Cabbage crop
-
కొంప ముంచిన క్యాబేజీ
ఎంతో కష్టపడి పండించిన క్యాబేజీకి ధర పడిపోవడంతో రైతులు పంటను దున్నేస్తున్నారు. క్యాబేజీ పంటను కొనేందుకు వ్యాపారులు రాకపోవడం... వ్యయప్రయాసలను ఎదుర్కొని మార్కెట్కు తీసుకువెళితే బస్తా రూ.50కి అడుగుతుండటంతో కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావని రొటోవేటర్తో పంటను తొక్కించేస్తున్నారు. ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోతున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పలు గ్రామాల్లో 80 ఎకరాల్లో క్యాబేజీ పంటను సాగుచేశారు. వీరిలో ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేలు ఇచ్చి కౌలుకు సాగుచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎకరా క్యాబేజీ సాగుకు రూ.80వేల వరకు ఖర్చులయ్యాయి. ప్రతి సంవత్సరం క్యాబేజీ తోటలను సాగుచేసిన తర్వాత పంట చేతికొచ్చేముందు ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి ఎకరాల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. వీరు క్యాబేజీ కోత సమయంలో డబ్బులు ఇస్తుంటారు. గత ఏడాది ఎకరా క్యాబేజీ పంటను రూ.2 లక్షల వరకూ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎకరా పంట రూ.80వేలకు పడిపోయింది. కొంతమంది రైతులు ఆ ధరకే అమ్ముకున్నారు. –మోపిదేవివార్పు(మోపిదేవి)బస్తా రూ.50 మాత్రమే... ధర పెరుగుతుందని కొందరు రైతులు క్యాబేజీ పంటను అమ్మకుండా ఎదురు చూశారు. వ్యాపారులు రాకపోవడంతో సొంతంగా మార్కెట్కు తరలిస్తే బస్తా రూ.50లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోత, రవాణా కూలీ ఖర్చులు దండగని రైతులు పంటను దున్నించేస్తున్నారు. తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా క్యాబేజీ కోసుకునేందుకు రావడం లేదు. దీంతో మోపిదేవి వార్పు, బండికోళ్ల లంక, బొబ్బర్లంక ప్రాంతాల్లో రైతులు రొటోవేటర్తో క్యాబేజీ పంటను తొక్కించేస్తున్నారు. ప్రస్తుతం పది ఎకరాలకు పైగా పంటను తొక్కించేశారు. మిగిలిన రైతులు కూడా ఇదే బాట పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.జగన్ హయాంలో వెన్నుదన్నుగా... సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి ఆదుకున్నారు. మార్కెట్లో ధర తగ్గిపోయిన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీ పడి రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. ఇందుకోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019 – 24 మధ్య 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,745 కోట్ల విలువైన 21.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు ధర లేని సమయంలో టమోటాలు, ఉల్లిపాయలు లాంటి కూరగాయలు కూడా సేకరించి రైతులకు అండగా నిలిచారు. -
హ్యాపీ గార్డెనింగ్
‘‘నా తొలి పంట నా చేతికి వచ్చింది’’ అని సంబరపడిపోతున్నారు సమంత. ఇటీవల ఆమె టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘క్యాబేజ్ మైక్రోగ్రీన్స్’ని పండించారు. మైక్రోగ్రీన్స్ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. రెగ్యులర్ క్యాబేజ్కన్నా ఈ మైక్రోగ్రీన్స్లో పోషకాలు ఎక్కువ. ఇక ట్రేల్లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్ చేసి, ‘ఒకవేళ మీకు గార్డెనింగ్ మీద ఆసక్తి ఉంటే.. క్యాబేజీ మైక్రోగ్రీన్స్ని ఎలా పండించాలో’ నేను చెబుతా అన్నారు సమంత. చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్పారామె. ‘‘ఈ పంటకు మీకు కావాల్సిందల్లా ఒక ట్రే, కోకోపీట్ (కొబ్బరి పొట్ట ఎరువు), విత్తనాలు, చల్లని గది.. అంతే. నా బెడ్రూమ్ కిటికీ సూర్యరశ్మి పాక్షికంగా వస్తుంది. ఒకవేళ ట్రైకి తగినంత సూర్య రశ్మి రాకపోతే దానికి దగ్గరగా ఒక బెడ్ ల్యాంప్ ఉంచవచ్చు. ఇక పంట ఎలా వేయాలంటే.. 1. ట్రేని కోకోపీట్తో నింపాలి. 2.విత్తనాలు చల్లండి 3.కోకోపీట్ మొత్తం తడిచేవరకూ నీళ్లు చల్లి, ఆ తర్వాత ట్రేని కవర్ చేయండి. కిటికీకి దగ్గరగా ఇంట్లో చల్లని ప్రాంతంలో ఈ ట్రేని ఉంచండి. సూర్యరశ్మి తక్కువగా ఉందనిపిస్తే.. బెడ్సైడ్ ల్యాంప్ ట్రే దగ్గర ఉంచండి. నేను అలానే చేశాను. నాలుగు రోజులు ట్రే కదిలించకుండా అలానే ఉండనివ్వండి. ప్రతి రోజూ మీరు గమనిస్తే మొలకలు కనబడతాయి. ఐదో రోజు ట్రే మీద ఉన్న కవర్ తీసి, రోజుకోసారి నీళ్లు చల్లండి. ఎనిమిదో రోజుకల్లా మీ మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోతాయి’’ అని మొత్తం వివరించి, ‘హ్యాపీ గార్డెనింగ్’ అన్నారు సమంత. -
