The High Court Division
-
సమ్మె విరమించిన న్యాయవాదులు
హైకోర్టు విభజన కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు తమ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. హైకోర్టు విభజనపై సానుకూల సంకేతాలు కనిపించినందును సమ్మెను విరమించనున్నట్లు తెలంగాణ న్యాయవాద జేఏసీ ఛైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి విధులకు హాజరు కానున్నట్లు వివరించారు. విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారని.. అన్నారు. అయితే సమ్మె విరమణ తాత్కాలికమే అని.. సమస్య పరిష్కారం కాకపోతే.. మళ్లీ ఉద్యమించేందుకు వెనకాడమని తెలిపారు. -
‘హైకోర్టు విభజనే మన అజెండా’
-
‘హైకోర్టు విభజనే మన అజెండా’
హైకోర్టు విభజనే ప్రధాన అజెండాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యవహరించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఆయన అధికార నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సి వ్యూహాన్ని చర్చించారు. హైకోర్టు విభజనే అజెండాగా ముందుకు సాగాలని, అయితే కేంద్రం స్పందించే తీరును బట్టి ప్రణాళిక ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభ పక్ష నేత ఏపీ జితేందర్రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు. ‘రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హైకోర్టు విభజన కాలేదు.ఇంతకుముందు ఉత్తరాఖండ్, ఛ త్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 15 రోజుల్లో హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విభజన చేయాలన్నది మా డిమాండ్. కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై పార్లమెంటులో ఆందోళన ఏవిధంగా ఉండబోతోందన్న ప్రశ్నకు బదులుగా ‘మా నిరసన తెలుపుతాం. ఏవిధంగా ఉండబోతోందన్న దానిపై వ్యూహం ఖరారు చేస్తాం. వారి స్పందనను బట్టి మా వైఖరి ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజన రాష్ట్ర పరిధిలో ఉందని, కేంద్రం విధి ఏమీ లేదని గతంలో న్యాయమంత్రి చెప్పారని మీడియా ప్రస్తావించగా ‘కేంద్రం గందరగోళంలో ఉంది. న్యాయమంత్రి సబ్ జ్యుడిస్ అని చెబుతారు. మరికొందరు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ హైకోర్టు విభజన జరగాలి. అందుకు మా ఆందోళన కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు. -
కేసీఆర్ చొరవచూపాలి: దత్తాత్రేయ
హైకోర్టు విభజన విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చొరవ తీసుకోవాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉన్న లీవ్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. అలాగే న్యాయవాదుల కేటాయింపు విషయంలో చోటు చేసుకున్న సమస్యపై కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మంచి సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. బుధవారమిక్కడ బాల్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు విభజన కోసం కేంద్రం చొరవ తీసుకుంటోందని, అదే విధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. హైకోర్టు నిర్మాణం విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. తాజాగా కేంద్రహోం, న్యాయశాఖ మంత్రులను కలిసి తాజా పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. మరోసారి ఈనెల 8న న్యాయశాఖ మంత్రిని సమస్యను వివరించి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడిస్తామన్నారు. అదే విధంగా సమస్యల పరిష్కారం కోసం న్యాయాధికారులు చేసిన సమ్మె కాలాన్ని సెలవు రోజుగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 9న దత్తాత్రేయ చైనా పర్యటన హైదరాబాద్: జీ-20దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఈ నెల 9న చైనా వెళ్తున్నారు. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు సాగే సమావేశాల్లో కార్మికశాఖ అంశాలపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. -
రాష్ట్రంలో కుటుంబ పాలనకు చెక్
బోథ్ నుంచే ఉద్యమం రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి నేరడిగొండ : రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చెక్పెట్టేలా బోథ్ నుంచే ఉద్యమాన్ని చేపడుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. శనివారం నేరడిగొండలోని గార్డెన్స్లో బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అబద్దాల కుటుంబమని విమర్శించారు. నాయకుడంటే వైఎస్.రాజశేఖరరెడ్డిలా ఉండాలని, మాటపై నిలబడాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతరు కవిత, మేనల్లుడు హరీష్రావ్ అందరూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు గమ్యాలు ఉండవని, టీఆర్ఎస్ చేతిలో తెలంగాణ సమాజం మోసపోయిందని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ పాలక పక్షాన్ని గల్లీ నుంచే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా అనిల్జాదవ్ ఎన్నికవుతారని జోస్యం చెప్పారు. 33 ఏళ్ల నుంచి బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకపోవడానికి గ్రూపు విబేధాలే కారణమని, ఇక నుంచి అందరినీ కలుపుకొని పోతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన చేవేళ్ల నుంచే ప్రారంభించే వారని, ఇప్పుడు ఇక్కడికి చేవేళ్ల చెల్లమ్మగా పిలువబడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడం మన అదృష్టమని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రవీందర్రావు, గంగాభవాని, ప్రేమలత అగర్వాల్, జిల్లా నాయకులు సాజిద్ఖాన్, మల్లెపూల సత్యనారాయణ, తిరుమల్గౌడ్, రాజుయాదవ్, నేరడిగొండ సర్పంచ్ విజయలక్ష్మి, రోల్మామడ ఎంపీటీసీ తొడసం గోదావరి, కార్యకర్తలు పాల్గొన్నారు. సబితాఇంద్రారెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని సుమారు 200 మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి నిర్మల్టౌన్ : తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్లోని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి నివాస భవనంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఆందోళన చేస్తున్న న్యాయమూర్తులను సస్పెండ్ చేయడం అన్యాయమని అన్నారు. కక్షిదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా న్యాయమూర్తులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. హైకోర్టు ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదన్నారు. 10 మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందని విమర్శించారు. హైకోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్పై సాకులు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోకుండా తగిన ప్రయత్నం చేయాలన్నారు. పార్లమెంట్ను స్తంభింపజేసి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, సాద సుదర్శన్, వెంకట్రారాంరెడ్డి, సుజాత, మేర్వాన్, దినేష్, లింగారెడ్డి పాల్గొన్నారు. అంతా వైఎస్ నామస్మరణే నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కార్యకర్త నుంచి నాయకుల వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన పనులను కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, విద్యార్థులకు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, తదితర అంశాలపై ప్రస్తావించారు. వేదికపై ఉన్న నాయకులు వైఎస్ పేరు చెప్పడంతో అందరూ కరతాళ ధ్వనులు చేశారు. నాయకుడంటే వైఎస్లా ఉండాలని, ఇప్పుడు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఇప్పటికీ రుణమాఫీ సరిగా చేయలేదని వివరించారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. -
టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
'న్యాయం కోరితే సస్పెండ్ చేయడం బాధాకరం'
ఢిల్లీ: తెలంగాణ జడ్జిల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు న్యాయం చేయాలని కోరితే సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్పై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ్ లను కలుస్తామని వినోద్ చెప్పారు.