
తాడేపల్లి : స్టార్టప్ కాన్సెప్ట్ను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సుమారు మూడు లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలనీ సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...:
- పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలి
- న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలి
- అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం
- ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయి
- కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్గా ఉండాలి
- అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలి
- స్టార్టప్ కాన్సెప్ట్ను మరింత ప్రోత్సహించాలి
- విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలి
- అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండాలి
- స్టార్టప్స్కు అధిక ప్రాధాన్యతనివ్వాలి
- పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పన దిశగా దృష్టిసారించాలి