
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది.
ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు.