nayeemuddin encounter
-
నయీం కేసులో మరో సంచలనం!
-
నయీం కేసులో మరో సంచలనం!
నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు.. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్యనేతల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉంది. గంగసాని రవీందర్రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు నాయకులు తమకు సంబంధం లేదని.. ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు నేరుగా మండలి వైస్చైర్మన్ పేరే బయటకు రావడంతో ఆయన రాజీనామా చేస్తారా.. లేక ప్రజల ముందుకు వచ్చి తన వివరణ తెలియజేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి బినామీలలో పలువురిని పోలీసులు అరెస్టుచేశారు. వాళ్లను విచారించినప్పుడు పలువురు నాయకులు, పోలీసుల పేర్లు తెలిశాయన్న ప్రచారం జరిగినా, అవేవీ బయటకు మాత్రం రాలేదు. అయితే.. సీపీఐ నాయకుడు నారాయణ ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలు చేయడంతో.. మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భువనగిరి కోర్టులో సిట్ తన నివేదికను సమర్పించింది. అందులో.. తాము విచారించిన వారి వాంగ్మూలాల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించింది. వెలగపూడి శివరాంప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు పేరు, యూసుఫ్ఖాన్ వాంగ్మూలంలో డీఎస్పీ మస్తాన్వలీ పేరు ఉన్నాయి. అలాగే లక్ష్మారెడ్డి ఇచ్చిన స్టేట్మెంటులో సీఐ వెంకట్రెడ్డి పేరు ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది పోలీసులు, నాయకుల పేర్లు ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి 156 కేసులు నమోదు చేసి వంద మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు తాజా వాంగ్మూలాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది పోలీసు అధికారుల సర్వీసు రివాల్వర్లను కూడా సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో వందలకోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, వందల ఎకరాల భూముల వివాదాలు ఉండటంతో.. దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వస్తుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు ఆలస్యం అయ్యేకొద్దీ బాధితులకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే అవకాశం లేదని అనడంతో మళ్లీ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన పేర్లు ఉన్నవారికి ఎప్పుడు నోటీసులు జారీచేస్తారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు
తమపై సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలను మరో నిర్మాత సి. కళ్యాణ్ ఖండించారు. నట్టి కుమార్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబరు ఇస్తే.. నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు. కుమార్ జీవితం అంతా బ్లాక్మెయిల్, నీలిచిత్రాల మయమని ఆరోపించారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలను కూడా నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కుమార్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో చర్చించి తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నామన్నారు. తమిళనాడులో కూడా ఇతడికి సినిమా సంబంధాలతో పాటు.. అక్కడ కేసులు వేసి బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలున్నాయని తెలిపారు. నయీంతో లింకులు ఉన్నవాళ్లు సినిమా పరిశ్రమలో ఎంతటి పెద్దవాడైనా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, శిక్షించవచ్చని తెలుగు సినీ పరిశ్రమ తరఫున చెబుతున్నామన్నారు. అసలు నట్టికుమార్ కుటుంబమే మోసాలు చేస్తుందని సి.కళ్యాణ్ ఆరోపించారు. ఆయన కొడుకు అమెరికాలో చదువుకోడానికి వెళ్తుంటే ఫోన్ చేసి, ఏదో ప్రాజెక్టు రిపోర్టు చేయాలంటూ తాను తీసిన ఎటో వెళ్లిపోయింది మనసు క్లిప్పింగులు కావాలని అడిగారని.. సరే కదా అని ఇస్తే ఆ సినిమాను నెట్లో పెట్టారని చెప్పారు. దీనిపై తన భాగస్వాములు నెట్లో సినిమా ఉందేంటని అడిగారన్నారు. దాంతో నట్టి కుమార్కు తాను ఫోన్ చేసి, నీ కొడుకును అరెస్టు చేసే పరిస్థితి వస్తోందని చెబితే.. బతిమిలాడుకుని తీసేశాడని చెప్పారు. క్రైస్తవ మతం పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడం, అన్నదానాల పేరుతో వసూళ్లు నిజం అవునా కాదా అని ప్రశ్నించారు. పోస్టర్లు వేసుకుని ఆ పేరుతో డబ్బులు దండుకుంటారన్నారు. సినీ పరిశ్రమలో చాలామంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారని, ఎవరూ కూడా ఎందుకులే అని ప్రెస్ ముందుకు రావడం లేదని తెలిపారు. విశాఖలో బ్యాంకులలో ఓవర్ డ్రాఫ్టుల పేరుతో ఓ కుంభకోణం జరిగిందని, అది త్వరలోనే బయటకు రానుందని అన్నారు. వైజాగ్ నుంచి ఇతడిని తన్ని తరిమేశారని చెప్పారు. అతడు థియేటర్ కొన్నట్లు చెబితే తాను ఓపెనింగ్కు వెళ్లానని, కానీ ఆ థియేటర్ లీజుకు తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు. వాటి పేరుతో బ్యాంకుల్లో ఓవర్డ్రాఫ్ట్ లావాదేవీలు నడిపించాడని చెప్పారు. -
అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు