
సాక్షి, అమరావతి: విశాఖ క్రేన్ కూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్థాన్ పిప్యార్డ్ లిమిటెడ్లో జరిగిన క్రేన్ ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ ఘటనలో సహయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హిందుస్తాన్ షిప్ యార్డ్లో ఘోర ప్రమాదం)
సిబ్బంది, సందర్శకులు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు.