
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. గతేడాది శ్రీకారం చుట్టుకున్న ఈ పథకం ఈ ఏడాది కూడా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ పేద మహిళలకు ఈ పథకం వరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి నవెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం అందించనున్నట్లు ప్రకటించారు. తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెంటనే కసరత్తు చేయించారు. గత ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పేరిట పథకానికి తొలి అడుగు వేశారు. ఈ సామాజిక వర్గంలోని పేద మహిళల మోమున చిరునవ్వులు పూయించారు.
ఈ ఏడాదీ వాస్తవానికి కరోనా పరిస్థితి వీడలేదు. ఆర్థిక పరిస్థితులూ సహకరించకున్నా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలుపై సీఎం నిబద్ధత ప్రదర్శిస్తున్నారు. పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ కాపునేస్తం సొమ్ములు నేరుగా జమకానున్నాయి. రెండో ఏడాది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది అక్కాచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థికసాయం అందనుంది. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ఇన్కంబర్డ్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment