Mother Language Day
-
Hong kong: హాంకాంగ్లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది. ఈ దినోత్సవం భాషా వైవిధ్యం మరియు బహుభాషావాదం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, హాంకాంగ్లోని వివిధ భాషా సమాజాల నుండి ప్రతినిధులు మరియు అతిథులు పాల్గొన్నారు. వివిధ భాషలలో కవితలు, కథలు, ప్రదర్శనలు, పాటలు మరియు జానపద నృత్యాలు పంచుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భాషలలో కాంటోనీస్, కుర్దిష్, బంగ్లా, మరాఠీ, రొమేనియన్, కన్నడ, సంస్కృతం, హిందీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ మరియు నేపాలీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వీరే.. 1.మిస్టర్ యూజీన్ ఫాంగ్, పార్టనర్షిప్ ఎంగేజ్మెంట్ చైర్ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్2. మిస్టర్ మార్కో క్వాంగ్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్, యునెస్కో HK అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్3. మిస్టర్ అష్ఫాకుర్ రెహమాన్, బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షుడు4 శ్రీమతి రీటా గురుంగ్, హాంకాంగ్ నేపాల్ ఫెడరేషన్ చైర్పర్సన్5. మిస్టర్ మెసుట్ టెమెల్, ఆంటోలియా కల్చరల్ అండ్ డైలాగ్ సెంటర్ చైర్మన్6. మిస్టర్ థాపా చురా బహదూర్, సర్ ఎల్లిస్ కడూరీ సెకండరీ స్కూల్ (వెస్ట్ కౌలూన్)లో NET టీచర్, టీచర్/రచయిత/రచయితమిస్టర్.7. తిరుపతి నాచియప్పన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ & మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్ సహ-చైర్.బాంగ్లాదేశ్ అసోసియేషన్ అఫ్ హంగ్ కాంగ్ ప్రతి సంవత్సరం 1952లో మాతృభాష పవిత్రతను, గుర్తింపును కాపాడే పోరాటంలో అంతిమ త్యాగం చేసిన భాషా అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ 21 ఫిబ్రవరి ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. యునెస్కో వారి గ్లోకల్ పీస్ సెంటర్ కార్యకర్త శ్రీ తిరునాచ్ నాచియప్పన్ గారి సహాయ సహకారాలను మరియు ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ది హంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు , ఈ కార్యక్రమ రూపకర్తగా మాట్లాడుతూ, హంగ్ కాంగ్ లో మొదటి సారిగా తమ సంస్థ మాత్రమే 2021 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకి, పిల్లలకు వారి తల్లి తండ్రులకు, గౌరవ్ అతిథులకు మరియు నిర్వహణ లో సహకరించిన వారందరికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు. -
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
మదనపల్లె సిటీ : మనకు ఎన్ని భాషలు తెలిసినా మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగేది ఒక్క మాతృభాషలోనే. అలాంటి కమ్మనైన అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగానే వారి వారి మాతృభాషల పరిరక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలు కనుమరుగు కాకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా యునెస్కో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. నాటి నుంచి వారి వారి మాతృభాషలను గౌరవించుకుంటున్నారు. కనీసం 30 శాతం మంది వారి మాతృభాషలను నేర్చుకోకపోయినా.. మాట్లాడకపోయినా ఆ భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరించింది. గతం.. ఎంతో ఘనం రాజులు, నవాబుల పరిపాలనలో రాజ్యమేలిన భాషలు తెలుగు, ఉర్దూ. ఈ భాషలు రానురాను ప్రాభవం కోల్పోతున్నాయి. నేడు పాలనలో, పాఠశాలల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ మాతృభాషలు అటు తెలుగు, ఇటు ఉర్దూ అమలు అరకొరగానే ఉంది. తెలుగు వెలుగు కోసం.. తెలుగు వెలుగు కోసం పాలకులు చొరవ చూపాలని తెలుగు భాషాభిమానులు సూచిస్తున్నారు. తెలుగుభాషా రక్షణ, భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను నిధులు, విధులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.మాతృభాషల అభివృద్ధికి ఇలా చేయాలి.. రాష్ట్ర స్థాయిలో అధికార భాష, ద్వితీయ అధికార భాష అయిన తెలుగు, ఉర్దూలను నిర్బంధంగా అమలు చేయాలి. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కూడా జరగాలి. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి శాశ్వత భవనం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తెలుగు, ఉర్దూభాషాభివృద్ధికి వినియోగించాలి. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషలను నిర్బంధంగా అమలు చేస్తూ ప్రాథమిక స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. తెలుగు, ఉర్దూ అకాడమీలను, అధికారభాషా సంఘాలకు అధికారులు, నిధులు, విధులు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించి భాషాభివృద్ధికి కృషి చేయాలి. పోటీ పరీక్షలన్నింటినీ ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ మాధ్యమ అభ్యర్థులకు 5 శాతం అదనపు మార్కులు కలిపి ప్రశ్నాపత్రాలను తెలుగు, ఉర్దూలో కూడా ఇవ్వాలి. జాతి మనుగడకు భాషే ఆధారం అమ్మ ఉగ్గుపాలతో నేర్చుకు న్న భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తెలుగువారైన మనందరిపైనా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు మన తెలుగుభాష ను అందించాలి. ఒక జాతి మనుగడ, వారు మాట్లా డే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. తెలుగుభాషాభివృద్ధిలో భాగంగా ఏర్పాటైన తెలుగు అకాడమీలను బలోపేతం చేయాలి. – టీఎస్ఏ కృష్ణమూర్తి,ప్రముఖ నవలా రచయిత, మదనపల్లె.అందరి బాధ్యత అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమిష్టిగా మాతృభాషాభివృద్ధికి చొరవ చూపాలి. – వీఎం నాగరాజు, మరసం సభ్యులు, మదనపల్లె.తల్లిదండ్రుల పాత్ర కీలకం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుదకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు. – అంజలి, ఉపాధ్యాయురాలు, మదనపల్లె. -
Telangana: ఆ కవుల గురించి మీకు తెలుసా?
'ఎంతో మంది చనిపోతున్నారు అందులో కొద్ది మంది మాత్రమే తమలోని అధ్బుతమైన ఆలోచనలు ఈ లోకానికి పంచిపోతున్నారు ' అంటాడు టాడ్ హెన్రీ (Die Empty ) తమ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టనష్టాలైనా భరించి అలా సమాధిలోకి వెళ్ళడానికి ముందే రచనల ద్వారా తమలోని ప్రతిభా ఉత్పత్తులను పంచిపోయిన కవులు రచయితలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. వేల సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఈనాటికీ ఆ సాహిత్యం నిలిచివున్నా వారి జ్ఞాపకాలే చెదిరిపోతున్నాయి,వారి సమాధులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కన్నడ ఆదికవి అనిపించుకున్న పంప ( 902-975 AD) అంతటి కవి సమాధి నిజామాబాదు బోధన్లో నామమాత్రంగా మిగిలిపోయింది. తెలుగు ఆదికవి అంటున్న నన్నయ కాలానికే చెందినవాడుగా, కరీంనగర్ వేములవాడ ప్రాంతీయుడుగా భావిస్తున్న చాటుపద్య కవి వేములవాడ భీమకవికి అక్కడ చిన్న స్మారకం కూడా పెట్టకుండా చాటుకే ఉంచేసారు. కాకతీయుల కాలంనాటి శాసనకవి నగునూరు పాలకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించిన వెల్లంకి గంగాధరుడిని పట్టించుకున్న వారే లేరు. తెలుగులో తొలి వచన కావ్యకర్త, వచన సంకీర్తనా వాంజ్ఞయానికి మూలపురుషుడు అనిపించుకున్న సింహగిరి వచనాల కృష్ణమాచార్య సంతూరు తెలంగాణ వాడే అయినా ఆయన పేరిట ఏదీ ఎక్కడా లేదు. మహా పండితుడు,సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రసిద్ధుడైన కోలాచలం మల్లినాధ సూరి (14వ శతాబ్దం) మెదక్ జిల్లా కొలిచెలమ /కొల్చారం వాడే అయినా ఆయనను తలుచుకునే పని ప్రభుత్వం చేసింది లేదు. భాగవతకర్త పోతన అంతటి మహానుభావుడికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో బమ్మెరలో తలపెట్టిన 'పోతన స్మృతివనం' రూపురేఖలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళివచ్చిన సాహితీ మిత్రుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు వాపోయారు. తుమ్మూరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన పూర్వకవి, పోతనామాత్యుని శిష్యుడు, భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను రచించిన వెలిగందుల నారయకవి స్మారకం వంటిదేదీ ఆ గ్రామంలో ఈనాటికీ లేదని వారు చెబుతుంటే అశ్చర్యం వేసింది. ప్రతియేటా మాతృభాషా దినోత్సవాలు మొక్కుబడిగా జరపడం కాదు ఆ భాషను నిలబెట్టడానికి తమ ప్రాణాలను దారపోసిన కవులు రచయితలను తలుచుకోవడం అవసరం. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
ఏఈఎస్ జనక్పురి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: జనక్పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రకమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిత విద్యార్థులందరికీ ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో వేడుకలు ఆరంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని భాషల వారు తమ మాతృభాషను చూసి గర్వించాలని, ఇతర భాషలను కించపరచరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీవైష్ణవి తెలుగులో అనర్ఘళంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. 10 వ తరగతి విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, తెలుగు ఉపాధ్యాయులు పాడిన మా తెలుగుతల్లికి మల్లెపూదండపాటకు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. పాఠశాలలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు తమ తమ మాతృభాషల్లో ప్రసంగించారు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి తెలుగు ఉపాధ్యాయుడు టి. లక్ష్మీనారాయణ, హిందీ ఉపాధ్యాయిని రూపేశ్వరి, ఆంగ్ల ఉపాధ్యాయిని ప్రసన్న లక్ష్మి మూడు భాషల గొప్పదనాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెండోతరగతి విద్యార్థిని సాయినందిని చక్కని తెలుగు పాటపాడి వినిపించింది. తెలుగు భాషేతరులైన విద్యార్థులు తెలుగు పద్యాలు చదివి వినిపించారు. తెలుగు విద్యార్థులు తెలుగు భాష ప్రాశస్త్యాన్ని , తెలుగుపై మక్కువను తమ కవితల ద్వారా చాటారు. హిందీ మాతృభాషగా కలిగిన విద్యార్థులు తెలుగులో మాట్లాడడంద్వారా ఏ భాష నేర్చుకోవాలన్నా శ్రద్ధాసక్తులు ఉంటే సరిపోతుందనే విషయాన్ని నిరూపించారు.