
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్సింగ్కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.