సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 60.80 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.. వారికోసం రూ.1420.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 86.02 శాతం మందికి రూ.1219.94 కోట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.
బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమలు
లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలుచేస్తున్నామని, అలాగే.. ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పెద్దిరెడ్డి తెలిపారు. ఎవరైనా తమ సొంత నివాసం నుండి ఇతర ప్రాంతాలకు వైద్యం లేదా ఇతర కారణాలతో ఆరు నెలలు ఊరెళ్లిన వారికి కూడా, వారు ఉండే చోటే పెన్షన్ అందించే ఏర్పాట్లుచేసినట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక కారణాలవల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ పంపిణీని మూడ్రోజుల్లో నూరుశాతం పూర్తయ్యేలా వలంటీర్లను ఆదేశించామన్నారు.
కాకినాడ: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వాలంటీర్లు ఉదయం నుంచే లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తున్నారు. జిల్లాలో 6,66,229పెన్షన్లకు రూ.154.35 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ నెల అదనంగా 20వేల కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment