Excavation works
-
కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. -
ఎండే అండ! సోలార్ విద్యుత్ దిశగా అడుగులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గొట్టా బ్యారేజీ వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సోలార్ విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లు ఖరీఫ్, రబీలో పచ్చని పైరుతో మెరవాలంటే హిరమండలం రిజర్వాయర్లో 19.05 టీఎంసీల నీటిని నింపాలి. డెడ్స్టోరేజ్లో 2.5 టీఎంసీల నీరు ఉంది. ఫ్లడ్ఫ్లో కెనాల్, కొండ చరియలు నుంచి వచ్చే నీరంతా కలిపి 4టీఎంసీలు ఉంటుంది. మిగిలిన 12 టీఎంసీల నీటిని నింపాలంటే.. ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేక గొట్టాబ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటుచేయడమే మార్గం. అయితే దీనికి వంశధార ఇంజినీర్లు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వంశధార కుడి కాలువ ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా కాలువను ఆధునీకరించేందుకు డిజైన్లు చేశారు. పాత కాలువ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా దాన్ని మరో వెయ్యి క్యూసెక్కులు అదనంగా నీరు పారేలా కాలువను 10 మీటర్లు వెడల్పు పెంచేందుకు డిజైన్ చేస్తున్నారు. కాలువ సామర్థ్యం పెంచి దానిలోంచి ఎత్తిపోసిన నీటిని హిరమండలం రిజర్వాయర్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ ఏర్పాటుకు ప్రణాళిక హిరమండలం రిజర్వాయర్లోకి 12 టీంఎంసీల నీటిని నింపేందుకు సాధారణంగా విద్యుత్ వినియోగం 45 మెగావాట్స్ అవ్వవచ్చని నిపుణులు అంచనా. అందుకు సుమారు రూ.25కోట్లు విద్యుత్ చార్జీలు అయ్యే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోయడమనేది వర్షాకాలంలో సుమారు 100 రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఎత్తిపోతల అవసరాలు పూర్తయ్యాక మిగిలిన 9 నెలల కాలంలో సోలార్ విద్యుత్ని ప్రజా అవసరాలకు పు ష్కలంగా అందించవచ్చు. దాని వల్ల వచ్చే ఆదా యంతో సోలార్ప్లాంట్ నిర్మాణ ఖర్చులు, లిఫ్ట్కి అయ్యే విద్యుత్ చార్జీలను రాబట్టుకోవచ్చనే ఓ అంచనా వేస్తున్నారు. సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద స్థలం అవసరం. హిరమండలం రిజర్వాయర్ ఫోర్షోర్, రిజర్వాయర్ గట్టు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. 45 మెగావాట్స్ విద్యుత్ తయారు చేసేందుకు కావాల్సిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకి సుమారు రూ.300కోట్లు ఖర్చు ఉండవచ్చని అంచనా. అయితే ఏటా ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ వినియోగించగా మిగిలిన రోజుల్లో వచ్చే విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చు 8 ఏళ్లలో వచ్చేస్తుంది. ప్లాంట్ నిర్మాణం కంటే రైతులకు ఏటా పండించే పంట అంతకు రెట్టింపుగా ఉంటుంది. సోలార్తో ప్రయోజనం అవసరమైన విద్యుత్ని సోలార్ నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్ లోటు తగ్గుతుంది. లిఫ్ట్ అవసరాలు తీరగా ప్రజా అవసరాలను తీర్చేందుకు అవ కాశం ఉంటుంది. గతంలో భీమవరంలో ఎస్ఈగా పనిచేసిన సమయంలో లోసరి కెనాల్పైన సోలార్ సిస్టమ్ని ఏర్పాటుచేశాం. ఇప్పటికీ విజయవంతంగానే పనిచేస్తోంది. హిరమండలం రిజర్వాయర్లో ఉన్న ఫోర్షోర్ ఏరియాలో సోలార్ సిస్టమ్ అమర్చవచ్చు. – డోల తిరుమలరావు, ఎస్ఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, శ్రీకాకుళం -
ఈ ఎంటెక్ కుర్రాడు అపరభగీరథుడు.. స్వయంగా బావిని తవ్వి
సాక్షి, బెంగళూరు: ఎంటెక్ చదివిన కుర్రాడికి సేద్యంపై మనసైంది. తానే యంత్రమై బావి తవ్వి అపరభగీరథుడిగా మారి పాతాళ గంగమ్మను పైకి తీసుకొచ్చాడు. బీదర్ జిల్లా ఔరద్ తాలూకాకు చెందిన సూర్యకాంత్ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఇంటిబాటపట్టాడు. పంటల సాగు చేసేందుకు నీటి కోసం ఒక్కడే తన పొలంలో 12 అడుగుల లోతు, 30 అడుగులు వ్యాసార్ధంతో తవ్వగా నీరు పడింది. సూర్యకాంత్ తవ్విన బావిలోని నీటిని గ్రామస్థులు తాగటానికి ఉపయోగిస్తున్నారు. చదవండి: యువతిపై యాసిడ్ దాడి.. ట్రెండింగ్లో యాసిడ్ అటాక్ -
ఒక్కరి కోసం రోడ్డు తవ్వేశారు..
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణాల్లో ఇప్పటికే పేదల ఇళ్లు మూడడుగుల లోతుకు వెళ్లిపోయాయి. పాత సీసీ రోడ్డును పగలగొట్టకుండానే కాంట్రాక్టర్లు రోడ్డుపై రోడ్డు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పేదలు కావడంతో కాంట్రాక్టర్లను ప్రశ్నించలేదని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో తమ ఇళ్లలోకి నీరొస్తుందం టూ అధికారులు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవిం చుకున్నా ప్రయోజనం కరువైంది. ఈ పరిస్థితులు సామాన్యులకు మాత్రమేనని స్పష్టమవుతోం ది. నిబంధనలకు మంగళం నగరంలోని ఉస్మాన్సాహెబ్పేట కృష్ణమందిరం వీధిలో టీడీపీ సీనియర్ నేత దగ్గు సుబ్బారావు కుమారుడి ఇంటి వద్ద ఇటీవల సీసీ రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డు ఎత్తులోకి రావడంతో టీడీపీ నేత ఇళ్లు రెండడుగుల లోతుకు వెళ్లింది. దీంతో తాము నివసిస్తున్న ఇల్లు లోతులోకి వెళ్లిందని.. రోడ్డును పగలగొడతామని కాంట్రాక్టర్ను బెదిరించారు. దీంతో రోడ్డు వేసిన వారంలోనే జేసీబీ సాయంతో గంటల వ్యవధిలో పగలగొట్టారు. టీడీపీ నేతలకు సమస్య వస్తే మాత్రం వేసిన రోడ్డును సైతం పగలగొడుతున్నారని, అయితే ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామని తెలియజేస్తే పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమందిరం వీధిలో దాదాపు 200 మీటర్ల రోడ్డును వేసి ఉండగా, టీడీపీ నేత ఇంటి వద్ద 40 మీటర్ల రోడ్డు తవ్వి తిరిగి వేయడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్కు హుకుం జారీ టీడీపీ నేతల ఇళ్ల వద్ద సీసీ రోడ్డు వేసే క్రమంలో నేతలతో చర్చించి వారి సూచనల మేరకే రోడ్డు వేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి నారాయణ హుకుం జారీ చేశారని సమాచారం. సీసీ రోడ్లు వేయడంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని వీధుల్లో ఇళ్లు మూడు నుంచి నాలుగడుగుల మేర లోతుకు వెళ్లాయి. పాత సీసీ రోడ్డును పూర్తిగా పగలకొట్టకుండా మరో సీసీ రోడ్డు వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
పెనాల్టీ పడుద్ది
సాక్షి,సిటీబ్యూరో: రోడ్లమీద చెత్త , డెబ్రిస్ వంటివి వేసినా.. బహిరంగ మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ త్వరలో.. రోడ్లను ఇష్టానుసారం తవ్వి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు ఏజెన్సీలకు సైతం పెనాల్టీలు విధించనుంది. తమ పనుల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్ఎల్), హైదరాబాద్ రోడ్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్), వాటర్ సప్లై అండ్ సివరేజి బోర్డు (జలమండలి)రోడ్లను తవ్వుతున్నాయి. వెలువడే వ్యర్థాలను ఎక్కడికక్కడ అలాగే వదిలేస్తున్నాయి. తమ పనులు ముగిశాక తిరిగి పూడ్చివేసేందుకు ఎంతో సమయం పడుతోంది. అప్పటి వరకు ఆ వ్యర్థాలు అలాగే ఉంటున్నాయి. అంతేకాదు.. పూడ్చివేతల తర్వాత సైతం వ్యర్థాలతో నగర అందం దెబ్బతింటోంది. ఓడీఎఫ్ ర్యాంకింగ్లో.. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో నగరం మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందంజలో ఉంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం నగరాన్ని అందవిహీనంగా మారుస్తున్నాయి. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరానికి వచ్చే పర్యాటకులూ పెరుగుతున్నారు. నగరంలో రోడ్ల వెంబడి ఈ వ్యర్థాలు అందవిహీనం చేస్తుండగా, వ్యర్థాలుండటంతో పారిశుధ్య చర్యలు సైతం అధ్వాన్నంగా మారుతున్నాయి. కొత్తగా వచ్చేవారెవరైనా తొలుత చూసేది రోడ్లనేనని.. వాటిని అద్దాల్లా తీర్చిదిద్దాలని భావించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆమేరకు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వ్యర్థాలను తొలగించని వారు ఎవరైనా సరే.. ప్రభుత్వ విభాగాలే అయినా సరే నగర అందాన్ని చెడగొడితే పెనాల్టీలు విధించాలని భావించారు. అలాంటి వారిని గుర్తించి రోడ్డు కటింగ్ చార్జీల అంచనాలో 10 శాతం జరిమానాగా విధించాలని భావించారు. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించారు. శనివారం జరిగే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు. కేబుల్ సంస్థలతో మరింత అధ్వానం.. పలు కేబుల్ సంస్థలు తమ అవసరాల కోసం రహదారులను తవ్వి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో రహదారి అందం మొత్తం దెబ్బతినడమే కాకుండా అది జీహెచ్ఎంసీ ఇమేజ్నూ దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పెనాల్టీ చర్యలకు సిద్ధమయ్యారు. ఉదాహరణకు రోడ్ కటింగ్లకు చ.మీ.కు రూ.800 చార్జి కాగా, ఇలా వ్యర్థాలను వదిలేస్తే అందులో పది శాతం అంటే..రూ.80 పెనాల్టీగా వసూలు చేస్తారు. హైదరాబాద్ రహదారుల్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ చర్యలని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (మెయింటనెన్స్) జియాఉద్దీన్ పేర్కొన్నారు. -
వైఎస్ హయాంలోనే వెలిగొండకు వెలుగు
* బాబు హయాంలో ఆ ప్రాజెక్టుకు గ్రహణం * తొమ్మిదేళ్ల హయంలో ఖర్చు చేసింది రూ.13.5 కోట్లే సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పరుగులు పెట్టగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి రూ. 5,150 కోట్ల అంచనా వ్యయంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 1995లోనే ప్రాజెక్టుకు అనుమతి వచ్చింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు పలుమార్లు శంకుస్థాపనలు చేశారు. ఆయన అప్పటి 9 సంవత్సరాల పాలనలో ప్రాజెక్టుకు చేసిన వ్యయం కేవలం రూ. 13.5 కోట్లే. అది కూడా చిల్లర ఖర్చు కిందే చూపించారు. నిర్మాణం కోసం చేసిన ఖర్చు దాదాపు శూన్యమే. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుకు విశేష ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఈ ప్రాజెక్టుకు రూ. 1,448.14 కోట్లు ఖర్చు చేశారు. పనులు వేగంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. అనంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాలు కూడా వైఎస్ ఒరవడినే కొనసాగించాయి. వారిద్దరి హయాంలో రూ. 2053.05 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపటే ్టనాటికి ప్రాజెక్టు పనుల్లో 63 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు బాబు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పని కేవలం 3.25 శాతమే.ప్రాజెక్టు పనుల్లో 66.25 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలను తవ్వుతున్నారు. బాబు అధికారం చేపట్టేనాటికి ఒకటో సొరంగం 6.75 కిలోమీటర్లు మిగిలిపోయి ఉండగా, ఈ రెండేళ్లకాలంలో తవ్వింది కేవలం 0.75 కిలోమీటర్లే. రెండో సొరంగం దాదాపు 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులోనూ 0.6 కిలోమీటర్లు తవ్వకం పనులు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో చేసిన ఖర్చు రూ. 500 కోట్ల లోపే. గతంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు, అదనపు ధరల చెల్లింపులకే అధిక శాతం ఇవ్వడం గమనార్హం.