-
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
సరిహద్దులో పాక్ బరితెగింపు.. తిప్పికొట్టిన భారత్
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా పాక్ దుశ్చర్యలను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. భారత సైనిక పోస్ట్లను లక్ష్యంగా చేసుకుని దాయాది కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద పాకిస్థాన్ సైన్యం మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. పూంచ్ సెక్టార్ ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ చనిపోగా, మరో సైనికుడు గాయపడ్డాడు. పాక్ సైన్యం కాల్పుల్లో గాయపడిన సైనికులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. అటువైపున కూడా ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పాక్ కవ్వింపు చర్యలకు గట్టి జవాబిస్తోంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కేవలం తొమ్మిది నెలల్లోనే 3,600 సార్లు కాల్పులకు తెగబడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందానికి పాకిస్థాన్ తరుచూ తూట్లు పొడుస్తూనే ఉంది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత నుంచి దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులను దేశంలోకి పంపి విధ్వంసం సృష్టించేందుకు దాయాది చేయని ప్రయత్నం లేదు. అయితే, వీటిని సైనికులు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. (చదవండి : బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!) -
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
నాగావ్: గౌహతి నుంచి ఈటానగర్ కు బయలు దేరిన ఎమ్ ఐ 17 హెలికాప్టర్ అత్యవసరంగా అసోంలోని నాగావ్ లో ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ నుంచి ఇంధనం లీకవుతుండటం పైలట్ గుర్తించిడమే ఇందుకు కారణం. ఇందులో ఇద్దరు ప్రయాణీకులతో పాటు ఆరుగురు స్కైవన్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఉన్నారు. స్కైవన్ ఎయిర్ వేస్ సంస్థ గౌహతి నుంచి ఈటానగర్ కు 290 కి.మీ మేర సర్వీసును అందిస్తుంది. 2011 ఏప్రిల్ లో ఎమ్ ఐ-17 హెలికాప్టర్ తవాంగ్ లో ప్రమాదానికి గురైంది. ఇందులో 17 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి ప్రయాణీకులను తరలింరాదని ఈ సర్వీసులపై డీజీసీఏ నిషేధం విధించింది. అరుణాచల్ ప్రదేశ్ దివంగత సీఎం దోర్జీ ఖండూ సైతం చాపర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలో వాతావరణం ఆకాశ ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. -
మాజీ సీఎంకు గాయాలు
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న కారు నాగాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. నిలిపివుంచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రపుల్లకుమార్ కుమారుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు. వీరందరినీ నాగాన్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని సన్నిహితులు తెలిపారు. ప్రపుల్ల కుమార్... గువాహటి నుంచి తన నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడి కాలేదు. -
అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి
అసోం: అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం అసోంలోని నగాన్ లో చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. అసోం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లక్ష్మీపూర్ జిల్లా నుంచి గౌహతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు.