emcet-2
-
మంత్రుల దిష్టిబొమ్మ దహనం
కందుకూరు: ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేవైఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్చారి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-2 పేపర్ రద్దు విషయంలో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తుందని విమర్శించారు. అహర్నిశలు శ్రమించి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నిరాశకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 కోట్ల ఒప్పందంతో లీకేజీ వ్యవహారం జరిగిందని, దీనికి విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రులు బాధ్యత వహించాలని ఆయన మండిపడ్డారు. వారి కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాధ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శులు నల్లబోలు నర్సింహారెడ్డి, దయ్యాల యాదగిరి, బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శులు ఎల్లపల్లి లింగంయాదవ్, కళ్లెం సుధాకర్రెడ్డి, సీనియర్ నాయకులు మామిళ్ల అంజయ్య, గంగుల ప్రభాకర్రెడ్డి, కొంతం జంగారెడ్డి, సాధ ప్రవీణ్రెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, శ్రీశైలం, సురేష్, మహేష్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎంసెట్–2పై అయోమయం
పేపర్ లీక్పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం జిల్లానుంచి ఆరుగురు విద్యార్థుల గుర్తింపు? పరీక్షను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం రద్దు చేయాలంటున్న విద్యార్థి సంఘాలు కొందరి కోసం అందరిని బలిచేయెుద్దు ర్యాంకర్లు, వారి తల్లిదండ్రుల ఆందోళన కరీంనగర్ ఎడ్యుకేషన్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీపై సర్వత్రా ఆందోళన నెలకొంది. లీకేజీ పర్వం జిల్లా అభ్యర్థులను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీపై సీఐడీ అధికారులు కూపీలాగడంతో పెద్ద కుంభకోణం బయటపడింది. హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడితోపాటు మరికొంత మందిని లీకేజీ సూత్రధారులుగా సీఐడీ అధికారులు గుర్తించారు. వారికోసం వేట మెుదలు పెట్టారు. లీకేజీతో మెుత్తం 70 మంది విద్యార్థులకు సంబంధమున్నట్లు నిర్ధారించారు. ఇందులో మన జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులున్నట్లు తెలిసింది. లీకేజీ సూత్రధారులను ఆర్థికంగా ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులను టార్గెట్గా ఎంచుకుని వారి తల్లిదండ్రులతో అత్యంత గుట్టుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రూ.50 యాభై లక్షలకు ఒప్పందం కుదుర్చుని, ముందుగా రూ.10 లక్షల చొప్పున అడ్వాన్స్ తీసుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు సీఐడీ అధికారులు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. త్వరలోనే నిందితులందరిపైనా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంసెట్–2ను రద్దు చేయాలనే యోచనలో ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్–2 పరీక్షకు జిల్లావ్యాప్తంగా 3361 మంది దరఖాస్తు చేసుకోగా, 3076 మంది హాజరయ్యారు. 13వ తేదీన ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. కొందరికోసం అందరిని బలిచేయెుద్దు జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం రాత్రి కరీంనగర్ ప్రెస్ భవన్కు చేరుకొని బోరును విలపిస్తూ తమ గోడును మీడియా ముందు వెల్లబోసుకున్నారు. ఎంసెట్–2 రద్దు చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. యథావిదిగా కౌన్సెలింగ్ కొనసాగించాలని కోరారు. ఎవరో చేసిన తప్పిదానికి ర్యాంకర్లకు శిక్ష విధించడం సరికాదన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన 70 మంది విద్యార్థుల కోసం 50 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. రోజుకు 15 గంటలు చదివితే మంచి ర్యాంకు సాధించామని, మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఫలితం ఏవిధంగా ఉంటుందోనని ఆవేదన చెందారు. లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఎంసెట్–2లో తనకు 44 ర్యాంకు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష అంటే తన భవిష్యత్తు ఏం కావాలని ర్యాంకర్ సుష్మారెడ్డి ప్రశ్నించారు. నిద్రాహారాలు మాని కష్టపడి చదివితే మంచిర్యాంకు సాధించమన్న సంతోషం లేకుండా చేస్తున్నారని, కొందరు చేసిన తప్పిదంతో తాము శిక్ష అనుభవిస్తున్నామని మరో ర్యాంకర్ శ్రావణి అభిప్రాయపడ్డారు. తప్పుచేసిన వారిని శిక్షించకుండా ర్యాంకర్లను మానసిక అందోళనలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచిస్తూ ఎంసెట్–2ను రద్దు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. రద్దు చేయాల్సిందే.... ఎన్టీఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఎంసెట్–2ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.