National Girls Day
-
లేత వయసు.. వినని మనసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్లైన్ సైట్లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ వంటి సైట్లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.⇒ సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్లో పోస్ట్లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు. బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్కు, కాలేజ్కు, ట్యూషన్కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి.. బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్ఫోన్లే. చిన్నపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం, ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. – బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్నగర్ సీఐ -
National Girl Child Day 2025 : అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే నేడు బాలికల ఎదుగుదల బాగుండాలి. అందుకు తగిన పోషకాహారాన్ని అందించడంతో పాటు, అవగాహన కలిగించడం ముఖ్యమని యునిసెఫ్ తన నివేదికల ద్వారా స్పష్టం చేస్తోంది. 2025లో పిల్లల్లో ఎదుగుదల లోపాలను 60 శాతానికి పైగా తగ్గించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం. అందుకు అనుగుణంగా మనం పని చేయడానికి కొన్ని మార్గదర్శకాలు...ఎదిగే వయసులో అమ్మాయిల ఎముకల బలానికి క్యాల్షియం, రక్తవృద్ధికి ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం అవసరం. ఎదుగుదల ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. చంటిపిల్లల వయసులో, ప్యూబర్టీకి ముందు, ప్యూబర్టీ తర్వాత అంటూ దశలను విభజించుకోవాలి. 21 సంవత్సరాల వరకు ఐరన్,ప్రొటీన్లు, విటమిన్లు గల సమతుల ఆహారం ఉండాలి. అయితే, అమ్మాయిలు సన్నగా ఉండాలనే ఆలోచన ప్యూబర్టీకి ముందు నుంచే ఆలోచన చేస్తున్నారు. చాలా సన్నగా ఉండటమే ఆరోగ్యం, అందం అని కూడా అనుకుంటున్నారు. దీంతో ఆహారాన్ని సరిగా తీసుకోక΄ోవడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటప్పుడు అమ్మాయిలను వారి తల్లిదండ్రులు గైడ్ చేయాలి.అవగాహన పాఠాలు...∙వయసుకు తగిన విధంగా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేదానిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి, పిల్లల ఆలోచనలను ఉన్నతంగా మార్చగలగాలి.చైల్డ్ ఫుడ్కు సంబంధించిన క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి. అవి పిల్లలను ఆకట్టుకునేలా వినోదంగా కూడా పిల్లలకు పరిచయం చేయవచ్చు.పిల్లల ప్రపంచంలోకి సోషల్ మీడియా అమితంగా వచ్చేసింది. వీడియోల్లో వచ్చే జంక్ ఫుడ్, యాడ్స్, ఇతర ఫుడ్స్కు సంబంధించిన సమాచారం కూడా వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. ఇలాంటప్పుడు మంచి–చెడులను ఇంట్లో వారు, స్కూల్లో టీచర్లూ చెబుతూ ఉండాలి.ఆహారంలో ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు, సమృద్ధిగా లభించే నువ్వులు, నట్స్, గుడ్లు, ఆకుకూరలు, బొప్పాయి, పప్పుదినుసులు, చేపలు, మాంసం వంటివి చేర్చాలి. గ్రోత్ చార్ట్స్ మార్కెట్లో లభిస్తాయి. పుట్టిన నాటి నుంచి వయసును బట్టి ఎత్తుకు తగిన బరువు ఎలా ఉందో చెక్ చేసుకుని ఈ గ్రోత్ చార్ట్ను అనుసరిస్తూ వారి ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావచ్చు. డా.జానకి, న్యూట్రిషనిస్ట్ – నిర్మలారెడ్డి -
బాలికలకు ఏదీ భరోసా!?
‘నవరత్నాల’తోపాటు అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాలికలకు ఎంతో భరోసా కల్పించింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతోపాటు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలుచేసి తద్వారా బాలికా వికాసానికి వైఎస్ జగన్ సర్కారు ఎంతో తోడ్పాటునందించింది. విద్య, వైద్యం, రక్షణ, సంక్షేమం తదితర విషయాల్లో వారి కోసం ఆయన అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కనీసం ఎన్నికల్లో హామీ ఇచి్చన తల్లికి వందనం పథకాన్ని సైతం అమలుచేయకపోగా ఉన్న పథకాలను కూడా నీరుగారుస్తోంది. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బాలికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామగా కొండంత అండగా నిలిచారు. తన హయాంలో వారికి అనేక పథకాలను అందించి పెద్ద మనస్సు చాటుకునే వారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్), సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్)ను సమర్థవంతంగా అమలుచేశారు. మైదాన ప్రాంతంలో 47,287 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, గిరిజన ప్రాంతంలోని 8,320 అంగన్వాడీల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ను పటిష్టంగా అమలుచేశారు. రాష్ట్రంలో మొత్తం 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సేవలను, నర్సరీ విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్క బాలికలకే కాకుండా బాలురు, గర్భిణులు, బాలింతలు కలిపి 35 లక్షల మందికి క్రమం తప్పకుండా పౌష్టికాహార కిట్లను అందించి వారిలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టారు. ‘దిశ’తో ఆడబిడ్డలకు రక్షణ.. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దిశ బిల్లును తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంతోపాటు దోషులకు త్వరితగతిన శిక్షపడేలా చేసింది. ఈ యాప్ ద్వారా ఆపదలో ఉన్న ఆడపిల్లలు సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి ఆదుకున్న ఘటనలు కోకొల్లలు. దిశ పోలీస్స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్థానాలు, వన్స్టాప్ కేంద్రాలు సైతం ఏర్పాటుచేసింది. సైబర్ నేరాల కట్టడికి 9121211100 వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచి్చంది. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో 9071666667 వాట్సాప్ నెంబర్నూ ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 5,651 మంది బాలికలను రక్షించారు. బాల్య వివాహాలకు చెక్.. పేద తల్లిదండ్రులకు తమ బిడ్డ పెళ్లి భారం కాకూడదనే పెద్ద మనçస్సుతో అందించిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకంలో ఆడపిల్లకు కనీసం 18 ఏళ్లు, ఉండాలనే నిబంధన పెట్టింది బాల్య వివాహాలను నిరోధించేందుకే. దీంతోపాటు.. కనీసం పదవ తరగతి చదివి ఉండాలనే నిబంధనవల్ల బాలికలను ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రోత్సహించినట్లైంది. దీంతోపాటు బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ కూడా అమలుచేశారు. సమర్థంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ అమలు.. కేంద్ర ప్రభుత్వం అందించిన మిషన్ వాత్సల్య పథకంలో పిల్లల సమగ్రాభివృద్ధికి, వారి రక్షణ, మౌలిక సదుపాయాల కోసం జువెనైల్జస్టిస్ (కేర్–ప్రొటెక్షన్) యాక్ట్ను సమర్థవంతంగా అమలుచేసింది. వారి సహాయానికి 1981, 1098 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ సెంటర్లు సేవలు అందించాయి. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ శిశువుల హత్యలను నివారించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఆడపిల్లల పట్ల కూటమి నిర్లక్ష్యం.. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, గత ప్రభుత్వం అమలుచేసిన కొన్ని పథకాలు అమలుచేయడం మినహా కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలుచేయలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. నాప్కిన్స్ పంపిణీని అటకెక్కించింది. ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వం అందించిన పథకాలను అరకొరగానే కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బాలికా విద్యను, ఆరోగ్యాన్ని, రక్షణను గాలికొదిలేసింది.విద్యలో బాలికలకు ప్రాధాన్యం..రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల విద్యను ప్రోత్సహించి వారి డ్రాపౌట్స్ను నిరోధించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. » అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలోనే నూతనోధ్యయాన్ని సృష్టించింది. పేద పిల్లల చదువు కోసం ఏటా రూ.15 వేలు అందించి బాలికల విద్యను ప్రోత్సహించింది. » నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి వారి ఇబ్బందులను తొలగించింది. » ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే 7వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) చదివే యుక్తవయస్సు బాలికలు దాదాపు 10 లక్షల మందికి ‘స్వేచ్చ’ పథకంలో ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందించింది. -
కంటిపాపలకు కనురెప్పలా...
‘స్వావలంబన దిశగా భవిష్యత్’ అనే థీమ్ను నిర్ణయించారు. నేటి బాలికలు భద్రంగా ఉంటేనే భవిష్యత్ సాధికారత సాధ్యమవుతుంది! ఆ భద్రతే నేడు అతి పెద్ద సమస్య! సమస్య ఆలోచనలను రేకెత్తిస్తుంది.. వినూత్న ఆవిష్కరణలు ఆకారం దాల్చేలా చేస్తుంది!అలాంటి యువ ఆవిష్కర్తలనే ఇక్కడ పరిచయం చేయబోతున్నాం.. ఆడపిల్లల భద్రత కోసం వారు రూ΄పొందించిన డివైజెస్తో!గణేశ్ రూరల్ ఇన్నోవేటర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అయిదు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ను సాధించాడు. గణేశ్ ఘనత గురించి తన ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. కట్టెల΄పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు ఆ ΄పొగను తట్టుకోలేకపోతున్న అమ్మ అవస్థను చూసి ఆమె కోసం తన పదకొండేళ్ల వయసులోనే హ్యాండ్ ఫ్యాన్ తయారు చేసి ఇచ్చాడు. ఆనాడు మొదలైన ఆ ప్రస్థానం నేడు 30కి పైగా ఆవిష్కరణలకు చేరుకుంది. అందులోదే బాలికల భద్రత కోసం రూ΄పొందించిన సంస్కార్ టాయ్. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటే వారిని ముట్టుకునే చెప్పాల్సి వస్తోంది. వారిని తాకకుండా.. దూరంగానే ఉంటూ చెప్పడమెలా అన్న అతని ఆలోచనకు పరిష్కారమే ‘సంస్కార్ టాయ్’. దీనిపేరు ఆద్య. ఇది మాట్లాడే బొమ్మ. ఆద్యను ఛాతీ ప్రాంతంలో తాకామనుకో.. ‘అక్కడ తాకకూడదు’ అంటూ హెచ్చరిస్తుంది. ఇలా శరీరంలో ఏ స్పర్శ తప్పో.. ఏ స్పర్శ భద్రమో.. ఆద్యను టచ్ చేస్తూ తెలుసుకోవచ్చన్నమాట. భద్రమైన చోట కూడా తాకడం నచ్చకపోతే ఐ మే నాట్ లైక్ అని చెప్పచ్చని చెబుతుంది. అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెబుతుంది.హెల్ప్లైన్ నంబర్లను వల్లె వేస్తుంది. సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ హాని గురించీ హెచ్చరిస్తుంది.‘సంస్కార్ టాయ్’ లో బాయ్ వర్షన్ కూడా ఉంది. పేరు ఆదిత్య. అబ్బాయిలకూ అవన్నీ చెబుతుంది. అదనంగా ఆడపిల్లలతో ఎలా మెసలుకోవాలో కూడా చెబుతుంది. అంతేకాదు చూపు, వినికిడి లోపాలున్న పిల్లలకూ సంస్కార్ టాయ్ ఉంది. చూపు లోపం ఉన్నవారికి వైబ్రేట్ అవుతూ టీచ్ చేస్తే, వినికిడి లోపం ఉన్న వాళ్లకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్స్తో బోధిస్తుంది. గణేశ్ ఈ బొమ్మను రూపొందించిన (2021) నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది, ఉత్తరాది కలుపుకుని మొత్తం అయిదు రాష్ట్రాల్లో, 65 వేల మంది విద్యార్థులకు భద్రత మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని స్కూల్స్కి ఉచితం గానే సేవలందించాడు. త్వరలోనే ఎల్ఎల్ఎమ్ మాడ్యూల్స్తో అప్డేట్ అవుతూ ‘సంస్కార్ 2.0’పేరుతో హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నాడు. ఇది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించి నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. ఇన్నోవేటివ్ మైండ్సెట్ ఉన్నవాళ్లకు ఓ ΄్లాట్ఫామ్ తయారు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకే ‘సంస్కార్ ఎలక్ట్రానిక్స్’ అనే స్టార్టప్ పెట్టాను. సామాజిక బాధ్యతే నా ప్రధాన ఆశయం! ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. సంస్కార్ టాయ్ తయారు చేయడానికి సైకాలజిస్ట్స్, సైకియాట్రిస్ట్స్, పిల్లల హక్కులు – భద్రత కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు వంటి వాళ్లందరినీ కలిసి, రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్ను తయారు చేసుకున్నాం. మళ్లీ దాన్ని వాళ్లందరికీ చూపించి.. ఓకే అనుకున్నాకే టాయ్ని డెవలప్ చేశాం’ అని సంస్కార్ టాయ్ వెనకున్న తన శ్రమను వివరించాడు గణేశ్.సంస్కార్ టాయ్ఆవిష్కర్త: యాకర గణేశ్, వయసు: 25 ఏళ్లు, ఊరు: వరంగల్ జిల్లా, నందనం గ్రామం, తెలంగాణ!తల్లిదండ్రులు: స్వరూప, చంద్రయ్య. వ్యవసాయ కూలీలు. ఇంకా.. తెలంగాణ, వికారాబాద్కు చెందిన సానియా అంజుమ్.. ఆడపిల్లల భద్రతకు ‘షీ (ఫర్ అజ్)’ అనే వినూత్న ఆలోచన చేసింది. పీరియడ్స్ టైమ్లో ఆడపిల్లల అవసరాలను తీర్చే అన్ని ఎక్విప్మెంట్స్తో ప్రతి స్కూల్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయాలనేదే‘ షీ’ కాన్సెప్ట్. మంచిచెడులను గైడ్ చేయడానికి, ధైర్యం కోల్పోకుండా అమ్మాయిలను మోటివేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్తో కలిపిన ఒక బృందం, అలాగే క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ విజిట్స్ను ఏర్పాటుచేయాలనేది ‘షీ’ ఉద్దేశం! హైదరాబాద్కు చెందిన హరీష్ గాడీ అనే అబ్బాయి.. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బ్యాంగిల్ని తయారుచేశాడు. ఇది మామూలు గాజునే పోలి ఉంటుంది. దీన్ని వేసుకుంటే.. దాడి చేసిన వాళ్లకు ఆ గాజు తగిలి షాక్నిస్తుంది. అంతేకాదు అందులో ఫీడ్ అయి ఉన్న నంబర్లకు మీరున్న లొకేషన్ కూడా వెళ్తుంది. దీన్ని కనిపెట్టినందుకు హరీష్కి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ (2019) లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆదిలాబాద్కు చెందిన ఎ. సాయి తేజస్వి ‘గర్ల్ సేఫ్టీ డివైస్’ను కనిపెట్టింది. చాలా తేలికగా ఉండే ఈ పరికరాన్ని కాలికి కట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కేయాలి. ఎమర్జెన్సీ టైమ్లో యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని టచ్ చేసిన వాళ్లకు షాక్నిస్తుంది. దాంతో దుండగులు మిమ్మల్ని ముట్టుకునే సాహసం చేయరు. సికింద్రాబాద్కు చెందిన వైష్ణవి చౌధరీ, మనోజ్ఞ సిద్ధాంతపు, నక్షత్ర పసుమర్తి.. ఈ ముగ్గురూ కలిసి ‘మహిళా సురక్షా బ్యాండ్’ను తయారుచేశారు. ఇది కూడా ఎవరైనా మీ మీద దాడికి పాల్పడితే వాళ్లకు షాక్నిస్తుంది. పెద్దగా డేంజర్ అలారమ్ని మోగిస్తుంది. మీరు ఆపదలో ఉన్న సందేశంతోపాటు మీ లొకేషన్నీ అందులో ఫీడైన నంబర్లకు షేర్ చేస్తుంది. ఈ డివైస్ చూడ్డానికి స్టయిలిష్గానూ ఉంటుంది. ఇలా అమ్మాయిల భద్రత కోసం యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మహిళల సాధికారతకు మద్దతునిస్తోంది. బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు→ గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. → అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూ ప్రోత్సహిస్తోంది. → ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. → గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! → ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. → బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ఆవిష్కర్త: ఎస్. పూజ, చదువు: బీటెక్ సెకండియర్, ఊరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు, తెలంగాణ. తల్లిదండ్రులు: సుమిత్ర (గృహిణి), రమేశ్ (బైక్ మెకానిక్). వయసుతో సంబంధం లేకుండా స్త్రీల మీద జరుగుతున్న దాడులు, వాళ్లకు భద్రత, రక్షణ లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చదువుకు దూరమవడం వంటివన్నీ వినీ, చూíసీ చలించిపోయింది పూజ. తనకు చేతనైనంతలో ఆ సమస్యకో పరిష్కారం కనిపెట్టాలనుకుంది. అదే ‘విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్!’ ఇదెలా పనిచేస్తుందంటే.. జడకు మామూలు రబ్బర్ బ్యాండ్ని ఎలా పెట్టుకుంటారో దీన్నీ అలాగే పెట్టుకోవాలి. ఆపద ఎదురైనప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ను నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఆ శబ్దానికి భయపడి ఈవ్టీజర్స్, దుండగులు పారిపోతారు. ఒకవేళ వాళ్లు వెళ్లకుండా ఇంకా ఇబ్బంది పెడుతుంటే.. ఆ బ్యాండ్ ను మరొకసారి నొక్కాలి. అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న షీ టీమ్ ఆఫీస్కి ‘ఆపదలో ఉన్నాను.. రక్షించండి..’అన్న వాయిస్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు, మీరున్న లైవ్ లొకేషన్నూ చూపిస్తుంది. వాటి ఆధారంగా షీ టీమ్ అలర్ట్ అయ్యి రక్షిస్తారు. ‘సమాజంలో అమ్మాయిలకు భద్రత, రక్షణ లేక వాళ్లు చాలా రంగాల్లోకి అడుగుపెట్టలేక పోతున్నారు. శక్తిసామర్థ్యాలున్నా రాణించలేకపోతున్నారు. ఆమె లక్ష్యానికి భద్రత, రక్షణలేములు ఆటంకాలు కాకూడదు అనిపించి ఈ హెయిర్ రబ్బర్ బ్యాండ్ను తయారు చేశాను’ అని చెబుతుంది పూజ.బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు∙గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. ∙అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూప్రోత్సహిస్తోంది. ∙ ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. ∙ గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! ∙ ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. ∙ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.– సరస్వతి రమ -
దేశంలో ప్రస్తుతం లింగ నిష్పత్తి ఎంతంటే..
భారత్లో ప్రతి ఏడాది జనవరి24నజాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఈ ఏడాది 16వ బాలికా దినోత్సవాన్ని దేశంలో జరుపుకుంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం దేశంలోని బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి, వారికున్న హక్కులు, సమస్యలతో ఎలా పోరాడాలి తదితరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అలాగే మహిళ సాధికారతకు పెద్దపీట వేసేలా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజునే భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాందీ ఈ రోజునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల మహిళ సాధికారతకు ఇదే అతిపెద్ద నిదర్శనం అని చాటి చెప్పేలా ఈ రోజునే జాతీయా బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జనవరి 24, 2008న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేషన్ ఫ్యామిలీ హల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)ఏం చెబుతోంది? ప్రస్తుతం బాలికల స్థితి ఎలా ఉంది తదితరాల గురించి తెలుసుకుందాం! ఎన్హెచ్ఎస్ గత నాలుగేళ్ల సర్వేలో..2015-16లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 991 మంది మహిళలు ఉండగా, 2019-21లో 1,020 మంది మహిళు మెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్త్రీల ఆయుర్దాయం కూడా గణనీయంగా మెరుగుపడింది కూడా. చెప్పాలంటే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్న ఇన్నే ఏళ్లలో నెమ్మది నెమ్మదిగా చాలా మార్పులు సంతరించుకున్నాయి కూడా. కానీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల కొంతమంది బాలికలకు విద్యా అవకాశాలు అందని ద్రాక్షలానే ఉండటం బాధకరం. నిజానికి భారతదేశంలో ఇందుకు సంబంధించిన కట్టుదిట్టమైన మంచి చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమల ఒక సవాలుగా ఉంది. ఆయా తాలుకా కేసుల్లో బాధిత బాలికలకు సత్వర న్యాయం కూడా అందడం లేదు. ఇక్కడ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ న్యాయవ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించి ఆ దిశగా వారికి న్యాయం సత్వరం అందే యత్నం చేయాల్సి ఉంది. అలాగే క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని (సీఎస్ఆర్) సమస్యను పరిష్కరించే దిశగా 2015న హర్యానాలోని పానిపట్లో ప్రధానమంత్రి బేటి బచావో బేటీ పఢావో(బీబీబీపీ)ని ప్రారంభించారు. ఇది ఇది మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం. దీనితో భ్రూణ హత్యలకు అడ్డుకట్టవేసి, వారికి విద్యా అవకాశాలు అందేలా చేయమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక రకంగా బాలికల మనుగడకు, అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అద్భుతమైన కేంద్ర పథకం ఇది. అలానే ఇలాంటి ఎన్నో బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధికి సంబంధించిన పథకాలు, స్త్రీ సంక్షేమ పథకాలు, కౌమర బాలికలు పథకం వంటివి తీసుకొచ్చింది. మహిళ సాధికారతకు, లింగ సమానత్వానికి పెద్ద పీట వేసింది. అంతేగాదు ఈ దినోత్సవం పేరుతో ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకోస్తున్నారు కూడా. అయితే లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. మహిళలు, బాలికలు జీవితాంత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. అది సమూలంగా తొలిగి దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయగలిగేతే దేశం మరింత అభివృద్ధిని సాధించనట్లే. (చదవండి: జాతీయ బాలికా దినోత్సవం 2024: ఎదగాలి.. చదవాలి!) -
National Girl Child Day 2024: మాటలు కాదు చేతలు కావాలి: ఆనంద్ మహీంద్ర
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పారిశ్రామిక వేత్త ఆనంద్ మహాంద్ర ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మాయిలకు చిన్న చేయూత దొరికితే కాలు అద్భుతాలు చేసి చూపిస్తారనే సందేశంతో ఈవీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. అద్భుత విజయాలు చిన్న సపోర్ట్, సాయం చాలు. ఇది మాటల్లోకాదు చేతల్లో అనునిత్యం ప్రతీ రోజు సాగాలి. ప్రతిరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డేనే అంటూ నాన్హి కాలీ అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోను తన అభిమానుల కోసం షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. సెజు అనే అమ్మాయి సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో పొందుపర్చింది. ఫుట్బాల్ అంటే ఇష్టమున్న సెజును టోర్నమెంట్లో ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సెజు లేకుండానే పోటీలకు వెళ్లిన జట్టు కప్పు గెల్చుకుని వస్తుంది. ఈ విజయాన్ని గ్రామస్తులంతా సంబరం చేసుకుంటారు. ఇది చూసి..తన బిడ్డ కలల్ని అడ్డుకున్నది తామేనని గుర్తిస్తారు తల్లిదండ్రులు. అంతేకాదు ఇంకెపుడూ ఆమె ఆశలకు, కలలకు అడ్డు రాకూదని నిర్ణయించుకుంటారు. ఫలితంగా సెజు పుట్బాల్ క్రీడకే కాదు.. తను పుట్టిన గడ్డకు కూడా పేరు తీసుకొస్తుంది. మహీంద్ర అండ్ మహీంద్ర ఆధ్వరంలోని నాంది ఫౌండేషన్తో పాటు, నాన్హి కాలీ ప్రాజెక్ట్ భారతదేశంలోని ప్రతి నిరుపేద బాలికా విద్య, గుర్తింపు పొందే హక్కును పొందేలా చేస్తుంది. బాలికా విద్యకు మద్దతిస్తుంది. సెజు లాగా, లక్షలాది మంది అమ్మాయిల కలలు ప్రాజెక్ట్ నాన్హి కాలీ ద్వారా కౌన్సెలింగ్, యువతులు, వారి తల్లిదండ్రులకు మద్దతిస్తుందని నాన్హి కాలీ ట్విటర్ ద్వారా తెలిపింది. A little support goes a long way! Despite her talent, Seju, a young girl, was not allowed to join her football team in a tournament. However, when the team returned, it changed everything. Watch the video to know what happened. Like Seju, the dreams of lakhs of girls are… pic.twitter.com/dQlCbsoRuP — nanhikali (@NanhiKali) January 24, 2024 -
National Girl Child Day 2024: ఎదగాలి.. చదవాలి!
ప్రతీ ఏడాది జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడటం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జాతీయ బాలికా దినోత్సవ చరిత్ర: మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 24 జనవరి 2008న జరుపుకున్నారు. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి చిహ్నంగానే మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రో జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు. ఆ తరువాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి ఇమేజ్(CSR) సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా 2015లో బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరతరాలుగా వేళ్లూనుకొని ఉన్న ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు తల్లి గర్భంలో ఉండగానే ఆడపిల్లల పట్ల వివక్ష ప్రారంభ మవుతుంది. ఇందుకు నిదర్శనమే ఆడ భ్రూణహత్యలు, శిశుహత్యలు. ఆడపిల్లను భారంగా, మగబిడ్డను ఉద్ధరించేవాడిగా పరిగణించే పరిస్థితి కుటుంబం నుంచే మొదలవుతుంది. నిర్లక్ష్యం, చిన్నచూపు బాలికల అభివృద్ధికి వారి సాంస్కృతిక సాంఘిక, ఆర్థిక, సామాజిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తోంది. లింగ అసమానతతోపాటు విద్య ,ఆరోగ్య సంరక్షణ వంటి అనేక అంశాల్లో వివక్ష, బాల్య వివాహాలు బాలికల పాలిట శాపంగా మారుతోంది. తరాలు మారుతున్నా ఈ పరిస్థితి ఇంకా సమసిపోలేదు. పైగా వెర్రితలలు వేస్తోంది. పేదరికం, బాల్య వివాహాలు ,ఇతర సామాజిక కారణాల వల్ల అసలు విద్యకే నోచుకోవడం లేదు. మరికొంతమంది చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. ఫలితంగా అది బాల్య వివాహానికి దారి తీస్తోంది. ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో మనది మూడోస్థానం. బాలికల కల ప్రతి అమ్మాయికి, ఆమె నేపథ్యం లేదా పరిస్థితితో సంబంధం లేకుండా, ఆరోగ్యసంరక్షణ, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలుండాలి.బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు. ఈ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక సంస్థలు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపు కుంటారు. సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా, హాయిగా ఎదిగే అవకాశాలు, ఎలాంటి హింస, వివక్ష, వేధింపులు లేని సమాజమే నేటి ఆడపిల్లల కల. ఈ కల పండే రోజు త్వరలోనే రావాలని, ఆశల రెక్కలు విప్పుకొని మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరమూ కోరుకుందాం. మహిళలకు అవకాశం ఇవ్వాలేగానీ, కుటుంబం, సమాజం, సంస్థల్ని చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, ఎదగనిద్దాం..చదవనిద్దాం!! ఇదే ప్రతి పౌరుడి నినాదం కావాలి.కుటుంబం, సమాజం, సంస్థల్ని దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. మన జీవితాలకు అర్థం..పరమార్థం..శాంతి.. శ్రేయస్సుతోపాటు ఎనలేని ప్రేమను అందించే బంగారు తల్లులు మన ఆడబిడ్డలు. -
అమ్మాయి ఆరోగ్యానికి ఏడు పరీక్షలు
ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి. అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి.వారికి వద్దు ఆటంకాలు. వారిపై వద్దు చిన్నచూపు.ఇదే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందేశం.అయితే యుక్త వయసుకు వచ్చిన బాలికలకు చాలామంది తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షలు చేయించరు.వైద్యనిపుణులు మాత్రం ఎదిగే వయసులోని ఆడపిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలంటున్నారు.‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కానుక ఈ ఆరోగ్య పరీక్షలే. ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లలకు శారీరకంగా ఏవో కొన్ని పోషక విలువల లోటుపాట్లు ఉండకపోవు. అయితే చాలామంది తల్లిదండ్రులు వాటిని నిర్థారణ చేసుకోరు. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే బాలికల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు, లోపాలను సరి చేసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించాలంటున్నారు వైద్య నిపుణులు. బాలికల సమగ్ర వికాసాన్ని సందేశంగా ఇచ్చే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా తప్పక ఈ పరీక్షలను చేయించడమే ఆడపిల్లలకు ఇచ్చే అసలైన కానుక అవుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ): బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (íసీబీపీ) పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. సీబీసీ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గురించి చెబుతుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సీబీపీ పరీక్ష తెలియచేస్తుంది. బాలికల్లో అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అసలు కారణం తెలియడానికి సీబీపీ చేయించడం మంచిది. ఐరన్ప్రొఫైల్: ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణంగా రక్తహీనత వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితిని (ఐరన్ లోపాన్ని) సమర్థంగా అధిగమించవచ్చు. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్: ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్ వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ బి12 జీవ క్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఆ విటమిన్ లోపం ఉంటే వైద్యుని సలహాతో దానిని పూరించే సప్లిమెంట్స్ ఇప్పించాలి. విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. శరీరంలో డి విటమిన్ తగ్గకుండా ఉదయపు ఎండ తగిలేలా చూడటం, వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవడం చేయాలి. ఆడపిల్లలు కండరాల బలహీనత, అలసట, ఎముకల్లో నొప్పిని ఎదుర్కొంటుంటే విటమిన్ల టెస్ట్ తప్పక చేయించాలి. మూత్ర పరీక్ష: మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది. మల పరీక్ష: ఎదిగే వయసు పిల్లలు మల విసర్జన రోజువారీ చేయకపోయినా, మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, తరచూ విరేచనాలవుతున్నా లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా అదేం పెద్ద విషయం కాదన్నట్టు నిర్లక్ష్యం చేయకూడదు. మల పరీక్ష చేయించాలి. దానివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది. కంటి పరీక్ష: టీనేజ్ పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్ష ఇది. ఈ వయసులో హ్రస్వదృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చినా పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారి పనులను, చదువును కొనసాగిస్తారు. కాని కంటి పరీక్ష వల్లే దృష్టిలోపం తెలుస్తుంది. ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాత కాలంలో కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కంటి పరీక్ష తప్పదు.హార్మోనల్ వర్కప్ టెస్ట్: ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పని తీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తదితరాలు తెలుస్తాయి. దీనివల్ల యుక్తవయసుకు జాప్యం ఎందుకో తెలుస్తుంది. సరి చేయ వీలవుతుంది. -
నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య
జాతీయ బాలికా దినోత్సవం ఏటా జనవరి 24న జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశాలు... బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, అత్యాచారాలపై అవగాహన కల్పించడం,; విద్య, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి బాలికా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని భారత్ 2008 నుండీ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆడ, మగ – ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్షతో గర్భంలో ఉండగానే స్కానింగ్లతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇప్పటికీ గర్భస్రావం చేయిస్తున్నారు. మన సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని ఆడ శిశువుల అంతానికి ఉపయోగించడం దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు ఉన్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని దుఃస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. 2015 లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘షాదీ ముబారక్’ వంటి పథకాలు బాల్య వివాహాలను కొంతవరకు తగ్గించాయి. స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యా వంతులు అవుతారని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఆనాటి నుండి నేటి వరకూ బాలికల విద్య నిర్లక్ష్యానికి గురి అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 82 శాతం మగవారు, 65 శాతం బాలికలు అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతా 35 శాతం బాలికలు బడికి దూరంగానే ఉన్నారు. 2009 విద్యాహక్కు చట్టం ఫలితంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో వెనుకబడిన తరగతుల బాలికలు చదువుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. అయినప్పటికీ పల్లెటూర్లలో బాలికల అక్షరాస్యత తక్కువగానే ఉంది. ఏ లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నామో... వాటిని సాకారం చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలకూ బాధ్యత ఉంది. (క్లిక్ చేయండి: మన క్రీడాకారిణులకు బాసట ఏది?) – సయ్యద్ షఫీ, హనుమకొండ (జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం) -
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్వర్క్లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
ఉత్తరాంధ్ర చిన్నారులకు బాల పురస్కారాలు
శ్రీకాకుళం (పాత బస్టాండ్)/దొండపర్తి (విశాఖ దక్షిణ)/న్యూఢిల్లీ/: ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు చిన్నారులు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లను అందుకున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అనంతరం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ పురస్కారాన్ని అందుకుంది. హిమప్రియకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. 2018లో జమ్మూకశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో ధైర్యసాహసాలు చూపినందుకు హిమప్రియను ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ.. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిక్కోలు బాలికకు పురస్కారం దక్కడం గర్వకారణమన్నారు. పురస్కార గ్రహీత హిమప్రియ మాట్లాడుతూ సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తన తండ్రే తనకు ఆదర్శమని తెలిపింది. నాడు ఏం జరిగిందంటే.. హిమప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీ ఉద్యోగి. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ క్వార్టర్స్లో నివాసం ఉండేది. 2018 ఫిబ్రవరి 10వ తేదీన జమ్మూకశ్మీర్లోని ఆర్మీ క్వార్టర్స్పై వేకువజామున ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో హిమప్రియ తల్లితో పాటు ఇంట్లోనే ఉంది. తండ్రి 60 కిలోమీటర్ల దూరంలో విధి నిర్వహణలో ఉన్నారు. నాలుగైదు గంటలపాటు ఉగ్రవాదులు తూటాలు కురిపిస్తూ ఉండగా.. హిమప్రియ సాహసం చేసి ఉగ్రవాదులతో పోరాడింది. దాడిలో ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా గాయమైనా.. వెరవకుండా ఉగ్రమూకలకు ఎదురెళ్లి క్వార్టర్స్లోని మరికొంత మందిని కాపాడింది. అమేయ, వీర్కాశ్యప్లకు పురస్కారాల ప్రదానం విశాఖకు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి అమేయ, నేవల్ స్కూల్ విద్యార్థి వీర్కాశ్యప్ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2021’ అందుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం వీటిని అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అమేయను ప్రధాని మోదీ ప్రశంసించారు. వీరంతా ఢిల్లీలోని రాజ్పథ్పై జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. -
ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా... ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా!
ఒక మంచి మాట చల్లగా దీవిస్తూ అంటుంది ఇలా... ‘నీకు ఆడబిడ్డ పుట్టింది. ఇక అంతా అదృష్టమే’ ఇక పాట విషయానికి వస్తే తెలుగు పాట రకరకాల భావాలతో చిట్టితల్లికి పాదాభివందనం చేసింది. వాటిలో కొన్ని పాటల గురించి... గద్దర్ గొంతులో వినిపించే ‘నిండూ అమాసనాడు’ పాట ప్రతి పల్లెను, ప్రతి హృదయాన్ని తాకింది. ‘ఆడపిల్ల నాకొద్దు’ అనే మూర్ఖత్వాన్ని కన్నీటీతో కడిగిపారేసింది. ఎంతోమంది తండ్రుల్లో గొప్ప మార్పును తెచ్చిన పాటగా ‘నిండూ ఆమాసనాడు’ పాటను చెబుతారు. ఆ పాటను మరోసారి పాడుకుందాం... ‘నిండూ అమాసనాడు ఓ లచ్చగుమ్మడి /ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చగుమ్మడి అత్తా తొంగిచూడలేదో ఓ లచ్చగుమ్మడి/ మొగడు ముద్దాడరాలే ఓ లచ్చగుమ్మడి సెత్త గంపలేసుకొని ఓ లచ్చగుమ్మడి/ సెత్త కుండిలెయ్యబోతే ఓ లచ్చగుమ్మడి కుక్కపిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చగుమ్మడి/ అక్కా అట్లా సెయ్యొద్దనే ఓ లచ్చగుమ్మడి బట్లలల్ల సుట్టుకోని ఓ లచ్చగుమ్మడి/ బాయిలో పడెయ్యబోతే ఓ లచ్చగుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చగుమ్మడి/ సెల్లె దానమియమందో ఓ లచ్చగుమ్మడి పున్నామిదినము వోలే ఓ లచ్చగుమ్మడి/పుట్ట కాడ పడవేస్తే ఓ లచ్చగుమ్మడి నాగన్న గొడుగు పట్టిండమ్మో ఓ లచ్చగుమ్మడి....’ ఇక సినిమాల విషయానికి వస్తే...‘ఆకాశమంత’ సినిమాలో ఒక తండ్రి తన చిట్టిపాప గురించి ఇలా మురిపెంగా పాడుకుంటాడు... (రచన: అనంత్ శ్రీరామ్) ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా /ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెచ్చిస్తా/ లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే కురిపిస్తా చల్లని హాయి అందిస్తా /పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తా లాలి పాటే నేనై లాలి పోసేవాడిని నేనవుతా ‘విశ్వాసం’ సినిమాలో అజిత్కుమార్ ఒక తండ్రిగా తన బంగారుతల్లి గురించి ఇలా పాడుకుంటాడు... (రచన: రామజోగయ్య శాస్త్రి) ‘చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా చిట్టి జాబిల్లి/నీ ఊసులోనే ముసురాడుతుంది ఈ నాన్న ఊపిరి’ ‘నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాలవాకిలి ఏ బూచి నీడ నీపై రాకుండా నేనేగా కావలి’ ‘కనుచివరన జారే తడి చినుకును సైతం/ సిరి తళుకుగా మార్చే చిత్రం నీదే’ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో తండ్రి తన కను‘పాప’ గురించి ఇలా పాడుకుంటాడు...(రచన: సిరివెన్నెల) గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడీ/ డాడీ ఊపిరిలో మెరిసే కూచిపూడి చిందాడీ చిందాడీ తుళ్లిందంటే చిన్నారీ /మమ్మీ చూపుల్లో ఎంతో వేడి వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి/ ముదై్దన తినదే పరుగెత్తే పైడి లేడి చిలకల్లే చెవులో ఎన్నో ఊసులాడి/ పడుకోదే పన్నెండైన ఏంచేయాలి నీ నవ్వే చూసి నిలువెల్లా పొంగి పోని/కాసేపు ఉంటే చాలే ఈ నాన్న తోటి వెయ్యేళ్లు జీవిస్తానే ఆశతోటి. -
ఉత్తరాఖండ్కు ఒక్కరోజు సీఎం
న్యూఢిల్లీ: జాతీయ బాలి కాది నోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. సీఎం హోదాలో హరిద్వార్కు చెందిన 20 ఏళ్ల గోస్వామి ఆదివారం అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకా లను సమీక్షించారు. దేశవ్యాప్తం గా జనవరి 24న జాతీయ బాలికాది నోత్సవం జరుపుకునే విషయం తెలిసిందే. బాలికాదినోత్సవం సందర్భంగా బాలికలకు ప్రధాని మోదీ శుభాకాం క్షలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు విద్య, వైద్యం అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వివరించారు. బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలి కలందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు. మీ సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. -
బతుకునిచ్చిన బతుకమ్మలు
ఆడపిల్ల కదా.. ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే.. ఇదీ అప్పుడూ.. కొన్నిచోట్ల ఇప్పుడూ ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయం.. కానీ.. ఈ మహిళలంతా వివక్షను జయించారు. తాము పుట్టే నాటికి ఎంత వివక్ష ఉండేదో కానీ.. నేడు వారే ఇంటికి పెద్దదిక్కయ్యారు. తల్లిదండ్రులకు అంత్యకాలంలో ఊతకర్రయ్యారు. తోడబుట్టిన వారికి ఆసరాగా నిలిచారు. వీరంతా కుటుంబపోషణ కోసం ఎంచుకున్న పనుల వెనుక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. వివక్షకు గురికాకుండా.. జీవితాలను గెలిచి, నిలిచిన నాటి బాలికలు.. నేటి మహిళల బతుకు పాఠాలు.. నేడు జాతీయ బాలికాదినోత్సవం సందర్భంగా.. – సాక్షి, నెట్వర్క్ ఇద్దరూ ఇద్దరే ఒకరు పూలమ్మ.. మరొకరు ఆదిలక్ష్మి.. మగవాళ్లు చేసే పనిని అవలీలగా చేసేస్తారు. బాధ్యతలే వాళ్లను విభిన్న వృత్తులవైపు నడిపించాయి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి పూలమ్మకు చిన్నతనంలోనే వివాహమైంది. 14 ఏళ్ల కిందట భర్త మరణించాడు. మనసంతా శూన్యం.. ఎదురుగా ఇద్దరు పిల్లలు.. ధైర్యంగా వంటింట్లోంచి బయటకొచ్చింది. పంక్చర్లు వేయడాన్నే వృత్తిగా మలుచుకుంది. ఆ పని చేస్తూనే కుమార్తెకు పెళ్లి చేసింది. కుమారుడిని చదివిస్తోంది. రోజూ రూ.600 వరకు సంపాదిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి 3వ తరగతి వరకే చదువుకుంది. భర్త కష్టంతో కుటుంబం గడవదనే ఆలోచనతో.. సంసార చక్రంలో తానూ భాగస్వామైంది. భర్త చేసే పంక్చర్లు, వెల్డింగ్ పనిలో పట్టు సాధించింది. స్థానిక వార్డు సభ్యురాలు కూడా అయిన ఆమె మగవారికి ధీటుగా వాహనాలకు గ్రీస్, పంక్చర్, టైర్ పౌడర్, బోల్ట్ సెట్టింగ్, ప్యాచ్, ఫిల్టర్ క్లీనింగ్, గాలి చెకింగ్, వెల్డింగ్ పనులు చకచకా చేసేస్తుంది. తమ ఇద్దరి సంపాదనతో కుటుంబం హాయిగా నడిచిపోతోందని అంటోంది. పనులు చేస్తున్న ఆదిలక్ష్మి; లారీ టైరుకు పంక్చర్ చేస్తున్న పూలమ్మ కష్టాలు.. ముక్కలు ముక్కలు చికెన్ను ముక్కలుగా కట్చేస్తున్న ఈ ఫొటోలోని మహిళ పేరు జరీనా. భర్త అబ్దుల్ కరీం నడుపుతున్న చికెన్ సెంటర్, హోటల్తో సంసారం సాఫీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి కరీం అనారోగ్యం బారినపడ్డాడు. చూస్తూ కూర్చుంటే.. కుటుంబం గడవదని భావించిన జరీనా.. తన భర్త చేసే పనినే తానెంచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో చికెన్ సెంటర్ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నిలబెట్టుకుంది. పెద్ద కొడుకు అల్తాఫ్హుస్సేన్ ఏడో తరగతి చదువుతూనే పంప్ మోటార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. రెండో కొడుకు సల్మాన్కు ఎంఎల్టీ శిక్షణనిప్పిస్తోంది. ఇలా ఇంటికొక్కరుంటే చాలు! అమ్మానాన్నా ఇద్దరూ కూలీలే. ఆరుగురు ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా.. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడమే గగనం.. దీంతో ‘నేనున్నా’నంటూ తల్లిదండ్రులతో పాటూ తానూ కుటుంబభారాన్ని పంచుకుంది అరుణ. ఇద్దరు అక్కలకు, చెల్లికి పెళ్లి చేసింది. మరో ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన అరుణ.. కూలి పనులకు వెళ్తుంది. సొంతంగా కొంత భూమి కొని, కొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. పురుషులతో సమానంగా నాగలి దున్నడం, ట్రాక్టర్ తోలడం చేస్తుంది. ఇంత కష్టం చేస్తూనే అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. మొదట్లో ఆశ కార్యకర్తగా పనిచేసినా.. వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోక.. ‘సాగు’లోకి దిగింది. తల్లిదండ్రులను కూలి పనులకు వెళ్లొద్దంది. తమకు కొడుకులు లేరనే బాధలేదని అరుణ తల్లిదండ్రులు అంటున్నారు. అరుణ లాంటి వారు ఇంటికొక్కరున్నా చాలని గంగారం గ్రామస్తులు అంటున్నారు. నేనే అబ్బాయినై ఇంటిల్లిపాదినీ పోషిస్తానని అరుణ చెబుతోంది. బుజ్జమ్మ..ఒంటరి పోరు! జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బుజ్జమ్మ అలియాస్ రాజేశ్వరి పదమూడో ఏటనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటికే పెద్దక్క అనారోగ్యంతో మరణించింది. రెండో అక్కకు పెళ్లయి ఇద్దరు కుమార్తెలు, కొడుకు పుట్టాక.. అక్కాబావలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. మరో ఏడాదికి ఇంటికి పెద్దదిక్కనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇక మిగిలింది.. చెల్లెలు రమ, రెండో అక్క పిల్లలు అరుణశ్రీ, మనోజ్, వర్ష.. ఈ పరిస్థితుల్లో బుజ్జమ్మ ఇంటి బాధ్యతను భుజానికెత్తుకుంది. మొదట్లో బీడీలు చుట్టింది. మిషీన్ కుట్టడం నేర్చుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని చెల్లెలు రమకు పెళ్లి చేసింది. అక్క పిల్లలు ఆదరణకు దూరమవుతారనే భయంతో పెళ్లి వద్దనుకుంది. ఏడాది క్రితం అక్క కుమార్తె అరుణశ్రీకి అన్నీతానై వివాహం చేసింది. మిగతా మనోజ్, వర్షను డిగ్రీ, ఇంటర్ చదివిస్తోంది. మూడేళ్ల క్రితం బుజ్జమ్మ ఆశ కార్యకర్తగా వైద్యారోగ్య శాఖలో చేరింది. మరోపక్క బీడీలు చుడుతూ, మిషీన్ కుడుతూ ఇప్పటికీ అక్క పిల్లలిద్దరే తన రెండు కళ్లుగా జీవిస్తోంది. మా ఇంటి ‘భాగ్య’రేఖ చేనేత కష్టాలకు ఎదురీదలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీడీలు చుడుతూ బిడ్డల్ని కడుపున పెట్టుకుని చూసుకున్న అమ్మ అనారోగ్యానికి బలైపోయింది. అప్పటికి పదిహేనేళ్లు భాగ్యకు. అమ్మ చివరిసారిగా తమ్ముడు నవీన్, చెల్లెలు స్రవంతి చేతుల్ని తన చేతుల్లో పెట్టడం భాగ్యకు ఇప్పటికీ గుర్తే. ఆ బాధ్యతే.. ముందుకు నడిపించింది. మొండి ధైర్యంతో కుటుంబభారాన్ని భుజానికెత్తుకుంది. అందరూ అయ్యో పాపం.. అన్నవాళ్లే కానీ.. ఎవరూ ఆదుకున్నది లేదు. చదువాగిపోయింది. కానీ తమ్ముడు, చెల్లి చదువాగిపోకూడదని వారి కోసం బీడీలు చుట్టింది. ఆమె కష్టం గురించి తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ సుల్తానియా.. భాగ్యకు హోంగార్డుగా అవకాశమిచ్చారు. ఆమె కష్టార్జితంతోనే స్రవంతి ఎంబీఏ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంటే, నవీన్ ఎంబీఏ ఫైనలియర్లో ఉన్నాడు. ప్రస్తుతం సంబంధాలు వస్తున్నా.. చెల్లెలు, తమ్ముడు స్థిరపడ్డాకేనంటోంది. రాత మార్చిన ‘గీత’ తలరాత బాగాలేదని చింతిస్తూ కూర్చోలేదు సావిత్రి.. కల్లుగీత వృత్తిని చేపట్టి రాతను మార్చుకుంది. మెదక్ జిల్లా రేగోడ్కు చెందిన సావిత్రి టెన్త్ వరకు చదివింది. చిన్న వయసులోనే సాయాగౌడ్తో వివాహమైంది. ఐదేళ్లకే భర్త హఠాన్మరణం.. అప్పటికి సావిత్రి నిండు గర్భిణి. పెద్దమ్మాయి భవాని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తలవని తలంపుగా మామ మంచానపడ్డాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి తానే పెద్దదిక్కుగా మారింది. భర్త కల్లు గీతవృత్తిని దగ్గర్నుంచి పరిశీలించిన ఆమె ఆ వృత్తినే చేపట్టింది. అధికారుల సాయంతో లైసెన్స్ పొందింది. రోజూ పది కిలోమీటర్ల మేర తిరుగుతూ ఈత చెట్లెక్కి కల్లుగీస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి మహిళా కల్లుగీత కార్మికురాలీమె. -
వేధింపులపై మౌనం వీడండి
సాక్షి, హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న వేధింపులను మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐజీ స్వాతి లక్రా యువతులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో హితైషి కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం షీ టీమ్స్ పోకిరీల పని పడుతోందని చెప్పారు. ఇటీవల ఐదో వార్షికోత్సవం సందర్భంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమా జాన్ని చైతన్యపరిచేలా మహిళా రచయితలు రాసిన కవితలను సంపుటిగా వెలువరించడం ఆనందం గా ఉందన్నారు. నేటి కాలం యువతులు ఎడ్యుకేషన్, గేమింగ్ యాప్లతోపాటు హాక్–ఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆపదలో డయల్ 100కి ఫోన్ చేయాలని, భరోసా కేంద్రాలను సంప్రదించాలన్నారు. చాలా కేసుల్లో తాము బాధితుల పేర్లు వెల్లడించకుండా కేసులు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేధింపులపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు అవగాహన పెంచేందుకు కళాశాలల్లో విద్యార్థులతోనే కమిటీ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ సుమతి మాట్లాడుతూ సమాజంలో విద్య, సమానత్వం, లింగ వివక్షలను రూపుమాపేందుకు 30 మంది కవయిత్రులు రాసిన కవితలు గొప్ప స్ఫూర్తిని చాటాయన్నారు. అనంతరం శ్రీవల్లి రాసిన వీడియో చైతన్య గీతాన్ని విడుదల చేశారు. -
బాలికలకు భద్రతేది..!?
కడుపులోనే చిదిమేస్తున్న వైనం గిరిజన బాలికల అక్రమ రవాణా కొనసాగుతున్న వివక్ష నేడు జాతీయ బాలికల దినోత్సవం బాలికలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల ఆర్థికంగా భారమనే భావనతో సమాజం చిన్నచూపు చూస్తోంది. పిండ దశ నుంచి బాలిక దశలోనూ భద్రత కరువవుతోంది. ఇదే సమయంలో ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేది నిరూపితమవుతోంది. బ్యాడ్మింటన్లో రాణిస్తున్న తెలుగు తేజం సింధు, పైలెట్గా రాణిస్తున్న ఆదిలాబాద్కు చెందిన స్వాతి ఇలా చాలామంది తల్లిదండ్రులు, బంధువుల ప్రోత్సాహంతో ఆయా రంగాల్లో దూసుకెళ్తున్నారు. సమాజంలో బాలికలు ఎదిగితే ఆర్థికంగా నష్టపోతామనే అవగాహన లేని తల్లిదండ్రులు, ఎక్కువ చదివితే ఎక్కువ వరకట్నం ఇవ్వాలని అనాలోచిత నిర్ణయాలతో వంటింటికే పరిమితం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకలిచావులు, ఆర్థిక ఒడిదుడుకులకు తాళలేక బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆధునిక సమజంలోనూ బాలికలపై ఆకృత్యాలు, అత్యాచారాలతో మనుగడ లేకుండా చేస్తున్నారు. 23 మంది బాలికలపై అత్యాచారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 23 మంది బాలికలపై అత్యాచారం జరిగిన సంఘటనలు వెలుగు చూడగా.. కేసులు నమోదయ్యాయి. పోలీసులకు నమోదు చేసిన కేసులు ఉమ్మడి జిల్లాలో 23 ఉండగా.. వెలుగులోకి రాకుండా మభ్యపెట్టి గూడేలు, పల్లెల్లో పంచాయితీతో మరుగునపడినవి ఎన్నో ఉన్నాయి. అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు నవ సమాజంలో సాగుతూనే ఉన్నాయి. చట్టాలు ఉన్నా అవి సరైన రీతిలో అమలు కావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. పోలీసుస్టేషన్ల గడపతొక్కని కేసులు ప్రజాప్రతినిధులు పలుకుబడి ఉన్న వ్యక్తుల కనుసైగల్లో ఎన్నో కేసులు పక్కతోవ పట్టాయనే విమర్శలు ఉన్నాయి. బాలికల అక్రమ రవాణా.. ఉమ్మడి జిల్లాలో గిరిజన గోండు గూడేల్లో బాలికల అక్రమ రవాణా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్, వాంకిడి, సిర్పూర్, భీంపూర్, తాండూర్ వంటి ఏరియాల్లో బాలికల అక్రమ రవాణా ఎక్కువ సాగుతున్నట్లు సమాచారం. గతకొంత కాలంలో నాలుగైదు అక్రమ రవాణా కేసులను పట్టుకున్నప్పటికీ చిక్కని కేసులు చాలా ఉన్నాయి. రాజస్థాన్ ఏరియాల్లో బాలికల శాతం తక్కువగా ఉన్నందున ఇక్కడి ప్రాంతాల్లో అమాయకులకు డబ్బులు వల వేసి అక్రమంగా బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ పదుల సంఖ్యలో ఈ తంతు అంతర్గతంగా సాగుతున్నా అధికారులు, పోలీసులు దృష్టి సారించడంలో విఫలం అవుతున్నట్లుగా తెలుస్తోంది. బాల్య వివాహాలతో బందీఖానా.. బాలికలకు అభం శుభం తెలియని చిన్న వయస్సుల్లో బాల్య వివాహాలు చేస్తూ బందీఖానాకు పంపుతున్నారు తల్లిదండ్రులు, ఆడపిల్ల అనగానే ఒక బరువుగా భావించి పెళ్లి చేయడమే బాధ్యతగా చూస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే సమయంలో విద్యాభ్యాసానికి దూరం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 120కి పైగా వివాహాలను బాలల సంరక్షణ సమితి అడ్డుకుంది. బయటకు రాకుండా అంతర్గతంగా ఎందరో బాలికలకు వివాహాలు చేసి వారి జీవితాలను తల్లిదండ్రులు అయోమయంలో పడేశారు. అభంశుభం తెలియని బాలికలు చిన్న వయస్సులో వివాహాలు చేయడంతో అనారోగ్యం బారినపడి మృతిచెందిన వారూ లేకపోలేదు. అసౌకర్యాలు.. వరకట్నాలతో విద్యకు దూరం.. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అసౌకర్యాల కారణంగానే బాలికలు విద్యకు దూరమవుతున్నట్లుగా తెలిసింది. బాలికలు మల, మూత్ర విసర్జన, పరిసరాలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యకు దూరం చేస్తున్నారు. ఎక్కువ విద్యాభ్యాసం చేస్తే దానికనుగుణంగా వరకట్నం ఇవ్వాల్సి ఉటుందన్న అనాలోచిత భావంతో బాలికలను విద్యకు దూరం చేస్తున్నారు. ఆధునిక సమాజంలోనూ బాలికల వివక్ష విద్యాభ్యాసానికి దూరం చేయడం తల్లిదండ్రుల అవగాహన లేమి నిర్ణయాలే కారణమని పలువురు భావిస్తున్నారు. భ్రూణహత్యలు.. ఆధునిక ప్రపంచంలోనూ ఆడపిల్ల అంటేనే సమాజంలో అలుసుగా భావించే వారు లేకపోలేదు. ఇందులో అనాగరికులు కాకుండా నాగరికత తెలిసి విద్యావంతులుగా, ఉద్యోగులుగా ఉన్నవారే ఎక్కువగా భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బాలికలను కడుపులోనే చిదిమేస్తూ బాహ్యలోకానికి రాకుండా చేస్తున్నారు. నవ సమాజంలో ఆడపిల్ల అనగానే వివక్ష చూపే సమాజం జన్మనిచ్చిన తల్లి కూడా మహిళ అన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఈ భ్రూణహత్యల నివారణకు ఆర్థిక లాభాపేక్షే ప్రధానంగా వైద్యులు ఇటువంటి దారుణానికి ఒడిగడుతున్నారు. కడుపులో శిశువు ఎదుగుదల, ఆరోగ్యవంతులుగా ఉన్నారా లేదా అనే స్కానింగ్లోనూ భ్రూణహత్యలు సాగుతున్నాయి. ఈ విషయం అంతర్గతంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కఠిన చట్టాలు అమలులో.. కఠిన చట్టాలు అమలు చేస్తే బాలికల సంరక్షణ, భద్రత సాధ్యపడుతుంది. బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తికి చైల్డ్ యాక్టు ప్రకారం శిక్ష ఉంటుంది. దీని కి నాన్ బెయిల్ఎబుల్ వారెంట్ను అందజేస్తూ కటకటాల లోపలికి పంపవచ్చు. జూవియల్ జస్టిస్ యాక్టు ప్రకారంగా శిక్షను విధించవచ్చు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఫోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షను విధించవచ్చు. సంరక్షించే వ్యక్తులే బాలికలపై వేధింపులకు పాల్పడినా, అత్యాచారం చేసినా రెట్టింపు శిక్షలు అమలవుతాయి. భ్రూణహత్యలు చేసిన వారికి పీసీపీఎన్డీటీ ప్రకారంగా శిక్షార్హులు. ఈ భ్రూణహత్యలో పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీ నివేదికలను అందించాలి. అటువంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాలికలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా, వేధింపులకు గురైనా 1098, 100 నెంబర్లకు సమాచారం అందిస్తే సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపడతారు.