komuravelli mallanna
-
పట్నాల మల్లన్నకు పదివేల దణ్ణాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మ, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతీ యేడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. రెండు పద్దతుల్లో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమ పద్దతి ప్రకారం స్వామి వారి కళ్యాణం, మహాశివరాత్రి సందర్బంగా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. జనవరి 19 నుంచి మార్చి 24వ తేదీ వరకు తెలుగురాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్çగడ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పది ఆదివారాలు జాతర వారాలుగా నిర్వహిస్తారు. ఇదే విధంగా తెలంగాణలో ఐనవోలు, ఓదెలలో సైతం ఇదే విధంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.కొమురవెల్లి మల్లన్నకు ప్రకృతి సిద్దమైన ఐదు రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీరంగు(బుక్క గులాల్), ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు) తెల్ల పిండి (బియ్యం పిండి)ని వాడుతారు. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలక పట్నం. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం. ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం. మల్లన్నకు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి సందర్బంగా కొమురవెల్లిలోని తోట బావి దగ్గర పెద్ద పట్నం వేస్తారు. ఈ పెద్ద పట్నం 41 వరుసలతో దాదాపు 50 గజాల్లో వేస్తారు. జానపద రూపాల్లో ఒగ్గు పూజారులు కథను చెబుతూ పట్నం వేస్తారు. పట్నంలోకి మల్లికార్జునుడిని ఆహ్వానించి కల్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటిన బండారి పెట్టి కంకణాలు కట్టి ఒగ్గు పూజా కతువు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి చరిత్రను సైతం వివరిస్తుంటారు. కొందరు ఇంటి వద్ద సైతం మల్లన్న పట్నాలు వేసి ఓ పండుగ లాగ బంధువులను పిలిచి చేస్తారు.పట్నంలో ఒకే కొమ్ము ఉన్న శూలంపెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్కు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.పట్నం దాటడం....ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం పై పెట్టి పూజారులు పూజలు నిర్వహిస్తారు. తర్వాత.. శివసత్తులు పట్నం దాటుతారు.. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.– గజవెల్లి షణ్ముఖ రాజుసాక్షి, సిద్ధిపేట -
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం,అగ్నిగుండాలు తరించిన భక్తకోటి (ఫొటోలు)
-
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతిపూజ, స్వస్తివాచనం, రుద్రహోమం, అష్టోత్తర శతకళషాభిషేకం, అన్నపూజ, సహస్త్ర బిల్వార్చణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు హాజరై రుద్రహోమం, విశేష అభిషేక అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, ఆలయ ధర్మకర్తలు సౌజన్య, గిరిధర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది. ఈనెల 18న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. -
కొమురెల్లి మల్లన్నకు 6.5 కిలోల బంగారు కిరీటం
సాక్షి, సిద్దిపేట: కోర మీసాల కొమురెల్లి మల్లన్న ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వనున్నారు. రూ.4 కోట్లు ఖర్చు చేసి 6.5కిలోల బంగారంతో కిరీటం తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీలు హైదరాబాద్లో మంగళవారం సమావేశమయ్యారు. భక్తులు కానుకల రూపంలో అందించిన బంగారం, ఎస్బీఐ బాండ్ల ద్వారా వచ్చిన బంగారంతో కిరీటం తయారు చేయించేందుకు నిర్ణయించారు. దాని నమూనాను ఆవిష్కరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి సీఎం నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రులు తెలిపారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రమైన నేపథ్యంలో ఈసారి భక్తుల రాక తగ్గింది. చిరుజల్లుల కారణంగా ఆలయ పరిసరాలు చిత్తడిగా మారాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నంను ఆలయ అధికారులు రద్దు చేశారు. -
కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం
సిద్దిపేట: ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక హుండీ లెక్కింపులో కనిపించలేదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ హుండీ లెక్కింపు నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ శనివారం పరిశీలించారు. అయితే, హుండీలో ఓ భక్తురాలు మంగళసూత్రాన్ని హుండీలో వేస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీలో కనిపించగా లెక్కింపులో మాత్రం ఆ మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. -
మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
వరంగల్: వరంగల్ జిల్లా చెర్యాల మండలం కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కొమరవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరుపున ఆయన పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కొమరవెల్లి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం హెలికాప్టర్ లో కొమరవెల్లి చేరుకున్నారు. కేసీఆర్ కు పార్టీ నేతలు, నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.