సస్యరక్షణే కీలకం
సిరులు కురిపించే క్యాబేజీ జిల్లాలో విస్తారంగా సాగు మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు గిరిజనులకు సిరులు కురిపించే పంట క్యాబేజీ. దీనికి చల్లని వాతావారణం అనుకూలం. ఏజెన్సీతోపాటు మైదానంలో.. ఖరీఫ్, రబీ కాలాల్లో ఏటా సుమారు 15 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈ పంటకు ఎక్కువగా ఆశించే చీడపీడలను నెట్టుకు రాగలిగితే.. మంచి దిగుబడులతోపాటు ఆదాయానికీ ఆస్కారముంటుంది. హుకుంపేట, న్యూస్లైన్ : క్యాబేజీ పంట ఎంతగా లాభాలను తెచ్చిపెడుతుందో అంతగా చీడపీడలకు గురవుతుంది. దీనికి పెట్టుబడులు అంతగా అవసరం లేదు. ఏజెన్సీ రైతులు ఎలాంటి రసాయన ఎరువులూ వినియోగించకుండానే పూర్తిగా స్వాభావిక సాగుతోనే పండిస్తారు. అయినా దీనికి పురుగుల బెడద తప్పదు. ఈ పంటకు సస్యరక్షణే ప్రధానం. విత్తుకునే ముందు విత్తశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తనశుద్ధి చేసుకుంటే పంటకు రెక్కల పురుగు బెడదను నియంత్రించవచ్చు. ప్రధాన బెడద ఆకుపురుగు దీని ఆకు అడుగు భాగాన్ని తిని గడ్డను తొలిచి రంధ్రాలు చేసి అధికంగా నాశనం చేస్తుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు వాడిపోయినట్టు కనిపిస్తాయి. ఇవి అధికంగా ఉన్నప్పుడు ఆకులలో ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో 50 శాతం లేదా నీటిలో కరిగే డబ్ల్యూపీ కార్బరిల్ను 0.15 శాతం 3 మిల్లీ గ్రాముల మందును లీటరు నీటిలో చొప్పున కలిపి పిచికారీ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. క్యాబేజీ తొలుచు పురుగు: వీటి పిల్ల పురుగు ఆకులను చుట్టుకునేట్లుగా చేయడం లేదా కాండం లోపల రంధ్రాలు చేసి తినడానికి ఉపయోగం లేకుండా చేస్తుం ది. ఇవి గడ్డను కూడా తొలిచి రంధ్రాలు చేస్తాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా 0.05 శాతం ఎండోసల్ఫాన్ లీటరు నీటిలో క లిపి పిచికారీ చేయాలి. ఆకునల్లి పురుగు: పిల్ల పురుగులు ఆకులు కొమ్మల నుంచి రసాన్ని పీల్చడం వల్ల వడిలినట్టు కనిపించడమేకాకుండా మొక్కలు బలహీనమవుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు: ఇవి ఆకు అడుగు భాగంలో ఉండి ఆకులు ముడుచుకునేటట్లు చేసి పత్రహరితాన్ని తినేసి ఈనెను మాత్రం మిగుల్చుతాయి. ఈ పురుగులు పువ్వులను గడ్డలను కూడా ఆశిస్తాయి. వీటి నివారణకు 0.04 శాతం మోనోక్రోటోఫాస్1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పైరు చల్లాలి. ఆకుపచ్చ దాసరి పురుగు : ఇది ఆకులకు రంధ్రాలు చేయడమే కాక ఆకులలో ఈనెలు మాత్రమే మిగిల్చి నాశనం చేస్తుంది. ఈ పురుగు నివారణకు 0.05 శాతం క్వినాల్ ఫాస్ 2 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు : ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. ఇవి ఆకులను, చిగుళ్లను తింటాయి. చిన్న లద్దె పు రుగులు ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థం తినేసి ఈనెలను మాత్రం మిగులుస్తాయి. తదుపరి వె డల్పాటి ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఈ పురుగు నివారణకు గడ్డ ఏర్పడే ముం దు 0.05 శాతం కార్బరిల్ 3 గ్రా ముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందులు అందుబాటులో లేవు నాది హుకుంపేట మండలం చీకటిపుట్టు. అర ఎకరా భూమిలో క్యాబేజీ పంట చేపట్టాను. ఏటా సులభంగా చీడపీడలకు గురవుతోంది. వాటికి పురుగు మందులు పిచికారీ చేసేందుకు మందులు అందుబాటులో లేకుండా పోయాయి. ఒడిశా, విజయనగరం వెళ్లి పురుగుమందులు తెచ్చుకోవడం వల్ల ఖర్చులు అధికం అవుతున్నాయి. -వంతాల రామన్న రైతు సకాలంలో స్పందించాలి సకాలంలో స్పందించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతి ఫలం ఉంటుంది. చీడపీడల కారణంగా క్యాబేజీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడి చల్లని వాతావరణం క్యాబేజీకి ఎంత అనుకూలమో, చలిగాలుల వల్ల తెగుళ్లు కూడా అదేవిధంగా వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంది. -చిట్టిబాబు, ఐటీడీఏ పీహెచ్వో, పాడేరు అధికారులు సహకరించాలి నాది హుకుంపేట మండలం బొడ్డాపుట్టు. ఎకరా భూమిలో పంటను చేపట్టాను. అధికారులు సహకారం లేకపోవడంతో ఏ తెగులుకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గ్రామంలో సిబ్బంది పర్యటించి తగిన సకాలంలో తగిన సూచనలు సలహాలు అందిస్తే బాగుంటుంది. - పి. బాబురావు, రైతు