
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి రోజూ అదేపనిగా తప్పుడు కథనాలను వండి వార్చే వ్రతం ఆచరిస్తున్న ఈనాడు రామోజీరావుకు బాబుపట్ల తనకున్న పిచ్చి పీక్స్కు చేరింది. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెప్పిందే చెప్పడం.. రాసిందే రాయడం చేస్తూ క్షీణిస్తున్న తన మానసిక పరిస్థితిని సిగ్గూఎగ్గూ లేకుండా ఈనాడు పాఠకులకు ప్రదర్శించుకుంటూ తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పోగొట్టుకున్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లి సీఎం కుర్చీలో తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్న ఫళంగా అందులో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఒకే వార్తను కేవలం శీర్షిక మార్చి నెలానెలా తిప్పితిప్పి వండి వారుస్తున్నారు.
ఈ మధ్యనే ‘కక్షకట్టి పరిశ్రమలను వెళ్లగొట్టి’.. శీర్షకతో ఓ దిగజారుడు కథనాన్ని అచ్చోసి నెలరోజులు కాకుండానే ‘బ్రాండుకు బ్యాండు’ అంటూ మళ్లీ అదే వార్తను అటుఇటూ మార్చి మరోసారి తన పాఠకుల మీదకు రామోజీ వదిలారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా రాష్ట్రం వేగంగా వృద్ధి చెందుతుండటమే కాకుండా అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, బంగూర్, భజంకా, సింఘ్వీ, ఐటీసీ, హెచ్యూఎల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే తన వర్గ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దిగజారుస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదంటూ వికృతానందాన్ని పొందుతున్నాడు.
నిజానికి.. రాష్ట్రానికి ఎప్పుడూలేని విధంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్ను కలిసి పెట్టుబడులు పెడుతుంటే రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినడంతో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయని గుండెలు బాదుకుంటూ ఓ గాలి వార్తను ప్రచురించారు. ఈ నేపథ్యంలో.. ఈనాడు వార్తలోని అంశాలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే..
పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయా!?
♦ రిలయన్స్ అంబానీ స్వయంగా విశాఖ పెట్టబడుల సమావేశానికి హాజరై గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.50,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా బయో ఎనర్జీ రంగంలో రిలయన్స్ గ్రూపు వ్యవసాయ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ను ఉత్పత్తి చేసేందుకు సుమారు రూ.1,900 కోట్లతో రాష్ట్రంలో 15 యూనిట్లును పెట్టడానికి ముందుకొచ్చారు. తొలిదశలో 8 యూనిట్ల నిర్మాణ పనులను మూడ్రోజుల క్రితం ప్రారంభించింది.
♦ ఆదిత్య బిర్లా గ్రూపు తూర్పుగోదావరి జిల్లా బలభ్రదపురంలో గ్రాసిం ఇండస్ట్రీస్ పేరుతో కాస్టిక్ సోడా తయారీ యూనిట్, పులివెందులలో ఆదిత్య బిర్లా రెడిమేడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్లను ఏర్పాటుచేయగా తాజాగా చిత్తూరు జిల్లాలో రూ.1,700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ను ఏర్పాటుచేసింది.
♦ ఐటీసీ గ్రూపు గుంటూరులో వెల్కమ్ గ్రూపు పేరుతో ఫైవ్స్టార్ హోటల్ నిర్మించడమేగాక స్పైసెస్ పార్క్ను ఏర్పాటు చేసింది.
♦ హిందుస్థాన్ యూనీ లీవర్ తాజాగా ఆయిల్పామ్ రిఫైనరీ యూనిట్తోపాటు రాష్ట్రంలో 30,000 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించే విధంగా ఒప్పందం చేసుకుంది.
♦ అలాగే, వైఎస్సార్ జిల్లా బద్వేల్లో సెంచురీ ప్లేవుడ్స్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జపాన్కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లు కరోనా ఉన్నప్పటికీ రికార్డు సమయంలో యూనిట్లను నిర్మించి ఉత్పత్తి ప్రారంభించి తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇలా విశాఖ జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరడమే కాకుండా ఏడాది కాకుండానే వాటిలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వాస్తవాలిలా ఉంటే.. పెట్టుబడులు వెళ్లిపోయాయంటూ రామోజీ ఏ ఆధారాలతో రాశారో చెప్పాలి.
అమరరాజా చెప్పినా సరే..
ఇక వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూపు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ ఇక్కడ కూడా విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు, దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఉదా.. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ హైదరాబాద్తో పాటు శ్రీకాకుళం, హిమాచల్ప్రదేశ్లలో యూనిట్లు పెట్టింది. అంతమాత్రానా ఆ సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందంటూ వార్త రాయగలమా? రామోజీకి చెందిన మార్గదర్శి గ్రూపు కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటుచేసింది.
అంటే ఏపీ, తెలంగాణ నుంచి మీ గ్రూపు వెళ్లిపోయిందని రాస్తావా రామోజీ? టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయాల్లోకి రావడంవల్ల కేంద్ర, ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారేగానీ ఆయన ఏ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ వేధింపులవల్ల అమరరాజా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ రామోజీ రాసిపారేశారు.
విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిరి్మంచడం కోసం లులూ గ్రూపునకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. కానీ, ఈ భూమికి చెల్లించాల్సిన మొత్తం ఆ గ్రూపు చెల్లించడంలో విఫలమైంది. భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ ఏపీఐఐసీ పలు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసీ ఆ భూమిని కేటాయించలేదు.
ఇది అభివృద్ధి కాదా రామోజీ..
♦ 2019–20లో జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా ఇప్పుడు 23.36 శాతానికి చేరింది.
♦ వరుసగా మూడేళ్లు నుంచి సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది.
♦ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన లీడ్ ఇండెక్స్–2023లో మన రాష్ట్రం టాప్ అచీవర్గా నిలిచింది.
♦ రూ.1.59 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలో ఆరో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది.
♦ 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్ అండ్ మెగా యూనిట్లు ప్రారంభమయ్యాయి.
♦ ఎగుమతుల సన్నద్ధ రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానానికి చేరింది.
..ఇలా వీటన్నింటి ద్వారా రూ.63,754 కోట్ల పెట్టుబడులు, 77,227 మందికి ఉపాధి లభించింది. అలాగే, ఎంఎస్ఎంఈలతో కలుపుకుంటే రాష్ట్రంలో 3,69,831 యూనిట్లు ఏర్పాటుకావడం ద్వారా రూ.14.18 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 32,30,425 మందికి ఉపాధి.. పరోక్షంగా 64,60,850 మందికి ఉపాధి లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment