పనామా దెబ్బతో కంగుతిన్న చంద్రబాబు
హైదరాబాద్: పనామా పత్రాల లీకేజీతో హెరిటేజ్ గుట్టు బయటపడటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కు సంబంధించి తాజాగా బయటపడిన పత్రాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ పుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు బయటపడటం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న చంద్రబాబు కంపెనీ నుంచి ఆయనతో రాజీనామా చేయించారు.
హెరిటేజ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా శివ రామ వర ప్రసాద్ కంపెనీ నుంచి తన పదవికి రాజీనామా చేశారని హెరిటేజ్ ఫుడ్స్ వెబ్ సైట్లో శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ఇచ్చింది. శివరామ ప్రసాద్ 12 వ తేదీ గురువారం రోజున తన రాజీనామా పత్రాన్ని సమర్పించారని, ఆ విషయాన్ని ముంబయ్ స్టాక్ ఎక్చేంజ్ కు తెలియజేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23 న జరగబోయే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలున్నాయని అందులో తెలిపారు.
భారీ ఎత్తున పన్నుల ఎగవేతకు మనీ లాండరింగ్ కు పాల్పడేందుకు వీలుగా చిన్న చిన్న దేశాల్లో ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాలను, బినామీల పేర్లను వెల్లడిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంపెనీలతో ఉన్న లింకులను తెలియజేస్తూ పనామా పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెరిటేడ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా ఉన్న శివరామ వరప్రసాద్ లింకులు బయటపడటంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. తీవ్ర తర్జనభర్జనలో పడ్డారు.
హెరిటేజ్ సంస్థతో ఉన్న లింకులు బయటపడటంతో చేసేది లేక చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి శివరమవరప్రసాద్ తో రాజీనామా చేయించినట్టు చెబుతున్నారు. శివరామ వరప్రసాద్ పేరు బయటకు రావడంతో ఈ వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పెద్దగా తవ్వి తియ్యబోదన్న నమ్మకం ఉన్నప్పటికీ ఇందులో తాము కూడా చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఆయనతో రాజీనామా చేయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విదేశాల్లో కంపెనీలు
ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్కెమీ వెంచర్స్ వంటి ఆఫ్షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది. నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్కు వాటాలున్నాయి.
ఎన్నెన్నో అనుమానాలు...
పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్కు కెన్లెమ్లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు.
బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే....
హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్కు హెరిటేజ్ ఫుడ్స్లో డెరైక్టర్గా కూర్చోబెట్టారు.
ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడు. ఆయన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన హెరిటేజ్లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్లోనూ ఎన్నో కంపెనీలు
ప్రసాద్కు హైదరాబాద్లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్లో ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్లో ఇండిపెండెంట్ డెరైక్టర్నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు.
ఎవరీ ప్రసాద్...
కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు. వరంగల్ నిట్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్లో వివరించారు.
అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.