటామన్న ధీమా కొందరిని బీమాకు దూరంగా ఉంచుతోంది. సైబర్‌ రక్షణ...సైబర్‌ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీదారులకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ చెల్లిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) తీసుకోవచ్చు. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం సుమారు రూ.600 వరకు.. రూ.కోటి కవరేజీకి రూ.25,000 వరకు ఉంటుంది. సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి దురి్వనియోగం చేయడం, సైబర్‌ వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వంటి కేసుల్లో.. చట్టపరమైన చర్యలకు అయ్యే వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మాల్వేర్, రాన్సమ్‌వేర్‌ రక్షణ కూడా ఉంటుంది. మాల్వేర్‌ దాడుల కారణంగా సర్వర్, నెట్‌వర్క్, కంప్యూటర్లకు వాటిల్లే నష్టానికి పరిహారం లభిస్తుంది. సైబర్‌ నేరస్థులు డివైజ్‌ను (మొబైల్‌ లేదా పీసీ/ల్యాప్‌టాప్‌) హ్యాక్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డేటా రికవరీకి, డివైజ్‌ రిపేర్‌ వ్యయాలను బీమా కంపెనీ భరిస్తుంది. డేటా చోరీతో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఆన్‌లైన్‌ బ్లాక్‌ మెయిల్, సైబర్‌ బుల్లీయింగ్‌ తదితర ఘటనల్లో న్యాయపరమైన చర్యలకు, సాంకేతిక సాయానికి అయ్యే వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. సైబర్‌ ఇన్సూరెన్స్‌లోనూ విభిన్న ప్లాన్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి. మొబైల్‌ వాలెట్లకూ రక్షణ కల్పించుకోవచ్చు. ఈమెయిల్‌ స్పూఫింగ్‌ దాడి వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టం, నేరస్థులపై చర్యలకు అయ్యే వ్యయాలకూ చెల్లింపులు ఉంటాయి. సందేశాలు పంపడం, ఫోన్‌ కాల్స్, నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా సున్నితమైన డేటాను పొందడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించడం వంటి ఫిషింగ్‌ దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. ఎంత కవరేజీ అవసరం? కంపెనీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఫైర్‌వాల్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌తో సైబర్‌ దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అదే మాదిరి వ్యక్తులు సైతం తమ వంతుగా సైబర్‌ బీమా రక్షణను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ముందుగా బ్యాంక్‌ ఖాతాల్లో బ్యాలెన్స్, క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్, ఈ–వ్యాలెట్‌ ఇలా సైబర్‌ దాడుల రిస్క్‌ ఉన్న పెట్టుబడుల విలువను ఒకసారి పరిశీలించాలి. మీ లిక్విడ్‌ అసెట్స్‌ విలువకు సరిపడా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తరచూ, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి అధిక కవరేజీ అవసరం. వీటికి కవరేజీ రాదు.. సైబర్‌ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు కూడా ఉంటాయి. వీటి గురించి పాలసీదారులు ముందుగానే సమగ్రంగా తెలుసుకోవాలి., చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యవహారాలు, లావాదేవీలు, ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కారణంగా జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. వాణిజ్య రహస్యాలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలకూ ఇందులో మినహాయింపులు ఉన్నాయి. యుద్ధం, సైబర్‌ యుద్ధం, సహజ ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టానికీ రక్షణ ఉండదు. క్రిప్టో పెట్టుబడులు, గ్యాంబ్లింగ్, మోసపూరిత చర్యలు, అనధికారికంగా డేటా సమీకరించడం, నిషేధిత సైట్లలోకి ప్రవేశించడం వల్ల వాటిల్లే నష్టం తదితర వాటికి సైబర్‌ బీమాలో కవరేజీ ఉండదు. వెంటనే రిపోర్ట్‌ చేయాలి.. మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే వెంటనే బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి వాటి ఖాతా/క్రెడిట్‌/డెబిట్‌కార్డుల యాక్సెస్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేయించాలి. వెంటనే బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించాలి. 1930కు కాల్‌ చేసి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి. పోలీసుల వద్ద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం, ఆ కాపీ తీసుకుని బీమా కంపెనీ వద్ద నిబంధనల మేరకు క్లెయిమ్‌ దాఖలు చేయాలి. బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ వద్ద ఫిర్యాదుకు సంబంధించి రుజువులను జత చేయాలి. జరిగిన నష్టానికి సంబంధించి ఆధారాలూ సమర్పించాలి. సైబర్‌ టిప్స్‌.. → చాలా మంది ఆన్‌లైన్‌ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైబర్‌ దాడులకు అవకాశం ఇచి్చనట్టు అ వుతోంది. ప్రతి ఒక్కరూ తమవంతు రక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. → స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లలో సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. → తెలియని వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేయకుండా ఉండాలి. → గూగుల్‌ సెర్చ్‌లో శోధించే క్రమంలో ఎదురయ్యే వెబ్‌ పోర్టళ్లు, కాంటాక్టుల వివరాలు, చిరునామాలు నిజమైనవేనా? అన్న పరిశీలన తర్వాతే ముందుకు వెళ్లాలి. → డొమైన్‌ చిరునామాలో హెచ్‌టీటీపీఎస్‌ లేకపోతే యాక్సెస్‌కు దూరంగా ఉండాలి. → బలహీన పాస్‌వర్డ్‌లు కాకుండా.. స్మాల్, క్యాపిటల్‌ లెటర్లు, స్పెషల్‌ క్యారెక్టర్లు, నంబర్లతో కూడిన పటిష్ట పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. → పబ్లిక్‌ వైఫై, ఉచిత నెట్‌ వర్క్‌ల యాక్సెస్‌కు దూరంగా ఉండాలి → టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ)ను ఎనేబుల్‌ చేసుకోవాలి. → ఫోన్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్, యాప్‌లు, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. → సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలను కొత్తవారు యాక్సెస్‌ చేయకుండా నియంత్రణలు పెట్టుకోవాలి. → మెయిల్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే యూఆర్‌ఎల్‌ లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు. అవి విశ్వసనీయ సంస్థల నుంచి వచి్చనవేనా అన్నది ధ్రువీకరించుకోవాలి. → పేమెంట్‌ యాప్‌లు సహా అన్ని ముఖ్యమైన యాప్‌లకు ఫింగర్‌ ప్రింట్‌ లాగిన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి. → ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి బ్యాకప్‌ తీసుకోవాలి. → ఓటీపీలు, ఆధార్, పాన్, బ్యాంక్‌ ఖాతా, చిరునామా, ఫోన్‌ నంబర్లు ఇలా కీలక వివరాలను ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోరాదు. → ఈ జాగ్రత్తలతోపాటు తగినంత రక్షణ కవరేజీతో సైబర్‌ బీమా తీసుకోవడం మరవొద్దు. హెచ్‌ఏఎల్‌కు నేరగాళ్ల బురిడీప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల కంపెనీ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను సైతం సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. కంపెనీ కాన్పూర్‌ శాఖను తప్పుదోవ పట్టించి రూ.55 లక్షలు కాజేశారు. యూఎస్‌కు చెందిన పీఎస్‌ ఇంజనీరింగ్‌ ఐఎన్‌సీ నుంచి హెచ్‌ఏఎల్‌ విడిభాగాలు కొనుగోలు చేయాలనుకుంది. కంపెనీ అధికారిక ఈ మెయిల్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల మధ్యలో సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించారు. యూఎస్‌ కంపెనీ పీఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారిక ఈమెయిల్‌ చిరునామాలో ఒక ఇంగ్లిష్‌ ‘ఇ’ తొలగించి, మిగిలిన అక్షరాలన్నీ ఉండేలా ఈమెయిల్‌ ఐడీ సృష్టించి హెచ్‌ఏఎల్‌తో సంప్రదింపులు చేశారు. రూ.55 లక్షల అడ్వాన్స్‌ను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. జరిగిన మోసాన్ని హెచ్‌ఏల్‌ ఆలస్యంగా గుర్తించింది. అలాగే, ఆ మధ్య ఓ ప్రముఖ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన కీలక డేటా లీక్‌ అయ్యింది. 68,000 డాలర్లు చెల్లించాలంటూ హ్యాకర్‌ డిమాండ్‌ చేశాడు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Former Intelligence Chief AB meets accused Srinivasa Rao10
పాత కుట్రకు మళ్లీ పదును!

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌: 2019 ఎన్నికల ముందు 2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ను పదునైన కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం భేటీ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అది కూడా అతడిని వెతుక్కుంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీనివాసరావు ఇంటికెళ్లి ఏబీ కలిశారు. స్వయంగా నిందితుడి ఇంటికెళ్లి కలవడం ద్వారా నాడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి అసలు కుట్రదారులెవరనే విషయాన్ని ఏబీ చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాటి తరహాలోనే మళ్లీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా కొత్త కుట్రలు పన్నుతున్నారని చర్చ జరుగుతోంది. నిందితుడు శ్రీనివాసరావును కలిసిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడం, నిందితుడిని కొనియాడటం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నాడు కూడా ముందస్తు కుట్రలో భాగంగానే..వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్‌ 25న హత్యాహత్నం జరిగిన విషయం టీవీల్లో వచ్చిన వెంటనే.. స్థానిక టీడీపీ నేతలు వారికి ముందుగానే తెలిసినట్లు నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద వాలిపోయారు. మీడియా కంటే ముందుగానే అతడి ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు నడింపల్లి శ్రీనివాసరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌లు.. వారికి ముందే ఎవరో ‘బ్రీఫింగ్‌’ ఇచ్చినట్టు.. ‘నిందితుడు జగన్‌ అభిమాని’ అంటూ ఒకేపాట పాడారు. తాజాగా ఇప్పుడు నిందితుడు శ్రీనివాసరావు ఇంటికెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే పాట పాడటం గమనార్హం. అప్పుడు కుట్ర అమల్లో భాగంగా టీడీపీ నేతలతో అలా మాట్లాడించిన అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు చంద్రబాబు తనను నామినేటెడ్‌ పదవిలో నియమించడంతో ఆయన రుణం తీర్చుకోవడానికి అన్నట్టు అవే పలుకులు పలకడం ద్వారా హత్యాయత్నం కుట్రలో భాగస్వాములు ఎవరో స్పష్టం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అప్పట్లో డీజీపీ ఠాకూర్‌ కూడా అదే పాటనాడు వైఎస్‌ జగన్‌పైన హత్యాయత్నం జరిగిన అరగంట లోపే (అప్పటికి నిందితుడు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) కస్టడీలో ఉన్నాడు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌ సైతం నమోదు కాలేదు. నిందితుడిని విచారించనూ లేదు) మధ్యాహ్నం 1.30 గంటలకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడి పేరు, ఊరును ప్రకటించడంతోపాటు అతడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అని, వైఎస్‌ జగన్‌ అభిమాని అని ప్రకటించేశారు. పబ్లిసిటీ కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్‌ నుంచి నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోకముందే అంతా ముందుగానే తెలిసినట్టు.. పక్కా ప్రణాళిక ఉన్నట్టు నిందితుడి వివరాలను ఆర్పీ ఠాకూర్‌ ఎలా వెల్లడించగలిగారు? అసలు విచారణ నామమాత్రపు విచారణ కూడా లేకుండానే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా పసిగట్టగలిగారు? అనే ప్రశ్నలకు అప్పుడు ఠాకూర్‌ సమాధానం చెప్పలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే కుట్రను రచించి అమలు చేయడంలో డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ కీలక భాగస్వామి కాబట్టే ఆయనకు అన్ని విషయాలూ ముందుగానే తెలిశాయన్నది సుస్పష్టం. ఇక నాటి డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సైతం అదే విషయాన్ని వల్లె వేశారు.అంత ఆర్గనైజ్డ్‌గా అందరూ ఒకే విషయాన్ని ఎలా చెప్పారనే విషయం తేల్చే సమయంలో, కేసు కీలక దశకు చేరిన సందర్భంలో ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం నిందితుడి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపడం.. అప్పటి కుట్ర ఎవరి మార్గదర్శకత్వంలో జరిగిందో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదవీ విరమణ నాటి నుంచి కుట్రలే..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు.. గంగ.. చంద్రముఖిగా మారినట్టు పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. తన కుల సంఘాల సమావేశాల్లోనూ వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మారు. తానొక మాజీ ఐపీఎస్‌ అధికారిననే విషయం మరిచిపోయి ఒక సాధారణ టీడీపీ కార్యకర్తకంటే దిగువ స్థాయికి జారిపోయి సోషల్‌ మీడియాలోనూ అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ఏబీ వెంకటేశ్వరరావుకు నామినేటెడ్‌ పోస్టు కట్టబెట్టారు. అంతేకాకుండా ఏబీపై ఉన్న నిఘా పరికరాల కొనుగోలు కేసును కూడా పక్కనపెట్టారు. దీంతో చంద్రబాబు రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఏబీ వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోందని అంటున్నారు. ఇందులో భాగంగానే నాడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన నిందితుడు శ్రీనివాసరావును అతడి ఇంటికెళ్లి మరీ ఏబీ కలిశారని.. కొత్త కుట్రలకు తెరలేపుతున్నారనే చర్చ జరుగుతోంది. లేకపోతే జగన్‌ మీద హత్యాయత్నం కేసులో నిందితుడు ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన తర్వాత.. అమలాపురంలో ఏబీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్‌ కోసం బలైన మొదటి వ్యక్తి శ్రీనివాసరావు అని నిందితుడిని వెనకేసుకొచ్చారు. జగన్‌ అతడి జీవితాన్ని చిదిమేశారన్నారు. జగన్‌ రాష్ట్రానికి, ఆంధ్రులకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదకారి అని ఏబీ వ్యాఖ్యానించారు. జగన్‌ బాధితులు ఎందరో ఉన్నారన్నారు. తిరిగి జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదన్నారు. జగన్‌ అక్రమాలు చేశారని.. ఆయన వల్ల బాధ పడుతున్న బాధితులకు తాను అండగా ఉంటానని ఏబీ అన్నారు. జగన్‌ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement